Pages

Thursday, August 30, 2012

గుజరాత్‌ హంతకులకు గుణపాఠం



గుజరాత్‌ మారణకాండలో  పరమ పైశాచికమైన నరోదా పాటియా హత్యాకాండలో మాజీమంత్రిణి మాయాబెన్‌ కొందనాని,భజరంగదళ్‌ కన్వీనర్‌ బాబూ భజరంగ్‌జీతో సహా 32 మందికి శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జ్య్యోత్స్నా యాగ్నిక్‌ ఇచ్చిన తీర్పు సంచలనాత్మకమైంది. వీరే గాక బిజెపి విహెచ్‌పి వంటి సంస్థలకు చెందిన పలువురు స్థానిక నాయకులు ఈ శిక్ష విధింపబడిన వారిలో వున్నారు. కసబ్‌కు ఉరి శిక్ష ఖాయమైన రోజునే ఇది కూడా రావడం యాదృచ్చికమైనప్పటికీ నర హంతకులకు మతాల తేడా వుండదని తెలియడానికి దోహదపడింది. 2002లో గోద్రా రైలు పెట్టె ధగ్గం ఘటనను సాకుగా చూపి సాగించిన జాతి హత్యాకాండలో నరోదా పాటియా మారణహౌమం చాలా తీవ్రమైంది. ఇక్కడ 97 మంది ముస్లిములను వూచ కోత కోశారు. 2002 ఫిబ్రవరి28న విహెచ్‌పి బంద్‌ పిలుపుపై 5000 మంది అక్కడ చేరి రాక్షస కాండ సాగించారు.పోలీసులకు 94 శవాలు దొరికాయి. ఈ ఘోరకలితో సహా వేలాది మంది హత్యాకాండకు బలైనప్పటికీ ఇసుమంత పశ్చాత్తాపం లేని ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా సమర్థించుకోవడం ఏమీ ఆశ్చర్యం కలిగించదు. అయితే ఆ తరహా మాటలే ఎల్లకాలం చెల్లుబాటవుతాయనుకోవడం కూడా పొరబాటే. తనను స్వంతపార్టీవారే ప్రధాని అభ్యర్థిగా ఆమోదించలేకపోతున్నా మోడీ కళ్లు తె రవడం లేదు.మరోవంక కార్పొరేట్‌ మీడియా అమెరికా సెనేట్‌ విదేశాంగ విభాగం వంటివి మాత్రం దేశ రాజకీయాలను మోడీ రాహుల్‌ల మధ్య పోటీగానే చూపించే ప్రయత్నం కొనసాగిస్తున్నాయి.!

కసబ్‌పై తగిన తీర్పు


166 మందిని అమానుషంగా కాల్చి చంపిన ముంబాయి దాడిలో...... పట్టుబడిన పాకిస్తానీ టెర్రరిస్టు అజ్మల్‌ కసబ్‌కు కింది కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేయడం అనివార్య పరిణామం. అరుదైన వాటిలో అరుదైన జాబితా తీసుకుంటే ఇంతకంటే తీవ్రమైన కేసు వుండదు. ప్రపంచంలో సజీవంగా ప్రత్యక్ష రంగంలో పట్టుబడిన టెర్రరిస్టు కసబ్‌ ఒక్కడే అంటున్నారు. అతనికి మరణశిక్ష విధించడంపై పాకిస్తాన్‌ పట్టనట్టు వ్యవహరించడం వ్యూహాత్మకమే. పైగా అలాటి దుశ్చర్యలు ఆగింది కూడా లేదు.అయితే కసబ్‌కు ఉరిశిక్ష పడటం పెద్ద విజయమైనట్టు భావించాల్సిన అవసరం లేదు. అతన్ని బహిరంగంగా వురి తీయాలని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.అప్పుడు నరహంతక టెర్రరిస్టులకు మనకూ తేడా వుండదు. కసబ్‌ విషయంలో పద్ధతి ప్రకారం వ్యవహరించడం భారత దేశ న్యాయ ప్రమాణాలకు నిదర్శనంగా వుంటుంది. అయితే ఆయనను వురి తీయడానికి ముందు 300 మందికి పైగా వున్నారు గనక ఇది ఎప్పుడు అమలవుతుంది, క్షమాభిక్ష అభ్యర్థన వగైరాలు ఎలా నడుస్తాయి చూడాలి.ఎందుకంటే ఆగ్రహం అసహనం ఎంత వున్నప్పటికీ రాజ్యాంగ ప్రక్రియను కాదనడానికి లేదు.
కసబ్‌తో పాటు శిక్షలు పడిన ఇద్దరు ముస్లింలను నిర్దోషులుగా సుప్రీం కోర్టు విడుదల చేయడం కూడా ప్రాధాన్యత గల విషయం.. గతంలో పార్లమెంటుపై దాడి సందర్భంలోనూ ఇలాటిదే జరిగింది. ముష్కర శక్తులకు మతం లేదని అర్థం చేసుకోవడానికి బదులు టెర్రరిజాన్ని ఏదో ఒక మతానికి అంటకట్టే దుర్నీతిని అమెరికా వ్యాపింప చేస్తే మన దేశంలోనూ మత తత్వ శక్తులు అందిపుచ్చుకున్నాయి.అయితే అమెరికాలో గురుద్వారాపై జరిగిన దారుణ కాల్పుల వుదంతం వారికి మత భేదం ఏమీ లేదని తేటతెల్లం చేసింది. కనక ముంబాయి టెర్రరిస్టు దాడుల సందర్భంలో నిఘా వైఫల్యం వంటి వాటిని సవరించుకోవడం ముఖ్యం. అంతేగాని మతాల వారిగా ఆలోచించడం వల్ల దేశానికి మేలు జరగదు. ముంబాయి దాడిలో కసబ్‌ గనక ప్రాణాలతో పట్టుబడి వుండకపోతే భారతీయ ముస్లిములను అనవసరంగా అనుమానించే అవకాశంవుండిందని కోర్టు చేసిన వ్యాఖ్య కూడా అందుకే ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.

Wednesday, August 29, 2012

బొగ్గుల కుంపటి..



పార్లమెంటు అట్టుడికి పోతున్నా దేశం గగ్గోలు పెడుతున్నా రాజ్యాంగ సంస్థ వేలెత్తి చూపించినా మాననీయ ప్రధాన మంత్రికి మాత్రం మలినం ఎక్కడా కనిపించడం లేదు. పారదర్శకత లేని బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో దేశాన్ని వదిలేసి తాను విదేశాలకు పయనం కట్టారు. పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన పట్టపురాణి తానే కత్తి పట్టి కపట యుద్ధం చేస్తున్నారు. ్ల. అయితే మిగిలిన అన్ని ప్రకృతి సంపదలూ చెరబట్టిన అభినవ హిరణ్య కశిపులు ఈ బొగ్గును కూడా బొజ్జల్లో నిక్షిప్తం చేసుకోవడం వల్లనే దేశ రాజకీయం ఆరని కుంపటిగా మారిపోయింది. అది కూడా రాజ్యాంగ బద్దమైన అధికారిక తనిఖీ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక ఎత్తి చూపిన ఫలితంగా. ఈ వ్యవహారం కూడా ఏదో హఠాత్తుగానో అనుకోకుండానో బయిటకు వచ్చింది కాదు. నలిగీ నలిగీ అనేక మలుపులు తిరిగి ఖరాఖండిగా కాగ్‌ ప్రకటించిన బొగ్గు భాగోతం విలువ కనీసంగా లక్షా 86 వేల కోట్ల రూపాయలు. కొంతమంది అంటున్నట్టు అనుకుంటున్నట్టు ఇది ఉజ్జాయింపు లెక్క కాదు- శాస్త్రీయంగా గణించిన లెక్క. ఇంకా పెరిగే అవకాశం వున్న లెక్క. ఈ లెక్కను గనక తప్పు పట్టేట్టయితే అప్పుడు అకౌంట్ల తనిఖీ అభిశంసన అన్న మాటలకే అర్థం వుండదు. అయినా ఘనత వహించిన నిష్కళంక ప్రధానికి ఇందులో కాస్తయినా దోషం కనిపించదు. ఎందుకంటే అది అక్షరాలా ఆయన హయాంలోనే ఆయన ఆధ్వర్యంలోనే జరిగిన కేటాయింపు గనక. అనేకానేక సూచనలు ప్రత్యామ్నాయాలను పెడచెవిని పెట్టి ఇష్టానుసారం వ్యవహరించారు గనక. ఇది కళ్లుమూసుకున్న పిల్లి తంతు తప్ప తెలియని తతంగమేమీ కాదు.
భారత దేశాన్ని రత్నగర్భ అంటారు నల్లబంగారమైన బొగ్గుకు మాత్రం ఇది నిజంగానే

Saturday, August 25, 2012

అస్థిరత యథాతథం- అసమ్మతి అనివార్యం


       అవినీతి వూబిలో చిక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఎంత మాత్రం మారలేదు. వూబిలో చిక్కిన మనిషి పైకి రావాలని ప్రయత్నించినకొద్ది మరింత లోతుల్లోకి కూరుకుపోతుంటాడు. కాంగ్రెస్‌ వ్యవహారం కూడా అలాగే వుంది. విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కిటికీలు తెరుచుకోవాలని సలహా ఇచ్చి విమానమెక్కి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దాదాపు రిక్త హస్తాలతోనే తిరిగి వచ్చారు. ఇప్పటికి పది రోజులపైగా తన చేతుల్లో పెట్టుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించేందుకు అధిష్టానం అనుమతి సంపాదించడం ఆయన సాధించిన ఫలితమంటున్నారు.అయితే ఆ ఆ ఆమోదం కూడా అప్పుడే కాదు, అభియోగాలను కోర్టు నిర్ధారించిన తర్వాత అనివార్యంగా తీసుకోవచ్చన్నది అధిష్టానం ఆదేశం. ఈ క్రమంలోనే మిగిలిన ఆరోపిత మంత్రుల సంగతి కూడా. నిజానికి ఛార్జిషీటులో పేరున్న ఒక మంత్రి రాజీనామా చేస్తే దాన్ని వెంటనే ఆమోదించకుండా అట్టిపెట్టుకోవడం ఎలాటి రాజనీతి? మంత్రివర్గ ఏర్పాటు మంత్రుల కొనసాగింపుపై విచక్షణాధికారం కలిగి వుండాల్సిన ముఖ్యమంత్రి రాజీనామా అందిన తర్వాత కూడా అడుగు ముందుకేయలేకపోవడం ఎంత అసహాయత? ఇందులో నైతికత ఎక్కడీ చట్టబద్దత ఎంత? ఇన్నాళ్ల తర్వాత ఇందుకోసమే ఢిల్లీ వెళ్లి వచ్చిన కిరణ్‌ ఇరకాటం ఇప్పట్లో తీరేది కాదన్నది దీంతోనే స్పష్టమై పోయింది. ఇంగ్లీషు పత్రికల్లో అంతా ఆయనకు అనుకూలంగా జరిగినట్టు కథనాలు వెలువడినా వాస్తవం అదే. అంతకు మించిన ఫలితం.
24 మంది మంత్రులు రాజీనామాలు ఆమోదించవద్దంటూ కిరణ్‌పై ఒత్తిడి చేయడం తెలిసిన విషయమే. ఆమోదమే మొదలు పెడితే అందరికీ చుట్టుకుంటుందనే ఆందోళనే ఇందుకు కారణం.ఆ భయం అధిష్టానానికి కూడా వుంటుంది - కేంద్రానికి సంబందించినంత వరకూ. కనకనే హడావుడి అక్కర్లేదని తగు సమయంలో నిర్ణయం

Friday, August 24, 2012

బూటకపు సందేశాలు, తప్పుడు చిత్రాలు


        బెంగుళూరు నుంచి అస్సామీయులు ఆపినా ఆగకుండా పెద్ద ప్రవాహంగా ప్రయాణం కట్టారంటే అందుకు బలమైన కారణాలున్నాయి. వారికి అందిన సెల్‌ఫోన్‌ సందేశాలు అంత భయోత్పాతం కలిగించాయి. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిం వలసదారులను కోక్రాజార్‌ జిల్లాలో దారుణంగా హింసిస్తున్నారని చంపేస్తున్నారని ఆకాశరామన్న సందేశాలు నెట్‌ వర్క్‌లలో నిండిపోయాయి. దేన్నో దేనికో ఆపాదించడం ద్వారానూ సంబంధం లేని వాటిని చూపించడం ద్వారానూ ఈ అవాంఛనీయ శక్తులు బర్మాలో జరిగిన హింసాకాండ బొమ్మలనే అస్సాంలో జరిగిన వాటిగా ప్రచారంలో పెట్టారు. వాటి తాలూకూ వీడియోలు కూడా వుంచారు.
అస్సాంలో ముస్లింల వూచకోత పేరిట ఈశాన్య ప్రజల పోలికలున్న ఒక మనిషి తల నరికి రక్తమోడుతున్న బొమ్మను యూ ట్యూబులో విపరీతంగా చలామణి చేశారు. మైన్మార్‌(బర్మా)లో ముస్లిముల హత్యాకాండ ఆపండి అంటూ అంతకు ముందు పోస్టు చేసిన చిత్రాలే ఇవి! అలాగే ఒక ముస్లిం మహిళ తమపై జరిగిన అత్యాచారాలను గురించి ఆవేదనగా చెబుతున్న దృశ్యం కూడా వుంచారు. అయితే పూల బురఖా ధరించిన ఆ మహిళ మాటలు గుజరాతీ యాసలో వుండటమే గాక కొన్ని వూర్ల పేర్లు కూడా ప్రస్తావించిన తర్వాతే అసలు సంగతి అర్థమవుతుంది. గుజరాత్‌లో 2002 మత మారణహౌమం నాటి చిత్రాన్ని ఇక్కడ ఉపయోగించి ఉద్రేకాలు పెంచారని తెలుస్తుంది.ఈ మోసకారి కథనాలు చిత్రాలు వేలాది మంది వీక్షించారు గాని నిజమైన వార్తలను వాస్తవాలను పేర్నొంటున్న సైట్లను చాలా కొద్ది మంది మాత్రమే చూశారు.
వెంటనే బయిలు దేరి రండి అంటూ ఎస్‌ఎంఎస్‌లు. ఇద్దరు నేపాలీలు, ఇద్దరు మణిపురిలు హత్య చేయబడ్డారు అంటూ మరో సందేశం. వారం కన్నా ఎ క్కువ రోజులు మీరు అక్కడే వుంటే చాలా ప్రమాదం జరిగిపోతుందని హెచ్చరించేవి కొన్ని, బలాత్కారాలను గురించి

పుకార్ల పూర్వాపరాలు, చారిత్రిక పాఠాలు


షేక్స్‌పియర్‌ హెన్రీ4 నాటకంలో పుకార్లను ఒక పాత్రగా సృష్టించాడు. ' నా నాల్కపైన నిరంతరం నర్తిస్తుంటాయి దుష్ప్రచారాలు/ నేను ఏ భాషలో మాట్లాడినా సరే/ వినేవాళ్ల చెవుల్లో అబద్దాలే నింపుతాను అంటుంది ఆ పాత్ర. వాల్మీకి రామాయణంలో సీతను గురించి కూడా ఎవరో ఏదో అన్నారన్న గూడచారి మాటలపైనే రాముడు ఆమెను అడవికి పంపిస్తాడు! పురాణాలలో ఇలాటి కథలెన్నో!
ఇంతకూ పుకార్లంటే ఏమిటనే దానిపై స్పష్టమైన నిర్వచనం లేదు. వెంటనే నిర్ధారించుకునే అవకాశం లేని మాట అన్న రీతిలో దాన్ని పిలవడంపై ఏకాభిప్రాయం వుంది. ప్రచార వ్యూహంలో ఒక భాగంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి.ప్రత్యర్థుల స్థయిర్యం దెబ్బతీయడానికి మామూలుగా ఇలాటివి చేస్తుంటారు. సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా ఫాసిస్టులు నిరంతరం పుకార్ల ఫ్యాక్టరీలే నడిపిస్తుంటారు. అబద్దం పదిసార్లు చెబితే నిజమవుతుందన్న గోబెల్స్‌ సూక్తి ఫాసిస్టు పథకంలో భాగమే. కమ్యూనిస్టులపైన ప్రగతిశీల శక్తులపైన, తమ దాడికి లక్ష్యమైన ప్రజాసమూహాలపైన నాజీలు నిరంతరం దుష్ప్రచారాలు సాగిస్తూనే వుండేవారు. అసలు హిట్లర్‌ రాజకీయాల ఆవిర్భావమే రీచ్‌స్టాగ్‌కు(జర్మనీ పార్లమెంటుకు) కమ్యూనిస్టులు నిప్పుపెట్టారనే దుష్ప్రచారంతో మొదలైంది. ఆ కేసులో నిందితుడుగా బోనెక్కిన డిమిట్రావ్‌ దాన్ని తుత్తునియలు చేశారు. యూదులను నిర్మూలించడం కోసం హిట్లర్‌ కూటమి ఎప్పటికప్పుడు ఏవో విష ప్రచారాలు చేస్తూనే వచ్చింది. దానివల్ల వారిలో భయాన్ని జర్మన్లలో ద్వేషాన్ని కలిగించింది. ప్రాణాలు అరచేతి పెట్టుకుని బతుకుతున్న యూదులను వూచకోత కోసేందుకు ఎప్పటికప్పుడు ఏవో వదంతులు వ్యాపింపచేస్తూ వారిని ఒక చోట చిక్కించుకుని హతమార్చడం ఒక రాక్షస క్రీడగా సాగింది.
అభివృద్ధి నిరోధక పాచిక
ఇదే పద్ధతిని అమెరికా బ్రిటన్‌ తదితర దేశాలు నేటికీ అనుసరిస్తున్నాయి. స్టాలిన్‌ మావో కాస్ట్రో వంటి వారిపై తాడూ బొంగరం లేని కథలు ప్రచారం చేయడం వారికి పరిపాటి. కాస్ట్రో చే గువేరాను చంపించేశాడని పెద్ద దుమారం లేవదీస్తే దాన్ని బాగా సాగనిచ్చి తర్వాత సాక్ష్యాధారాలతో సహా సుదీర్గ ప్రసంగం చేశారు( చూడండి: నా సృతిలో చే గువేరా పుస్తకం) అసలు కాస్ట్రోనే చనిపోయాడని ఎన్నిసార్లు ప్రచారం చేశారో లెక్కేలేదు. అమెరికాలో మెకార్థిజం

హైటెక్‌ పుకార్లతో కల్లోలం



       సత్యం నోరు విప్పేలోగా అసత్యం విశ్వవిహారం చేసి వస్తుందంటారు.. అభివృద్ధి నిరోధకులు మతోన్మాదులు వికృత మనస్కులు సృష్టించే కట్టుకధలు కార్చిచ్చులా పాకి సమాజ జీవితాన్ని కల్లోల పర్చడం చరిత్ర చూస్తున్న సత్యం. నాజీ ఫాసిస్టుల నుంచి నేటి మతోన్మాదుల వరకూ జాతి దురభిమానుల నుంచి మతిమాలిన కుటిలాత్ములు మూఢ విశ్వాసుల వరకూ అనేకులు అనేక రకాల ఆరంభించే అరాచక అఘాయిత్య వదంతులకు అమాయక జనం ఆహుతవుతున్నారు. ప్రస్తుతం అస్సాం వాసు ల ఆవేదనకు సామూహిక సంచలనాలకు కారణమైన పరిణామాలలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర కూడా చాలా వుంది...

     2012 ఎంసెట్‌ ఫలితాలు వచ్చిన సందర్భం మీకు గుర్తుందా? మొదటి ర్యాంకు వచ్చిన ఫలనా అభ్యర్థి ఫలానా విద్యా సంస్థకు చెందిన వాడు కాదంటూ ఒక ఎస్‌ఎంఎస్‌ వేలమందికి చేరింది. దానిపై ఆశ్చర్య పడేలోగానే అది అసత్య ప్రచారమంటూ మరో ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఆ తర్వాత సదరు సంస్థ అధికారికంగా దాన్ని ఖండిస్తూ మీడియా ముందుకొచ్చింది.ఇంతకూ ఆ ఎస్‌ఎంఎస్‌ అందుకున్న వారిలో అత్యధికులకు అది ఎందుకొచ్చిందో తెలియలేదు గాని ఒక క్రమపద్ధతిలో ఎవరో కావాలని పంపించారని మాత్రం అర్థమై పోయింది.
కొద్ది మాసాల కిందట రాజధాని సమీపంలోని సంగారెడ్డిలో మతపరమైన ఉద్రిక్తతలు ప్రబలాయి. ఎవరో దేవుణ్ని అవమానించే చిత్రాన్ని ఇంటర్‌నెట్‌లో వుంచారంటూ ప్రచారం జరిగింది.ఆ చిత్రం ఏమిటో ఎవరు చేశారో తెలియలేదు గాని ఈ లోగానే విపరీతమైన ప్రచారాలు జరిగిపోయి ఉద్రిక్తత పెరిగి కర్ఫ్యూ వరకూ వెళ్లింది. హైదరాబాదులో మామూలుగానే ఫలానా ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేశారని, ఎక్కడో గొడవల్లో చాలామంది చనిపోయారని పుకార్లు వినిపిస్తాయి. ఇలాగే అవమానకరమైన రీతిలో దేవుళ్ల చిత్రాలను చలామణిలో పెట్టడమూ జరుగుతుంది.
ఓ స్త్రీ రేపురా!
ఎవరో తెల్లచీర కట్టుకున్న స్త్రీ అర్థరాత్రి వూళ్లో సంచరిస్తుందని, దగ్గరగా వెళితే మాయమవుతుందని ఎవరో అంటుకోబోతే రక్తం కక్కుకుని చనిపోయారని ఇలాటి కథలు నిరంతరం ఏదో ఒక వూళ్లో ప్రచారమవుతూనే వుంటాయి. ' ఓ స్త్రీ రేపురా' అన్న వాక్యం

Friday, August 17, 2012

వేమన భాష, భావ సర్వస్వం


తెలుగు వారికి అత్యంత ప్రియమైన కవి ఎవరంటే వేమనే. అంత పొడుపుగా అంత పొదుపుగా చెప్పిన వారు అప్పుడూ ఇప్పుడూ కూడా అరుదే. అక్షరాక్షరంలో అర్థం పొదిగి ఇచ్చిన ప్రజాకవి గనకనే నాలుగు శతాబ్దాల తర్వాత కూడా ఆయన పద్యాల నాలుకలపై నాట్యమాడుతున్నాయి. అన్ని సందర్భాలకు అతికినట్టు సరిపోతున్నాయి. ఆలోచనలకు పదును పెడుతూనే వున్నాయి. అనేక సార్లు ఆయుధాలవుతున్నాయి. అలాటి వేమనను గుర్తించడంలోనూ గౌరవించడంలోనూ చాలా ఆలస్యమే జరిగింది. అన్యాయమూ జరిగింది.దీనికి చాందసత్వం స్వార్తపర వర్గాల కుటిలత్వం కారణాలు. మొదట బ్రౌన్‌ పండితుడు వేమనను వెలికి తీసి వెలుగులోకి తెస్తే తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఆయనకు సముచిత వ్యాఖ్యాత అయ్యారు. అయితే ఇంత గొప్ప వాడైన వేమనపై సమగ్ర సాధికారిక పరిశోధన చేసిన సాహిత్య వేత్త కవి డా.ఎన్‌.గోపి. 35 ఏళ్ల వయసులోపే వేమనపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. అంత కన్నా ముందే వేమన్న వేదం పుస్తకమూ ప్రచురించారు. ఒక విధంగా వేమన పట్ల పునరాసక్తి పెంచిన వారిలో గోపీ ప్రథములు. ఆయన పరిశోధన ప్రజాకవి వేమన పేరిట ప్రచురితమైంది.ఈ క్రమంలో గోపి ఆ పద్యాలను విశేషంగా అధ్యయనం చేసి నిగ్గు తేల్చారు. పారిస్‌లో వున్న అరుదైన ప్రతిని తెప్పించి ప్రచురింపచేశారు. అప్పటి వరకూ తెలియని ఏడు పద్యాలు కొత్తగా పరిచయం చేస్తూ ఆయన పేరిట చలామణిలో వున్న కొన్ని నిజానికి కాదని తేల్చారు.
ఆ తర్వాత కాలంలో ఆరుద్ర కూడా వేమనకు సంబంధించి అనేక అంశాలు తెలియజేసినా శ్రీశ్రీ నిరంతరం వేమన స్మరణ చేస్తూనే వున్నా ఈ అనంత పరిశోధన వల్ల గోపి వేమన వేదానికి భాష్యకారుడైనారు. రెండేళ్ల కిందట సాక్షి పత్రికలో తన అనుభవాన్ని రంగరించి 428 పద్యాలకు సమగ్రమైన తాత్పర్య సహిత వ్యాఖ్యానం రాశారు. కేవలం పద్యాలకు వ్యాఖ్యానానికే పరిమితం కాకుండా విలక్షణమైన వేమన పద ప్రయోగాన్ని విప్పిచెప్పేందుకు విశేషమైన శ్రమ చేశారు.అలాగే వేమన తత్వాల పూర్వాపరాలను వాటి వెనక చారిత్రిక నేపథ్యాన్ని సమకాలీన భావాలనూ కూడా పొందుపర్చారు. ఈ పద్య పాదాలకు వున్న పాఠాంతరాలను కూడా ఇస్తూ ఏది ఔచిత్యానికి దగ్గరగా వుందో వివరించారు.
అకారాది క్రమంలో ఎంపిక చేసిన ఈ పద్యాలు వేమన మూడు వేల పద్యాల సారాంశానికి ప్రాతినిధ్యం వహించేవిగా వున్నాయని

Thursday, August 16, 2012

పోలీసు బాసుల పోస్టింగు పాఠాలు



 ఔను. డిజిపి దినేష్‌ రెడ్డి నియామకం కొట్టి వేస్తూ మొదట క్యాట్‌ తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లేవనెత్తుతున్న ప్రశ్న ఇది. ఈ వ్యవహారంలో అయిదు వేల జరిమానా కూడా సర్కారు చెల్లించాల్సి రావడం పరువు తక్కువ కాదా? దినేష్‌ రెడ్డి వ్యవహారానికి ముందు కూడా ఇలాటి తగాదాలు రెండు మూడు సార్లు వచ్చాయి. రకరకాల ప్రహసనాలకు దారి తీశాయి. వైఎస్‌ హయాంలోనైతే పదే పదే మార్పులు కూడా జరిగాయి. ఇన్ని అనుభవాల తర్వాత ఈ ప్రభుత్వం ఎందుకు అదే తప్పు పునరావృతం చేసింది? విధేయులు విశ్వసనీయులు వుండాలనుకుంటే ఎవరు మాత్రం అందులో వెనకబడతారు? అసలు పోలీసులు సైన్యం అధికారులెవరైనా చేయాల్సింది రాజ్య రక్షణే కదా! కనక అందులో కొద్దిపాటి వ్యక్తిగత పక్షపాతాలు వివక్షతలకు లోను కావలసిన అవసరం అసలే లేదు. సీనియర్‌ అధికారుల ప్యానల్‌ రూపొందించి అందులో ఒకరిని ఎంపిక చేసి కనీసం రెండేళ్లు కొనసాగే అవకాశం ఇవ్వాలన్నది ఇప్పటి వరకూ కమిషన్లు చేసిన ప్రధాన సిఫార్సు. సుప్రీం కోర్టు ఆమోదించిన విధానం.ఆ క్రమంలో ఏవైనా విభేదాలు వస్తే ఏకాభిప్రాయానికి

Wednesday, August 15, 2012

అ ధర్మో రక్షతి రక్షిత:?



. ధర్మో రక్షతి రక్షిత: అనే వాల్మీకి సూక్తిని మన గోడలన్నిటి మీదా విపరీతంగా రాస్తుంటారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని దాని అర్థం చెబుతుంటారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ ధర్మానను రక్షించితే తనను తాను రక్షించుకోవచ్చునుకుంటున్నారా? అధిష్టానం కూడా ఆ విధంగానే ఆలోచిస్తూ వుందా?
అధర్మం జరిగిందనే అధికార పక్షం వారంతా ఆవేశంగా విమర్శించారు. ఎన్నేళ్లు శిక్షలు పడేది ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించేశారు. అంతా అయిపోయిన తర్వాత.. అసలు వాళ్లు ఖైదులోకి వెళ్లిన తర్వాత ఇప్పుడు ఆయన సహచరులు ఆ 26 జీవోలలో తప్పేలేదు పొమ్మని దబాయిస్తున్నారు. అదే నోటితో అమాయకుల్లా అర్భకుల్లా మాట్లాడుతున్నారు. ఆనాటి అధినేత ఆదేశాల మేరకు( ఆయనకు శక్తివంతమైన కుడి భుజాలుగా వుండి కూడా) అనివార్యంగా సంతకాలు చేసినందున తమ వ్యక్తిగతపాత్ర ఎలా తప్పవుతుందని ధర్మాన వంటి వారి ప్రశ్న. అసలు మిటన్నది వారి వాదనకు మూలం. అంటే నిజంగా ఆనాడు అధర్మాన్ని కాపాడామని పరోక్షంగా ఒప్పేసుకున్నట్టే గనక అందుకు శిక్ష వుండక్కర్లేదా? ఒక వేళ ఆ జీవోలే గనక తప్పు కాకపోయినట్టయితే అప్పుడు జగన్‌పైన అన్ని విమర్శలు కేసులు ఎలా నిలుస్తాయి? ఈ వాదనలతో నెమ్మదిగా ఆయన వైపు తిరుగుతున్నారా?
వాన్‌పిక్‌ వ్యవహారంలో రెవెన్యూమంత్రిగా ఆయన జారీ చేసిన జీవోలలో ముచ్చటగా మూడు అంశాలు అనుమానాస్పదమే. వాన్‌పిక్‌ పోర్టు పేరిట వుండాల్సిన భూములను వాన్‌పిక్‌ ప్రాజెక్టు పేరిట నిమ్మగడ్డ ప్రసాద్‌కు ధారాదత్తం చేయడం ఒకటి. నాలుగు వేల ఎకరాలతో మొదలైన దాన్ని 28 వేల ఎకరాల వరకూ

Monday, August 13, 2012

జగన్‌పట్ల కిరణ్‌ మెతక వైఖరి? తెలుగు దేశం కొత్త వ్యూహం?



వైఎస్‌ జగన్‌ పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆయన ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తూ పరోక్షంగా సహకరిస్తున్నాయనే భావం రాజకీయ వర్గాలలో బాగా పెరుగుతున్నది. ప్రతిపక్షాలు మీడియా ప్రతినిధులు గాక అచ్చంగా అధికార పార్టీ ముఖ్యులే ఈ మాట పదే పదే అంటున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. ఇటీవల జగన్‌ పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నాయకుడు(ఇక్కడ కొత్తవారే) దీనిపై ఆసక్తికరంగా స్పందించాడు. ఢిల్లీతో రాజీకి వచ్చారని అంటే అక్కడ వస్తే ఏం లాభం, యుపిఎ అంతంత మాత్రంగా వుంది, ఇంకా ఇక్కడ రాజీ పడటమే మాకు ఎక్కువ ఉపయోగం అని ఆయన అన్నాడు. మంత్రులను తద్వారా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మాకు కూడా మద్దతు నివ్వక తప్పదని ఆయన ధీమా వెలిబుచ్చారు. పైగా ఇటీవలి కాలంలో కరెంటు ఫీజులు వంటి సమస్యలపై కేంద్రీకరణ పెరిగి జగన్‌పై విమర్శలను అందరూ తగ్గించడం కనిపిస్తుంది. ఆయనను ఎంత విమర్శించినా లాభం కలగడం లేదని అర్థమైన తెలుగు దేశం జగన్‌ తెలంగాణా రెండు సమస్యలను పక్కకు పంపించేందుకై వర్గీకరణ, తెలంగాణాపై స్పష్టత, బిసి డిక్లరేషన్‌ వంటి అజెండాలను తీసుకువస్తున్నది. ఇందులో వ్యూహం మరేదైనా వున్నప్పటికీ ఆచరణలో అదే జరుగుతున్నది. ఇదంతా జగన్‌ పార్టీకి నెత్తిన పాలు పోసిన చందమవుతుంటే వారు పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేస్తున్నామంటూ కథనాలు వదులుతున్నారు! అదీ సంగతి.

కిరణ్‌ సర్కార్‌కు మరో ధర్మాఘాతం



ధర్మాన ప్రసాదరావు రాజినామా అనివార్యమైందే తప్ప అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనమని చెప్పుకోవడం అర్థం లేదు. ఇప్పటికే వరస సంక్షోభాలతో అతలాకుతలమవుతున్న కిరణ్‌ కుమార్‌ సర్కారుకు ఇది తాజా దెబ్బ. గతంలో ఇలాటి సందర్భాలలో సమర్థన తప్ప లేశమైనా ఆత్మ పరిశీలన ప్రక్షాళన చేసుకోలేదు గనక ఇప్పుడైనా అలాటిదేమీ జరిగే అవకాశమే లేదు. కాకపోతే వ్యాన్‌పిక్‌ వ్యవహారంలో అక్రమాలే లేవని మొండిగా వాదించడం వాస్తవ విరుద్ధం. మొదట కుదిరిన ఒప్పందాన్ని మార్చడం దగ్గర్నుంచి ఏకపక్షంగా రస్‌ఆల్‌ఖైమా కమ్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌కు మేళ్లు చేయడం వరకూ ఇందులో అనేక రకాలైన అక్రమాలున్నాయి. ఆ భూములు ఎవరివి, ఏ ప్రాతిపదికన తీసుకుని ఎంత పరిహారం ఇచ్చారు. ఎంత చూపించారు వగైరా వాదనలన్ని హాస్యాస్పదమైనవి.ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాను ప్రకంపింప చేసిన వ్యాన్‌పిక్‌ పాపం ఇప్పటికైనా బద్దలు కావడం ఆహ్వానించదగింది. రెవెన్యూ మంత్రికి ఎకరా భూమి కూడా ఇచ్చే అధికారం లేదని మంత్రి వాదించడం మరింత విడ్డూరంగా వుంది. ఇప్పటికే విచారణ నెదుర్కొంటున్న మంత్రులతో పాటు ఈయనకు కూడా (అ)న్యాయ సహాయం అందుతుందనడంలోనూ సందేహం లేదు. మొత్తానికి ఉభయ కాంగ్రెస్‌లు ఒకే కొసకు చేరుకుంటున్న తీరుకు ఇవన్నీ నిదర్శనాలు. గతంలోనే రాసినట్టు కాంగ్రెస్‌కు రాజకీయ హాని కలగకుండా చూడాలంటే వైఎస్‌ హయాంలో వ్యవహారాలన్నిటినీ సమర్థించుకోవలసిందే. ఆ క్రమంలో జగన్‌పై కేసు నీరసించినా నీరు గారినా ఏలిన వారికి పెద్ద అభ్యంతరం వుండదు.


Thursday, August 9, 2012

సోనియా కోప సందేశంలో సంకేతాలేమిటి?





లోక్‌సభలో తమ పార్టీకి చెందిన తెలంగాణా ఎంపిలపై సోనియా గాంధీ బహిరంగంగా ఆగ్రహం ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అధికారాన్ని అన్ని విధాల కాపాడుకోవడానికి సహకరిస్తూ మరో వైపున ప్రాంతీయ స్మరణలోనూ పోటీ పడే టి కాంగ్రెస్‌( నిజానికి అదొక మిథ్య, టి ఎ ఆర్‌ ఇన్ని రకాలు లేవు) ఎంపిల ద్వంద్వ క్రీడకు ఇక స్వస్తి పలికినట్టే. ఆమె తమను ఏమీ అనలేదని అంటూనే ఇకపై సభలో ఆందోళనలు చేయబోమని కూడా మంచి బాలుళ్ల తరహాలో చెప్పేశారు. అంటే ప్రాంతీయ వ్యూహాలపై అధిష్టానం ఒక నిర్ధారణకు వచ్చినందునే సోనియా అలా వ్యవహరించారని అనుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇంత కాలం నిరసన ప్రహసనాలు కూడా అధిష్టానం ఆశీస్సులతోనే జరిగాయనుకోవాలి. మా అధినేత్రి మమ్మల్ను ఏమన్నా అనొచ్చు అంటే అదొక రీతి కాని అసలేమీ అనలేదని సమర్థించుకోవడం మాత్రం హాస్యాస్పదం.
టి కాంగ్రెస్‌ వారి సంగతి అటుంచి టిఆర్‌ఎస్‌ అధినేత సంకేతాలకు ఈ పరిణామానికి ఏమైనా పొసుగుతుందేమో చూడాలి. ఢిల్లీ నుంచి ఏ మాట రాకుండా ఇక్కడ ఎవరు ఏమి చెప్పినా ఏ విన్యాసాలు చేసినా వ్యర్థమని కూడా గ్రహిస్తే మంచిది.

Tuesday, August 7, 2012

జైపాల్‌; కోపాల్‌!



కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రి జైపాల్‌ రెడ్డి సీనియర్‌ నాయకులే గాక ఆయన భాషా పాండిత్యమూ రాజకీయ పరిజ్ఞానమూ బహుధా గౌరవం పొందాయి.అయితే ఆంధ్ర ప్రదేశ్‌కు గ్యాస్‌ సరఫరా విషయంలో ప్రతిపక్షాలూ విశ్లేషకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన పదే పదే ఆగ్రహించడం ఆయన పెద్దరికానికి తగినట్టు లేదు. గతంలోనే ఒక ఎంట్రీలో రాసినట్టు ఇది కిరణ్‌ కుమార్‌ జైపాల్‌ రెడ్డి పంచాయితీ కాదు. ఆంధ్రప్రదేశ్‌ మహారాష్ట్రల తగాదా కాదు. కొంతమంది పనిగట్టుకుని జైపాల్‌ రెడ్డిని సమర్థిస్తున్నట్టుగా ఆంధ్ర తెలంగాణా సమస్య కూడా కాదు. సహజవాయువు, చమురు గనులు వగైరా ప్రకృతి వనరులను కార్పోరేట్లకు ధారాదత్తం చేసిన సరళీకరణ విధానాల పుణ్యం ఇది. గాలి జనార్థనరెడ్డి చుప్తాగా తవ్వుకుపోయినా రిలయన్స్‌ అంబానీ అవకాశమున్న గ్యాస్‌ను తీయకపోయినా ఏమీ అనగల స్తితిలో ప్రభుత్వాలు లేవు. అలాగే గ్యాస్‌ పొందే విద్యుత్‌ ప్లాంట్లు ఆ ఉత్పత్తిని అధిక లాభం కోసం మరెక్కడో అమ్ముకున్నా మనం చేయగలిగింది శూన్యం.ప్రైవేటీకరణ ఒప్పందాలు చేసుకోవచ్చు గాని ఎమర్జన్సీ క్లాజు కూడా పెట్టుకోకుండా జుట్టు చేతిలో పెట్టడం ఎంత అవివేకం మరెంత అనర్థం! గతంలో రిలయన్స్‌ గురించి విమర్శలు చేసిన జైపాల్‌ రెడ్డి ఇప్పుడు రత్నగిరికి సరఫరా చేయక గత్యంతరం లేదనట్టు మాట్లాడారు. కాని 24 గంటలు తిరక్క ముందే ప్రధాని కార్యాలయం దాన్ని మార్చేసింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదనుకున్నా బాధ్యత గల సీనియర్‌ నేతగా ఆయన ఇదే పని గతంలో చేసి వుండొచ్చు. దానికి బదులుగా 11 నెలల గ్యాస్‌ సరఫరాకు తనను అభినందించలేదన్న ఆవేదనకు ఇప్పుడు అనవసరంగా అంటున్నారన్న ఆగ్రహానికి ఎక్కువగా లోనవుతున్నారు. అయితే ఇప్పుడు ఎలాగో గట్టెక్కామనుకున్నా ముఖ్యమంత్రి ప్రభుత్వం సకాలంలో స్పందించని లోపం కూడా మాసిపోదు. దీంతోనే సమస్య తీరిపోదు. ఈ ఘనత తమ విజయమని తెలుగు దేశం నేత నామా నాగేశ్వరరావు చెప్పుకోవడం మరో విశేషం. విజయానికి స్వంత దారులు చాల మంది వుంటారెప్పుడూ!

ప్రాచీన కవులకు ప్రాంతీయ హద్దులెందుకు?



            కెసిఆర్‌ సాహిత్యంలో అవగాహన వుండే నాయకులు. అయితే ఆయన తన రాజకీయ వ్యూహంలో తరచూ భాషా సాహిత్యాలను తీసుకొస్తుంటారు. విమర్శ కోసం కాదు గాని వివరణ కోసం ఆదికవిపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించవలసి వస్తున్నది. నన్నయ్య ఆదికవి కాదు పాల్కురికి సోమనాథుడు ఆదికవి అని ఆయన చేసిన వ్యాఖ్య చారిత్రిక వాస్తవాలతో పొసిగేది కాదు. నన్నయ్య ఆదికవి అన్న వాదన మాలాటి వాళ్లం ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఒక్కసారిగా భారతం అంతటి మహాకావ్యం పుట్టదు. దానికి ముందే తెలుగు భాష ప్రజల నోళ్లలో నానుతూ వుంది. పల్లెపదాలు ప్రవర్థిల్లుతున్నాయి. అయితే నన్నయ్య చేసిందేమంటే సంసృత భాష సహాయంతో కన్నడాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగు భాషను తన శైలిలో సంస్కరించాడు. వైదిక సంసృతిని పరిరక్షించేందుకు రాస్తున్నట్టు కూడా చెప్పుకున్నాడు. 1022-1063 మధ్య పాలించిన రాజ రాజ నరేంద్రుడి ఆస్థానంలో వుండి ఈ పనిచేశాడు. పాల్కురికి సోమనాథుడు 13 వ శతాబ్దికి

Monday, August 6, 2012

అద్వాన్వస్థితిపై అద్వానీ ఒప్పుకోలు!



ఇటీవలి కాలంలో ఈ బ్లాగులో నేను చేస్తున్న వ్యాఖ్యలు అనూహ్యమైనంత వేగంగా నిజమవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా మన రాజకీయ ప్రతిష్టంభనకు రాజకీయ శక్తుల స్తంభనకు ఇదో నిదర్శనమై వుండొచ్చు. అన్నా హజారే దీక్ష, కెసిఆర్‌ సంకేతాలు, ఫీజు రీ ఇంబర్సుమెంటుకు మంగళం వంటి ఏ సమస్య తీసుకున్నా అనుకున్న దానికన్నా ముందే తేలిపోతున్నాయి. ఫలితంగా నాపై వూరికే ధ్వజమెత్తే మిత్రులు కూడా ఒకింత ఆలోచనలో పడుతున్నట్టు కనిపిస్తుంది. బహుశా అలాటి వాటన్నిటికీ పరాకాష్ట బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ 2014 ఎన్నికలలో తమకు అవకాశాలు లేవని ఇంత ముందుగా ఒప్పుకోవడం! ఏదో పత్రికా గోష్టిలో ఎవరో అడిగితే చెప్పడం కాదు, తనకు తానుగా బ్లాగులో రాసిపెట్టారంటే ఆయన ఎంత నిరుత్సాహంలో వున్నారో తెలుస్తుంది.బహుశా పార్టీ వారిని ముందే ఓటమికి సిద్ధం చేయడం అవసరమని ఆయన భావించి వుంటారు.
అద్వానీ ఒక విధంగా భగజీవి. అయోధ్య ఉద్యమంలో మతతత్వ వ్యూహాలను అటుంచితే బిజెపి పెద్ద శక్తిగా ఎదగడానికి ప్రధాన కారణమైంది. దానికి నాయకత్వం వహించిన అద్వానీ ఫలితంగా వచ్చిన ప్రభుత్వానికి మాత్రం నాయకత్వం వహించలేకపోయారు. ఆమోదయోగ్యత కారణంగా మూడు సార్లు వాజ్‌పేయికే కిరీటం దక్కింది.ఉప ప్రధాని పదవి లాంచనంగా రావడానికి కూడా చాలా కాలం పట్టింది. ఆ తర్వాత కూడా వాజ్‌పేయి ఏనాడూ హృదయపూర్వకంగా ఆయనను స్వాగతించింది లేదు.లోV్‌ా పురుష్‌ వికాస్‌ పురుష్‌ అంటూ వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యానంపై వాజ్‌పేయి ఎంతటి దుమారం రేపిందీ మర్చిపోలేము.
2004 ఎన్నికల ఓటమి తర్వాత అద్వానీ పార్టీలోనే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నది

Sunday, August 5, 2012

కె.సి.ఆర్‌ కొత్త సంకేతాలు- పాత సందేహాలు



స్వామిగౌడ్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణా విభజన వాద వాణికి వేదికగా మారడం వూహించదగిన విషయమే.అయితే అక్కడ వారిలో విభజనలు కూడా వ్యక్తం కావడం మహబూబ్‌నగర్‌, పరకాల వంటి పరిణామాల కొనసాగింపుగా కనిపిస్తుంది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రతినిధుల మాటల్లో తేడాలు స్పష్టంగా కనిపించాయి. నేను 2009లో తెలంగాణా నినాదంతో గెలవలేదని పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించడం సాహసోపేతమైనదే.అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే పదిహేను రోజుల్లో తెలంగాణా వచ్చేస్తుందని కేశవరావు ఆవేశ పూరితంగా చెప్పిన మాట అపహాస్యానికి మాత్రమే అక్కరకు వస్తుంది కారణమేదైనా జెఎసి చైర్మన్‌ కోదండరాం అక్కడ కనిపించలేదు.ఇవన్నీ ఒక ఎత్తయితే కె.సి.ఆర్‌ ఈ సభలో తన సంకేతాల గురించి చెప్పిన మాటలు ఆలోచించదగినవి. సంకేతాలు నాకు రాకపోతే ఎవరికొస్తాయని మీడియాను ఎద్దేవ చేస్తూ ఆయన అన్న మాటలలో అసహనమే కనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమానికి ఆయన అగ్ర నాయకుడు ప్రధాన ప్రతినిధి అనడంలో సందేహం లేదు గాని కేంద్రం గురించిన ఆయన జోస్యాలు అనేక సార్లు విఫలమైనాయి. ఒకవైపున కాంగ్రెస్‌ నాయకులే సంకేతాలు లేవని చెబుతుంటే నాకు సూచనలున్నాయన్నట్టు చెప్పడం తప్పకుండా ప్రశ్నార్థకమే. ప్రశాంతంగా వుంటే పరిశీలిస్తామని ప్రధాని చెప్పినందునే ప్రశాంతంగా వున్నామని ఆయన అంటున్నారు గాని ప్రధాని కాదు కదా కేంద్రంలో ఏ ప్రతినిధి కూడా అలాటి మాట చెప్పింది లేదు. హౌం శాఖ నుంచి ఆర్థిక శాఖకు వెళ్తూ ఆఖరి పత్రికాగోష్టిలో కూడా చిదంబరం అందరూ అంగీకరించాకే అఖిలపక్ష సమావేశం వుంటుందని కుండబద్దలు కొట్టి చెప్పారు.ఉద్యమ నాయకులు నమ్మకం నిలబెట్టడం కోసం ఏదైనా చెప్పాలని ఆ పార్టీ నేతలు సమర్తించుకుంటారు గాని అవాస్తవమైన ఆశలు భ్రమలు కల్పిస్తే తర్వాత వాస్తవాన్ని తట్టుకోలేని వారు అఘాయిత్యాలకు తలపడతారు. కనక ఉద్యమ సారథులు వూహాగానాలు చేసే కంటే ఉన్నమాట చెప్పి జనాన్ని నిలబెట్టుకోవాలి.లేదంటే నిజం చెప్పినా నమ్మని స్థితి రావడానికి ఎంతో కాలం పట్టదు.మరో వైపున ఉద్యోగులు కొందరు బుద్ధి జీవులు రాజకీయ వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉద్వేగాలకు ఉద్రేకాలకు గురి కావడం కూడా వాంఛనీయం కాదు.ప్రాంతీయ సమస్యకు పార్టీలతో నిమిత్తం లేకుండా తామే పరిష్కారం సాధిస్తామన్న భ్రమ నుంచి ఉద్యోగులు విద్యార్థులు తదితరులు బయిటపడటం అవసరం. ఎందుకంటే వారిని బలిపెట్టి తమ పబ్బం గడుపుకోవడం 1969-72 మధ్య అనేక మంది స్వార్థ పర నాయకులలో చూశాం.అలాటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి.

Saturday, August 4, 2012

రాయలసీమలో బాబుకు కొత్త సవాలు



బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ వాదంతో చేస్తున్న నిరాహారదీక్ష ఇప్పటికే చిక్కుల్లో వున్న తెలుగు దేశంకు కొత్త సవాలని చెప్పాలి. తెలంగాణాలోనూ కోస్తాంధ్రలోనూ ఇప్పటికే పలువురు ఆ పార్టీని వదలి వెళ్లారు. ఆ విధంగా చూస్తే రాయలసీమలో శోభా నాగిరెడ్డి వంటి వారు గతంలోనే నిష్క్రమించగా ఉప ఎన్నికల్లోనూ ఓటములు ఎదురైనాయి. ఇలాటి పరిస్థితుల్లో బైరెడ్డి కొత్తగా సీమ వాదం తీసుకురావడం నిరాహారదీక్షతో కార్యాచరణకు దిగడం సరికొత్త సంకటమే.తెలంగాణా ఫోరం నేతలు దీనిపై ఎలా స్పందిస్తారనేది ఒకటైతే అధినేత ఇచ్చే స్పష్టతకు దీనివల్ల కలిగే ఆటంకం మరొకటి. పైగా ఆయన కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారు కావడం అదనపు ఇబ్బంది. ఒకవేళ కర్నూలు జిల్లా తెలుగు దేశం అద్యక్షుడు చెప్పినట్టు నిజంగానే దీన్ని వ్యక్తిగత వ్యవహారంగా తీసుకుంటే అప్పుడు బైరెడ్డి స్వంత వేదికకు బలం చేకూర్చినట్టు అవుతుంది.ఇప్పటికే రాయలసీమలో సామాజికంగా జగన్‌ వర్గం గట్టి సవాలు విసురుతున్న నేపథ్యంలో ఈ పరిణామం వల్ల మరో గండి పడకుండా ఏం చేస్తారో చూడాల్సిందే. ఈ దీక్షను ఉపేక్షిస్తే అప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ ఇలాటివే తలెత్తవచ్చు. దాంతో అధినేత ఇస్తానంటున్న స్ఫష్టతకు విలువ లేకుండా పోవచ్చు. రాయలసీమలో స్వంత పునాది పెంచుకోవాలనుకుంటున్న నాయకులు ఈ వాదనను బలపర్చే అవకాశం వుంటుంది గాని బైరెడ్డికి ఆ స్థానం ఇవ్వడానికి వారు సిద్ధపడతారా అనేది మరో ప్రశ్న. సిద్ధాంతాలు గాని నికరమైన విధానాలు గాని లేని వ్యక్తులు శక్తులు ఏదైనా చేయొచ్చు. కనక ఇది తెలుగు దేశంకు తర్వాత కాంగ్రెస్‌కు కూడా ఇరకాటమే.

రిలయన్స్‌ అందరికంటే గొప్ప!






రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంలో అల్లాడుతుంటే ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌ అమ్మకానికి రిలయన్స్‌ సంస్థ సహకరించకపోవడం సహజ న్యాయ సూత్రాలకే విరుద్ధం.అందరికీ చెందాల్సిన గ్యాస్‌ను ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో గల అన్యాయం వదిలేద్దాం. సరళీకరణలో అవన్నీ మూమూలే.అంతమాత్రాన అవసరమైనప్పుడు కొనుక్కోవడానికి కూడా దిక్కులేని స్థితి ఏ వ్యాపారంలోనైనా వుంటుందా? వైఎస్‌రాజశేఖర రెడ్డి హయాంలో నేను ఈ విషయమై ఆయనతో ఒకటికి రెండు సార్లు మాట్లాడితే జరిగిపోయిన ఒప్పందాన్ని ఏమీ చేయలేమని కనీసం మనకు సరసమైన ధరకు సరఫరా జరిగేలా యత్నిస్తున్నామని అన్నారు. కాని జరిగింది శూన్యం. ఇప్పుడు పెట్రోలియం సహజ వాయుశాఖా మంత్రి జైపాల్‌ రెడ్డి రిలయన్స్‌ సంస్థ ప్రధాని కార్యాలయంపైనే వత్తిడి తెచ్చిన తీరును పరోక్షంగా బయిటపెట్టారు. ఇప్పుడు మనను కాదని మహారాష్ట్రలోని దబోల్‌ విద్యుత్కేంద్రానికి సరఫరా జరగుతుంటే అతి జాతీయ విధానమని సమర్థిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రికి ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి వారిద్దరూ కలిసి మిగిలిన పార్టీలను కూడా కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి గాని ఇలా పరస్పరం ఆరోపణలతో బాధ్యతలు వదిలేయడం కాదు.ఏమైనా ఈ నిర్వాకాల వల్ల ఆంధ్ర ప్రదేశ్‌లో అంధకారం అలుముకోవడం అత్యంత ఆందోళన కరం.

పీజులకు ఫ్యూజు!




ఏకీకృత ఫీజుల వివాదం మాటున రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీ ఇంబర్సుమెంటు పథకానికి గ్రహణం పట్టించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల పెంపు ప్రతిపాదనలో తన పాత్ర నిర్వహించకుండా దాటేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అందరినీ కూచోబెట్టి ఒప్పించే బదులు కాలయాపన చేసింది. వారిలో వారు విడిపోతే చూస్తూ వూరుకుంది. అంతే గాని విద్యార్థు ల తరపున చొరవ తీసుకుని చర్చల ద్వారానో ఆర్డినెన్సు ద్వారానో ప్రతిష్టంభన తొలగించే ప్రయత్నం జరగలేదు.ఇప్పుడు గవర్నర్‌ గారే ఉచితం తప్పు అన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఇక్కడ ఉచితం ఏమీ లేదు.ప్రభుత్వం కార్పొరేట్లకు సొమ్ము చెల్లించే విద్య కొనుగోలు చేసి విద్యార్థులకు అందించడం ఇక్కడ సూత్రం. ఆరోగ్యశ్రీలో ఆస్పత్రులైతే ఇక్కడ కాలేజీలు. అంతే తేడా. ఈ వ్యవహారానికి బదులు ప్రభుత్వమే కాలేజీలు నడిపి పిల్లలను చేర్చుకోవచ్చు గదా అంటే భేషుగ్గా చేయొచ్చు.కాని కార్పొరేట్ల బేహారుల సేవ ఏమయ్యేట్టు? కనక అదంతే! ప్రజల డబ్బుతో ఫీజు రీఇంబర్సుమెంట్‌ చేస్తూ అది వైఎస్‌ ఘనత అని ఒక పార్టీ కాదు మాదే గొప్ప అని మరో పార్టీ. ఎంత హాస్యాస్పదం? ఈ అయోమయంలో అఖిల భారత స్థాయిలోనూ అంతర్జాతీయంగానూ విద్యార్థులకు జరిగే నష్టానికి బాధ్యులెవరు? ఈ అనిశ్చితి అశాంతికి దారి తీసినా ఆశ్చర్యం లేదు.

అన్నా రాజకీయం- అంతా అస్పష్టం!



అపర గాంధీ స్థాయిలో ప్రచారం పొందిన అవినీతి వ్యతిరేక ఉద్యమ కారుడు అన్నా హజారే రాజకీయ వేదిక స్థాపిస్తానని చేసిన ప్రకటనపై పెద్ద హర్షాతిరేకం వ్యక్తం చేసిన వారెవరూ లేరు. కాని ఆయన గత వైఖరికీ దీనికి మధ్య వ్యత్యాసం పట్టి చూపినవారు,ఆ వేదిక భవిష్యత్తుపై నిర్లిప్తత వ్యక్తం చేసిన వారు చాలా ఎక్కువ. అత్యధిక ప్రచారం పొంది ప్రభంజనంలా కనిపించిన ఒక వ్యక్తి కేవలం ఒక ఏడాది కాలంలో ఇంత పేలవమైన ప్రతిస్పందనతో మిగిలిపోవడం అరుదే అయినా అసహజం కాదు.వ్యవస్థాగత అంశాలు వదిలిపెట్టి వ్యక్తిగత పోకడల చుట్టూ పరిభ్రమిస్తే కలిగే ఫలితం ఇలాగే వుంటుంది. వ్యక్తులు స్వీయారాధనలో పడిపోయి ఇచ్చానుసారం అన్ని జరిగిపోతాయనుకుంటే పరిస్థితి తలకిందులవుతుంది. అన్నా హజారే ఒకటికి రెండు సార్లు నిరాహారదీక్షలు ప్రకటించడం, విరమించడం,ఆ దీక్షా శిబిరంలో బృంద సభ్యుల మధ్యనే విభేదాలు కనిపించడం ఇవన్నీ మెరుపును తగ్గించేశాయి. వాస్తవానికి మొదటి నుంచి ఆయన ఆందోళనలో వైరుధ్యాలకు లోటు లేదు. బ్లాగులో నేను హజారే దీక్ష హజార్‌ సవాళ్లు అంటూ మొదట్లోనే రాశాను. ఇటీవల కూడా మళ్లీ సందేహాలు వ్యక్తం చేశాను.ఇప్పుడు ఆ క్రమం పూర్తయిందని