Pages

Tuesday, February 25, 2014

గు'లాబీ' హస్త విలీన విన్యాసం..









తెలంగాణా విభజన బిల్లు ఆమోదం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి యావత్తూ టిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడంపై కేంద్రీకరించింది. విలీనంపై చర్చ ముగిసిందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజరుసింగ్‌ చేసిన ప్రకటనతో ఈ తతంగం కూడా పరిసమాప్తమైంది. వారం రోజులుగా దిగ్విజరు సింగ్‌తో రాజకీయ చర్చలు చేస్తున్నట్టు కె.సి.ఆర్‌ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటనను సందేహించవలసిన అవసరం కనిపించదు. ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి వెళ్లి 100 శాతం తెలంగాణా రాష్ట్రానికి వస్తానని కెసిఆర్‌ అన్నప్పుడు టిఆర్‌ఎస్‌ నుంచి వెళ్లి కాంగ్రెస్‌కు వస్తారా అని నేను తమాషాగా అన్నాను. ఇప్పుడు ఇంచుమించు అదే జరిగినట్టు కనిపిస్తుంది.
టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర రావు కుటుంబ సమేతంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలసి కృతజ్ఞతలు తెల్పి వచ్చారు. సకుటుంబ సందర్శనం మర్యాదకోసం జరిగినట్టు కనిపించినా వాస్తవానికి రాజకీయంగా తమ అనుబంధాన్ని చాటుకోవడానికే కెసిఆర్‌ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. తమ పార్టీ కీలక నేతలనూ సీనియర్లనూ వదలిపెట్టి కేవలం కుటుంబసభ్యులనూ బంధువులను తీసుకెళ్లడంపై ఆ పార్టీలో కొంత దుమారం రేగింది కూడా. ఈ సమయంలో తెలంగాణా అభివృద్ధికి అవసరమైన కోర్కెల పత్రాన్ని సోనియా గాంధీకి సమర్పించినట్టు చెప్పిన కెసిఆర్‌ రాజకీయాలు చర్చకు రాలేదనడం ఎవరూ తీవ్రంగా తీసుకోలేదు. విలీనానికి సిద్ధమని చెప్పిన తర్వాత కొత్తగా ఆ స్థాయిలో చర్చించవలసిన అంశాలేముంటాయి? వాటిపై సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులతో ఎలాగూ చర్చలు జరుగుతూనే వున్నాయి అని టిఆర్‌ఎస్‌ నేత ఒకరు నాతో చెప్పారు. వారు చెప్పినట్టు వినడం తప్ప మా చేతుల్లో ఏముంటుంది? ప్రత్యామ్నాయాలేముంటాయి అని ఆ నేత అన్నారు.
ఉభయ పార్టీల విలీనంపై వాస్తవానికి వివిధ రూపాల్లో చర్చ నడుస్తూనే వుంది. విలీనమా విడిగానే అనేది ఒక కొలిక్కి రావడం లేదు. ఇందుకు కె.సి.ఆర్‌ వైఖరి ప్రధాన కారణం అన్నది ఒక కథనం. విలీనం ప్రతిపాదనను తోసిపుచ్చకుండానే ఆయన అనేక విధాల రాజకీయ బేరసారాలకు ప్రయత్నిస్తున్నారు. పైగా విలీనం వల్ల తెలుగుదేశం ప్రచారం నిజం చేసినట్టవుతుందని ఆ పార్టీ నాయకులు చేస్తున్న వాదన కూడా వాస్తవికంగా లేదు. ఒకసారి అన్న మాట ప్రకారం తెలంగాణా ఇచ్చిన తర్వాత తాను అన్నమాట నిలబెట్టుకోవడానికి ఇంతగా తటపటాయించడంలో ఆంతర్యం ఏమిటి? అని తెలంగాణా ప్రాంతానికి చెందిన ఒక సీనియర్‌ నాయకుడు అన్నారు. కాంగ్రెస్‌ కోణం నుంచి మాట్లాడుతున్నట్టు కనిపించే కెసిఆర్‌ నిజానికి తన పార్టీ పునాదిని విస్తరించుకోవడంపై కేంద్రీకరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల పొత్తుతో పోటీ చేసి గరిష్టంగా స్థానాలు తెచ్చుకోవడం మంచిదని అంటున్న కెసిఆర్‌ రేపు ఎన్నికల తర్వాత కేంద్రంలో పరిస్థితి మారిపోతే మాట మార్చరని ఇతరులతో కలవరని ఎవరు గ్యారంటీ ఇస్తారన్నది మా అధిష్టానాన్ని వేధిస్తున్న సమస్య అని మరో మాజీ ఎంపి వివరించారు. ఇన్ని కారణాల రీత్యా కాంగ్రెస్‌ ఆయనను కమిట్‌ చేయించిందని అనుకోవాలి.
తెలంగాణా ఆవిర్భావంతో మొత్తం తానే తుడిచిపెట్టేస్తానని కెసిఆర్‌ అతిగా అంచనా వేసుకుంటున్నారు. విలీనమైతే ఆయనపై ఒత్తిడి తగ్గి కాంగ్రెస్‌ అధిష్టానం పేరుమీద అంతా జరిగిపోతుంది. లేదంటే అసలు పొత్తుకే విలువ లేకుండా బహుముఖ పోటీలు తిరుగుబాట్లు పెరుగుతాయి. ఈ ఓట్ల చీలికలో బలమైన యంత్రాంగం గల తెలుగుదేశం, విభజనకు సహకరించిన బిజెపి సీట్లు తెచ్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నది కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న ఆందోళన. తెలుగుదేశం చాలా ఇరకాటంలో వున్నా వెంటనే ఎన్నికల రంగంలోకి దిగిపోతుంటే మనం తర్జనభర్జనలలో మునిగిపోయామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రజలలో ఈ ఎన్నిక వరకూ కెసిఆర్‌ కన్నా సోనియాపైనే ఎ క్కువ గురి వుంటుందని వారు భావిస్తున్నారు. తెలంగాణా ఇస్తే కాళ్లు కడుగుతానని ఇంకా ఏవేవో మాట్లాడిన కెసిఆర్‌ ఇప్పుడు ఆ మాటల నుంచి వెనక్కు పోవడం కూడా సులభం కాదు.

కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలను కలిపేసుకోవడం తప్ప విలీనం వంటి మాటలను కూడా ఉపయోగించదు. ఒకప్పుడు శరద్‌ పవార్‌ తన కాంగ్రెస్‌ను విలీనం చేస్తున్నానని చెబితే అదే సభలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీ మాతృసంస్థలోకి వస్తున్నందుకు స్వాగతం చెబుతున్నానని మాత్రమే అన్నారు. ఇటీవల చిరంజీవి పిఆర్‌పిని విలీనం చేసినప్పుడు ఎలాటి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. ఆ సభకు సోనియా వస్తారని ప్రచారం జరిగినా నిజం కాలేదు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ విషయంలోనూ అందుకు భిన్నంగా జరగబోదంటున్నారు. విలీనం జరిగితే మొదట్లో ప్రాధాన్యత నిచ్చినా తర్వాత కెసిఆర్‌కు ఇంత బలమైన స్థానం వుండబోదని కాంగ్రెస్‌ తేలిగ్గా చప్పరించేస్తుందని విభజనకోసం కృషి చేసిన ఒక ప్రముఖ సంపాదకుడు అన్నారు. ఇప్పుడు కెసిఆర్‌ లేకుండానే దిగ్విజరు సింగ్‌ తానుగా ఇలాటి వ్యాఖ్యలు చేశారంటే ఎంత దాని వెనక ధీమా స్పష్టం. తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పే కెసిఆర్‌ అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌లో కలసి పోయి కొత్తగా సాధించేదేమిటన్న ప్రశ్న వుండనే వుంటుంది.
నిజానికి టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఈ విలీనం పట్ల తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. పైనున్న వారికి స్థానం లభించవచ్చు గాని తమ వంటి వారి పరిస్థితి ఏమిటని యువ నాయకులు కింది వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాటి వారంతా ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
.

Monday, February 24, 2014






భ్రమగా మిగిలిన బ్రహ్మాస్త్రం
ఉత్తుత్తి మాటలతో ఉష్ణోగ్రత పెంచిందెవరు?
మమత వెంట మహాత్ముడు
తెలంగాణా సాకారం- రెండు రాష్ట్రాలకు శ్రీకారం
జాతీయ భావనలు వాడుకునే ప్రయత్నం




watch www.10tv.in to watch gamanam by Telakapalli ravi 

Saturday, February 22, 2014

తెలుగు ప్రజల చరిత్ర మలుపుల్లో మరో అధ్యాయం





ఆంధ్ర ప్రదేశ్‌ విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో 29వ రాష్ట్రంగా తెలంగాణా వాస్తవ రూపం దాల్చనుంది. ఇప్పటి వరకూ జరిగిన వాదోపవాదాలూ, భిన్నాభిప్రాయాలూ ఎలా వున్నా రాజకీయ పరిణామాలను వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోవడం అనివార్య అవసరం. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించడం వెనక చాలా చరిత్ర వుంది. గుణపాఠాలున్నాయి. భవిష్యత్తుకు పాఠాలున్నాయి. ప్రాంతాల పేరిట వివిధ దశల్లో జరిగిన ఉద్యమాల వెనక నాయకుల వ్యూహ ప్రతివ్యూహాలు వాటి పర్యవసానాలు కూడా రకరకాలుగా వున్నాయి. తెలుగు ప్రజల భవిష్యత్తు కొత్త మలుపు తిరుగుతున్న ఈ సమయంలో వాటిని ఒకసారి తేరిపార చూడటం ఆసక్తికరం.1953లో ఆంధ్ర రాష్ట్రం,1956లో ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడ్డాయి. వీటికి కారణమైన పరిస్థితులను చాలా సార్లు ప్రస్తావనకు వచ్చాయి. తర్వాత కాలంలో పరిణామాలపైన చర్చ జరగడం తక్కువ. తెలంగాణా వైపున అరవయ్యేళ్ల ఉద్యమం అన్నమాట పదే పదే వినిపిస్తుంటుంది. ఇందుకు భిన్నంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల కమ్యూనిస్టేతర నేతలు ఇవన్నీ బూటకమని కొట్టిపారేస్తుంటారు. నిజానికి చాలా పరిణామాలు అంశాలు కలగలసిపోయిన జటిలమైన చరిత్ర ఇది.

యాభయ్యవ దశకంలో రెండు ప్రాంతాల్లోనూ కమ్యూనిస్టులు బలమైన ప్రథమ శక్తిగా వున్నారనేది చాలా సార్లు చెప్పుకున్న విషయం. ఆంధ్ర, హైదరాబాదు శాసనసభల తెలుగు జిల్లాల వరకూ చూస్తే వారే ప్రథమ స్థానం. అయితే అప్పటి శాసనసభలు ఉమ్మడి రాష్ట్రాల పరిధిలో వున్నాయి గనక ఆ సంఖ్యాబలం అధికారంలోకి తీసుకురాలేకపోయింది. 1952లో తెలంగాణా ప్రాంతంలో పోరాట విరమణకు ముందే ఉద్యమంలో పొడసూపిన కొన్ని అవకాశవాద ధోరణులు, ఆంధ్ర ప్రాంతంలోనూ ఎన్నికల భ్రమలు పాలక పక్షాల కుట్రలూ కలసి 1955లో కమ్యూనిస్టుపార్టీ దెబ్బతినడం జరిగిన నేపథ్యంలోనే కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. అప్పటిదాకా అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్‌ ఉభయ ప్రాంతాల నాయకులూ కలసి ఆదరాబాదరాగా పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. నాటి హైదరాబాదు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అందుకు సహకరించగా ఆయన వ్యతిరేకులైన మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి అభ్యంతరం తెలిపారు. రాయలసీమ కోణంలో మొదట వ్యతిరేకించిన నీలం సంజీవరెడ్డి తర్వాత సర్దుకుని మొదటి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణా ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడలేదు. అది ఆరోవేలు అని తీసిపారేశాడు. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాని వంటి పదవులు లేవు. అది ముఠాతగాదాల సర్దుబాటుకోసం తెలుగు వారు సృష్టించినదే. కాని సంజీవరెడ్డి దాన్ని నిరాకరించడంతో వ్యవహారం ఆదిలోనే హంసపాదులా తయారైంది.
ఇదే సమయంలో నిజాం పాలనా కాలంలో నివాసార్హతకు సంబంధించి రూపొందిన ముల్కీ(స్థానిక) నిబంధనలు వివాదాస్పదమైనాయి. 1952లో కొంతమంది నాన్‌ముల్కీ గోబ్యాక్‌ అంటూ అలజడి సృష్టించారు. 1956,59 మధ్య ఉద్యోగులకు సంబంధించి పలు రకాల ఉత్తర్వులు వెలువడ్డాయి.1965 నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు నిలిపేయడం యువతలో అశాంతికి కారణమైంది. 1967లో తెలంగాణా ఎన్‌జివోల సంఘంగా మారిన హైదరాబాద్‌ ఎన్‌జివోల సంఘం పలు ప్రత్యేక కోర్కెలతో ఒక ప్రకటన విడుదల చేసింది. నివాసార్హతకు సంబంధించిన ఈ నిబంధనలు 1974 వరకూ చివరి సారిగా పొడగించాలనే ప్రతిపాదన వచ్చింది. దీన్ని కోర్టులో సవాలు చేసినప్పుడు చెల్లుబాటు కావని హైకోర్టు 1969 లోతీర్పు నిచ్చింది. ఇవన్నీ అసంతృప్తికి దారి తీశాయి.
దీనికి సమాంతరంగా కాంగ్రెస్‌ నేతల ముఠా తగాదాలు నడిచాయి. 1964లో నీలం సంజీవరెడ్డి కేంద్రానికి వెళ్లేప్పుడు తన అనుచరుడైన కాసు బ్రహ్మానందారెడ్డిని నియమింపచేసుకున్నారు. అయితే అప్పటి ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి మరణానంతరం ఇందిరాగాంధీ పేరు ప్రతిపాదించడంలో కాసు స్వతంత్రంగానే వ్యవహరించి పట్టు పెంచుకోవడం ఆయనకు నచ్చలేదు. 1967 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఎక్కువ మంది ఎన్నిక కావడంతో కాసు ప్రాబల్యం మరింత పెరిగింది.తన మంత్రివర్గంలోకి తీసుకున్న మర్రి చెన్నారెడ్డికి కొద్ది రోజుల్లోనే కేంద్రంలో పదవి ఇప్పించి దూరం పంపించారనే భావం ఏర్పడింది. అయితే 1968 ఏప్రిల్‌లో ఒక ఎన్నికల పిటిషన్‌లో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ విషయంలో తనకు కాసు సహాయపడలేదని ఆయన ఆగ్రహించారు. తనకు పదవి వచ్చే అవకాశం లేకపోవడం, తెలంగాణాకు సంబంధించి వచ్చిన వివాదాలు ఉపయోగించుకుని మర్రి చెన్నారెడ్డి అప్పటికే ఏర్పడి వున్న ఉద్యమ నాయకత్వం చేతుల్లోకి తీసుకోగలిగాడు. ముఖ్యమంత్రి కాసు ఇందిరాగాంధీ చెప్పిన మధ్యేమార్గ పరిష్కారానికి ఒప్పుకోకపోవడంతో సంక్షొభం కొనసాగింది. రాజకీయాలలో ఉద్దండుడైనప్పటికీ ఆయన తెలంగాణా నాయకులను తనవైపు తిప్పుకోలేకపోయారు. ఆ మంత్రులంతరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రాంతీయ ఉద్రేకాలు వెర్రితలలు వేశాయి. సమస్యల పరిష్కారం తో పాటు కాసును తప్పించడం ఒక ప్రధాన షరతుగా తయారైంది. ఉద్రిక్తతలు పెరిగాయి. 1971 ఎన్నికలలో ఇందిరాగాంధీ అఖండ విజయం సాధించి తిరుగులేని నాయకురాలయ్యారు. ముఖ్యమంత్రుల సహాయంపై ఆధారపడే స్తితి పోయి తానే నియమించే స్తితికి వచ్చారు. అయితే తెలంగాణా ప్రాంతంలో మాత్రం మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణా ప్రజా సమితి అత్యధిక పార్లమెంటు స్థానాలు తెచ్చుకోగలిగింది. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ కాసును తప్పించి తన విధేయుడైన పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రిగా నియమించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత 16 ఏళ్లకు తొలి తెలంగాణా ముఖ్యమంత్రి వచ్చారు. మంత్రి వర్గంలోని 29 మందిలో 14 మంది తెలంగాణా వారుండడమే గాక 13 మంది వెనకబడిన వర్గాల వారికి స్థానం కల్పించారు. ఇందిరాగాంధీ దళిత బాంధవురాలన్న నాటి ప్రచారానికి తగు రీతిలో జరిగిన తతంగమిది. కొంతమంది దీన్ని అతిశయోక్తిగా చిత్రిస్తూ ఆయన భూ సంస్కరణలు అమలు చేయడం వల్లనే దెబ్బ తిన్నారని చెబుతుంటారు. ఇన్‌సైడర్‌ పేరిట రాసుకున్న ఆత్మకథలో ఆయన కూడా అదే భావంకలిగించారు. కాని వాస్తవం ఏమంటే నాటి విధానాలే. పివి వ్యవహార శైలితో పాటు దేశ వ్యాపితంగా అసంతృప్తి పెరుగుతున్న వాతావరణంలో ఆశించిన స్థిరత్వం లభించలేదు. పివి ఎంత విధేయుడుగా వున్నా కాసు కూడా ఆశీర్వదించలేదు. ఈ లోగా సుప్రీం కోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుతాయని ఇచ్చిన తీర్పును పివి సమర్థించడం సమస్యను జటిలం చేసింది. ఈ దఫా ఆంధ్ర ప్రాంత మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. బిజెపి అప్పటి రూపమైన జనసంఫ్‌ు కూడా ఈ ఉద్యమాన్ని బలపర్చింది. వెంకయ్య నాయుడు అప్పుడే పైకి వచ్చారు. స్వతంత్ర పార్టీ గౌతులచ్చన్న కూడా చురుగ్గా పాల్గొన్నారు. విద్యాసంస్థలు మూతపడగా ఉద్యోగులు సమ్మెలతో జీతాలు కోల్పోయారు.
ఆ సమయంలో అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీని రద్దు చేసి ఉన్నతాధికార సంఘాన్ని నియమించింది. ఈ సంఘం ముఖ్యమంత్రి రాజీనామా చేయడం మంచిదని సూచించింది. ఆయన తప్పుకోగానే రాష్ట్రపతి పాలన విధించారు. పరిస్థితి కాస్త సద్దుమణగ్గానే కాంగ్రెస్‌ నాయకులు అధికారం కోసం తహతహలాడారు. అన్ని ప్రాంతాల్లోని అన్ని ముఠాలూ అధిష్టానం చెప్పింది వినడానికి సిద్ధమయ్యారు. సమైక్యతను నొక్కి చెప్పిన ఇందిరాగాందీ ఆరు సూత్రాల పథకం ప్రకటించారు. కృష్ణాజిల్లాలో పుట్టినా ఖమ్మం జిల్లా పరిషత్‌ అద్యక్ష పదవి చేపట్టి పునాది పెంచుకున్న జలగం వెంగళరావును 1973లో ముఖ్యమంత్రిగా నియమించారు. ఇది ఎలా జరిగిందో ఆయన తన ఆత్మకథలో వివరంగా రాసుకున్నారు. 1975 జూన్‌లో దేశంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి 1977 వరకూ ఉక్కుపాదంతో పాలించడం ఆయనకు కలసి వచ్చింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశమంతా ఆమె ఓడిపోయినా ఈ రాష్ట్రంలో మాత్రం 41 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఓడిపోయిన ఇందిరతో విభేదించిన జలగం 1978 ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్‌ తరపున రంగంలోకి దిగి ఓడిపోయారు. ఇందిరా కాంగ్రెస్‌ తరపున ఒకప్పుడు ఆమెను గట్టిగా వ్యతిరేకించిన మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. దీర్ఘ కాల నిరీక్షణ తర్వాత కల నెరవేర్చుకున్న మర్రి తీవ్రమైన అవినీతి ఆరోపణలకు గురయ్యారు. ప్రభుత్వ వైభోగంతో షష్టిపూర్తి వేడుకలు తులాభారాలు జరిపించుకుని విమర్శలు మూటకట్టుకున్నారు. భూ కబ్జా అన్న మాట అప్పుడే పుట్టింది. వీటన్నిటి మధ్యనా 1980 చివరలో అఖిలపక్ష ఉద్యమం మొదలైంది. చివరకు చెన్నారెడ్డి స్థానంలో హైదరాబాదు కార్మిక నాయకుడైన అంజయ్య పదవి చేపట్టారు. వీరిద్దరి హయాంలో ఏనాడూ తెలంగాణా వాదం గాని ఆ కోణం గాని ప్రత్యేకంగా ముందుకు రాకపోవడం విశేషం!

ఉద్యమాలతో పాటు ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్‌ పరాజయాలపాలైంది. విజయవాడ కార్పొరేషన్‌లో కమ్యూనిస్టులు, విశాఖలో బిజెపి విజయం సాధించడమే గాక కొన్ని ఉప ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు విజయం సాధించాయి. అంజయ్య పట్ల రాజీవ్‌గాంధీ అనుచితంగా ప్రవర్తించినందుకు గాను సుందరయ్య నాయకత్వంలో మొత్తం ప్రతిపక్షం మౌనం పాటించిన సన్నివేశం అపూర్వమైంది.ఈ కారణంగా అంజయ్యను హఠాత్తుగా తొలగించి ఆరు నెలలు భవనం వెంకట్రామ్‌ను, ఆ పిదప చివరగా కోట్ల విజయభాస్కర రెడ్డిని ఇందిరా గాంధీ నియమించడంతో ముఖ్యమంత్రి స్థానం పలుచనవడమే గాక రాష్ట్ర ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదనే భావన బలపడింది. కాంగ్రెసేతర పార్టీల ఉద్యమాల నేపథ్యం, అధిష్టానం అవమానకర పోకడల మధ్య ఈ మొత్తం వాతావరణాన్ని ప్రసిద్ధ కథానాయకుడు నందమూరి తారకరామారావు గొప్పగా ఉపయోగించుకోగలిగారు. ఫలితంగానే తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు దేశం నవమాసాలు నిండకుండానే ఘనవిజయం సాధించింది. చంద్రబాబు నాయుడు నుంచి చంద్రశేఖర రావు(కల్వకుంట్ల) వరకూ ఆ తానులో ముక్కలుగానే వచ్చారు.

ఎన్టీఆర్‌ విజయం ప్రజలు ఇచ్చిన బ్రహ్మాండమైన మద్దతు ఫలితమేననడంలో సందేహం లేదు. అయితే అది కేవలం ఆయన ఆకర్షణ లేక వ్యూహ చతురత అనుకుంటే అదీ వాస్తవికం కాదు. కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నాక వారికి సుపరిచితుడైన వ్యక్తిగా ఆయనను ఎంచుకున్నారు. ఆయనకు విధానాలలో ఏ మేరకు స్పష్టత వుందీ లేదు అనేది పక్కనబెడితే కొన్ని ప్రజానుకూల చర్యలు తీసుకున్నమాటా నిజమే. రిటైర్‌మెంట్‌ వయస్సు తగ్గింపు వంటి ప్రతికూలాంశాలు మొదట్లోనే రుచిచూపించారు. ఇవన్నీ గమనించకుండా ఆయనే తెలుగు వల్లభుడు అన్నట్టు అప్పుడూ ఇప్పుడూ తెలుగుదేశం నేతలు ప్రచారం చేసుకుంటుంటారు. ఆయన రాకముందు తెలుగు వారికి గుర్తింపు లేకుండా మద్రాసీలుగానే వుండిపోయినట్టు చిత్రిస్తుంటారు. ఇవన్నీ అతిశయోక్తులు. ఏమైనా తెలుగుదేశం రాకవల్ల ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల పోరాటం రాజకీయ కోణం నుంచి మారి ఒక ప్రాంతీయ గుర్తింపు, వ్యక్తి ఆరాధాన మార్గాలవైపు మళ్లింది. సామాజిక వర్గాల ప్రస్తావన కూడా పెరిగింది. మళ్లీ ఎన్టీఆర్‌పై నాదెండ్ల కుట్ర తదితర పరిణామాల వల్ల కొంత మార్పు వచ్చినా తెలుగుదేశం ఈ ధోరణి మారింది లేదు. ఇప్పటికీ అవకాశం రాగానే తెలుగువారి ఆత్మగౌరవం, తమిళనాడు తరపున చిదంబరం కుట్ర, ఉత్తరాది వారి ప్రాబల్యం వంటి మాటలు ఆ పార్టీ పైకి తీస్తుంటుంది. ఎన్టీఆర్‌ హయాంలో తెలుగుగంగ ప్రకటించినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు గాక నికర జలాలు కేటాయించాలనే ప్రాతిపదికపై వైఎస్‌రాజశేఖర రెడ్డి, మైసూరా రెడ్డి వంటి వారు ఉద్యమం నడిపినపుడు ప్రత్యేక రాయలసీమ వాదాలు కూడా ఎక్కువగానే వినిపించినా తర్వాత సర్దుకున్నాయి. ఎన్టీఆర్‌ మొదట్లో కాంగ్రెస్‌ వ్యతిరేక ఐక్యత అనే మాటనే నొక్కి చెప్పేవారు. అయితే ఆయన జాతీయ రంగంలో ప్రవేశించిన తర్వాత అనివార్యంగా లౌకిక విధానాల ప్రసక్తి వచ్చింది. అందువల్లనే ఆయన అద్యక్షుడుగా నేషనల్‌ ఫ్రంట్‌ బిజెపి లేకుండానే ఏర్పడింది.ఆ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని వామపక్షాలు బిజెపి బయిటనుంచే బలపర్చవలసిన స్థితి కలిగింది. అద్వానీ రథయాత్ర తర్వాత ఎన్టీఆర్‌ సూటిగా బిజెపితో విడగొట్టుకున్నారు.
ఎన్టీఆర్‌ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత కాలం పాత రాజకీయాలనే కొనసాగించినా ఆర్థిక విధానాలలో ప్రపంచ బ్యాంకు ఆదేశాల అమలు తీవ్రంగా జరిగింది. 1998 తర్వాత ఆయన వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడంతో తొలిసారి రాష్ట్ర రాజకీయాలు మితవాద మతవాద మలుపు తిరిగాయి. 1997లోనే ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం ఇచ్చిన బిజెపి స్వతహాగా విభజనకు అనుకూలం. అయితే చంద్రబాబు కారణంగా తాత్కాలికంగా ఆ ఎజెండా పక్కన పెట్టింది. కెసిఆర్‌తో సహా తెలంగాణా నాయకులంతా ఆయనతో బాగానే కలసి పనిచేశారు. 1999లో రెండవ సారి ఆయన అధికారం చేపట్టాక ఈ ధోరణి పరాకాష్టకు చేరింది. తనను తాను సరళీకరణకు అగ్రగామిగా భావించుకున్న చంద్రబాబు చేపట్టిన ఆర్థిక విధానాలు వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ సంస్థల మూత ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణలకు బాట వేశాయి. ప్రపంచ ద్రవ్య సంస్థలు, అమెరికా అధినేతలు నేరుగా వచ్చి వూరేగే పరిస్తితి ఏర్పడింది. ఇజాలు అవసరం లేని టూరిజమే గొప్పదన్న విచిత్ర వాదనలు వినిపించాడాయన. ఈ పరిస్థితుల్లోనే విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ, ఛార్జీల పెంపు తీవ్ర నిరసనకు దారి తీశాయి.2000 బషీర్‌ బాగ్‌ ఘటనలు దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా ప్రభావం కలిగించాయి. సిపిఎం వామపక్షాల నేతృత్వంలో మొదలైన ఆ ఉద్యమంలో వైఎస్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా పాల్గొనవలసి వచ్చింది. ఆ విధంగా ప్రపంచీకరణకు ప్రయోగశాలగా మారిన ఈ రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా ప్రతిఘటన కూడా ఉధృతంగా రావడం తెలుగు నాట ప్రజాస్వామిక పోరాటాలకు కొత్త వూపు నిచ్చింది. దానికి నాయకత్వం వహించిన బి.వి.రాఘవులు తదితరులపట్ల గౌరవం పెరిగింది.
అయితే 1981 అఖిలపక్ష ఉద్యమం తర్వాత తెలుగుదేశం ఆవిర్భవించినట్టే 2000 తర్వాత తెలంగాణా రాష్ట్ర సమితి ముందుకొచ్చింది. చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరున్నా మంత్రి పదవి పొందలేకపోయిన కెసిఆర్‌ ఆ పార్టీ నుంచి బయిటపడటానికి ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రపంచ బ్యాంకు విధానాలపై పోరాటాన్ని ప్రాంతాల పోరాటంగా మార్చేసే ఎజెండా చేపట్టారు. ఎందుకంటే అంతకు ముందే కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణా కోసం కృషిచేయాలని సోనియాగాంధీకి మెమోరాండం సమర్పించిన నేపథ్యం ఆయనకు కలసి వచ్చింది. మతతత్వంతో చేతులు కలిపి సరళీకరణకు ప్రతిరూపంగా మారిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించడం ఆ ఎన్నికల్లో ప్రధాన కర్తవ్యంగా వచ్చింది. అందుకే తొలిసారి సిపిఎం కాంగ్రెస్‌తో పోటీ నివారణకు ప్రయత్నించి తద్వారా ఓట్ల చీలికను నివారించవలసిన అగత్యం ఏర్పడింది. ఎన్నికల అవసరాలకోసం కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌తోనూ పొత్తు పెట్టుకుంది గాని సిపిఎం దానికి ఏ నాడూ భాగస్వామి కాదు. అనేక చోట్ల టిఆర్‌ఎస్‌పై పోరాడింది కూడా. ఎన్నికల విజయం తర్వాత టిఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో చేరి 2008 తర్వాతనే బయిటకు వచ్చింది. తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే.2008లోనే చంద్రబాబు నాయుడు తమ పార్టీ విధానాన్ని మార్చుకుని ప్రత్యేక రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించడమే అప్పటి అజెండాతప్ప ఉమ్మడి వేదికల్లో ఎక్కడా తెలంగాణా ఏర్పాటు నినాదంగా రాలేదు. అయితే పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీల అవిశ్వాసం అవకాశవాద పోకడల కారణంగా వైఎస్‌ బొటాబొటి మెజారిటీతో తిరిగి అధికారంలోకి రాగలిగారు. తర్వాత ఆరునెలలకే ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం, రాజకీయ అస్థిరత్వం కెసిఆర్‌ నిరాహారదీక్ష, చిదంబరం డిసెంబర్‌9 ప్రకటన వంటివన్నీ బాగా తెలిసిన విషయాలే. ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే ఈ మొత్తం పరిణామ క్రమంలో పాలక పక్షాలైన కాంగ్రెస్‌ తెలుగుదేశం, బిజెపిల రాజకీయావసరాలే రాష్ట్ర విభజన వెనక ప్రధాన పాత్ర వహించడం కనిపిస్తుంది. ఈ క్రమంలో కెసిఆర్‌ సందర్భాన్ని ఉపయోగించుకున్న సంధాన కర్తగానే కనిపిస్తారు. అందుకే విభజన నిర్ణయం జరిగితే కాంగ్రెస్‌లో విలీనమై పోతానని ఆయన పలు సార్లు ప్రకటించారు. ఇప్పుడు నేరుగా కలిసినా బయిటనుంచి కలిసినా ఆయన అస్తిత్వం దానితోనే ముడిపడి వుంటుంది. ఇక మిగిలిన మూడు పార్టీలూ రెండు ప్రాంతాల రాగం ఆలపిస్తూనే చేయవలసింది చేశాయి. లోక్‌సభలోనూ రెండు ప్రధాన పార్టీలు కలిసే తతంగం నడిపించాయి. ఇక్కడ దేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా చేయాలన్న ప్రపంచ బ్యాంకు ప్రణాళిక ఒకవైపు, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలు చిన్నవైతే కేంద్రంలో తామే చక్రం తిప్పొచ్చన్న పెద్ద పార్టీల ఆలోచన కనిపిస్తాయి. అంతే తప్ప విభజన చేస్తే లేక సమైక్యంగా వుంటే వాటికవే సమస్యలు పరిష్కారమైపోవు. విధానాలు మారని విభజనలు విలీనాలు సాధించేదేమిటనే ప్రశ్న మిగిలే వుంటుంది.
తెలంగాణాలో బలమైన రాష్ట్ర కాంక్ష వుండొచ్చు. కోస్తా రాయలసీమల్లో కలసి వుంటే మంచిదన్న భావన అంతే బలంగా వుండొచ్చు. రాజధాని హైదరాబాదు మరింత తీవ్ర వివాదంగా కొనసాగి వుండొచ్చు కూడా. వాస్తవానికి ఇవన్నీ విధానాలతో ఆర్థిక నిర్ణయాలతో ముడిపడి వుండేవే. ఏ మూడు పార్టీలైతే ఇప్పటి వరకూ కేంద్ర రాష్ట్రాలలో పాలన చేశాయో వాటినుంచే కొత్తగా ఆశించే మార్పు ఏముంటుంది? విధానాల పరంగా వైఎస్సార్‌ పార్టీ కూడా వీటికంటే భిన్నంగా వుండేది కాదు.కాకపోతే ఆ మూడు పార్టీల వలె గాక జగన్‌ పార్టీ.మలిదశలో సమైక్యత అన్న నినాదమే తీసుకుంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా సమైక్యవాదమే అంటున్నారు గాని ఆయన కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్థాపిస్తారో లేదో తెలియని పార్టీ కూడా భిన్నమైన వైఖరి తీసుకునే అవకాశం వుండదు. కాకపోతే విజయావకాశాల వేటలో పదవీ కాంక్షాపరులు పరిభ్రమించే అవకాశాలు చాలా వుంటాయి. ఎన్నికల సమీకరణలు పొందికలు కూడా పరిస్థితిని బట్టి పలురకాలుగా వుండొచ్చు. ఈ సమయంలో తెలుగుదేశం బిజెపి పొత్తు, కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ పొత్తు లేదా విలీనం సూచనలు కనిపిస్తున్నాయి. అందుకోసమే సీమాంధ్రకోసం తామేదో గొప్పగా సాధించినట్టు చూపించుకోవడానికి బిజెపి నానాతంటాలు పడుతున్నది.
విభజన లేదా సమైక్యత అన్నవి కేవలం ఉద్వేగానికి సంబంధించిన అంశాలు కాదు. వాటిని ముందుకు తెచ్చిన నాయకుల వైఖరి కూడా అన్ని వేళలా ఒకే విధంగా లేదు కూడా. అధికారం కోసం పార్టీల ఆధిపత్యం కోసం వారంతా అనేక విధాల కలసి వ్యవహరించారు. అందువల్లనే ప్రజలు కూడా ఈ వాస్తవాలు గ్రహించాల్సి వుంటుంది. ప్రజాస్వామ్య శక్తులు ప్రాంతాల మధ్య ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం కాపాడటానికి రెండు చోట్లా సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి సాదించడానికి కృషి కేంద్రీకరించవలసి వుంటుంది. ఇన్ని విధాల విన్యాసాలు చేసిన నాయకులు రేపు విభజన తర్వాత కూడా అనేక వికృతాలకు పాల్పడటం తథ్యం. అలాటి వాటిపట్ల అప్రమత్తత అవసరం. ఈ సందర్భంగా శాసనసభలోనూ పార్లమెంటులోనూ కానవచ్చిన అవాంఛనీయ పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవడం మరింత ముఖ్యం. గతంలో ఉప్పొంగిన ఉద్యమాలను రకరకాల దోవతప్పించిన శక్తులు ఇప్పుడు తమ పాచికలు పారాయన్న రీతిలో చెలరేగి పోయే అవకాశం వుంటుంది. అందుకే ప్రజాశక్తి గతంలో శీర్షిక నిచ్చినట్టు ప్రజలకు సంబంధించినంత వరకూ ఒకటైనా రెండైనా పోరాటం అనివార్యం.

Friday, February 21, 2014

చిరును మించిన 'వెంకీ'¸











రాజ్యసభ చర్చలో ఈ రోజు బిజెపి సీనియర్‌ నేత వెంకయ్య నాయుడుకూ కేంద్ర మంత్రి చిరంజీవికి మధ్య ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. సభలో తొలి ప్రసంగం చేసిన చిరంజీవి కొంత తడబాటుకు గురవుతున్నా అనుకున్నది చెప్పడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ను సమర్థిస్తూనే హైదరాబాద్‌ యుటి హౌదాపై కేంద్రీకరించారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఆరుణ్‌ జైట్లీ లేచి ఒక మంత్రి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చునా అని పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. అది ఆ ప్రభుత్వం ఆ మంత్రి చూసుకోవలసిన విషయం తప్ప తనకు సంబంధం లేదని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ తెలివైన రూలింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు లేచి చిరంజీవి చాలా ప్రసిద్ధి గల నటుడని తనకు చాలా మంది అభిమానులున్నారని అన్నారు. ఆయన తన భావాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. తర్వాత ప్రసంగం కొనసాగించిన చిరంజీవి తన నటనను మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతూనే తాను ఇక్కడ నటించడం లేదని చురక వేశారు.
అయితే రాజ్యసభలో వెంకయ్య నాయుడు పదే పదే సవరణలు సీమాంధ్ర కోర్కెల పేరుతో లేచి వాదించడం ఓటింగు వరకూ వెళ్లకుండా సర్దుకోవడం చూసిన వారికి ఆయన నటనలో చిరంజీవిని మించి పోయారన్న అ భిప్రాయం కలిగింది. తామేదో సాధించామన్న అభిప్రాయం కలిగించడమే ఆయన తాపత్రయంగా అనిపించింది. వాస్తవానికి ఆయన పదే పదే అడిగిన ఏ కోర్కెను కూడా ప్రభుత్వం ఆమోదించలేదు. అయినా వివరణ కోరుతున్నాను, స్పష్టీకరణ అడుగుతున్నాను అంటూ ఒకటికి రెండు సార్లు లేచి మాట్లాడారు.

తెలంగాణా రాష్ట్రావతరణ






ఆంధ్ర ప్రదేశ్‌ పునరవ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభ మంగళవారం, రాజ్యసభ గురువారం ఆమోదించడం తెలుగు ప్రజల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఉభయ సభలు పచ్చజెండా వూపడంతో దేశంలో తెలంగాణా 29వ రాష్ట్రంగా ఆవిర్భవించడానికి రంగం సిద్ధమైంది. అరవై ఏళ్లుగా వివిధ రూపాల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రాంతీయ సమస్య ఇప్పటికి ఈ విభజనతో ముగుస్తున్నది. ఆయా దశల్లో పాలక వర్గ పార్టీల నేతల పంచాయితీలు, క్రమేణా ప్రజల్లో ప్రబలిన మనోభావాలు, నాలుగేళ్లుగా నానుతున్న అనిశ్చితి అన్నీ దీని వెనక వున్నా కాంగ్రెస్‌ అధిష్టానం కళ్లముందున్నది మాత్రం నెలాఖరుకు రానున్న ఎన్నికలేనన్నది నిర్వివాదాంశం. పదేళ్లుగా పేరబెట్టిన సమస్యను పది రోజుల పార్లమెంటు చివరి సమావేశాల్లో తేల్చిపారేయడం సాధ్యమైందంటే ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి అందించిన సంపూర్ణ సహకారమే కారణం. ఈ సందర్భంగా లోక్‌సభలో కానవచ్చిన దృశ్యాలు ప్రాంతాల ప్రతినిధుల కుమ్ములాటలు జుగుప్సా కరం కాగా యుపిఎ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రమాణాలను తోసిరాజని ఏకపక్ష ఆమోదానికి పరుగులు పెట్టిన తీరు అత్యంత ఆందోళన కరం. దేశంలో తొలి భాషా రాష్ట్రంగా ఆవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌ను కనీస చర్చ లేకుండా అత్యున్నత సభ పేరిట విభజించడానికి రెండు ప్రధాన పార్టీలూ చేతులు కలపడంలో రాజకీయ ప్రయోజనాల పాకులాట తప్ప ప్రజా శ్రేయస్సు గోచరించదు. లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభలో కాస్తయినా చర్చ జరగడం కొంతలో కొంత మెరుగు. కావాలంటే ఈ రెండు పార్టీలూ అక్కడ కూడా చర్చ జరపలేవని కాదు గాని దాటవేయడానికి, ప్రధాన తతంగం ముగించేయడానికి ఆతృత పడ్డాయి.ఏమైనా బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందింది గనక ఇక రెండు రాష్ట్రాల ఏర్పాటు ఎప్పుడు ఎలా అన్నది కేవలం లాంఛనంగా ప్రకటించడమే మిగిలివుంటుంది.
ఇన్నేళ్లుగా సాగిన వాదోపవాదాల్లో నిజమైన సమస్యలు కొన్ని వుంటే స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాపింప చేసిన అవాస్తవాలూ చాలా వున్నాయి. ఈ క్రమంలో నిజమైన సమస్యలు మరుగున పడ్డాయి.ప్రజల పేరిట ప్రాంతాల పేరిట అటూ ఇటూ పాలకపక్షాలు పోటీ పడి రాజకీయ నాటకాలు నడిపించాయి. అసమానతలకు మూలమైన ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థ ఆపైన ఇటీవలి ప్రపంచీకరణ అనారోగ్యకరమైన రాజకీయ కాలుష్యం వీటన్నిటి నేపథ్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. అడుగు జారుతున్న ప్రధాన పార్టీలు పట్టు నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రాల విభజనను ఆయుధంగా చేసుకోవడం అస్తిత్వ రాజకీయాలను రెచ్చగొట్టడం దేశంలోనూ ప్రపంచంలోనూ చూస్తున్నదే.తెలంగాణా సమస్యకు కొన్ని ప్రత్యేకాంశాలు వున్నా ఈ మౌలిక లక్షణం మరుగున పడేది కాదు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు తెలంగాణాను బలపరుస్తున్నామంటూనే సీమాంధ్ర పేరిట నడిపిన ప్రహసనాలకు కూడా లోటు లేదు. ఈ పదిహేడేళ్లలోనూ పలుపల్లవులు మార్చిన బిజెపి ఇటీవల వరకూ తెలంగానం చేసి చివరి దశలో సీమాంధ్ర కోసం కంకణం కట్టుకున్నట్టు కపటనాటకాలాడి కసీన చర్చ కూడా లేకుండానే గుండుగుత్తగా బిల్లు ఆమోదానికి మాత్రం సహకరించింది. లోక్‌సభలో అత్యంత అప్రజాస్వామికంగా జరిగిన ఈ తతంగం రాజ్యసభలో కాస్త చర్చ జరిగేందుకు అవకాశమిచ్చింది. అయతే ఆ సందర్భంలో వెంకయ్య నాయుడు వంటి బిజెపి నేతలు పదే పదే ఏదో సాధించినట్టు కనిపించేందుకు చేసిన రాజకీయం రక్తి కట్టలేదు. స్వాతంత్రానంతరం దేశ భౌగోళిక పటాన్ని పాలనా విభాగాలను ఏర్పాటు చేసుకునేప్పుడు అనుసరించిన భాషా ప్రయుక్త సూత్రాన్ని తోసిపుచ్చేందుకు కేంద్ర రాష్ట్రాలలోని మూడు ప్రధాన పార్టీలూ కుమ్మక్కు కావడం దాచేస్తే దాగని సత్యం. రాజ్యసభ చర్చలో చాలా పార్టీలు ఈ పద్ధతిని వ్యతిరేకించడం యాదృచ్చికం కాదు.
సిపిఎం మొదటి నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన తగదనే సూత్రబద్ద వైఖరికి కట్టుబడి వుంది. పార్లమెంటులో చర్చ సందర్భంగానూ సిపిఎం నేత సీతారాం ఏచూరి అదే నొక్కి చెప్పారు. చర్చ జరిగిన రాజ్యసభలో ఓటింగు తీసుకోనందువల్ల వాకౌట్‌ చేసింది.కమ్యూనిస్టుపార్టీ మొదటి నుంచి చెబుతున్న విధానమదే. అన్ని రకాల ఒత్తిళ్ల మధ్య ఒక విధానానికి కట్టుబడి వున్నందునే విమర్శకులు సైతం దాని కట్టుబాటును గుర్తించారు. ఇంత ప్రాంతీయ వివాదాల మధ్య కూడా ప్రజాసంఘాల పోరాటాలు ఉద్యమాలు ఆగింది లేదు. ఈ పోరాటాలన్నీ ప్రాంతాల తేడా లేకుండానే జరిగాయి. రేపు కూడా రాష్ట్రాలు రెండైనా కొనసాగుతుంటాయి. సిపిఐ విభజనను సమర్థించగా వైసీపీ సమైక్యత నినాదమిచ్చింది. తెలంగాణా సమస్య ఈ దశలో ముందుకు రావడానికి ప్రధాన కారణమైన టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో విలీనానికి కూడా సిద్ధమంటోంది. లౌకిక పార్టీగా పేరున్న తెలుగుదేశం నరేంద్ర మోడీ చెలరేగి పోతున్న ఈ తరుణంలో బిజెపితో చేతులు కలపడానికి సిద్ధమైంది. బిజెపి నేతలు ఆఖరి నిముషంలో చేసిన హడావుడి అందుకు అనుగుణంగా జరిగిందే తప్ప చిత్తశుద్ధి నాస్తి. ఇక విభజనను ఆపే బ్రహ్మాస్త్రముందన్న కాంగ్రెస్‌ ఎంపిలు పెప్పర్‌ స్ప్రేలతో తప్పుసంకేతాలివ్వగా చివరి బంతి తగిలాకే ముఖ్యమంత్రి ఇంటిదారి పట్టారు. ఏతావాతా కాంగ్రెస్‌ నాయకత్వం ఉద్దేశించిన రాజకీయ క్రీడ చివరి దశకు చేరింది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన కోసం ఎదురు చూడటమే మిగిలింది. రాష్ట్ర విభజన నిర్ణయం అమలుకు ఆదేశాలు జారీ చేయవలసింది కూడా ఆయనే. ఇన్నేళ్లలోనూ ఎందరు ఎన్ని విధాల రెచ్చగొట్టినా ఘర్షణలకు ఆస్కారమివ్వకుండా ప్రశాంతతను కాపాడుకున్న తెలుగు సోదర సోదరీ మణులు ఇక ముందూ అదే సుహృద్భావాన్ని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నేతలందరూ ఆ విధమైన పిలుపునివ్వడం ఆహ్వానించదగింది. ఎందుకంటే వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చినాడన్నా వరాల తెలుగు ఎప్పటికి ఒక్కటిగానే వుంటుంది. అదే స్పూర్తితో తెలుగు ప్రజల సమరశీల చైతన్య వారసత్వం చెయ్యెత్తి జై కొడుతూనే వుంటుందని విశ్వసిద్దాం.




నిరర్థక నిష్క్రమణ







ఆంధ్ర ప్రదేశ్‌ బిల్లు లోక్‌సభ ఆమోద ముద్ర వేయించుకుని రాజ్యసభకు రానున్న తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. విభజన ప్రాంగణంలో వున్న ఈ రాష్ట్రాన్ని ప్రజలనూ దృష్టిలో వుంచుకునే తాను రాజీనామా చేశాను తప్ప స్వప్రయోజనం ఎంతమాత్రం లేదని ఆయన బల్లగుద్ది చెప్పారు. రాజకీయ రాజ్యాంగ ప్రక్రియ రాష్ట్ర సరిహద్దులు దాటి కేంద్రం చేతుల్లోకి వెళ్లిన తర్వాత అందులోనూ ప్రధాన భాగం పూర్తయిన తర్వాత ఆయన రాజీనామా చేయడం వల్ల ఒరిగేది జరిగేది శూన్యమని ఆయనకూ తెలుసు. చివరి బంతి అంటూ ఎడతెగని ప్రజ్ఞలు పలుకుతూ బ్రహ్మాస్త్రాలు చక్రాయుధాల గురించి చెబుతూ అంతా అయిపోయిన తర్వాతనే ఆయన వైదొలగడానికి రాజకీయ ప్రాధాన్యత గానీ ప్రభావం గానీ వుండకపోవచ్చు.
విభజనకు సంబంధించి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం వెలువడిన తర్వాత గత ఆరునెలల్లోనూ కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహారశైలి గానీ, చేసిన వ్యాఖ్యానాలు గానీ అతిశయోక్తికీ అవాస్తవికతకూ అద్దం పట్టాయి. సమైక్య సింహం అని ప్రచారం చేయించుకున్న కిరణ్‌ శాసనసభలో బిల్లుపై చర్చ సందర్భంలోనూ ద్విముఖ వ్యూహమే అనుసరించారు. రాష్ట్రపతి పంపిన బిల్లును శాసనసభలో చర్చకు చేపట్టి నివేదిక తయారు చేసేందుకు సహకరించారు. ఆ తర్వాత బిల్లును తిరస్కరిస్తున్నట్టు ఆఖరి దశలో తీర్మానం పెట్టి మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు ప్రకటించారు. ఈ చర్య చాలా గొప్పదైనట్టు ముఖ్యమంత్రి అనుయాయులు ప్రచారం చేసుకుంటే తెలంగాణా వాదులు దానిపై తీవ్రంగా దాడి చేశారు. రాజ్యాంగం మూడవ అధికరణం ప్రకారం శాసనసభ అభిప్రాయాన్ని పార్లమెంటు తోసిపుచ్చవచ్చుననే మాట ఒకటైతే అది కూడా సూటిగా చేయడం గాక ఉభయ తారకంగా తతంగం నడిపించడం ముఖ్యమంత్రి కేంద్రానికి చేసిన పరోక్ష సేవ వంటిదే. ఈ విధంగా ఒక వైపు పూర్తిగా సహకరిస్తూ మరో వైపు ధిక్కారం అభినయిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌ రసవత్తర రాజకీయమే నడిపించారు, ఆ తర్వాత ఇరవై రోజులపాటు రోజూ రాజీనామా వార్తల ధారావాహిక నడిపించారు. దీనివల్ల చివరి నిముషం వరకూ అధికారం చేజారిపోకుండానూ మరో నేతను ఎన్నుకోవలసిన చిక్కు సమస్య అధిష్టానానికి రాకుండానూ శాయశక్తులా సహకరించారు. విధేయత తప్ప విలువలు పెద్దగా పాటించని కాంగ్రెస్‌ నేతగా ఆయన ఇవన్నీ చేయడం మామూలేగాని పైకి గంభీరోక్తులు పలుకుతూ ఏదో చేయబోతున్నారన్నట్టు కొందరిలో భ్రమలు గొల్పడం మరికొందరు వివాదాలు రగిలించడానికి ఆస్కారం కలిగించాయి.
క్లిష్ట సమయంలో పదవి చేపట్టి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చయడం కిరణ్‌ గొప్ప అనే భావం ఒకటి ప్రచారంలో వున్నా వాస్తవానికి ఈ మూడేళ్లు ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకమైన దుస్థితి. ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడుతున్నా పాలన స్తంభించిన దుర్గతి. తామే సృష్టించిన ప్రాంతీయ చిచ్చును సాకుగా చూపి కనీస ఉపశమన చర్యలను కూడా ఉపేక్షించింది. మరోవైపున కేబినెట్‌ ప్రాంతాల వారిగా చీలిపోయి సమిష్టి బాధ్యతను ప్రహసనంగా మార్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్ది తక్షణ పాలనా చర్యలైనా సక్రమంగా సకాలంలో తీసుకోడానికి బదులు ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు పార్టీ ప్రచారానికి పాకులాడారు. తాడూ బొంగరం లేని పథకాలతో ప్రజాధనం వెచ్చించి ప్రచార యజ్ఞం నడిపించారు. అవినీతి ఆరోపణలకు గురైన అమాత్యులను తప్పించకపోగా రకరకాలుగా వెనకేసుకొచ్చి చేయిదాటిపోయాకే బయిటకు పంపించారు. అక్రమంగా కట్టబెట్టిన భూములను వెనక్కుతీసుకుంటానన్న వాగ్దానం అరకొరగానే అమలు చేశారు. పైగా ఆఖరి క్షణంలోనూ సంతకాల సంతర్పణతో ఆరోపణలు మూటకట్టుకున్నారు. అంగన్‌వాడీలపై అధికార నివాసం దగ్గర అమానుషం జరిగితే ఆపలేని అలక్ష్యంలో మునిగిపోయారు. వ్యక్తిగత పోకడలకు మారుపేరుగా వివాదాస్పద వ్యాఖ్యలకు మూర్తీభావంగా స్వజనంతోనే విమర్శలు అందుకున్నారు. ఇంటా బయిటా ఈసడింపుల జడివాన కురుస్తుంటే ఆత్మస్తుతితో కాలక్షేపం చేశారు. సమైక్య జపం చేసిన ముఖ్యమంత్రి రెండు ప్రాంతాల మధ్య సుహృద్భావం పెంచే చర్యలు తీసుకున్నది లేకపోగా కొన్ని సార్లు దుందుడుకు వ్యాఖ్యలతో వివాదం పెరగడానికి కూడా కారణమైనారు. వాస్తవంగా ఏ ప్రాంతానికీ ఏ తరగతి ప్రజలకూ నిజంగా జరిగిన మేలు లేకపోగా వాతావరణం కలుషితమైంది. స్వంత పునాదులు కాపాడుకోవాలనే పాలక పక్ష రాజనీతి తప్ప విశాల దృక్పథంతో పదిమందినీ కలుపుపోవడానికి చొరవ చూపింది పూజ్యం. ఆఖరికి ఆయన దగ్గర పట్టుమని పదిమంది మంత్రులు గాని పాతిక మంది శాసనసభ్యులు గాని మిగల్లేదంటే ఇవన్నీ కారణాలే. కాంగ్రెస్‌ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు అనుసరించిన దివాళాకోరు విధానాల అనివార్య పరిణామమే కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిరర్థక నిష్క్రమణ. తానే ఏదో చేస్తానని చెప్పడం ద్వారా మిగిలిన వారిని కూడా నిరోధిస్తూ అధికార పీఠాన్ని కాపాడుతూ అధినేత్రి ఆదేశాలు తుచతప్పక అమలు చేశారనే ఆరోపణలపై సుదీర్ఘ సంజారుషీ ఇచ్చుకోవలసివచ్చిందీ అందుకే. అయితే వీటితో సంతృప్తి చెందేవారెవరూ వుండరు.
కిరణ్‌ కుమార్‌ రెడ్డి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌ ఆఖరి ముఖ్యమంత్రి అవుతారా లేక మరో చివరాఖరి కీలుబొమ్మకు అవకాశం వుంటుందా అనేది వేచిచూడాల్సిన విషయమే. అనిశ్చితి అలవాటుగా మారిన అంధ్ర ప్రదేశ్‌ ప్రజానీకానికి ఈ కొద్దిపాటి అస్పష్టత ఒక లెక్కలోది కాదు. విభజన బిల్లుకు పార్లమెంటు సంపూర్ణ్త ఆమోదం తదితర తతంగాలు పూర్తి అయితే రాష్ట్రపతి పాలన విధించడమా లేదా అనేదానిపై భావిగతి ఆధారపడి వుంటుంది.