Pages

Saturday, March 31, 2012

జగన్‌ కేసులో ఛార్జిషీట్‌ విశేషాలు


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌తో అధిష్టానం సయోధ్య దిశగా నడుస్తోందన్న సూచనల నేపథ్యంలో ఆయనపై ఆరోపణలకు సంబంధించి సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.  జగన్‌ను అరెస్టు చేస్తారన్న అలజడి కొంత కాలం నడిచినా తర్వాత ఆ అవకాశం లేదని స్పష్టమై పోయింది. ఈ బ్లాగులో గతంలో ఆ సంగతి చెప్పుకున్నాం. ఢిల్లీ వెళ్లిన సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు ప్రస్తుతానికి పగ్గాలు పడ్డాయన్న వార్తలు ఒకవైపు వినిపించాయి. (ఆయన ఇక్కడ ఆరేళ్ల కాలంగా వున్నారు గనక బదిలీ కావచ్చని కూడా ఒక ఛానెల్‌ కథనం ప్రసారం చేసింది.) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ మేరకు బహిరంగంగానే ఆరోపణ చేశారు గాని అది కూడా రాజకీయ దృష్టితో చేసిందే తప్ప తీవ్రంగా తీసుకోనవసరం లేదని ఆ పార్టీ వర్గాల వివరణ ఇచ్చాయి. ఏమైనా అక్రమాస్తుల కేసులో మొదటి నిందితుడైన జగన్‌ను ప్రశ్నించేనిమిత్తం నిర్బంధంలోకి తీసుకోకుండానే లాంఛనంగా ఛార్జిషీటు దాఖలు చేయొచ్చని న్యాయ నిపుణులు భావించారు. జరిగింది కూడా అదే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరికి అక్రమ లబ్ది చేకూర్చి వారి నుంచి తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారన్న క్విడ్‌ ప్రో కో ఆరోపణలను సిబిఐ ఛార్జి షీటు నిర్ధారిస్తోంది. జగన్‌ను మొదటి నిందితుడుగా పేర్కొంది. అయితే ఆయనను నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నించడం తప్పని సరి కాదని ఆధారాలు వున్నాయి గనక నేరుగానే కోర్టుకు నివేదించారని అంటున్నారు. ఇప్పుడు ఏం జరగాలనేది కోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఒక వేళ కోర్టు గనక అరెస్టు చేయమని ఆదేశాలిచ్చినా వెంటనే అమలు కాకపోవచ్చు. ఉదాహరణకు కనిమొళి వంటి వారి విషయంలో రకరకాల సాకులతో చాలా సమయమే తీసుకున్నారు.ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాల్సిన విషయం. ఈ లోగా సుప్రీం కోర్టు రాష్ట్ర మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసింది గనక దాని వైఖరి ఎలా వుంటుందో కూడా గమనించాలి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇది తప్పు చాేర్జిషీట్‌ అని విమర్శ చేసినప్పటికీ దానిలో రాజకీయంగా పెద్ద దూకుడు కనపించలేదు. పైగా జగన్‌ తరపు న్యాయవాది ఒకరు చార్జిషీట్‌లో ఆయనపై వున్న ఆరోపణలు తీవ్రమైనవేమీ కావన్నట్టు మాట్లాడారు. ఊహాగానాలు ఎలా వున్నా వేసిన ఛార్జిషీట్‌ పకడ్బందీగానే వుందనీ, కోర్టు ఏ వైఖరి తీసుకుంటుందనేది తప్ప ఇక సిబిఐ తనుగా జగన్‌ విషయంలో అరెస్టు వంటివి చేసే అవకాశం వుండదనీ న్యాయ పోలీసు నిపుణులు చెబుతున్నారు. మాయావతి, లాలూ యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ వంటి నేతలపై సిబిఐ కేసులు ఎంత కాలం నడుస్తున్నాయో ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో గమనిస్తే జగన్‌ కేసుకు కూడా అలాటి అవకాశాలు వుంటాయనీ అయితే అవన్నీ రాజకీయ అవగాహనలపై ఆధారపడి వుంటాయని అర్థం చేసుకోవచ్చు.

Friday, March 30, 2012

జగన్‌తో సయోధ్య కుదిరినట్టేనా?



ఇది కేవలం ప్రశ్న కాదు. వూహాగానం అంతకన్నా కాదు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న భావన. కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలెవరూ ఖండించడానికి సిద్దం కాని పరిస్థితి. ఒక ప్రముఖ చానల్‌ విలేకరి వారం రోజుల కిందట చెప్పిన సాధికార సమాచారం బట్టి నేను కొద్ది గత శనివారం ఐటంలోనే ఈ మేరకు రాశాను.ఇప్పుడు ఇంచుమించు అందరూ అదే మాట ధృవీకరిస్తున్నారు. తాజా పరిణామాల తర్వాత జగన్‌ను అరెస్టు చేయడం ఎందుకనే అభిప్రాయం కాంగ్రెస్‌లో కలిగినట్టు చెబుతున్నారు. జగన్‌పై తీవ్రంగా ధ్వజమెత్తే కడప జిల్లా కాంగ్రెస్‌ నాయకుడితో ఈ సంగతి అన్నప్పుడు ఆయన కూడా అర్థాంగీకారమే తెలిపారు. జెడి లక్ష్మీనారాయణ ఢిల్లీ యాత్ర తర్వాత ఈ మేరకు నిర్ణయం జరిగిందనేది కథనం. ఆయన బదిలీ కావచ్చుననీ మరో కథనం. జగన్‌ను అరెస్టు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయొచ్చని ప్రతిపక్ష న్యాయవాది ఒకరు వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా సిబిఐ వైఖరిలో మార్పు వచ్చిందని బహిరంగంగా వ్యాఖ్యానించడంలో ఇదే అంచనా తొంగి చూస్తుంది. వీటన్నిటి మధ్యనా సోనియా తనను చూసి భయపడుతోందని జగన్‌ ఎందుకన్నాడనే ప్రశ్న రావచ్చు. రాజకీయాలలో ఇవన్నీ సర్వసాధారణమేనని సమాధానం ఇవ్వాలి.ఒక్కసారిగా మెతగ్గా మాట్లాడకుండా వుండటమే ఇక్కడ కాంగ్రెస్‌ కోరుకుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక వోటు తెలుగుదేశంకో మరొకరికో పోకుండా జగన్‌కు వెళితే కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దగా బాధపడదు. ఇంతకు ముందే చెప్పినట్టు రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొత్త సమీకరణాలు ముందుకు రావడం తథ్యంగా కనిపిస్తుంది. జగన్‌ అరెస్టు కాకపోవచ్చు, లాంఛనంగా నిర్బంధంలోకి తీసుకున్నా గౌరవంగానే బయిటకు రావచ్చు.ఇందుకు భిన్నంగా జరిగితే దాన్ని ప్రస్తుత అంచనాలకు పూర్తి భిన్నమైన పరిణామంగా చూడాల్సి వుంటుంది.కాగ్‌ నివేదిక తర్వాత ప్రభుత్వ స్పందన చూస్తే కూడా ఈ అభిప్రాయమే బలపడుతుంది.

తెలంగాణాపై కొత్త ప్రహసనం




తెలంగాణా సమస్యపై కాంగ్రెస్‌ తెలుగు దేశం పార్టీలు ఏక కాలంలో కొత్త ప్రహసనం ప్రారంభించాయి.ఏదో చర్చలు జరుగుతున్నట్టు చర్యలు తీసుకోనున్నట్టు విన్యాసాలు చేస్తున్నాయి. టీ కాంగ్రెస్‌ ఎ ంపిలు అటు, టిటిడిపి ఫోరం నాయకులు ఇటు తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారు.అయితే వాస్తవం ఏమంటే వీరంతా చెప్పే దాంట్లో కొత్త దనమేమీ లేదు. వుండే అవకాశమూ లేదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయొచ్చునా అని గులాం నబీ ఆజాద్‌ అడిగితే ససేమిరా వీల్లేదని తాము చెప్పడం గొప్ప విశేషమైనట్టు కాంగ్రెస్‌ ఎంపిలు చెబుతుంటే త్వరలో తేల్చాల్సిన అవసరముందని ఆజాద్‌ అంటున్నారు. మరి నిన్ననే చిదంబరం చేసిన ప్రకటన వీరికి తెలియదా? ఇదంతా దాన్ని మాఫీ చేసే ఎత్తుగడ మాత్రమే కాదా? ఇక కాంగ్రెస్‌ ఏదో చేయబోతుందన్న సెగ తగిలిన తెలుగు దేశం నేతలు తాము కూడా మళ్లీ కసరత్తు ప్రారంభించినట్టు హడావుడి చేస్తున్నారు. తెలంగాణా ప్రాంతంలో ఉప ఎన్నికల సమయంలో గాక ఇతర చోట్ల ఎన్నికలకు ముందు మౌలిక విధానాన్ని మార్చుకోవడం జరగదని స్పష్టంగా చెప్పొచ్చు. అది నష్టమని కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు దేశం నేత ఒకరన్నారు. ఇదంతా ఆ పార్టీని ఆవరించిన అయోమయానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఒక వేళ కేంద్రానికి లేఖ రాసినా చంద్రబాబు ఎప్పుడూ చెప్పే రాజకీయ భాషణం సారాంశంగా వుంటుంది తప్ప నాటకీయంగా ప్రకటించేది శూన్యం. ఎందుకంటే కాంగ్రెస్‌ విధానం చెప్పకుండా తెలుగుదేశం చెప్పదు. ఈ రెండు పార్టీల తరపున రెండు ప్రాంతాలలో రెండు గొంతులు వినిపిస్తున్నంత కాలం ఏం చెప్పినా విలువా వుండదు.

Thursday, March 29, 2012

సైన్యానికి పాకిన సంక్షోభం




దేశంలో సర్వ రంగాలనూ చుట్టుముట్టిన సంక్షోభం ఇప్పుడు సైన్యాన్నీ ఆవరించింది. సైన్యాధిపతి జనరల్‌ వి.కె.సింగ్‌ లేఖ బహిర్గతం కావడంపై పరిపరి విధాల ఆందోళన నెలకొనడంలో ఆశ్యర్యం లేదు. నిజానికి పారదర్శకత లేని సైనిక కొనుగోళ్లలో అంతులేని అవినీతి సాగుతుంటుంది.ఈ ఏడాది ఇంచుమించు రెండు లక్షల కోట్ల రూపాయల రక్షణ బడ్జెట్‌ వుేంట్తే అందులో 80 వేల వరకూ కొత్త ఆయుధాల కొనుగోలుకు కేటాయించారు. కనక దీన్ని కబళించడానికి నాసి రకం వస్తువులు అంటగట్టేవారినుంచి కొన్ని రెట్లు ఎక్కువ ధర వసూలు చేసే కంపెనీల వరకూ రకరకాల శక్తులు కాచుకుని వుంటాయి. కనక వికెసింగ్‌ తనకు 14 కోట్లు లంచం ఇవ్వజూపారని చేసిన ఆరోపణను శంకించవలసిన అవసరం లేదు.అయితే దాన్ని రక్షణ మంత్రి ఆంటోనీ వెంటనే పట్టించుకోకపోవడం, సింగ్‌ కూడా దర్యాప్తుచర్యలకు సిద్దం కాకపోవడం సందేహాలు పెంచుతున్నాయి. ఇక ఆయన రక్షణ దళాల సమర్థత గురించి ప్రధానికి రాసిన లేఖ లీకు కావడం ఎవరి పుణ్యమో విచారణలో గాని తేలదు ఆయన తనుగా బయిటపెట్టి వుండకపోవచ్చు. ఎందుకంటే దాని పర్యవసానాలు ఆయనకు బాగా తెలుసు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు భారీగా అవకాశాలు కల్పించిన తర్వాత దాన్ని కైవశం చేసుకోవాలని కార్పొరేట్‌ శక్తులు ఆయుధ బేహారులు పోటీ పడుతున్నారు. కనక వీరంతా అవినీతిని పెంచడంలో ఆశ్చర్యం లేదు. గతంలో ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో సంచలం రేకెత్తించిన తెహల్కా టేపుల వ్యవహారం రక్షణ రంగంలో అవినీతిని చాటింది. ఇటీవల ఆదర్శ హౌసింగ్‌ స్కాం, సైనికాధికారులపై చర్యకు కారణమైన సుకోరు భూముల వ్యవహారం, 40 మందికి పైగా అధికారులు తమ ఆయుధాలను తక్కువ ధరకు అమ్ముకున్న కారణంగా తొలగించాల్సి

Sunday, March 25, 2012

సబ్‌ ప్లాన్‌ ఎజెండా సబ్‌ కా ఎజెండా



ఎస్‌సి ఎస్‌టిలకు జనాభా నిష్పత్తి మేరకు సబ్‌ ప్లాన్‌ కేటాయింపులు జరపాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల అధ్వర్యంలో జరుగుతున్న 72 గంటల నిరాహారదీక్షకు గొప్ప సంఘీభావం వ్యక్తమైంది. ఆదివారం ఆ శిబిరం సందర్శించినపుడు వరుసుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, సిపిఎం సిపిఐ లతో సహా అనేకానేక సంఘాల నేతలు ప్రతినిధులు వచ్చి ముక్తకంఠతో బలపర్చారు. ఈ నాటి అనిశ్చిత ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక సమస్యపై అంతటి సమైక్య భావన వ్యక్తమవుతుందని చూస్తే తప్ప నమ్మడం కష్టం. 16 శాతం దళితులు , 8 శాతం గిరిజనులు వుండగా వీరికి కేటాయించవలసిన దానిలో కొద్ది భాగమే విదిలించి అది కూడా ఇతర రంగాలకు మళ్లించడం జరుగుతున్నది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ 5 లక్షల కోట్లకు పైగా వుండగా అందులో 30 వేలకు కొంచెం ఎక్కువగా మాత్రమే ఈ రంగాలకు కేటాయించారు. లక్షా 12 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్‌సిఎస్‌టిలకు కలిపి పది వేల కోట్ల కేటాయింపు చేసి అందులో 3 వేల కోట్లు ఇతర రంగాలకు మరల్చారు. రాష్ట్రంలో 70 వేల దళిత వాడలుండగా మొత్తం కలిపి 7 వేల కోట్లు కేటాయించడమంటే తలసరి ఎంత వచ్చేది చెప్పనవసరం లేదు. పైగా ఈ నిధులను జలయజ్ఞానికి రోడ్లకూ విమానాశ్రయాలకు మరలించి అది కూడా దళితులకు ఉపయోగకరమని వూకదంపుడు వినిపిస్తున్నారు. దేశంలో 55 మంది సహస్ర కోటేశ్వరులు జిడిపిలో మూడో వంతు అనుభవిస్తుంటే మరో వైపు నాలుగో వంతుగా వున్న ఈ అణగారిన వర్గాలు కనీస నిష్పత్తిలో కూడా కేటాయింపులు పొందలేకపోవడం కఠోర వాస్తవం. ఈ పరిస్తితులలో సామాజిక చైతన్యం గల వారందరూ ఒక్క కంఠంతో పోరాడితే తప్ప ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ అన్న రాజ్యాంగ భావన, ప్రణాళికా సంఘ సూచన అమలు కావు.ఆంధ్ర ప్రదేశ్‌లో మొదలైన ఈ ఉద్యమం ఆ విధంగా దేశానికి మార్గదర్శకమవుతుంది.అందుకే దాన్ని అందరూ బలపరుస్తున్నారు. నిన్న హెచ్‌ఎంటివి రామచంద్రమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, దేవులపల్లి అమర్‌ తదితర పాత్రికేయ మిత్రులు పూర్తి సంఘీభావం ప్రకటిస్తే ఈ రోజున ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌, ప్రజాశక్తి న్యూస్‌ ఎడిటర్‌ తులసీదాస్‌ తదితరులు వచ్చారు. మీడియా కూడా సామాజిక అంశాలను చర్చకు పెట్టడంలో తన వంతు పాత్ర పోషిస్తుందని హామీనిచ్చారు. ఇదెంతైనా హర్సనీయమైన పరిణామం. మాజీ ప్రభుత్వ కార్యదర్శి కాకి మాధవరావు ఈ సభలో మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఇంత స్థాయిలో దీనిపై ఉద్యమాలు ఇంకా రావడం లేదని అన్నారు.బహుశా ఆంధ్ర ప్రదేశ్‌లో సామ్యవాద భావాల సామాజిక ఉద్యమాల ప్రభావమే అందుకు కారణం. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడం ద్వారా సబ్‌ కా ఎజెండా సబ్‌ప్లాన్‌ ఎజెండా అన్న భావాన్ని చాటిచెప్పడం ఎంతైనా అవసరం.

Saturday, March 24, 2012

ఫలితాలు: ప్రకంపనాలు





ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వూహించనివి కాకపోయినా అనంతర ప్రకంపనాలు మాత్రం వూహించిన దానికంటే తీవ్రంగా వున్నాయి. తెలంగాణా ప్రాంతంలోని ఆరు స్థానాలు, నెల్లూరు జిల్లా కోవూరు ఎక్కడా ప్రభుత్వ పక్షమైన కాంగ్రెస్‌ గాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం గాని గెలవలేకపోయాయి. తెలుగు దేశం తెలంగాణాలో మూడు చోట్ల డిపాజిట్‌ కోల్పోగా కాంగ్రెస్‌ కొన్ని చోట్ల మూడవ స్థానంలో వుండి పోయింది. ఆ రెండు పార్టీల శాసనసభ్యులను చేర్చుకుని ఈ ఉప ఎన్నికలకు కారణమైన టిఆర్‌ఎస్‌ నాలుగు చోట్ల విజయం సాధించి మహబూబ్‌నగర్‌లో మాత్రం బిజెపికి సీటు కోల్పోయింది.నాగర్‌కర్నూలులో తెలుగు దేశం మాజీ నాయకుడు నాగం జనార్థనరెడ్డి స్వతంత్రుడుగా గెలుపొందారు. కాగా కోవూరులో మాజీ తెలుగు దేశం సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి ఈ సారి వైఎస్‌ఆర్‌ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఫలితాలు వూహించినవే అయినా అవి వెలువడిన తర్వాత ఈ రెండు పార్టీలలోనూ ప్రత్యక్ష పరోక్ష ప్రకంపనాలు మాత్రం అనుకున్నదానికన్నా తీవ్రంగా వున్నాయి. ఒక విధంగా రాష్ట్ర రాజకీయాలలో కొత్త సమీకరణాలకు పరిణామాలకు ఇవి సూచికలుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం నినాదంతో ఏర్పడిన టిఆర్‌ఎస్‌ ఉద్యమాలలోనూ విమర్శలు వివాదాలలోనూ ముందున్నా రాజకీయంగా ఇక్కడ కాంగ్రెస్‌ తెలుగు దేశంల తర్వాతి స్థానమే దానిదనే భావన ఇప్పటి వరకూ వుంది. అది అవాస్తవం కాదు కూడా.అయితే కేంద్రం అనిశ్చిత వైఖరిని ఆసరా చేసుకుని ఆ పార్టీ క్రమేణా రాజకీయంగా ప్రధాన శక్తిగా రూపొందుతుందనే అభిప్రాయానికి ప్రస్తుత ఫలితాలు ఆస్కారమిస్తున్నాయి. రెండు పార్టీల నుంచి వచ్చి చేరిన వారి స్థానాలను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తులోనూ తమ స్థానాలను కాపాడుకోవాలనుకునే మరింత మందికి ఆకర్షణీయమైన గమ్యంగా ఆ పార్టీ మారవచ్చు. మరో విధంగా చెప్పాలంటే వలసలకు కేంద్ర బిందువు కావచ్చు.దానివల్ల ఆ పార్టీలో ఇప్పటికే వున్న వారిపై ఎలాటి ప్రభావం పడుతుందనే దానితో పాటు ఎత్తుగడల్లోనూ మార్పులు రావచ్చు.
పైగా ఈ సారి విజయం సాధించినప్పటికీ తెలంగాణా ఎన్నికల క్షేత్రంలో టిఆర్‌ఎస్‌ వూపు కొంత తగ్గిందనే భావన కూడా ఏర్పడింది.ఎందుకంటే గతంతో పోలిస్తే గెలిచిన అభ్యర్థుల ఆధిక్యతలు తగ్గడం, గతంలో అన్ని చోట్లా డిపాజిట్టు పోగొట్టుకున్న తెలుగు దేశం రెండు చోట్ల తెచ్చుకోవడం, మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోవడం

Friday, March 23, 2012

కాంగ్రెస్‌లో కలహాలు, కొత్త వ్యూహాలు



ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ ప్రభుత్వంలోనూ కూడా కలహాలు తీవ్రమవడం కళ్లెదుట కనిపిస్తూనే వుంది. ఉప ముఖ్యమంత్రి దాదాపు సవాలు చేసినట్టు మాట్లాడ్డం, మరో మంత్రి రవీంద్రా రెడ్డి రాజీనామా లేఖ సంధించడం, కేశవ రావు వంటి వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం ఇవన్నీ చూస్తుంటే రెండు రకాల వ్యూహాలు గోచరిస్తాయి. మొదటిది ఈ ఫలితాలను ఆధారం చేసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రిని గద్దె దింపడం(వీలైతే తాము కూచోవడం). రెండవది ఉప ఎన్నికల ఓటమి దెబ్బ ప్రభావం తమపై పడకుండా కాపాడుకుంటూ రేపు ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి భూమిక ఏర్పర్చుకోవడం. తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు ఈ విషయంలో చాలా చురుగ్గా వుంటే కోస్తా రాయలసీమలలో మరో కథ నడుస్తున్నది.
తెలంగాణాలో యాభైలలోనూ అరవైలలోనూ ప్రత్యేక వాదాన్ని మొదట ముందుకు తెచ్చిన వారు కాంగ్రెస్‌ నాయకులే.1999 లోనూ టిఎన్‌సిసి పేరిట ఏర్పాటు చేసి సోనియా గాంధీకి రాష్ట్ర విభజన కోరుతూ మొదట మెమొరాండం ఇచ్చిందీ వారే. తర్వాత ఆ కోర్కెకు ప్రధాన ప్రతిబంధకంగా విమర్శలకు గురైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోనే ఈ తతంగమంతా జరిగింది. అప్పటికి కెసిఆర్‌ ఇంకా తెలుగుదేశంలోనే వున్నారు.ఈ నినాదానికి గల రాజకీయ చెల్లుబాటును గమనించిన తర్వాత, విద్యుచ్చక్తి ఉద్యమం అనంతరం ఆయన బయిటకు వచ్చారు. 2009 డిసెంబర్‌ 9 ప్రకటన ద్వారా కాంగ్రెస్‌ నాయకత్వం ఆ కోర్కెను ఆమోదించినట్టు

సిఎజి లీకేజిని ఖండిస్తే క్లీన్‌ చిట్‌ అవుతుందా?


సరికొత్త బొగ్గు కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు నిజం కాదని సిఎజి వినోద్‌ రాజా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసినట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్నది. వాస్తవం ఏమంటే సిఎజి నివేదిక లీకేజిపై ప్రధాని కార్యాలయం ఆరా తీస్తే దాన్ని మాత్రమే ఆయన ఖండించారు. విచారం వెలిబుచ్చారు. పైగా సిఎజిని సమాచార హక్కు చట్టం కింద చేర్చాలని కూడా కోరారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో మాత్రం తాము ఎలాటి ముసాయిదా(చిత్తు ప్రతి) నివేదిక కూడా ఇంత వరకూ ఇవ్వలేదని ఇంకా పరిశీలన చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఒక కీలకమైన సాంకేతికమైన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఆడిటింగ్‌లో ఏవైనా ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం ఒక పట్టాన ముగిసేది కాదని, అప్పటి వరకు వాటిని తాత్కాలిక అభిప్రాయాలుగానే పరిగణించాల్సి వున్నందున తమ దృష్టికి వచ్చిన అంశాలను కూడా చెప్పగల స్తితి వుండదని సూచించారు. బొగ్గు కుంభకోణం విషయానికి వస్తే అలాటి ఆరోపణలే లేవని ఆయన లేఖలో ఎక్కడా పేర్కొనటేదు. సిఎజి లేఖ

పంచాంగాల పేరిట ప్రహసనాలు, ప్రవాదాలు



ఉగాది అంటే సంవత్సరాది గనక ఆ రోజున కొత్త పంచాంగాలు వెలువరించడం సంప్రదాయం. ఇందులో ప్రకృతికి సంబంధించిన అంశాలు నమ్మకాల విషయాలు కూడా వుంటాయి. దేశంలో నూటికి తొంభై మంది వీటిని నమ్ముతుంటారు గనక పంచాంగాలు వేసుకోవడంలో తప్పు లేదు.అయితే వాటిని రకరకాలుగా ప్రచురించి ప్రజలను గందరగోళ పర్చడం మూఢత్వం పెంచడం సరైంది కాదు. అనేక అంశాల్లో ఈ పంచాంగాలు పరస్పర విరుద్దంగా వుండటం చూస్తాం. ఒక పండుగ ఎప్పుడు చేయాలనేదానిపైనే తిరుపతి భద్రాచలం వంటి చోట్ల వేర్వేరుగా నిర్ణయాలు తీసుకోవడం సెలవులు వేర్వేరు తేదీల్లో ఇవ్వడం చూస్తుంటాము. ఇందులో ఏది నిజం ఏది కాదు అని ఎవరు చెప్పగలరు? ఒక ముహూర్తం మంచిదైనా ఇరు పక్షాలకు మంచి జరగదు కదా?
ఉదాహరణకు అణు ఒప్పందంపై ఓటింగు సందర్భంలో నాతో వున్న జ్యోతిష్యులు ఆ ముహూర్తం చాలా గొప్పదని అన్నారు. అంటే అందరికీ మంచిదేనా అంటే ఔనన్నారు.అయితే అవతలి వారికి కూడా మంచిదయ్యేట్టయితే మన్మోహన్‌కు ఎలా ప్రశ్నిస్తే కాస్త తడబడి ఏదో జవాబు చెప్పి దాటేశారు.
ఇటీవల శ్రీనివాస గార్గేయ నందన నామ సంవత్సరానికి రూపొందించిన పంచాంగంలో రజస్వల అయ్యే సమయం ఆధారంగా స్త్రీల స్వభావాలు ఫలానా విధంగా వుంటాయని ప్రకటించడం నిజంగా ఘోరం. ఆదిశక్తి తో మొదలు పెట్టి స్త్రీని

Thursday, March 22, 2012

దేశానికి బొగ్గు రాస్తున్న అవినీతి ప్రైవేటీకరణ!


చట్ట విరుద్దంగానూ అక్రమంగానూ ప్రైవేటు శక్తులకు బొగ్గు బ్లాకులు కేటాయించడం వల్ల దేశ ఖజానాకు 10 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అత్యున్నత ఆడిటింగ్‌ సంస్థ సిఎజి నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచంలోనే పెద్ద కుంభకోణం అవుతుంది. 2 జి స్పెక్ట్రం కన్నా అయిదు రెట్లు పెద్దదన్న మాట. నిజానికి గనుల ప్రైవేటీకరణతో అంతులేని అవినీతి విస్తరించిందనడానికి గాలి జనార్థనరెడ్డి వ్యవహారానికి మించిన ఉదాహరణ అవసరం లేదు.చమురు సహజ వాయు నిక్షేపాల ప్రైవేటీకరణ కారణంగా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రభుత్వ రంగాన్ని మించిపోయింది. దేశంలోని చమురు నిక్షేపాలకు సంబంధించి అతి పెద్ద ఒప్పందాలు జరిగిపోతున్నాయి.2009-10లో 21.8 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం తవ్వకం జరిగితే ఇందులో 63 శాతం ప్రైవేటు కాగా అందులో 45 శాతం విదేశాలకు తరలిపోయింది.బొగ్గు గనులను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయి. గనుల రంగాన్ని ప్రైవేటు పరం చేయడం వల్ల వనరులను కొల్లగొట్టడం ప్రభుత్వానికి చెల్లివేతలు ఎగ్గొట్టడం కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆ పైన దేశీయ అవసరాలను పట్టించుకోకుండా లాభాల కోసం విదేశాలకు తరలిస్తుంటే రేపు మనకు వనరులు లేకుండా పోయే పరిస్థితి. ఇది బొగ్గు విషయంలోనూ తీవ్రంగానే వుందని సిఎజి నివేదిక స్పష్టం చేసింది.అయితే ఇది ఒక పత్రికలో రాగానే మన్మోహన్‌ ప్రభుత్వంలో అలజడి రేగింది. తము పేర్కొన్నది ప్రాథమిక నివేదిక మాత్రమేనని తర్వాత అభిప్రాయం మార్చుకున్నామని సిఎజితోనే లేఖరాయించారు. అంతేగాక బొగ్గు గనులు పాడుకున్న వారికి అనుకోకుండా విపరీతమైన లాభాలు వచ్చినంత మాత్రాన అది ప్రభుత్వానికి నష్టం అనుకోనవసరం లేదని కూడా వింత వాదన తీసుకొచ్చారు. దీనంతటిని బట్టి చూస్తుంటే సిఎజిపైన కూడా ఎంత వత్తిడి పెరిగిందో తెలుస్తుంది.
చివరగా ఒక్కమాట చెప్పాలి. పెట్టుబడిదారులు చాలా మంది ఉత్పత్తి చేసి లాభాలు సంపాదించడం కన్నా ఉత్తుత్తినే లాభాలు దండుకోవడానికి పాకులాడుతున్నారు. ఈ క్రమంలో వారి దృష్టి ప్రకృతి వనరులపై పడింది.

అసంతృప్తి జ్వాలల్లో అధికార పక్షం




అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి అసంతృప్తి వేగంగానే రాజుకుంటున్నాయంటే ఆశ్చర్యం లేదు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యల నుంచి డిఎల్‌ రవీంద్రారెడ్డి రాజీనామా లేఖ వరకూ ప్రతిదీ ధిక్కార స్వరానికి ప్రతిధ్వనిగా వుంది. అధిష్టానం కూడా కొంత కాలం ఈ అసంతృప్తిని వెల్లడించనివ్వడమే మంచిదని భావిస్తుంది. తద్వారా పరిస్తితి కొంతైనా చల్లబడుతుందని దాని ఆశ. కాంగ్రెస్‌ కోలుకోక తెలుగుదేశం తేరుకోక అంతర్గత వైరుధ్యాలతో సతమతమవుతుంటే రాష్ట్ర రాజకీయాలలో అనిశ్చితి మరింత పెరుగుతుంది.ఉత్తరోత్తరా అది అధికార పీఠానికే ఎసరు పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. ముఖ్యమంత్రిపైనా పిసిసి అధ్యక్షుడిపైనా విమర్శలు వినిపించడం భావి పరిణామాలకు సూచికే. రానున్న 18 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ కోలుకునేది ఎలాగూ వుండదు గనక ప్రభుత్వానికి ప్రమాదం పెరుగుతుంది.కొనసాగినా అది దిన దిన గండంగానే వుంటుంది. కేంద్రం పరిస్తితి కూడా అంతంత మాత్రంగానే వుండటం, రాష్ట్ర భవిష్యత్తుపైనా తేల్చుకోలేక పోవడం సంక్షోభాన్ని తీవ్రం చేస్తాయి.బహుశా తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు స్వంత వేదిక ఏర్పాటు చేసుకుని వత్తిడి పెంచడం ఖాయం.

కాషాయ దళంలో కలవరం




బిజెపిలో కల్లోలాలు ఇప్పట్లో సద్దు మణిగే సూచనలు కనిపించడం లేదు. కర్ణాటకలో ఎడ్యూరప్ప పునరాగమన సంకేతాలు అవినీతిపై ఆ పార్టీ పోరాటం అసలు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. గాలి జనార్థనరెడ్డిని వెనకేసుకొచ్చి ఎడ్యూరప్పపై దాడికి వూతమిచ్చిన వారిలో బిజెపి అగ్రనేతలే వున్నారు. తర్వాత గాలిపై ఆయన తీసుకున్న చర్యలను సమర్థించి చిక్కు లేకుండా చేసుకున్నారు. ఈ లోగా ఎడ్యూరప్ప తనే అవినీతి ఆరోపణల్లో చిక్కి అవమాన కరంగా నిష్క్రమించడం అనివార్యమైంది. ఆ పైన కృష్ణ జన్మస్తానమూ ప్రాప్తించింది. అప్పట్లో దీనంతటికీ కారకుడైన లోకాయుక్త సంతోష్‌ హెగ్డే రాజీనామా చేస్తానంటూ బిజెపి నేతలే రాజీ కుదిర్చి కొనసాగించారు. ఎడ్యూరప్పను తొలగించి సదాశిగౌడను గద్దెక్కించారు.ఇప్పుడేమో లోకాయుక్త ఉత్తర్వులు కోర్టు కొట్టి వేసిందంటూ ఎడ్యూరప్ప తిరుగుబాటు చేసే సరికి మళ్లీ ఆయన ఒత్తిడికి లొంగి పోయి పున:ప్రతిష్టించేందుకు సిద్దమవుతున్నారు. అవినీతిపై పోరాటంలో తామే ఆదర్శమన్నట్టు చెప్పుకున్న బిజెపికి నిస్సందేహంగా ఇది పెద్ద కళంకమే అవుతుంది. ఇప్పటికే యుపి ఎన్నికల్లో ఘోరంగా విఫలమై నిరుత్సాహంలో మునిగి వున్న ఆ పార్టీని కర్ణాటక,, గుజరాత్‌ ఉప ఎన్నికల ఫలితాలు కుదిపేశాయి.మోడీ గురించిన గొప్పలకు ఉప ఎన్నికల ఓటమికి పొంతన కనిపించడం లేదు.కాంగ్రెస్‌ త్వరితంగా దెబ్బ తింటున్నా బిజెపి అంతకన్నా దారుణ స్తితిలో వున్నందున ఆ స్థానాన్ని అందుకోలేదని పదే పదే స్పష్టమవుతున్నది.యుపి ఎన్నికల తర్వాత కాంగ్రేసేతర లౌకిక కూటమికి అవకాశాలు మెరుగవుతాయని భావించినా అనుకున్నట్టే ఎస్‌పి యుపిఎను బలపర్చటంతో కథ మొదటికొచ్చింది. బిజెపిని కాంగ్రెస్‌ కన్నా మెరుగైన ప్రత్యామ్నాయంగా ప్రజలు పరిగణించకపోగా దాని మత రాజకీయాలను అంతర్గత కలహాలను ఆమోదించడం లేదని అనిపిస్తుంది. వామపక్షాలు కూడా బెంగాల్‌లో దెబ్బ తిన్న నేపథ్యంలో ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ నిర్మాణం ప్రయాసతో కూడిందే. గతంలో ఈ విషయంలో చొరవ చూపిన సిపిఎం ఇప్పుడు ఎదురు దెబ్బలతో అననుకూలతను ఎదుర్కొంటున్నది. ఇక తెలుగు దేశం కోలుకోలేకపోతున్నది.
దేశమంతటా బిజెపి పరిస్తితి ఇలా వున్నప్పుడు మహబూబ్‌నగర్‌లో కొన్ని ప్రత్యేక పరిస్తితులలో విజయం సాధించినా అదేదో అన్ని చోట్లా గెలుపు వచ్చేస్తుందనుకోవడం అవాస్తవమే గాక అతిశయోక్తి కూడా. ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినంత వరకూ బిజెపి వంటరిగా అలాటి అద్భుతాలు సాధించడం దుస్సాధ్యమే. దీనికి ఇక్కడి చారిత్రిక రాజకీయ సామాజిక నేపథ్యమే కారణం. టిఆర్‌ఎస్‌ కూడా అవసరార్థం ఎన్ని విన్యాసాలు చేసినా బిజెపిని బలపడటాన్ని ఆహ్వానించే అవకాశం లేదు. కెసిఆర్‌ ప్రతి సందర్భంలోనూ మైనార్టి కోణానికి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వడం చూస్తూనే వున్నాం.కనక మహబూబ్‌నగర్‌ ఫలితాన్ని గమనిస్తూనే దానిపై అతి అంచనాలు అనవసరమని చెప్పవలసి వస్తుంది.

Wednesday, March 21, 2012

ఉప ఎన్నికల ఫలితాలు



ఉప ఎన్నికల ఫలితాలపై ఇంతకు ముందే స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినందువల్ల కొత్తగా రాయాల్సింది కనిపించడం లేదు. టిఆర్‌ఎస్‌ సంఖ్యాబలం పెరగడంతో పాటు తెలంగాణా ప్రాంతంలో ప్రధాన పార్టీగా లేదా ప్రథమ పార్టీగా ఆవిర్భవించే అవకాశాలు ఇప్పుడు పెరిగాయి.ఇంతకు ముందు కాంగ్రెస్‌ తెలుగు దేశం తర్వాతి స్థానంలో ఆ పార్టీ వుండేది. ఇప్పుడు బలమైన రాజకీయ శక్తిగా పెంపొందడానికి భూమిక ఏర్పర్చుకుంటున్నది. భవిష్యత్తులోనూ ఆ పార్టీ నాయకుల దృష్టి ఉద్యమాలపై కన్నా ఈ కోణంపైనే ఎక్కువగా కేంద్రీకృతం కావచ్చు.
అయితే మెజార్టిలు, ఇతరుల డిపాజిట్ల గల్లంతు వంటి విషయాల్లో టిఆర్‌ఎస్‌ ప్రచార వ్యాఖ్యలు చాలా వరకూ నెరవేరలేదు. తెలంగాణా రాజకీయ క్షేత్రంలో ఇతర పార్టీలు కూడా చోటు సంపాదించాయి. నాగం జనార్ధనరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరకుండా తన స్వతంత్రత నిలబెట్టుకున్నాడు. బిజెపి మహబూబ్‌నగర్‌లో హౌరాహౌరీ పోరాటంలో విజయం సాధించింది. గెలిచిన కొన్ని చోట్ల ఆధిక్యతలు పరిమితంగా వున్నాయి. ఇన్ని కారణాల రీత్యా టిఆర్‌ఎస్‌ ప్రధాన శక్తిగా వచ్చినా ఏకపక్ష వాతావరణం వుండబోదని

Monday, March 19, 2012

తెలుగుదేశంలో నిరసన తీవ్రత



రాజ్యసభకు సిఎం రమేష్‌, దేవేందర్‌ గౌడ్‌లను ఎంపిక చేసిన తెలుగు దేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. వ్యక్తిగతంగా కలసిన తెలుగు దేశం నేతలు, మాజీ ప్రస్తుత ఎంపిలు కూడా ఈ విషయమై తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. పైగా ఆర్థిక వనరుల సమీకరణ అవసరాన్ని అధినేత ప్రతిసారీ ముందుకు తేవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే తెలుగు దేశం పరిస్థితి ఏమంత సజావుగా లేదు.ఎన్ని తంటాలు పడినా విశ్వసనీయత పొందలేకపోతున్నామన్న బాధ ఆందోళన వారిలో చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆలోచనా ధోరణి మారాలన్న మాట అంటున్నారు. మధ్యలో కొంత నూతన భావాలను ఆదరించిన ఆయన చుట్టూ ఇప్పుడు మళ్లీ పాత నేతలే వలయంగా ఏర్పడ్డారని వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపైనా ఏమంత ఉత్సాహంగా లేని ఆ పార్టీకి ఈ అసంతృప్తి పులి మీద పుట్రలా వచ్చిపడిందని చెప్పక తప్పదు. తలసాని శ్రీనివాసయాదవ్‌, అరవింద గౌడ్‌, కోడెల శివ ప్రసాద్‌, ఆఖరుకు మైసూరా రెడ్డి వంటి వారు కూడా ఏదో ఒక స్తాయిలో తమ అసంతృప్తిని వెల్లడించడం చూస్తే చంద్రబాబు ముందున్న సవాలు పెద్దదేనని స్పష్టమవుతుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈ నేతలలో కొంతమందికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో సంబంధాలున్నాయి. అందరూ కాకపోయినా కొద్ది మందైనా పార్టీని వదలిపెట్టే అవకాశాలున్నాయనే చెప్పాలి.అలాగే తెలంగాణాలో ఎంత ఎదురుదాడి చేసినా నిలదొక్కుకోలేమన్న భావన కూడా బలంగానే వుంది.దేవేందర్‌ గౌడ్‌ సహజ శైలిలో అసంతృప్తి మామూలేనని అంటున్నా అవతలి పక్షం వారు అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోతున్నారు.

Sunday, March 18, 2012

ఎగ్జిట్‌ ఫలితాలు: కొత్త వాదనలు


ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత టీవీ5 నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌పై చర్చ చాలా సేపు జరిగింది. గతంలో జెమినీలో సర్వే, టీవీ9లో ఆఖరున నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ చర్చలకు కూడా హాజరయ్యాను. మొత్తంపైన ఇవన్నీ కూడా ఒకే విధంగా వుండగా ఎగ్జిట్‌ పోల్‌ సహజంగానే వాటికి ముగింపు అని చెప్పాలి.తెలంగాణా ప్రాంతంలో ఉప ఎన్నికల ఫలితాలు టిఆర్‌ఎస్‌ పక్షానే వస్తాయని, అయితే ఓటింగు మాత్రం ఏకపక్షంగా వుండకపోవచ్చని ఎగ్జిట్‌ పోల్‌ చెబుతున్నది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 50-55 శాతం, మహబూబ్‌ నగర్‌లో 34 శాతం ఓట్లు వస్తాయని ఆ పోల్‌ అంచనా వేసింది.అయితే స్టేషన్‌ ఘన్‌పూర్‌, కామారెడ్డి రెండు చోట్ల తెలుగు దేశం రెండవ స్థానంలో వస్తే మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంలో వస్తుందని అంచనా. మొత్తంపైన ఈ ఎన్నికల ఓటింగు ఏకపక్షంగా వుండదనీ,ఇతర పార్టీలు కూడా తెలంగాణా క్షేత్రంలో కాలూనుకుంటాయని వచ్చిన అభిప్రాయాన్ని ఎగ్జిట్‌పోల్‌ ధృవపర్చింది. అయితే ఈ దశలో టిఆర్‌ఎస్‌ నాయకులు, ప్రత్యేక తెలంగాణాను బలపర్చే ఇతరులు కూడా సిపిఎం తప్ప మిగిలిన పార్టీలకు వచ్చిన ఓట్లన్నీ తెలంగాణా వాదానికేనని కొత్త తర్కం మొదలు పెట్టారు. ప్రచారంలోనూ అంతకు ముందూకూడా దుర్భర స్తాయిలో దూషించుకుని పరస్పర ద్రోహాలు ఆపాదించుకుని ఇప్పుడు హఠాత్తుగా మాకందరికీ వచ్చిన ఓట్లు ఒకటేనని చెప్పడం కంటే వైపరీత్యం వుంటుందా?అయితే ఇది భవిష్యత్‌ రాజకీయాలకు సూచిక కూడా. ఎంందుకంటే అందరూ ఇదే వాదనతో ఈ ప్రాంత ప్రజలను గందరగోళ పర్చి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పోటీ పడతారన్నమాట.
కోవూరు మెజారిటీపై ఆశలు
కోవూరులో వైఎస్‌ఆర్‌ పార్టీ విజయం సాధిస్తుందని అంటున్నా మెజారిటీ ఎగ్జిట్‌ పోల్‌ చెబుతున్న దానికన్నా ఒకటి రెండు రెట్లు ఎక్కువుంటుందని ఆ పార్టీ నాయకులు ఆశతో వున్నారు.ఈ ఫలితంతోనే రాజకీయాలలో పెనుమార్పులు వచ్చేస్తాయని కూడా అంచనాలు కడుతున్నారు. వాస్తవం ఏమంటే ఈ ఫలితం రాబోయే సామూహిక ఉప ఎన్నికల ఫలితాలకు ముందస్తు సూచిక అవుతుంది. అసలు మార్పులు ఆ తర్వాతనే వస్తాయి. అంతే తప్ప వెనువెంటనే నాటకీయ పరిణామాలు వచ్చి పడతాయనుకోవడానికి లేదు. వైఎస్‌ఆర్‌ పార్టీ వారు మెజారిటీపై అతి అంచనాలు పెట్టుకుంటే అప్పుడు వచ్చిన విజయాన్ని కూడా తామే సరిగ్గా చెప్పుకోలేని స్తితి రావచ్చు. కనక ఒకింత వాస్తవికంగా ఆలోచించడం మంచిది. వారి సంగతి ఎలా వున్నా తెలుగుదేశం మాత్రం ఈ ఓటమి తర్వాత కొంత విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు.

Saturday, March 17, 2012

ఉప ఎన్నికలు- వూహించిన ఫలితాలేనా!


ఆదివారం జరగనున్న ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలలో ఎలాటి నాటకీయమైన మలుపులు వుండక పోవచ్చు. తెలంగాణా ప్రాంతంలో టిఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న మాజీ కాంగ్రెస్‌, తెలుగు దేశం అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. తెలంగాణా రాజకీయ క్షేత్రంలో టిఆర్‌ఎస్‌ మాత్రమే ఏకైక పాత్రధారిగా సూత్రధారిగా వుండే దశ ఇప్పుడు లేదు. ఇతరులను రానివ్వకుండా చేసే పరిస్తితి కూడా లేదు. అవన్నీ నిజమే అయినా ఇప్పటికీ ప్రత్యేక రాష్ట్ర నినాదం ప్రభావమే ప్రధానంగా పనిచేస్తుంది గనక దానికి ప్రధాన ప్రతినిధులుగా కనిపించే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధిస్తారని దాదాపు అన్ని పార్టీల నేతలూ అంగీకరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి గెలుస్తుందని బలమైన కథనాలు వున్నా ఈ ప్రచారాలే దాని ఓటమికి కారణం కావచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఒక పార్టీని ఓడించాలన్నా గెలిపించాలన్నా వ్యూహాత్మక ఓటింగు విధానం బిజెపికి వ్యతిరేకంగానే ఎక్కువగా వినియోగించబడుతున్నది. అందులోనూ టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మైనారిటి నిలబడటం వల్ల పూర్తి స్థాయిలో ఓటర్ల సమీకరణ వుంటుంది. స్టేషన్‌ ఘనపూర్‌లో కూడా అన్నిచోట్ల వచ్చే ఫలితాలే రావచ్చు. తెలుగు దేశం నాయకుల ఎదురు దాడి వారి శ్రేణులను కూడతీసుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఉపయోగపడింది తప్ప ప్రజలలో విశ్వసనీయత కలిగించడానికి సరిపోలేదు.ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర విభజన లేదా సమైక్యత సమస్యపై వారి వైఖరి అస్పష్టంగానే వుంది. మోత్కుపల్లి వంటివారి దుర్భాషలు( ఒకప్పటి కెసిఆర్‌ శైలికి నకళ్లే అయినా) ఈ వాతావరణంలో ప్రజా బాహుళ్యానికి నచ్చి ఓట్లు తెచ్చిపెట్టడం కష్టం. బిజెపి తెలంగాణా వాదానికి తాను ప్రతినిధిగా రావాలని చేసే ప్రయత్నాలు కూడా ఫలించకపోవచ్చు. విభజన వద్దని చెప్పే సిపిఎంకు పరిమితంగానే ఓట్లు రావచ్చు గాని అసలు అది పోటీలో వుండటమే మారిన పరిస్థితికి ఒక సంకేతం. నేను చర్చల్లో పాల్గొన్న సర్వేలన్నీ ఇదే విధమైన అంచనాలిచ్చాయి.
కోవూరులో కూడా ఈ సారికి వైఎస్‌ఆర్‌ పార్టీనే విజయం సాధించవచ్చు. దీనివల్ల వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు గాని అందుకోసం మిగిలిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ ఆగక తప్పదు. అప్పుడు వైఎస్‌ఆర్‌ పార్టీ అన్ని స్తానాలు తెచ్చుకోగలిగితే అధికార పీఠం కదలిపోవడం అనివార్యమే. నిజానికి ఇది పాలక పక్షానికే గాక ప్రధాన ప్రతిపక్షానికి మరింత పెద్ద సవాలు. ఆ సవాలను విజయవంతంగా ఎదుర్కోగలుగుతామన్న ధీమా ఇంకా తెలుగు దేశంలో కనిపించడం లేదు.

ప్రణబ్‌ బడ్జెట్‌: ప్రజలపై దాడి



ఇరవయ్యేళ్ల సరళీకరణ అనబడే గరళీకరణ అనంతరం ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2012-13 కేంద్ర బడ్జెట్‌ ఎలా వుండాలో అలా వుంది. కఠిన నిర్ణయాలు తప్పవని ఒకటికి రెండు సార్లు చెప్పిన ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ఆ కాఠిన్యం కష్టజీవులపైన సామాన్యుల పైన ఎక్కుపెట్టారు. కార్పొరేట్‌ కుబేరులకు, దేశ విదేశీ గుత్తాధిపతులకు సేవలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. సబ్సిడీలు తల్చుకుంటే నిద్ర పట్టడం లేదన్న ప్రణబ్‌ దాదాకు కార్పొరేట్లకు ఏడాదికి దాదాపు అయిదు లక్షల కోట్ల వరకూ ఇస్తున్న రాయితీలు హాయిగా నిద్ర పట్టించడమే గాక గురకలు పంచ రంగుల కలలు కూడా తెప్పిస్తున్నాయన్న మాట. అందుకే ఈ బడ్జెట్‌లో ఆ తరహా రాయితీలు బాగా పెంచేసి సామాన్యులకూ మధ్య తరగతి ప్రజలకూ వాతలు పెట్టేశారు. ఈ సారి బడ్జెట్‌ విశ్లేషణలో ఎలాటి తేడాలు లేకుండా అన్ని పత్రికలూ ఇదే చెప్పడం గమనార్హం. చాలా కాలం తర్వాత పరోక్ష పన్నులను బాగా పెంచేసి ప్రత్యక్ష పన్నులను మాత్రం మైనస్‌లోకి తీసుకెళ్లారు. ఆర్థికాభివృద్ధి శాతం 6.9 శాతం మాత్రమే వుంటుందని ఒక వైపున చెబుతూనే మరోవైపున అవే విధానాలను కొనసాగించాలనుకోవడం ఎంత అనర్థదాయకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆహార సబ్సిడీలను తప్ప అన్నిటినీ ఎత్తివేస్తానన్న మంత్రి ఆహారం కేటాయింపును కూడా కేవలం రెండు వేల కోట్లు మాత్రమే పెంచారు.పెరిగే ధరల భారంతో పోలిస్తే ఇది నామమాత్రమే.ఇక వ్యవసాయ సంక్షోభం గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సర్వేలోనూ ఆ మాట చెప్పారు.కాని 14 లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయానికి కేవలం 20 వేల కోట్ల కేటాయింపుతో సరిపెట్టారు.సర్వీసు టాక్సులు ప్రతిదానిపై పెంచడమే గాక చిన్న జాబితాకు మాత్రమే మినహాయింపు ఇచ్చి తక్కినవాటన్నిటిపైనా బాదేశారు. రక్షణకు మాత్రం 17 శాతం పైన కేటాయింపులు ఎందుకు చేశారంటే రేపు విదేశీ ఆయుధ కంపెనీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చి ఆదాయం పెంచడానికే! ప్రభుత్వ సంస్థలలో 30 వేల కోట్ల వాటాల అమ్మకం ఎజెండా కొనసాగించారు. బడ్జెట్‌కు ముందే ఎపిఎఫ్‌ వడ్డీ రేటు తగ్గించి ఉద్యోగులపై వేటు వేసిన ప్రభుత్వం ఆదాయం పన్ను మినహాయింపును 2 లక్షలకే పరిమితం చేసి అదో పెద్ద వరమైనట్టు చెప్పుకున్నది.ఆర్థిక మంత్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు 3 శాతం వున్న ధరల పెరుగుదల ఇప్పుడు 9 శాతం దాటినా ప్రభుత్వ పంపిణీని మె రుగుపర్చే ఆలోచనలు చేయకపోగా అంతా మార్కెట్‌ దయా భిక్షకే వదిలేశారు. ఉపాధి పెరగడం లేదని ఆందోళన వెలిబుచ్చిన ప్రభువులు ఆ రంగంలో మాత్రం ఎలాటి చర్యలూ తీసుకున్నది లేదు. ఏతావాతా రానున్న కాలంలో ప్రజల జీవితాలు ఆర్థిక భారాలు దుర్భరంగా మారడం రోజు ప్రతి కీలక వస్తువు ధర పెరగడం అనివార్యం. పారాహుషార్‌!

అద్భుతం కాదు, అంతా అధ్వాన్నమే!


కొంతకాలం కిందట ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రయోగించిన సామెతతో చెప్పాలంటే కేంద్ర రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పరిస్థితి పెనం మీంచి పోయిలోకి పడినట్టుగా వుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప 2014లో కాంగ్రెస్‌ విజయం సాధించే అవకాశం లేదని రాష్ట్ర మంత్రి జానారెడ్డి మొదటి సారి అర్థమయ్యేట్టు చెప్పగలిగారందుకే. తర్వాత మళ్లీ మీడియాపై నింద వేసి తప్పకోవడానికి కొత్త భాష్యం చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిజానికి మనసులో మాటనే చెప్పారు. నిజానికి ఆ మాట అందరి మనస్సులోనూ వున్నదే. అస్థిరత్వంతో అస్తుబిస్తుగా నడుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగించడమే గగనంగా వుంటే అద్బుతాలు ఏం జరుగుతాయి? అధ్వాన్నం కావడమే తప్ప!
మొదట రాష్ట్రం విషయమే తీసుకుంటే లిక్కర్‌ సిండికేట్ట వ్యవహారం మాఫీ చేసి హమ్మయ్య అనుకోకముందే ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. పైకి ఎంత గంభీరంగా కనిపించినా దీని రాజకీయ పర్యవసానాలు నేతలకు బాగా తెలుసు.అందుకే మొదట సూటిగా సమర్థించిన ముఖ్యమంత్రి తర్వాత కాస్త సర్దుకున్నారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కనక ఆయన హయాంలో జరిగిన వాటికి రాజకీయంగా ఆ పార్టీ బాధ్యత లేదని తప్పుకోవడం అసాధ్యం. అలాగే ఆ రోజుల్లో విడుదలైన 26 జీవోలకూ సంబంధిత మంత్రులకు సంబంధం లేదని తప్పుకోవడం అసలే అసంభవం. క్విడ్‌ ప్రో కో పద్ధతిలో ప్రభుత్వ ధనాన్ని ప్రకృతి సంపదను కొందరికి దోచి పెట్టి ప్రతిఫలంగా తమ సంస్థలలో పెట్టుబడులు పెట్టించారన్నదే ఇక్కడ కేసు. ఈ కేసులో

Tuesday, March 13, 2012

సర్కారు సమర్థనలు- జగన్‌ వర్గం విన్యాసాలు





వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించి ఆ నాటి మంత్రులకు ఐఎఎస్‌లకు సుప్రీం కోర్టు నోటీసులివ్వడంపై ఇప్పుడు చర్చలు కేంద్రీకృతమైనాయి. ఈ సందర్భంగా అటు ప్రభుత్వ ప్రతినిధులు ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వాదనలలో ద్వంద్వత్వం బాహాటంగానే తెలిసిపోతున్నది. తమపై సాగే దర్యాప్తు ఏకపక్షమంటున్న వైఎస్‌ఆర్‌ పార్టీ వారు మంత్రులకు నోటీసులివ్వడాన్ని స్వాగతిస్తున్నారు. జగన్‌పై దర్యాప్తును హర్షిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు అదే మంత్రులను వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన ప్రభుత్వాన్ని నేరుగా కోర్టు ప్రస్తావించకపోయినా అదే ధోరణిలో మాట్లాడారు. నోటీసులు ఇచ్చింది వ్యక్తిగతంగా ఆ మంత్రులకే తప్ప ప్రభుత్వానికి కాదు. గతంలో శంకర్‌రావు పిటిషన్‌పై ఇదే సమస్యలు వచ్చినపుడు ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. కనక ఇప్పుడు సమర్థనకు దిగాల్సిన అగత్యమేమిటి? మంత్రులు తెలిసి ఈ 26 జీవోలపై సంతకాలు చేసివుంటే నైతికంగా అనర్హులు, తెలియకుండా ఇదంతా జరిగిపోయిందంటే అప్పుడు రాజ్యాంగ రీత్యా అనర్హులు. ఏమైనా వారు పదవులలో కొనసాగుతుంటే నిస్పాక్షికమైన దర్యాప్తు ఎలా జరుగుతుంది? గతంలో లిక్కర్‌ మాఫియాలో చిక్కిన వాళ్లను అధినేత సమర్థించిన తర్వాత మొదట విషయాలు బయిటపెట్టిన నున్నా వెంకట రమణ కూడా అడ్డం తిరిగిన తీరు చూశాం. ఇప్పుడు కూడా ఈ దర్యాప్తునకు అదే గతి పట్టించదల్చుకున్నారా? ఇక పొతే వైఎస్‌ఆర్‌ పార్టీవారు తమపై దర్యాప్తు కక్ష సాధింపు అంటూనే మంత్రులపై విచారణకు అంత ఆనందించాల్సిన అవసరమేమిటి? వారు చేసింది తప్పయితే వారితో పాటు తమూ మునగాలి. తాము తప్పుచేయలేదంటే అప్పుడు మంత్రులూ చేయనట్టే. ఇదే సూత్రం ఐఎఎస్‌లకూ వర్తిస్తుంది. మొత్తంపైన ఇదంతా చూస్తుంటే అవినీతి కేసులను దారి తప్పించే దాగుడుమూతలు సాగుతున్నాయా అని సందేహం మాత్రం కలుగుతుంది. కాని 2 జి స్పెక్ట్రం తదితర కేసుల పర్యవసానాలు చూసిన తర్వాత కూడా కిరణ్‌ ఆ మార్గాన్ని అనుసరించి నిందితులను కాపాడితే అప్పుడు కాంగ్రెస్‌ మరింతగా దెబ్బ తినడం తథ్యం. సిబిఐ దర్యాప్తు అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ఆయన అనడం కూడా హాస్యాస్పదంగా వుంది. అవినీతి దేశాభివృద్ధికి అతి పెద్ద అడ్డంకిగా వుందని రాష్ట్రపతి,సోనియా గాందీ తదితరులంతా చెబుతున్న మాట ఆయన చెవిన పడలేదని అనుకోవాలి.

Wednesday, March 7, 2012

శాసనసభల ఫలితాలు- జాతీయ ప్రభావాలు



అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ బిజెపిలు రెండూ చతికిలబడటం ఈ ఎన్నికల ప్రధాన పాఠం. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో. పదహారేళ్లలో తొలి సారి పూర్తి మెజారిటితో ప్రభుత్వం ఏర్పాటు చేసి తొలిసారిగా పూర్తి కాలం పాలించిన ి ముఖ్యమంత్రిగా బిఎస్‌పి నేత మాయావతి తనదైన స్థానం పొందారు. అయితే ఆమె రికార్డును కూడా అధిగమించి ఆమెను ఓడించి ఎస్‌పి నాయకులైన తండ్రీ కొడుకులు ములాయం సింగ్‌, అఖిలేష్‌ యాదవ్‌లు కొత్త చరిత్రనే సృష్టించారు. దేశంలో అతి పెద్దదైన ఈ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు పక్కకు పోయి సామాజిక న్యాయం లౌకిక తత్వంతో సంబంధం గల రెండు పార్టీలే ప్రధానంగా మిగలడం ఎంతైనా ఆహ్వానించదగిన పరిణామం.రాహుల్‌ ప్రచార వైఫల్యం ఒకటైతే ఉమా భారతి సహా బిజెపి నాయకగణమంతా పర్యటించినా ఫలితం లేకపోవడం అంతకన్నా తీవ్రమైంది. గతంలో తన పెరుగుదలకు ప్రధాన పునాదిగా ఉపయోగపడిన చోటనే బిజెపి వరుసగా దెబ్బ తినడం నిస్సందేహంగా మతతత్వ రాజకీయాలకు

వామపక్ష వాణి...



వివిద కార్మిక సంఘాల, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న దేశ వ్యాపితంగా జరిగిన బ్రహ్మాండమైన సమ్మె - ఉద్యమాలకు సంబంధించినంతవరకూ - ప్రపంచ ప్రాధాన్యత గల పరిణామం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, నయా ఉదార వాద నమూనాలపై దేశ దేశాల శ్రామిక ప్రజానీకం సాగిస్తున్న పోరాటాల పరంపరలో భారత కార్మిక వర్గ చైతన్య పతాకం ఈ సమ్మె. సామాన్యుల జీవితాలకు శ్రామిక ఉద్యోగ వర్గాల ఉపాధి భద్రతకూ సేద్యగాళ్ల బతుకులకూ దేశ సార్వభౌమత్వానికి కూడా హానికరమైన విధానాలపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం అది. మన కార్మికోద్యమానికి గల పట్టును, సంఘాల భావ సారూప్యతను సమ్మె ప్రతిబింబించింది. ప్రజా ఉద్యమాలకు కొత్త వూపునిచ్చింది. ప్రచార కోవిదులైన నేతలు ఇందులో ఏ కాస్త మోతాదులో కార్యక్రమం చేసినా బోలెడంత హంగామా వుండేది. అడుగడుగూ ప్రచారం పొందేది. ఇప్పుడు అస్సలు రాలేదని కాదు గాని అవన్నీ కమ్యూనిస్టులకే పరిమితమైన వ్యవహారాలై పోతాయి. ఎందుకంటే ధనాడ్య బలాఢ్య వర్గాలకు ఈ ఆర్థిక విధానాల చర్చ సుతరామూ ఇష్టముండదు. గాలిలో కత్తులు దూసినట్టుగా వ్యక్తిగత వివాదాలలో ఉత్తుత్తి ఉద్రిక్తతలలో మునిగితేలడమే వారికి కావాలి.
ఉదాహరణకు మన రాష్ట్రాన్నే తీసుకుంటే రెండేళ్లకు పైబడి ఎడతెగని అనిశ్చితి. దాని కారణమైన అవకాశవాదం. అధికార పక్షం అంతర్గత కలహాలు, అంతులేని అవినీతి పురాణాలు. ఈ భాగోతాల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువని అలసి పోయేలా దూషించుకుని దండగమారి దండకాలు చదివేసుకుని ఎజెండా అయిపోయిందనుకోవడం.. అంతే. కాంగ్రెస్‌ నిర్వాకాలను తెలుగు దేశం నేతలు విమర్శించగానే మీ సంగతేమిటని వారు ఎదురు దాడి

అనర్హత ఘట్టం- వైరుధ్యాలు తీవ్రం



వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు ప్రహజనం పూర్తయింది. నిజానికి వారు దీన్ని ఎప్పటినుంచో ఆహ్వానిస్తున్నందున వేటు అనడం కంటే స్వీటు అనే అభివర్ణించాల్సి వుంటుంది.అయితే భవిష్యత్‌ రాజకీయ పరిణామాల రూటు ఎటో ఘాటు ఎంతో మాత్రం చెప్పడం సులభం కాదు. ప్రధాన పాలకపక్షాల,వర్గాల నేతలు ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం వెలగబెడుతున్నా ఎవరి భయాలు వారిని వెన్నాడుతున్నాయి. రకరకాలైన రాజకీయ వైరుధ్యాలతో రాష్ట్ర రంగ స్థలం గజిబిజిగా మారింది. ప్రాంతాల వారీగా పార్టీలు పరి పరి విధాల విన్యాసాలు చేస్తున్నా పెద్ద మార్పులేమీ వచ్చిన దాఖలాలు లేవు. గత మూడేళ్ల కాలంలోనూ రాష్ట్రాన్ని వెన్నాడుతూనే వున్న అనిశ్చితి మరింత అధ్వాన్నమవడమే తప్ప పరిస్థితి మెరుగుపడే సూచనలూ లేవు. కమ్యూనిస్టేతర పార్టీలు ప్రజా సమస్యలతో నిమిత్తం కన్నా స్వీయ అస్తిత్వం ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆరాటపడుతున్న తీరే ఇందుకు కారణం.

ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదార్ల అనర్హత వ్యవహారమే చూద్దాం. జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని వ్యవస్తాపించడమే వారి ప్రధాన ఎజెండా. వైఎస్‌ మరణించిన వెనువెంటనే జగన్‌ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించి సంతకాలు చేయించినప్పటితో పోలిస్తే ఇలా కోరుకునే వారి సంఖ్య కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎల పరంగా బాగా తగ్గిపోయిందనేది నిజం. అప్పుడు 150 మంది సంతకాలు చేశారంటే ఇప్పుడు మిగిలింది అందులో