Pages

Sunday, September 4, 2011

కెసిఆర్‌ తాజా పలుకుల తాత్పర్యం!


కేంద్రం తెలంగాణా ఇచ్చేట్టు లేదని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ చేసినట్టు చెప్పబడుతున్న వ్యాఖ్యలు గతంలో ఈ బ్లాగులో చెప్పుకున్న అంశాల కొనసాగింపుగానే వున్నాయి. ఈ విషయంలో కేంద్రంపై భ్రమలు పెంచడం మంచిది కాదని అన్నప్పుడు ఆ నాయకులకు చాలా ఆగ్రహం కలిగింది. మొదటి నుంచి రకరకాల గడువులు ప్రకటిస్తూ కెసిఆర్‌ కేంద్రం పాత్రపట్ల గందరగోళం సృష్టించారు. ఆ మాయాజాలానికి ప్రజలనూ గురి చేశారు. ఈ విషయంలో ప్రాంతంలోని పార్టీలన్ని ఒక్కటేనని అంటూనే తన స్వంత పార్టీ బలాన్ని పెంచుకోవడానికి పాచికలు వేశారని కొండా లక్ష్మణ్‌ బాపూజీ లేదా తెలుగు దేశం నాయకులు విమర్శించారు. వారి వైఖరి సముచితమా అనే ప్రశ్న ఒకటైతే ఇన్ని దశాబ్దాలలోనూ కాంగ్రెస్‌ కేంద్రం నైజం తెలిసీ కేసిఆర్‌ ఎందుకు జనాన్ని వూరిస్తూ వచ్చారనే ప్రశ్న తప్పక ఎదురవుతుంది. తెలంగాణా ఇవ్వబోరని(నిజానికి అది ఇప్పటికే వుంది తప్ప ఎవరూ ఇచ్చేది కాదు. రాష్ట్ర విభజన ఇక్కడ వారి కోర్కె) ఇచ్చినా హైదరాబాదు లేకుండా ఇస్తారని ఆయన పేరిట ఒకే విధమైన లీకులు వచ్చాయంటే ఇది అనధికారికంగా జరిగిన అధికార లీకుగానే భావించాలి. దీనిపై ఇప్పుడు కోంగ్రెస్‌ నేతలు కోపం ప్రదర్శిస్తున్నారు. వీరి వైఖరినీ విశ్వసించడం కుదిరేపని కాదు.తెలంగాణా స్బరణ చేస్తూనే కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌,తెలుగు దేశం తమ తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నాయి.ఇవన్నీ ఒకటైనట్టు నటిస్తాయే గాని నిజంగా కావు. ఇంతకూ ఇస్తారన్నప్పుడు గాని ఇవ్వబోరని చెబుతున్నప్పుడు గాని ఆయనకు వున్న ఆధారాలేమిటి? కేవలం ఆ సమయంలో తమ రాజకీయ అవసరాలను బట్టి మాట్లాడ్డం తప్ప మరేమీ లేదు. ఇలా అంటూనే ఇప్పుడు సకల జనుల సమ్మెతో తెలంగాణా వచ్చేస్తుందని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏకాంశ పార్టీగా టిఆర్‌ఎస్‌కు ఇలా మాట్లాడ్డం కలసి రావచ్చునేమో గాని ఈ విన్యాసాల వల్ల విశ్వసనీయత పూర్తిగా దెబ్బతినిపోవడం అనివార్యం.2014లో వంద స్థానాలు గెల్చుకోవడం గురించి ఇప్పుడే మాట్టాడ్డం ముందుగా కూసిన కోయిల చందమే అవుతుంది.ఇంతకూ ఈ 20 మాసాలలోనూ తెలంగాణా సమస్యపై టిఆర్‌ఎస్‌ ఇతరులు రకరకాలుగా మాట్లాడటంలోనే వారి ఇరకాటం తేటతెల్లమవుతుంది.ఇన్ని మాట మార్పుల మధ్యన ప్రజలు తమ దైనందిన జీవిత పోరాటాన్ని వదలిపెట్టి ఈ ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటారని అనుకోలేము. జగన్‌ వర్గం రాజీనామాలు ఆమోదిస్తే అక్కడ ఉప ఎన్నికలపైకి దృష్టి మరలుతుంది. మొత్తంపైన సకల జనుల సమ్మె ప్రారంభం కావలసిన తరుణంలో ఇలా మాట్లాడ్డం ద్వారా టిఆర్‌ఎస్‌ నాయకులు తమపై భారాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి మరిన్ని మలుపులు చూడొచ్చునేమో.ఇలా అంటూనే విషం తాగడం గురించి కూడా కెసిఆర్‌ ప్రస్తావించడాన్ని బట్టి ఆయన ధోరణి మారేది కాదని కూడా తేలిపోతుంది. నిరుత్సాహం పెంచుతూ ఇలాటి మాటలు జోడించడం ద్వారా ఆయన ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో వేరే చెప్పాలా?

No comments:

Post a Comment