Pages

Sunday, May 11, 2014

ప్రణబ్‌ ముఖర్జీ ఏం చేస్తారు?






పెద్దపార్టీ సిద్ధాంతమా?
సుస్థిరతకు ప్రాధాన్యతా?
నిపుణులతో సంప్రదింపులు
కార్పొరేట్‌ శక్తుల హడావుడి



లోక్‌సభ ఎన్నికల చివరి ఘట్టం సోమవారంతో ముగిసి పోనున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై అందరూ దృష్టి సారిస్తున్నారు. పదేళ్లు పాలించిన తర్వాత దిగిపోతున్న ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వీడ్కోలు సమావేశాలు సందేశాలతో నిష్క్రమణకు సిద్ధమవుతుంటే కొత్తగా వచ్చే వారి కోసం రకరకాల శక్తులు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ అధినేతలు తమ తమ అనుకూల జాతీయ ప్రాంతీయ పార్టీల తరపున ధనరాశులతో వేచి చూస్తున్నారని రాజధాని పరిశీలకులు చెబుతున్నారు. వీరంతా రకరకాల లాబీలు నడుపుతూ రాజకీయ దళారులను సమీకరిస్తున్నారు. కాంగ్రెస్‌ దిగిపోవడం ఖాయమైనా బడా మీడియా అదే పనిగా చాటింపు వేసినట్టు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ రావడానికి అవకాశం ఏ మేరకు వుంటుందనేది ఇప్పుడు ప్రశ్నగా చెబుతున్నారు. బిజెపికి 200 స్థానాల లోపు తెచ్చుకుంటే మిత్రులను కూడగట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభం కాదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకుడు ప్రభుచావ్లా రాశారు. 180 దగ్గరే ఆగిపోతే బిజెపిలో మోడీ వ్యతిరేకులు చెలరేగిపోతారని కూడా ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ దెబ్బతింటే రాహుల్‌ను ఏమీ అనబోరని, 120 వరకూ వస్తే ఆయనను పరిరక్షకుడుగా కీర్తిస్తారని కూడా రాశారు. ఈ రెండు పార్టీలకు తక్కువ స్థానాలు వచ్చిన సందర్భంలో తృతీయ కూటమి ప్రయత్నాలకు బలం వస్తుందని అనేక బలీయమైనప్రాంతీయ పార్టీల నేతలు పోటీ పడతారని కూడా భావిస్తున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి సంగతి అలా వుంచితే మొత్తం 29 మంది మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుతం రంగంలో వున్నారని ఆయనే లెక్క వేశారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి బిజెపికి 200 పైన స్థానాలు వచ్చే అవకాశం దాదాపు లేదని మరో ప్రముఖ సంపాదకుడు దిలీప్‌ పడగోవ్‌కర్‌ విశ్లేషించారు. అయితే రాజ్యాంగ సంప్రదాయాలకు చాలా విలువనిచ్చే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పెద్ద పార్టీగా వచ్చే వారినే పిలుస్తారనీ, అప్పుడు మొదటి అవకాశం
మోడీకే లభిస్తుందని ఆయన అంచనాగా వుంది. మరో వైపు హిందూ మొదటి పేజీలో కథనం ఇస్తూ రాష్ట్రపతి సుస్థిరతకు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది. ఎవరికీ మెజార్టి రాని పక్షంలో సుస్థిరత సమకూర్చగలదని ఆయన నమ్మే పార్టీని లేదా కూటమిని ఆహ్వానిస్తారని ఈ కథనం పేర్కొంది. '' నిర్ణయాత్మకమైన తీర్పు రాని పక్షంలో రాష్ట్రపతి సుస్థిరతను ఇవ్వగల పార్టీని లేదా కూటమిని ఎంపిక చేయొచ్చు. తద్వారా దేశం అనూహ్యమైన ప్రగతి పథంలో దూసుకుపోవాలన్నది ఆయన అభిమతం' అని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు చెప్పాయి.ఈ విషయంలో తాను తటస్థంగా వున్నానని చెప్పడానికే పోస్టల్‌ బ్యాలట్‌ ఏర్పాట్లన్నీ ముగిశాక ప్రణబ్‌ ముఖర్జీ ఓటు వేయడం విరమించుకున్నారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
ఫలితాల అనంతర పరిస్థితిపై ఇప్పటికే ప్రణబ్‌ రాజ్యాంగ కోవిదులైన సోలీ సోరాబ్జీ, మోహన్‌ పరాశరన్‌, టి.కె.విశ్వనాథన్‌, పాలీ నారీమన్‌ తదితరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేగాక రిపబ్లిక్‌ దినోత్సవ సందేశంలోనూ ఆయన త్రిశంకు తీర్పు, విభజిత ప్రభుత్వం దురదృష్టకరమైన పరిణామాలుగా వుంటాయని పేర్కొన్నారు. అంతేగాక అలాటి పరిస్థితి వినాశకరమైనదని కూడా అభివర్ణించారు. అయితే సుస్థిరత పేరుతో ఏకైక పెద్దపార్టీకి పట్టం కట్టినా నిలబడజాలదని 1996లో వాజ్‌పేయి మొదటి ప్రభుత్వ అవమానకర పతనాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రణబ్‌ ముఖర్జీ ఆచితూచి అన్ని కోణాలలో ఆలోచించాకే అడుగు వేయవలసి వుంటుందని వారంటున్నారు.
ఆరెస్సెస్‌ సన్నిధిలో మోడీ
ఒకవైపున కార్పొరేట్‌ శక్తులు అనుకూల ప్రభుత్వం కోసం హడావుడి పడుతుండగా నరేంద్ర మోడీ ప్రచారం ముగియగానే నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించుకున్నారు. ఆయన అలసి పోకుండా ప్రచారం చేశారని వారు ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు జరగాల్సిన ప్రయత్నాలు అనంతర చర్యలపై వారు మంతనాలు జరిపారు.

No comments:

Post a Comment