Pages

Wednesday, February 15, 2012

విజయమ్మ పిటిషన్‌ తోసివేత: స్పందనలు



తెలుగు దేశం అద్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులపై దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్‌ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను అనేక మలుపుల తర్వాత హైకోర్టు కొట్టి వేసింది. దీనిపై న్యాయ పరమైన పరిశీలన కంటే రాజకీయ వాగ్యుద్దాలే ఎక్కువగా చూడక తప్పదు.తీర్పులు లేదా ఉత్తర్వులు తమకు అనుకూలంగా వస్తే న్యాయం ధర్మం గెలిచినట్టు ప్రతికూలంగా వస్తే ఏదో తప్పు జరిగినట్టు అనిపించడం సహజం. అయితే ఒక వ్యవస్థను ఆశ్రయించిన వారు ఆ సూత్రాల పరిధిలోనే వ్యవహరించక తప్పదు. ఇప్పుడు వారు సుప్రీం కోర్టుకు వెళ్లడం ఎలాగూ జరుగుతుంది. న్యాయ స్తానాలు కూడా విమర్శలకు అతీతం కాదు గాని వాటిపై మాట్టాడేప్పుడు కాస్త ఆచితూచి స్పందించడం మంచిది. ఇక మొత్తం పిటిషన్‌ను తోసి పుచ్చడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు ప్రతివాదుల వాదన వినకుండానే గతంలో వచ్చిన తీర్పుపై విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి వుంటుంది. నాట్‌ బి ఫోర్‌ సమస్య అంటే అది ఈ కేసుకే పరిమితం కాదు. పైగా కొన్ని ఆరోపణలు చేయడం ద్వారా బెంచీలు మారడానికి కొంత వరకు తామూ కారకులమైనామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వారు ఒప్పుకోవలసి వుంటుంది. ఇటీవల పలు కేసుల్లో వరుసగా సుప్రీం కోర్టులోనూ హైకోర్టులోనూ ఆశాభంగం ఎదురవుతుంటే రాజకీయంగానూ న్యాయపరంగానూ తమ వాదనల్లో లోటు పాట్లు ఏమిటని సమీక్షించుకోవాలి గాని ప్రత్యర్థులపై విరుచుకుపడినా మీడియాను లేదా కోర్టులను తప్పు పట్టినా ఫలితం లేదు. తెలుగు దేశం కూడా కొంత వరకూ సంతోషించవచ్చు గాని ఎమ్మార్‌ కేసులో చంద్రబాబు హయాంలో వాటిపైనా విచారణ జరుపుతామని సిబిఐ సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి గుర్తుంచుకోవాలి. కనక రాజకీయ మధనం ఇంకా చాలా జరుగుతుంది.

No comments:

Post a Comment