Pages

Saturday, December 31, 2011

కాలానికి స్వాగత గీతం జనావళికి శుభ ప్రభాతం




బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ ఏడాది మీకు ప్రగతిశీలంగానూ ప్రయోజనాత్మకంగానూ వుండాలని మీరు ప్రణాళికా బద్దంగా పురోగమించాలని కోరుకుంటున్నాను. ఏడాది పొడుగునా నా బ్లాగులో ఎంట్రీలు చూసిన ఇతరత్రా ఆదరించిన ప్రతివారికీ, ప్రత్యేకించి విమర్శల ద్వారా పదును అప్రమత్తత పెంచిన వారికి నా కృతజ్ఞతలు.
గత ఏడాది చివరలో ' కాలం ఖాతాలో వీడ్కోలు వీక్షణం' అని రాశాను. ఇప్పుడు దాన్ని ఒకసారి చదువుకుంటే గతాన్ని సమీక్షించుకోవడం ఎలా వున్నా రాబోయే రోజులను మెరుగ్గా ఉపయోగించుకునే అవకాశముంటుంది. అందరికీ కనీసం అత్యధికులకు ఏదో మేరకు అందుబాటులో వుండే సామ్యవాది (సౌమ్యవాది మాత్రం కాదు) కాలం ఒక్కటే.

కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రభావం

కాలం ఒక ప్రణాళిక
కాలం ఒక ప్రహేళిక

కాలం ఒక సవాలు
కాలం ఒక జవాబు

కాలం ఒక అవకాశం
కాలం ఒక అవరోధం

కాలం ఒక వాహనం
కాలం ఒక వాహకం

కాలం ఒక ప్రమాణం
కాలం ఒక ప్రయాణం

కాలం ఒక ప్రయోగం
కాలం ఒక ప్రకాశం

Tuesday, December 27, 2011

మోత్కుపల్లి వృథావేశం అవాంఛనీయం

ఈ వారం నల్గొండ జిల్లా తెలుగు దేశం నాయకుడు మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు బొత్తిగా అవసరం లేనివి. చంద్రబాబు నాయుడు రైతు పోరు పేరిట చేసిన యాత్ర పూర్తి కావడం మంచిదే. దాన్ని అడ్డుకుంటామని మొదట ప్రకటించిన కోదండ రామ్‌ తర్వాత దాన్ని సవరించుకున్నారు కూడా. ఈ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయే బదులు తెలుగు దేశం నాయకులు టిఆర్‌ఎస్‌పైనా ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కె.సి.ఆర్‌పైన ధ్వజమెత్తడానికి ప్రాధన్యాత నిచ్చారు. తెలంగాణా రాజకీయ క్షేత్రంలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర వైరుధ్యం వున్న మాటా నిజం. టిఆర్‌ఎస్‌ తెలుగుదేశంపై దాడి కేంద్రీకరిస్తున్న మాటా నిజం. కెసిఆర్‌ రాజకీయ విన్యాసాలు వివాదాలు ఎలా వున్నా ఆ కారణంతో మోత్కుపల్లి మాటలు సమంజసమై పోవు. ఎందుకంటే ఉరేసుకుందాం రమ్మని సవాలు చేయడం, ఒక ప్లాస్టిక్‌తాడుతో ప్రత్యక్షం కావడం బాద్యత గల రాజకీయ నేతలు చేసే పని కాదు. పైగా అనేక బాధాకర ఘటనల తర్వాత ఇప్పుడెప్పుడే స్తిమితపడుతున్న తెలంగాణా ప్రాంత ప్రజలకు అసలే మంచిది కాదు. కెసిఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుంటే

నిజరూపాల నిరూపణ, కొనసాగిన ప్రజా కార్యాచరణ

కాలగతిలో కరిగిపోతున్న 2011 చివరి ఘట్టం. సమీక్షకూ సమాలోచనకు సందర్భం. సంవత్సరం పొడుగునా చూసిన సమస్యలు సవాళ్లు సంవాదాలు సమరాలు సంచలనాలు సంతోష విషాదాలను బేరీజు వేసుకోవడానికి సరైన సందర్భం. కాలం ముందుకే పోతుంది తప్ప వెనక్కు నడవదు. గడియారాలు ఆగిపోవచ్చు గాని ఘడియలు ఆగవు. పరిణామ క్రమం కూడా అంతే..ప్రతికూలతలను ప్రతిఘటిస్తూ ముందుకు సాగడమే మానవాళి స్వభావం. కట్టుకథలు పటాపంచలు చేసి కఠోర సత్యాలను కళ్లకు కట్టడం, కల్పనలనూ కట్టుకథలను కుప్పకూల్చి కఠినతర పరీక్షలకు ప్రజా రాశులను సమాయత్త పర్చడం కాలసూత్రం.
2011 నే తీసుకోండి. ధర్నా చౌక్‌ నుంచి వాల్‌స్ట్రీట్‌ వరకూ ప్రతిచోటా కనిపించిన దృశ్యం ప్రతిఘటనే.సంస్కరణల పేరిట నల్లేరు మీద బండిలా నడిపించుకుపోవాలన్న నయవంచక పథకాలను వామపక్ష ప్రజాస్వామిక శక్తుల నుంచి అడుగడుగునా నిరసన వ్యక్తమవుతూ వచ్చింది. అది కూడా పరిమితులలో ఆగిపోకుండా అంతకంతకూ విస్తారమవుతూ వచ్చింది. ఇన్ని సమస్యల మధ్యనా సాధించుకున్న కోర్కెలు నిలువరించిన ప్రమాదాలు చాలా వున్నాయి. వీటిని చూసి బెంబేలెత్తిన సామ్రాజ్యవాదం మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్న స్థితి.2007లో సద్ధాం హుస్సేన్‌ ఉరితీతతో ముగిసిపోతే 2011 కల్నల్‌ గడాపీని కడతేర్చడంతో ముగిసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు. ఇరాక్‌లో తిష్ట వేసిన సైన్యాలు ఇంటి దారి పడితే అరబ్‌ దేశాలలో అనుకున్నట్టల్లా అడటానికి అనేక ఆటంకాలను ఎదుర్కొవలసిన స్థితి అమెరికాకు ఎదురవుతున్నది.ఆఖరుకు ఉపగ్రహం వంటి పాకిస్థాన్‌ సైనిక కూటమి కూడా పూర్తిగా లొంగిపోవడానికి నిరాకరించడంతో ఉద్రక్తత పెరుగుతున్నది. ఇరాక్‌పైన దురాక్రమణ సమయంలో కన్నా ఇప్పుడు ప్రపంచం అమెరికా అసలు వ్యూహాలను అర్థం చేసుకోగలుగుతున్నది. లిబియా తర్వాత ఏ దేశంపైన దాడి చేస్తారో అని ప్రతివారూ ముందస్తుగానే

Wednesday, December 21, 2011

మాఫియా మహా సామ్రాజ్యాలు



కారణమేదైనా మీరు మంచి పని చేశారు, ఆ చేసిందాంట్లో తెలిసిందేమిటో మాకూ చెప్పండి అని ప్రజలు ప్రతిపక్షాలు, మీడియా అడుగుతుంటేే పాలకులే తటపటాయించే పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయ రంగస్థలంపై ి దృశ్యం అదే. లిక్కర్‌ మాఫియాపై దాడులను ఆహ్వానిస్తూ వాటిలో పట్టుబడిన వారి వివరాలను పారదర్శకంగా ప్రజల ముందుంచమని కోరుతుంటే ప్రభుత్వం ప్రతిస్పందించడం లేదు. దాడులు చేసిన ఎసిబి అధిపతులు గాని, వారికి ఆదేశాలిచ్చే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గాని తమ దాడుల తీరు తెన్నులు ఫలితాలు పర్యవసానాలు రేఖా మాత్రంగానైనా పంచుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం జరపాలన్నారు. స్వపక్షం అద్యక్షుడు, సమిష్టి మంత్రివర్గ బృంద సభ్యుడు బొత్స సత్యనారాయణ విషయాలు బయిటపెట్టమని 'సవాలు' చేశారు. మహిళా సంఘాలు ఆందోళనలు మొదలెట్టాయి. మీడియా చర్చల్లో మాలాటి వాళ్లం మద్యం మాఫియా మతలబులు బహిర్గతం చేయాలని కోరుతూనే వున్నాం. అయినా సరే, ప్రభుత్వం కిమ్మిన్నాస్తి అన్నట్టుగా వుండిపోతున్నది. గనుల మాఫియా, భూముల మాఫియా, మాదకద్రవ్యాల మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఆయుధాల మాఫియా, అడవుల మాఫియా, అశ్లీల కృత్యాల మాఫియా, టెండర్ల మాఫియా, మర్దర్ల మాఫియా , మనీ లాండ్రింగ్‌ మాఫియా అన్నిటినీ మించి కనిపించని కార్పొరేట్‌ మాఫియా.. ఇన్ని మాఫియా మహా సామ్రాజ్యాల పదఘట్టనలో మన ప్రజాస్వామ్యం మనుగడ ఏమిటి?

మిగిలిన కొన్ని మాఫియాల్లాగా లిక్కర్‌ వ్యవహారం కేవలం ప్రకృతి సంపదనో ప్రజల ధనాన్నో కొల్లగొట్టడంతో ఆగదు. నేరుగా ప్రజల ఆరోగ్య సౌభాగ్యాలను దెబ్బతీస్తుంది. పురుషులు తాగితందనాలాడుతుంటే

Wednesday, December 7, 2011

అస్థిర విశ్వాసం




'నేనోడిపోయి గెలుపొందినాను, గెలిచానని నవ్వనా ఏడ్వనా' అంటూ నలభయ్యవ దశకంలో వచ్చిన పండంటి కాపురంలో పాట వుంటుంది. మనసా కవ్వించకే నన్నిలా అన్న పల్లవితో సాగిన ఆ పాటలోని పై చరణాలు మొన్న శాసనసభలో అవిశ్వాస తీర్మాన సన్నివేశానికి అచ్చంగా సరిపోతాయి. ఈ తీర్మానం రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో స్థిరీకరణ తీసుకువచ్చిందని ఒక కోణంలో అస్థిరత్వాన్ని స్థిరపరచిందని మరో కోణంలో చెప్పొచ్చు. పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ అభివర్ణనే అత్యంత వైరుధ్య భరితంగా వున్న ప్రస్తుత రాజకీయ స్తితికి సరైన నిర్వచనం.
జగన్‌పై కేసుల దర్యాప్తు, సకల జనుల సమ్మె, ప్రస్తుతం తెలంగాణా విభజన సాధ్యం కాదని ప్రధాని వ్యాఖ్య, చంద్రబాబు అస్తులపై దర్యాప్తుకు హైకోర్టు ఉత్తర్వులు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏడాది పూర్తి ఇవన్నీ ఇటీవల కొన్ని ముఖ్యమైన మలుపులు. కాగా అవిశ్వాస తీర్మానం వాటన్నిటికి పరాకాష్ట. అది చెప్పుకోదగినంత తేడాతో వీగిపోయింది గనక విజయం తమదేనని అధికార పక్షమైన కాంగ్రెస్‌ చెప్పుకోవచ్చు. అయితే జగన్‌ 16 మంది ఎంఎల్‌ఎలను తీసుకుపోవడం వల్ల కొట్టిన గండి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అంతర్గత కలహాల చరిత్రలో ఇంత తీవ్రమైన గండి గతంలో చూసి వుండకపోవచ్చు. ప్రజారాజ్యం పార్టీని ముందస్తు జాగ్రత్తతో విలీనం చేసుకోవడం వల్ల మజ్లిస్‌ మద్దతు వల్ల గండం గడిచి గట్టెకిని గండి మాత్రం పూడదు. పైగా రేపెవరైనా మరో గండి పడితే విజేత చిత్రంలో వలె ఆదుకోవడానికి మరో మెగాస్టార్‌ కూడా వుండరు. జగన్‌ శిబిరం మొదట చెప్పుకున్నట్టు అరవై మందిని గాక

Tuesday, December 6, 2011

అవిశ్వాసపర్వంలో ఎవరేమిటి? తర్వాతేమిటి?



అనుకున్న విధంగానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే రాష్ట్ర రాజకీయాల పొందికను స్పష్టీకరించేందుకు దోహదం చేసింది.చాలా కాలంగా చాలా విషయాల్లో ఎదురు దాడికి గురవుతున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం తన స్థానాన్ని పునరుద్ఘాటించుకోడానికి, చొరవ చాటుకోవడానికి సందర్భమైంది. రైతు సమస్యలపై తీర్మానం అని చెప్పినప్పటికీ నిజంగా సమస్యలపై కేంద్రీకరణ తక్కువేనని చెప్పాలి. మరోవైపున అవినీతి వ్యవహారాలు, మంత్రివర్గంలో అనైక్యత, రాజకీయ అనిశ్చితి, జగన్‌ వర్గం సవాళ్లు తదితర అంశాలను చర్చించేందుకు కూడా అవకాశం చిక్కింది.
ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అనుకున్న మేరకు బలాన్ని సమీకరించడంలోనూ వున్న వారిని పూర్తిగా నిలబెట్టుకోవడంలోనూ విఫలమైనప్పటికీ- దాదాపు ఇరవై మంది సభ్యులు పాలకపక్షం నుంచి విడగొట్టుకునేట్టు చేయడంలో కృతకృతమైంది. ఇందులో త్యాగం సిద్ధాంతాలు వంటివి ఏమీ లేకున్నా అధికార పక్షంలో రాజకీయ సంక్షోభ వాతావరణం తీసుకురాగలిగింది.అయితే పదే పదే పడగొట్టడం గురించి తాము చేసిన సవాలు సమీపంలోకి కూడా రాలేకపోవడం వారికి ఎదురుదెబ్బ లాటిదే.ఇప్పుడు విప్‌ను ధిక్కరించిన తమ వారిపై వెంటనే అనర్హత వేటు వేయించుకుని ఎన్నికలకు వెళ్లాలన్న ఆతృత జగన్‌ తదితరుల్లో కనిపిస్తున్నది.

బేషరతుగా లీనమై పొరబాటు చేశామని పశ్చాత్తాప పడుతున్న ప్రజారాజ్యం కాస్త బెట్టుచేసి ఏవో హామీలు సంపాదించుకోవడానికి కూడా అవిశ్వాసం అక్కరకు వచ్చింది. ప్రభుత్వం తమ వల్లే నిలబడిందని చెప్పుకునే అవకాశం లభించింది.అయితే అవసర సమయంలో బేరసారాలు చేయడం భవిష్యత్తుపై ఎలాటి ప్రభావం చూపిస్తుందో చెప్పడం కష్టం. మజ్లిస్‌ విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేదు గాని

Saturday, December 3, 2011

అవిశ్వాస పర్వం: టీ కప్పులో తుపాన్లు




ఎట్టకేలకు శాసనసభలో తెలుగు దేశం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌ స్వీకరించి చర్చకు అనుమతించారు గనక ఇక రెండు రోజుల పాటు దృష్టి దానిపైనే కేంద్రీకృతమవుతుంది. దీన్ని బలపరుస్తామని దాదాపు ప్రతిపక్షాలన్ని ప్రకటించాయి. జగన్‌ వర్గం కూడా అదే వైఖరి తీసుకుంది. అయితే జగన్‌ వెనక ఎందరున్నారు, వున్నవారిలో ఎందరు నిలబడతారు అన్నది మాత్రం ఇంకా సందేహంగానే వుంది. ఆ విధంగా ఇది ఆయనకూ విశ్వాస పరీక్ష వంటిదే అనుకోవాలి. ఈ సమయంలో చిరంజీవి శిబిరం( లేదా శాసనసభలో సాంకేతికంగానే మిగిలి వున్న పిఆర్‌పి) అసంతృప్తి టీ కప్పులో తుపానులా ముందుకొచ్చింది. బహుశా చాలా మాసాల తర్వాత రద్దయిన పిఆర్‌పి వునికిని ప్రత్యేకంగా చూపించిన సందర్భమిది. దీన్ని అలుక ఆసంతృప్తి ఆగ్రహం ఇలా ఏ పేరుతో పిలిచినా పెద్ద తేడా లేదు. వీటన్నిటినీ కలిపినా మాజీ ప్రజారాజ్య నేతల బాధను పూర్తిగా వ్యక్తం చేయలేవు. అయితే వారికి వున్న అవకాశాలేమిటనే ప్రశ్న అంతకన్నా ముఖ్యమైంది.చిరంజీవి పార్టీని లీనం చేయడమే అనివార్య పరిస్థితుల్లో తన వెనక వున్నవారిని తనే నాయకుడుగా మిగలడానికి చేసిన పని. ఇప్పుడు జగన్‌ వెనక వున్న వారే పాలక పక్షం ఆకర్షణలో లాగేయబడుతుంటే ఉనికిని వదులుకున్న పిఆర్‌పి చేయగలిగింది స్వల్పం. కాకుంటే ఏ కారణంతో లీనమైనారో ఆ పరీక్షా సమయం వచ్చింది గనక సన్నివేశానికి తగినట్టు బెట్టు చూపించి మెగాస్టార్‌ రక్తి కట్టించారు. ఎలాగూ కాంగ్రెస్‌తో రాజీకి రాకపోతే జగన్‌ విషయంలో జరిగిందే తమ పార్టీ విషయంలోనూ జరుగుతుందని ఆయనకు బాగా తెలుసు. గులాం నబీ ఆజాద్‌ తప్ప ఇతర పార్టీల నాయకులెవరూ చిరంజీవితో మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే కారణమదే.అలాగే టిఆర్‌ఎస్‌ నేతలు గాని, కోదండరామ్‌ గాని పిలుపునిచ్చినా కాంగ్రెస్‌ సభ్యులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి ముందుకు రాలేదు. కనక అవిశ్వాసం నెగ్గే అవకాశాలు దాదాపు కనిపించడం లేదనే చెప్పాలి. కనీసం ఈ పేరుతో ప్రజా సమస్యలపైనైనా సమగ్ర చర్చ జరిగితే పదివేలు. అయితే సాధారణంగా ఇలాటి చర్చల్లో రాజకీయాలే ప్రధానమై సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రధానమై పోవడం కద్దు. ఖచ్చితమైన ముగింపు సోమవారం. అయితే ఈ తీర్మానం వీగిపోయినా అది ప్రభుత్వానికి గొప్ప సుస్థిరత తెస్తుందని అనుకోవడానికి లేదు.

Tuesday, November 29, 2011

రాష్ట్ర రాజకీయాల్లో తాజా మలుపులు



ఊహించనివి కాకున్నా రాష్ట్ర రాజకీయాల్లో తాజా మలుపులు చాలానే వున్నాయి. ఎవరి కోణం నుంచి వారు మాట్లాడినా ఎవరూ కాదనలేని వాస్తవాలూ కొన్ని వున్నాయి. ఏ రాజకీయ పార్టీ పెద్దగా ఆనందించే పరిస్తితి ఇప్పుడు లేదన్నది మొదటి విషయం. వ్యక్తిగతంగా ఏడాది పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొంచెం సంతోషించవచ్చునేమో గాని అసలు సవాళ్లు ఇప్పటి నుంచే మొదలవుతాయని ఆయనకు బాగా తెలుసు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలన అని నన్ను వ్యాఖ్యానం అడిగినప్పుడు ఆయన గురించి చెప్పొచ్చు గాని పాలన అనడానికేమీ లేదని చెప్పాను. ఇక ముందైనా ఆ స్థితి మారుతుందేమో చూడాలి. కాకపోతే ఆయన నిలదొక్కుకోవడానికి సీనియర్‌ మంత్రులెవరూ సహకరించడం కాంగ్రెస్‌ సంసృతిలో జరగని పని. కనక ఆయన పాట్లు ఆయన పడుతున్నారు .ప్రచారానికి కోట్టు పెడుతున్నారు. పనులు జరిగినా జరక్కున్నా పథకాల జాతర సాగిస్తున్నారు.ఈ సమయంలో తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ఆలోచన చేస్తున్నా అది నెగ్గే అవకాశం లేదు. తద్వారా ప్రభుత్వాన్ని వెన్నాడే అస్థిరత్వం పోయిందని చెప్పుకునే అవకాశం కలగవచ్చు. సభ బయిట సమీకరణలు ఎలా వున్నా సభలో మాత్రం జగన్‌ వర్గం సవాలు ఉధృతి తగ్గిపోవడం కనిపిస్తున్నా వాస్తవం.ఇప్పుడే స్పీకర్‌ కూడా మూకుమ్మడి రాజీనామాలను తిరస్కరించి సంబంధిత సభ్యుల నెత్తిన పాలు పోశారు. వీటిని ఆమోదిస్తారని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు కూడా. పార్టీలు మార్చిన, పట్టు పట్టిన సభ్యుల రాజినామాలనే ఆయన ఆమోదించినట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో స్పీకర్‌ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించే వారు పదే పదే రాజీనామాలను ప్రయోగించే తమ వైఖరిని కూడా ప్రశ్నించుకోవలసి వుంటుంది.ప్రజలకు ఏ మేలు చేయని రాజినామాలు ఉప ఎన్నికలలో మునిగి తేలడం వ్యర్థ ప్రక్రియ మాత్రమే.ఇప్పుడైనా పార్టీలు ప్రజల సమస్యలపై చర్చిస్తే మేలు. చివరగా పార్లమెంటులో బిజెపి కాంగ్రెస్‌లు టిఆర్‌ఎస్‌కు సహకరించే అవకాశం మాయమైంది. నిజానికి బిజెపి టిఆర్‌ఎస్‌ వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయి. జెఎసి భారం తనే మోయడానికి కూడా టిఆర్‌ఎస్‌ సిద్దంగా లేదు.ఏతావాతా ఎన్నికల కోసం ఎదురు చూడటమే జరిగేట్టు కనిపిస్తుంది.

చిల్లర బతుకులు ఛిద్రం


ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, ఉపాధి రాహిత్యం వంటి సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే పాలకుల చర్యలన్ని బతుకులను మరింత చితగ్గొట్టేవిగా వుంటున్నాయి. పెన్షన్‌ సంస్కరణలు, చిల్లర వ్యాపారంలో వాటికి ద్వారాలు తెరవడం పరిస్తితిని మరింత దిగజార్చడానికే దారి తీయడం అనివార్యం. 2004 ఎన్నికల ప్రణాళికలో చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను ప్రవేశపెడతానని ప్రకటించిన బిజెపి ఎన్‌డిఎ కూడా ఇప్పుడు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయంటే పరిస్తితి తెలుస్తుంది.
మధ్యతరగతి ఉద్యోగులు జీవితమంతా శ్రమించి నిల్వ చేసుకున్న పెన్షన్‌పై అనేక విధాల దాడి చేయడమే గాక దాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌కు మళ్లించడానికి నిర్ణయించడం, అందులోనూ విదేశీ పెట్టుబడులను అనుమతించడం దారుణమైంది. ఆ దె బ్బ నుంచి కోలుకునేలోగానే చిల్లర వ్యాపారంలో వాల్‌మార్ట్‌ వంటి బహుళ జాతి తిమింగళాలను స్వాగతించాలని నిర్ణయించారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికులకు స్వయం ఉపాధి కలిగిస్తున్న ఈ రంగంలో వాటిని రానివ్వడం అత్యంత వినాశకరమైన నిర్ణయం.ప్రస్తుతం వున్నదే ఉపాధి రహిత అభివృద్ధి. ఇందులో యాభై శాతం వరకూ స్వయం ఉపాధి వుందని కేంద్ర గణాంక శాఖ లెక్కలు. కొత్తగా ఉపాధి కల్పించకపోగా వున్నది కూడా హరించుకుపోవడానికి కేంద్రం నిర్ణయం దారితీస్తుంది.ముప్పయి శాతం సరుకులు దేశంలోనే చిన్న మధ్య తరహా సంస్థల దగ్గర తీసుకోవాలనే నిబంధన ఒక రక్షణగా చెప్పారు. అయితే అది దేశీయ సరుకులకే పరిమితం కాదని తర్వాత వివరణ

Thursday, November 24, 2011

అమానుష రాజకీయ బంధాల అనివార్య పరిణామం

మల్లోజుల కోెటీశ్వరరరావు అలియాస్‌ కిషన్‌జీ జంగల్‌ మహల్‌ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందడం సహజంగానే మీడియాలో పతాకశీర్షికలనాక్రమించింది. దీనిపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. కరీం నగర్‌లో ఆయన పుట్టిన వూరు కన్నవారు తదితర వివరాలతో పాటే మావోయిస్టు అగ్రనాయకుడుగా ఆయన పాత్రను కూడా అభివర్ణించే విశేషాలు అనేకం వచ్చాయి. కొన్ని పత్రికలు దీనిపైకథనాలు,వ్యాసాలు గుప్పించాయి. మావోయిస్టులతో చేతులు కలిపి మార్క్సిస్టు పార్టీని, వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అనేక కుట్రలు సాగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తుంచేసినట్టుగానే మాట్టాడారు. నిజానికి అధికారంలోకి రావడానికి గాను మావోయిస్టుల దాదులకు హత్యాకాండకు వత్తాసు నిచ్చిన ఆమె ముఖ్యమంత్రి కాగానే వారికి హెచ్చరికలు సవాళ్లు చేయడం మొదలు పెట్టారు.మావోయిస్టులు కూడా తమ పాత బంధాన్ని మర్చిపోయినట్టు మమత వర్గ స్వభావం గురించి వ్యాఖ్యానాలు ఆరంభించారు.అంటే వారి మధ్య రాజకీయ బంధం ఎందుకు ఏర్పడిందో ఆ అవసరం తీరిపోయిందన్న మాట. ఈ అమానుష బంధం అనివార్యంగా కిషన్‌జీ కాల్చివేతకు దారి తీసిందనేది ఇక్కడకాదనలేని వాస్తవం. బెంగాల్‌ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సూర్యకాంత్‌ మిశ్రా తన స్పందనలో కిషన్‌జీని ప్రాణాలతో పట్టుకుని వుంటే బాగుండేదని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాననని అన్నారు. ఈ ఒక్క ఘటన వల్ల మావోయిస్టుల ప్రమాదకర వ్యూహాలలో పెద్ద మార్పు వస్తుందని తాము అనుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే సిపిఎం ఏనాడూ మావోయిస్టు సమస్యకు బూటకపు ఎన్‌కౌంటర్లు లేదా కాల్చివేతలు మార్గమని భావించలేదు.
వ్యక్తిగతంగా కిషన్‌జీ నేపథ్యం ఏమైనప్పటికీ ఆయన మావోయిస్టు మారణ యంత్రంలో కీలక పాత్రధారిగా పనిచేశాడు. గనక ఆ కోణంలోనే అర్థం చేసుకోవలసి వుంటుంది. కిషన్‌జీ మృదు స్వభావం, కవితా హృదయం, సాహసికత వగైరాలపై ఆయన అభిమానులు అనేకం చెప్పారు. దేశ ప్రజలకు ఆయన గురించి బాగా పరిచయమైంది మాత్రం

Wednesday, November 23, 2011

దర్యాప్తులు, ద్వంద్వనీతులు





ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంతోషించే తరుణం. ఇప్పుడే ఆయనకు ప్రధాన ప్రత్యర్థులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉభయులూ న్యాయ పోరాటాలు, దర్యాప్తుల వ్యవహారంలో చిక్కుకోవడం ఒక విచిత్రమైన పరిణామం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం చర్చ కూడా వెనక్కు పోయింది. ఈ ముగ్గురిలో తక్కిన ఇద్దరూ కుమ్మక్కయినట్టు మూడోవారు ఆరోపిస్తుంటారు గాని వాటిని ప్రజలు అంతగా పట్టించుకోరు. అలాటి అవసరార్థపు అదృశ్య అవగాహనలున్నా పెద్ద ప్రాధాన్యతా వుండదు.
తెలుగు దేశం అధినేత ఆస్తులపై దర్యాప్తు జరపాలన్న హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర రాజకీయాలలో కొత్త సంచలనం తీసుకొచ్చాయి. ఇందిరా గాందీ ఎన్నిక రద్దుతో సహా - కోర్టుల తీరు ఎప్పుడూ ఆలాగే వుంటుంది. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగివున్నందున దాని నిర్ణయాలపై ఎవరూ వ్యాఖ్యానించరు. తమ వాదన వినకుండానే విచారణకు ఆదేశాలిచ్చారన్నది ఇక్కడ తెలుగుదేశం ప్రధాన ఫిర్యాదు. సాంకేతికంగా చూస్తే జగన్‌ కేసులోనూ సిబిఐ సీల్డు కవరు ఉపయోగించకుండానే నిర్ణయం ప్రకటించినట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా బహుళ సంస్థల ద్వారా ప్రాథమిక దర్యాప్తు జరిపించి అలాగే చెప్పొచ్చు. తెలుగు దేశం నేతలు తమపై విశేష ప్రభావం చూపే ఈ కేసులో జోక్యానికి ముందే ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. స్టేలు తెచ్చుకుంటారన్న విమర్శకు వెరిచి వెనకడుగు వేశారా లేక తేలిగ్గా అంచనా వేశారా? మొత్తంపైన ఈ పరిణామంతో వారిలో కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రాంతీయ సమస్యనుంచి ఎలాగో బయిటపడ్డామన్నంతలో ఇది చుట్టుకుందన్న దిగులూ వెంటాడుతుంది.సుప్రీం కోర్టు ఆదేశాలు అనుకూలమా కాదా అన్నదానిపైన కూడా భిన్నమైన అంచనాలున్నాయి.

ఇప్పటికే కొనసాగుతున్న ఒఎంసి, ఎమ్మార్‌, జగన్‌ కేసుల దర్యాప్తుల్లో చాలా అంశాలు వస్తున్నాయి. దర్యాప్తు సాగేకొద్ది

Sunday, November 20, 2011

కొత్త మలుపుల మధ్య కొలువు తీరే చట్టసభలు


జగన్‌ ఆస్తులపైన గాలి జనార్ధన రెడ్డి మైనింగ్‌ అక్రమాలపైన దర్యాప్తు సాగిస్తున్న సిబిఐ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపైన కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నది. హైకోర్టు ఆదేశాలు ఆకస్మికంగానూ అనూహ్యంగానూ రాష్ట్ర రాజకీయాలలో కొత్త సంచలనం సృష్టించాయి. ఇందిరాగాందీ ఎన్నిక రద్దు నుంచి ఇప్పటి వరకూ కూడా న్యాయస్థానాల ఆదేశాలు తీర్పులు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజా జీవితంలో ప్రభుత్వాల నిర్వహణలో కీలక పాత్రధారులైన నాయకులపైన ఆరోపణలు వచ్చినపుడు విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చడం అవసరమే. ఈ విషయంలో కోర్టుల ఆదేశాల వరకూ ఎవరూ వేచి వుండనవసరం లేదు న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగివున్నందున దాని నిర్ణయాలపై వ్యాఖ్యానించడం అరుదుగా తప్ప జరగదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాలు ౖ తీవ్ర ఆరోపణలు విమర్శలున్న మాట నిజం. రెండు సార్లు ఆయన ఎన్నికల్లో దెబ్బ తినడం వెనక ఈ ప్రభావాలు కూడా వుంటాయి. అయితే న్యాయశాస్త్ర పరంగా వీటిపై గతంలో కాంగ్రెస్‌ నాయకులు అనేక సార్లు కేసులు వేసి విఫలమైనారని తెలుగు దేశం నేతల వాదన. అది నిజమే అయినా ఇప్పుడు న్యాయ స్థానమే ఇలాటి ఆదేశాలిచ్చింది గనక ఆహ్వానించడం తప్ప గత్యంతరం లేదు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తారా లేదా అన్నది వారి అంచనాలపైన ఆలోచనల పైన

Friday, November 18, 2011

పునరాలోచనలో జగన్‌ వర్గీయులు



రెండేళ్ల కాలంలో జగన్‌ వర్గం బలహీనపడి పోవడం ఇప్పుడు దాచినా దాగని సత్యంలా కనిపిస్తున్నది. 150 మంది సంతకాలతో మొదలైన ఆయన యాత్ర ఇప్పుడు అందులో రెండంకెలకు పరిమితమై పోయినట్టే చెప్పాలి. జయసుధ అయితే దాగుడుమూతలు లేకుండా ముఖ్యమంత్రిని బలపరుస్తున్నట్టు స్పష్టంగా చెప్పేశారు. బాగా గట్టిగా నిలబడేవారిగా పేరొందినవారు కూడా స్పీకర్‌ నిర్ణయానికి కట్టుబడతామన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోయే స్తితి వుంటేనే బలపరుస్తామని వారిలో ఒకరన్నారు. స్పీకర్‌ కార్యాలయం ఈ ఎంఎల్‌ఎలు రాజీనామాల విషయంలో పట్టుదలగా లేరనీ పిలిస్తే రావడం లేదనీ కథనాలు విడుదల చేసినా ఒక్కరంటే ఒక్కరు నేరుగా ఖండించలేదు(ఇది రాసే సమయానికి) ఇదంతా నిస్పందేహంగా వూపు తగ్గడాన్నే సూచిస్తుంది. నా దయాదాక్షిణ్యాల వల్ల ప్రభుత్వం బతుకుతున్నదనీ మొదట, ఇంకా బతకనిస్తే దేవుడు క్షమించడాని తర్వాత వ్యాఖ్యానించిన జగన్‌ క్రమేణా తన బలం చాలదని కూడా బహిరంగంగానే చెప్పారు.అయినా తమ వెంట రాజీనామా చేసిన వారే గాక మొత్తం అరవై మంది వరకూ వున్నారని ఆ పార్టీ నేతలు సర్వసాధారణంగా చెబుతూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు వాస్తవం కాకపోగా వున్నవారంతా కూడా నిలబడటం లేదని అర్థమవుతున్నది.తెలుగుదేశం వైఖరి ఇందుకు కారణమని వైఎస్‌ఆర్‌ పార్టీ వారు చేసే వాదన తర్కవిరుద్ధమైంది. తమ ప్రధాన ప్రత్యర్థి తమ వ్యూహం అవసరాల మేరకు నడుచుకోలేదని చెప్పడం రాజకీయాల్లో చెల్లదు. జగన్‌పై కేసుల దర్యాప్తు వగైరాలే ఇందుకు కారణమై వుండాలి. జగన్‌ వర్గం మెత్తబడిన తర్వాత తెలుగుదేశం అవిశ్వాసం రాజకీయ ప్రదానమే తప్ప పడగొట్టేంత దృశ్యం వుండదు. కనక ప్రస్తుతానికి కిరణ్‌ కుమార్‌కు గండం లేనట్టేనా?

Monday, November 14, 2011

ఇక న్యాయస్థానాలు, దర్యాప్తుల పోరాటం?



మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవాద్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తు జరిపించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడం ఆసక్తికరమైన పరిణామం. ప్రజా జీవితంలో పారదర్శకత న్యాయస్థానాల పట్ల గౌరవం కోణాల నుంచి ఈ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సి వుంటుంది. తెలుగు దేశం నేతలు కూడా ఆహ్వానిస్తూనే సుప్రీం కోర్టుకు వెళ్లడంపైన కూడా ఆలోచనలు చేయడం సహజమే. ఇప్పటికే జగన్‌ గాలి జనార్థనరెడ్డి కేసుల దర్యాప్తుతో ఉత్కంఠ భరితంగా వున్న రాజకీయాలలో మరో దర్యాప్తు ప్రవేశించింది. గత రెండేళ్ల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలు రకరకాలైన పోరాటాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మొదట ఎన్నికల పోరాటం. వైఎస్‌ మరణానంతరం అధికార పక్ష అంతర్గత పోరాటం. తర్వాత ప్రాంతీయ పోరాటం. ఇప్పుడు న్యాయస్థానాలు దర్యాప్తుల పోరాటం మొదలైనట్టు కనిపిస్తుంది. మంత్రి శంకర రావు 2010 సెప్టెంబరులో కేసు దాఖలు చేస్తే 2011 జులై వరకూ వాదోపవాదాలకు అవకాశమిచ్చిన నేపథ్యంలో అసలు తమ వాదనలు వినకుండానే ఆదేశాలివ్వడం సహజ న్యాయానికి విరుద్ధమని తెలుగు దేశం వాదిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులు ఉన్నత న్యాయ వ్యవస్థ ఏమంటాయో

Sunday, November 13, 2011

ప్రధాని ప్రకటన - ఒక ఘట్టానికి ముగింపు?


ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దాదాపు సూటిగానే చేసిన వ్యాఖ్యలపై  ఎవరు ఎలా స్పందిస్తారు అన్నది వారి వారి వైఖరిపై ఆధారపడి వుంటుంది. రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని వెంటాడిన రాజకీయ ప్రతిష్టంభన, అన్ని జీవిత రంగాల్లోకి చొరబడిన స్తబ్దత, అచేతనత్వం నిస్సందేహంగా కేంద్రం సృష్టించినవే.
ప్రధాని చెప్పిన మాటలు కొత్తవేమీ కాదు. ఎవరికీ తెలియనవీ కావు. 1.తెలంగాణాపై తీసుకునే నిర్ణయానికి జాతీయ ప్రభావం వుంటుంది.2.ప్రశాంత పరిస్తితులు నెలకొనకుండా పరిష్కారం చేయలేము 3. దీనిపై జాతీయ సంప్రదింపులు అవసరం 4.పరిష్కారం పెనంమీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా వుండకూడదు. - ఇవి ఆయన చెప్పిన దానిలో నాలుగు అంశాలు. అంటే రాష్ట్ర విభజన గాని,రాజ్యాంగ ఏర్పాటు గాని చేయబోవడం లేదని దీన్నిబట్టి స్పష్టం అవుతున్నది. గత వారంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు పరిపరివిధాల మాట్లాడిన దాన్నే ప్రధాని క్రోడీకరించారని చెప్పాలి. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్రంతో చెలగాటమాడడం ప్రజలను అనిశ్చితికి గురి చేయడం కేంద్రం దోషమైతే దానిపై కొండంత నమ్మకంతో వుండటం ఇతరుల దోషం. ప్రధాని ప్రకటన తర్వాత టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.సి.ఆర్‌. శాపనార్థాలు పెట్టారు గాని తమకేవో సంకేతాలు అందతున్నాయని ఎప్పటికప్పుడు ఎందుకు చెప్పారనేదానికి ఆయన కూడా సమాధానం చెప్పవలసే వుంటుంది. నవంబరులో విభజన జరిగిపోతుందని ప్రకటించిన కోదండరామ్‌ కూడా ఆ పొరబాటుకే జవాబుదారి కాకతప్పదు.
నా వరకు నేను 2009 డిసెంబరు 10న ఎన్‌టివి చర్చలోనే అంతకు ముందు రాత్రి చిదంబరం చేసిన ప్రకటన పరిమితులు చెప్పాను, అది అంతిమ వాక్యం కాదనీ అన్నాను. దేశంలో పాలకవర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ తీరుతెన్నులు అలానే

స్పీకర్‌ నిర్ణయం సామూహికంగా వుండకపోవచ్చు




నాగం జనార్థనరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి రాజీనామాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆమోదించడం వూహించదగిందే. ఈ రాజీనామాలు తెలుగు దేశం పార్టీ నుంచి నిష్క్రమణల ఫలితాలు, ఫిరాయింపుల చట్టంతో ముడిపడినవి కూడా. ఇవి ఆమోదించినంత మాత్రాన మిగిలిన 80 మందివి కూడా గుండుగుత్తగా ఒప్పేసుకుంటారని కాదు. ప్రాంతీయ సమస్యపైన ఉద్వేగాలతో రాజీనామా చేసిన వారందరివీ ఒప్పుకుంటే సభలో మూడో వంతు వరకూ ఖాళీ అయిపోతుంది. ఇందులో టిఆర్‌ఎస్‌ వారు రాజీనామా చేసి మళ్లీ గెలిచి వచ్చారు. వారు కొత్తగా నిరూపించవలసింది ఏమీ లేదు.కాంగ్రెస్‌ తెలుగు దేశం సభ్యులు రాజీనామాలిచ్చినా వాటికోసం పట్టుపట్టకపోవచ్చు.ఇక జగన్‌ వర్గం 29 మంది పరిస్థితి కీలకమవుతుంది. వీరు కూడా తటపటాయింపులో పడినట్టే. తమ రాజీనామాలతో ప్రభుత్వం అస్థిరత్వానికి గురవుతుందన్న అంచనా ఆనాడు వుండొచ్చు గాని అలా జరగలేదు. జగన్‌ పై కేసుల దర్యాప్తు వగైరాల వల్ల ఒక విధమైన ఆత్మరక్షణ స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం కొంత వరకూ నిలదొక్కుకుంది. ప్రాంతీయ కల్లోలాలు కూడా కొంతైనా సర్దుకున్నాయి.ఇలాటప్పుడు రాజీనామాల పేరిట అధికారానికి దూరమయ్యేబదులు క స్పీకర్‌ పేరిట తప్పించుకోవచ్చు. జగన్‌కు బాగా సన్నిహితులైన అర డజను మందిని మినహాయిస్తే తక్కిన వారంతా ఈ మార్గానికే మొగ్గుచూపే అవకాశం వుంది.ఇక మనోహర్‌ సామూహికంగా రాజీనామాలు ఆమోదించేసి కొత్త దృష్టాంతాలు సృష్టించరనే అనుకోవాలి. ఆయన నిర్నయాన్ని ముందస్తుగా నిర్దేశించే అవకాశం ఎవరికీ వుండదు గనక వేచి చూడవలసిందే.

Friday, November 11, 2011

జగన్‌పై దర్యాప్తులో మలుపులు, మరకలు



జగన్‌ సంస్థల విలువను డెలాయిట్‌ కంపెనీ పెంచి చూపించడానికి వారి ఆడిటర్‌ విజయసాయి రెడ్డి ఒత్తిడి లేదా అభ్యర్థన కారణమని సిబిఐ ముందు సంస్థ ప్రతినిధి సుదర్శన్‌ వాంగ్మూలమిచ్చారని మీడియా కథనం. ఇది సిబిఐ ఎలా లీక్‌ చేస్తుందని విజయ సాయి ప్రశ్న. అంతేగాక తాను అలా కోరలేదని ముఖాముఖి చర్చకు సిద్దమని కూడా సమర్థించుకుంటున్నారు. ఈ లేఖపై స్పందించాల్సింది సిబిఐ తప్ప ఇతరులు చెప్పగలిగింది లేదు. అయితే అదే లేఖలో ఆయన వ్యాపారాలలో విలువలు పెంచి చూపించడం మామూలేనని కూడా పేర్కొనడం గమనించదగ్గది.అదే నిజమైతే అప్పుడు ఇంత స్పందన అవసరముండేది కాదు. రాజకీయ కోణం నుంచి ఖండించడమే ఇక్కడ ముఖ్యం. అమెరికాలో ఎన్రాన్‌ కుంభకోణం నుంచి మన సత్యం కుంభకోణం వరకూ ఆడిటర్ల పాత్ర చాలా కీలకమని వారే ఎక్కువ విచారణకు గురయ్యారని గుర్తు చేసుకుంటే ఇంత చర్చ అవసరమనిపించదు. ఇక సిబిఐ లీక్‌ చేయడానికి వస్తే- గాలి కేసులో జగన్‌ను సాక్షిగానే పిలిచారని ఆయనకు ఏమీ కాదని ఇదే వైఎస్‌ఆర్‌ పార్టీ వారు అదేపనిగా చెప్పుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యమని అంత నమ్మకం దేనికని నేను చాలా చర్చల్లో ప్రశ్నించాను. ఆ విచారణ తర్వాత ఆయన బయిటకు వచ్చి చెప్పిన దానిపైనా అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇడి కూడా విచారించబోతున్నది. వ్యాపార పరమైన ఆర్థిక పరమైన లావాదేవీలలో అవకవతవకలు అక్రమాలకు రాజకీయ మద్దతుకు సంబంధం లేదని ఎవరైనా ఒప్పుకోవాలి. జగన్‌ వర్గం తరచూ రామోజీని లేదా రాధాకృష్ణను ప్రస్తావిస్తుంటుంది. కాని ఇక్కడ అధికారం ముఖ్యమంత్రి స్థానం అన్నవి కీలకంగా వున్నాయని గమనిస్తే ఈ కేసు ప్రత్యేకత తెలుస్తుంది.దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప ఇతరుల తప్పులు ఎత్తి చూపినంత మాత్రాన మరొకరి తప్పులు ఒప్పుగా మారవు. ఇప్పుడు విజయమ్మ కేసులో కోర్టు ఏదైనా చేయొచ్చు. అలాగే మార్గదర్శి విషయంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలను ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు అవి ఏ స్తితిలో వున్నాయో తెలియదు. కార్పొరేట్‌ ప్రపంచ అక్రమాలపై ఇదే బ్లాగులో చాలా ప్రస్తావనలున్నాయి.వైఎస్‌పై ఎవరికి ఎంత అభిమానమున్నా ఆ హయాంలో జరిగిన అవకవతవకలను విచారించడానికి అది ఆటంకం కానవసరం లేదు. ఇదంతా కక్ష సాధింపుగానే కొట్టేయడమూ కుదరదు. అదే నిజమైతే నిజమని రుజువైతే మరీ మంచిది. కాని అ సంగతి చెప్పాల్సింది ఆయన అనుయాయులు కాదు, కేసు నడిపిస్తున్న న్యాయస్థానాలూ, విచారిస్తున నిఘా సంస్థలూ.

Thursday, November 10, 2011

ఇక ఎస్సార్సీ ముచ్చట



ఈ రెండు రోజులలోనూ కేంద్ర కాంగ్రెస్‌ తరపున ఇద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడినప్పటికీ సారాంశంలో పెద్దగా తేడా లేదు.రాష్ట్ర విభజన తెలంగాణా ఏర్పాటు జరిగిపోతుందన్నట్టుగా కొందరు చేసిన వూహాగానాలు జోస్యాలు నిజం కావడం లేదని క్రమంగా స్పష్టమవుతున్నది. ఆ విషయం అలా వుంచి రాష్ట్ర భవిష్యత్తుపై ఎలాటి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా కనిపించడం లేదు. డి.శ్రీనివాస్‌తో లేదా మరొకరితో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయొచ్చన్న మాట మాత్రం కాంగ్రెస్‌ ఎంపిలు, ఎంఎల్‌ఎలు జనాంతికంగా చెబుతున్నారు. అందుకు ఒప్పుకునేది లేదంటూనే అసహాయత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తీవ్రమైన చర్యలేమీ తీసుకుంటామని వారిలో ఎక్కువ మంది చెప్పడం లేదు.
ఇంతకూ కాంగ్రెస్‌ ఎస్‌ఆర్‌సి గురించి చెప్పే మాటలు తెలంగాణా సమస్యకు వర్తిస్తాయా లేదా ? ఈ ప్రశ్నకు ఆ మాట్లాడిన నాయకులు కూడా జవాబు చెప్పలేరు. కావాలనే అంత గందరగోళంగా వ్యాఖ్యలు చేశారు. ఆజాద్‌ చెబుతాడని వాళ్లన్నారు. అయితే ఆజాద్‌ మాత్రం ప్రభుత్వం తరపున హౌం మంత్రి చేసే ప్రకటనే కాంగ్రెస్‌ అధికార వైఖరి అన్నారు.అంటే ఇప్పటికీ ఇన్ని అనర్థాలు అనిశ్చితుల తర్వాత కూడా కాంగ్రెస్‌ రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ వైఖరిని చెప్పబోవడం లేదన్నమాట.గత అరవై ఏళ్లలో అన్ని చోట్లా అన్ని సందర్బాల్లో ఆ పార్టీ ఇలాగే ప్రవర్తించింది. ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో మరింత ఎక్కువగా. ఇదమిద్దంగా ఏమీ చెప్పకుండా డాటేయడమే కాంగ్రెస్‌ మార్కు రాజకీయమన్నమాట. ఈ దశ లో దీనిపై ఇంతకన్నా మాట్లాడాల్సింది లేదు. కాకుంటే కేంద్రం మీద అపారమైన నమ్మకంతో తేదీలు ప్రకటించిన వాళ్లు, గడువులు ప్రకటించిన వాళ్లు కూడా ఈ విషయంలో కాస్తయినా అత్మ విమర్శ చేసుకుంటారా?
చివరగా మాయావతి విషయం. ఇన్నేళ్లు పాలించినప్పుడు తీసుకోని నిర్ణయం ఎన్నికల ప్రాంగణంలో ఎందుకు వచ్చిందంటే ఎన్నికల కోసమే! మమతా డార్జిలింగ్‌(గూర్ఖాలాండ్‌)విషయంలో ఎన్నికల ముందు తర్వాత చేసింది ఇంతకన్నా భిన్నమేమీ కాదు. ఇప్పుడు ఎస్‌ఆర్‌సి వేసేస్తారని కాదు.మరో ఏడాదో ఆరు నెలలో దాని చుట్టూ చర్చ తిప్పుతారంతే. ప్రాంతీయ కమిటీకి గాని ఎస్సార్సీకి గాని తెలంగాణా నిర్ణయంతో సంబంధం లేదని నమ్మబలుకుతుంటారు కూడా. ఈ గజిబిజి రాజకీయ అనిశ్చితికి ప్రజల ఆందోళనకు ఎలా కారణమవుతుందనేది వారికి ఏ మాత్రం అవసరం లేదు. అందుకే ప్రాంతాల పేరిట రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి.

మరో చరిత్రారంభం...

. కార్పొరేట్‌ స్వాప్నికుల కలలు కల్లలై కల్లోలాలు చుట్టుముడుతున్నాయి. చరిత్రాంతం భాష్య కారుల నోళ్లు మూత పడుతున్నాయి. మహా కథనాల మహా ప్రస్థానం మళ్లీ మొదలవుతున్నది. జోస్యాలన్ని అపహాస్యాల పాలవుతున్నాయి. విత్త విపణి విన్యాసాలన్ని వీగిపోతున్నాయి. ప్రతిఘటననూ ప్రజా చైతన్యాన్ని అపహాస్యం చేసిన అపర మేధావుల తలలు వాలిపోతున్నాయి. ఇవన్నీ నిజమేనా అనే సందేహ మందేహులుంటూ వాల్‌ స్ట్రీట్‌ దృశ్యాలు సమాధానం చెబుతున్నాయి.అక్కడిదాకా ఎందుకంటే కటకటాల్లో విఐపి హౌదా పొందిన గాలి జనార్ధనరెడ్డి ఇనుప సత్యాలను చెప్పడానికి సిద్దంగా వున్నాడు.అక్కడికీ అనుమానం తీరకపోతే తమిళ పొన్ను కనిమొళి కరుణార్ద్ర ఘట్టం కళ్లకు కడుతున్నది. సత్యం రామలింగరాజు స్వానుభవ కవిగా అందుబాటులో వున్నాడు. విదియ నాడు కనిపించని చంద్రుడు తదియ నాడు తానే కనిపించినట్టు ప్రపంచీకరణ పేరిట మొదలై నిరాఘాటంగా కొనసాగిన నిలువు దోపిడీ నిర్వాకాలకు నిదర్శనాలుగా ఇలాటివి ఎన్నయినా చూపించవచ్చు.ఈ నిలువు దోపిడినే శాశ్వతమని విశ్లేషించిన విపరీత సిద్ధాంత కారులకు సమాధానం వాల్‌స్ట్రీట్‌ నుంచి మంగళవారం భారత కార్మిక వర్గం అఖిల భారత సమ్మె పోరాటం వరకూ ప్రతి చోటా లభిస్తున్నది. చరిత్రాంతం కాదు, సరికొత్త సమర శీల చరిత్రకు అంకురార్పణ జరుగుతున్నది.
అమెరికా ప్రస్తుతానికి ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం వుగ్ర రాజ్యం కూడా గనక- పోలీసు తలారి న్యాయమూర్తి కూడా గనక - అక్కడ పరిణామాలకు ప్రత్యేక ప్రాధాన్యత. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రపంచమంతటా ప్రచార ప్రకంపనలే. అయితే అమెరికా ప్రపంచ దేశాలను వరుసగా అక్రమిస్తుంటే లేదా అక్కడే వాల్‌ స్ట్రీట్‌ ను అక్రమించడమేమి చిత్రం? ఎవరో ఇస్లామిక్‌ టెర్రరిస్టులు వచ్చి దాడి చేయకుండా ప్రతిచోటా తలదూర్చే ఆ మహాదేశాధినేతలు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ దారుల ధాటికి

Saturday, October 29, 2011

రాజు బూజు ఘనం! రాష్ట్ర ఏర్పాటు ద్రోహం!!



తెలంగాణా పేరిట నాటి నిజాం రాజు నిరంకుశత్వాన్ని ఈనాటి కార్పొరేట్‌ రాజకీయాన్ని కూడా సమర్థించడం ద్వారా టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర రావు గతాన్ని వర్తమానాన్ని కూడా గందరగోళ పరచేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాడు ఆయన పోలవరం టెండర్లపై పత్రికాగోష్టిలో చేసిన వ్యాఖ్యలు, అదే రోజు సాయింత్రం ఒక పుస్తకావిష్కరణ సభలో వెలిబుచ్చిన భావాలు ఆ దిశలోనే వున్నాయి.

తెలంగాణా సంసృతి, చరిత్రల గురించి పదే పదే ప్రస్తావించే కెసిఆర్‌ వంటి వారు ఆ చరిత్రను ఆజరామరం చేసిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని గౌరవించేవారైతే ఇలా జరిగేది కాదు. విగ్రహాల విషయం వచ్చినప్పుడు అయిలమ్మ, కొమరయ్యల పేర్లు స్మరించేవారు నిజంగా వారు ఎవరిపై ఎందుకు పోరాడారో తెలియనట్టు నిజాంను కీర్తిస్తున్నారని అనుకోలేము.
ఓ నిజాం పిశాచమా! కానరాడు
నిన్ను పోలిన రాేజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ అని దాశరథి నిజాం జైలు గోడలపై బొగ్గుతో రాశాడు! మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నిప్పులు కక్కాడు.
చుట్టుపట్ట సూర్యాపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైద్రాబాదు
తర్వాత గోలకొండ
గోలకొండ ఖిల్లా కింద -
నీ గోరి కొడతాం కొడకో
నైజాం సర్కరోడా!
ఆనాడు తెలంగాణా పోరాట యోధుడైన ప్రజాకవి యాదగిరి రాసిన గీతం ఆయన తుపాకి గుళ్లకు నేలకొరిగినా ఇప్పటికీ జనాన్ని వుర్రూతలూగిస్తుంది.
నీ గోరికాడకొచ్చి
నేను మొక్త కొడకో అని పాడుకోవలసిన పరిస్థితి కెసిఆర్‌కు ఎందుకు కలిగింది? నాలుగేళ్ల కిందట ఆయన నిజాం వర్ధంతికి హాజరై ప్రశంసలు కురిపించినపుడు నిజమూ నిజామూ పేరిట రాసిన వ్యాసంలో నేను అడిగిన ప్రశ్న

Tuesday, October 25, 2011

సకల విరమణ.. తదనంతరం...?



ఊహించినట్టుగానే ఉచితమైన రీతిలోనే సకల జనుల సమ్మె 42 రోజుల తర్వాత విరామం తీసుకుంది. విరమణ అన్నా, విరామం అన్నా వాస్తవంగా వర్తమాన ప్రభావంలో పెద్ద తేడా ఏమీ వుండదు. రాజకీయ నాటకాలతో ఉత్పన్నమైన సమస్యలకు సంక్షోభాలకు ఉద్యోగుల సమ్మెలు పరిష్కారం చూపించలేవని ఈ బ్లాగులో రాయడమే గాక ఇతరత్రా కూడా స్పష్టంగానే చెబుతూ వచ్చాను. ఇది సమ్మెదార్లను తక్కువ చేయడం కాదు. సవాళ్లు సంక్లిష్టతల తీవ్రతను చెప్పడం మాత్రమే. వరుసగా వివిధ తరగతులు విరామం తీసుకోవడం అనివార్యమైన పరిణామం. ఈ వాస్తవాన్ని గుర్తించడంలో ఎవరూ ప్రతిష్టలకు పోనవసరం లేదు. అలాగే విరమించారు గనక విఫలమైనారని ఇతరులు భావించనవసరం లేదు. ఇలాటి విషయాల్లో జయాపజయాల లెక్కల కన్నా జన హితమే కొలబద్దగా పెట్టుకోవాలి. అయితే ఉద్యోగులైనా విద్యార్థులైనా రాజకీయ వాస్తవాలను ప్రాంతాల వారీ కోర్కెల పరిమితులను కూడా గమనంలోకి తీసుకోవడం అవసరం. రాజకీయ సమస్యను భావోద్వేగ భరితంగా మార్చి చూపించడం స్వార్థపర శక్తులకు ఉపయోగం తప్ప విశాల జనబాహుళ్యానికి కాదు. పాలకులు తల్చుకుంటే రాష్ట్ర విభజన చేయొచ్చు. ప్రస్తుతానికి వారు అలా అనుకోవడం లేదు. ఆ అవకాశం లేదని కూడా పదే పదే స్పష్టంగానే చెబుతున్నారు. రెండువారాల్లో వచ్చేస్తుందని కెసిఆర్‌ చెప్పినప్పుడు గాని నవంబరు 1 కి వస్తుందని కోదండరామ్‌ అన్నప్పుడు గాని అవి ఆధారరహితాలేనని అందరికీ తెలుసు. వారికి ఇంకా బాగా తెలుసు.సమ్మె విరమణకై విజ్ఞప్తి చేసిన ఆజాద్‌ వ్యాఖ్యలలో కూడా ఇసుమంతైనా కొత్త దనం లేదు. అన్నీగత వైఖరి పునరుద్ఘాటనలే. అయినా ఆ ప్రకటన పెద్ద ప్రధానమైందన్నట్టు చూపించడంలో వాస్తవికత శూన్యం. ఇప్పుడు నిరాహారదీక్షలు అంటున్నారు గాని ఇంత త్వరలో పరిస్థితులు మారిపోతాయిని అనుకోవడానికి ఆస్కారమే లేదు. కాకపోతే వూపు నిలబెట్టడానికి ఉపయోగపడొచ్చు. కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయ ప్రకటన వేగవంతం చేయడమే ఇప్పుడు జరగాల్సింది.

తెలుగు పీఠం వస్తున్నట్టేనా?






తెలుగు భాష ప్రాచీన హౌదా కోసం తీవ్ర పోరాటం తర్వాతనే ఆలస్యంగా కేంద్రం అందుకు అంగీకరించింది.ఆ నిధులు రాకముందే వాటి గురించి ఆలోచించే భాషా సేవకులు పలువురు రాష్ట్రంలో పోటీలు పడ్డారు. అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న తెలుగు విశ్వ విద్యాలయం ఈ బాధ్యత వహిస్తుందా లేక తెలుగు అకాడమీలోనో మరో దాంట్లోనో కలపాలా అని చర్చ మొదలైంది.ఈ లోగా కేంద్రం ఇందుకు సంబంధించి అధ్యయన పీఠాన్ని తీసుకెళ్లి మైసూరులో పెడుతున్నట్టు ప్రకటించి మరో వివాదానికి కారణమైంది.మైసూరులో భారతీయ భాషల అధ్యయన కేంద్రం వున్నమాట నిజమే గాని దాని పరిధి పద్ధతి వేరు. తెలుగును వారు సరిగ్గా పట్టించుకోరన్న విమర్శలూ వున్నాయి. అసలు తెలుగు భాష వికాసం కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాన్ని మరో రాష్ట్రంలో నెలకొల్పవలసిన అవసరమేమిటి? దీనిపై ప్రతిపక్షాలు భాషా వేత్తలు నిరసన తెల్పిన మీదట ఇప్పుడు హైదరాబాదులోనే దాన్ని నెలకొల్పాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సూచనలు వస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆ మేరకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అంతవరకూ మంచిదే. అసలు మైసూరులో నెలకొల్పాలన్నది ప్రాచీన భాషా విభాగమట. ప్రాచీన సాహిత్య విభాగం బేతవోలు రామబ్రహ్మం ఆచార్యత్వంలో హైదరాబాదు యూనివర్సిటీలో నెలకొల్పబడింది. ఇప్పుడు మైసూరు ఆలోచనే మానుకుని తరలి వస్తే మరీ మంచిది. అయితే ఈ కేంద్రం రావడం ఒకటైతే దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరొకటి. దుర్వినియోగాలు అరికట్టడం ఇంకోటి.కనక ప్రభుత్వం తెలుగు భాషాభిమానులు నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని భాషా వికాసానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశించాలి.

డిఎస్‌ రాకతో మూడవ కేంద్రం



కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీలో అంతర్గత కలహాలను ప్రోత్సహించి విభిన్న అధికార కేంద్రాలను ఏర్పాటు చేసే పని పున: ప్రారంభించింది. శాసనమండలికి పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్‌ను నియమించడం ఈ దిశలో మరో చర్య. ఇప్పటికే కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణల మధ్య సాగే ప్రచ్చన్న యుద్దం చాలనట్టు డిఎస్‌ కూడా తోడవువతారనడంలో సందేహం లేదు. ప్రాంతీయ కోణం ఈయన విషయంలో బలంగా వుంటుంది. లోగడ నిజామాబాద్‌లో గెలిస్తే పెద్ద మంత్రినవుతానని బాహాటంగా ప్రచారం చేసుకున్న డిఎస్‌ మనసులో మాట అందరికీ తెలుసు. పెద్ద మంత్రి కావడానికి ఎంఎల్‌ఎ ఎంఎల్‌సి ఏదైనా ఫర్వాలేదు! కనక ఇప్పటి నుంచి ఆయన ఆ పనిలో వుంటారు.ఇకపోతే తెలంగాణాలో పార్టీ ఎంఎల్‌లను దారికి తెచ్చుకోవడానికి జానారెడ్డిపై ఆధారపడటానికి లేదని భావిస్తున్న అధిష్టానం డిఎస్‌ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. కిరణ్‌,బొత్స,డిఎస్‌ ముగ్గురు మోతుబరులు పోటీ పడి పార్టీని ప్రభుత్వాన్ని కాపాడటం అధిష్టానం పని తేలికచేయొచ్చు. కాకపోతే ఈ నేతలు ప్రజల కోసం కూడా పోటీ పడితే తప్పులేదు ఆ పోటీ ఆధిపత్యం చుట్టూ తిరిగే అవకాశాలే ఎక్కువ. ఆ విధంగా ఒకరిపై ఒకరు పోటీ పడుతుంటే అధిష్టానం అందరినీ తిప్పుకుంటూ గుప్పిట్లో పెట్టుకుంటుంది.

నరహంత ఖాతాలో గడాఫీ

గడాఫీ మరణంపై తక్షణ స్పందన, వచ్చిన వ్యాఖ్యలకు సమాధానం లోగడ రాశాను. దీనిపై ప్రజాశక్తిలో రాసిన వివరమైన వ్యాసం విమర్శకుల కోసం అందిస్తున్నాను- తెర



నియంతవో.. నీతి మంతుడివో.. ఉత్సాహివో..ఉన్మాదివో.. పోరాడిన యోధుడివి, నిలబెట్టిన నాయకుడివి..మంటల మధ్యనా మడమ తిప్పని స్థయిర్యం, పంజరంలోనూ లొంగని ధైర్యం..నీలోనే చూసిందొక కాలం,,నీవే ప్రతిఘటనకు ఆలవాలం.. కాల సంధ్యలో నీ బలిదానం,, బుష్సాసురులకు రణనాదం.. అయిదేళ్ల కిందట 2007వ సంవత్సరం ప్రవేశించనున్న తరుణంలో సద్దాం హుస్సేన్‌ను లోపాయికారిగా వురి తీసిన కథనాన్ని విడుదల చేసినప్పుడు రాసిన చరణాలివి. లిబియా అధినేత కల్నల్‌ గడాఫీ అమానుష హత్య తరుణంలో ఇవే వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి. రోజెన్‌ బర్గులను కక్షకట్టి కరెంటుతో చంపినా, పర్షియా నేత మొసాదిక్‌ను సిఐఎ హత్య చేయించినా,వజ్రాల సీమ కాంగోలో పాట్రిస్‌ లుముంబా ప్రాణాలు బలిగొన్నా, లాటిన్‌ అమెరికాలో చే గువేరాను బలిగొన్నా, చిలీలో ప్రజలెన్నుకున్న అలెండీని సైన్యం హతమార్చినా, ఆఫ్ఘనిస్థాన్‌లో అభ్యుదయ పాలకుడు నజీబుల్లాను నడివీదిలోవురి తీయించినా, సోషలిస్టు రుమేనియా అధినేత సెషెస్క్మూను నిరంకుశంగా కాల్చిపారేసి టీవీలలో అదే పనిగా చూపించినా అన్నిటా ఒకే దుర్నీతి. ఒకే దుర్మార్గం. కొన్ని చోట్ల సైన్యం,కొన్ని చోట్ల కోర్టులు, కొన్నిచోట్ల కిరాయి హంతకులు.... ఇప్పుడు లిబియాలో చూస్తున్నది ప్రజాస్వామ్యం పేరిట తిరుగుబాటు శక్తుల ముసుగులో సాగిన ఘాతుకం.
నేషనల్‌ ట్రాన్షిషనల్‌ కౌన్సిల్‌(ఎన్‌టిసి) ఆధ్వర్యంలో గడాఫీ హతమైనట్టు చెబుతున్నా దాని వెనక వున్నది నాటో అమెరికాలే. అరబ్‌ వసంతం పేరిట పలు అరబ్‌ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు అమెరికా ద్వంద్వ ప్రమాణాలు

Friday, October 21, 2011

పోలవరం టెండర్ల పాఠాలు



పోలవరం టెండర్లను టిఆర్‌ఎస్‌కు అనుకూలమైన, నమస్తే తెలంగాణాతో సంబంధం కలిగిన ఎస్‌డబ్ట్యు ఎమ్మార్‌ పటేల్‌ కన్సార్టియం చేజిక్కించుకున్నట్టు తెలుగు దేశం నాయకుడు రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణపై చర్చకు నన్ను ఆహ్వానించారు గాని వెళ్లడం కుదరలేదు. మరో ఛానల్‌లో వ్యాఖ్యలు మాత్రం చేశాను. ే ఈ అంశం నేను ఇంత కాలం చేస్తున్న ఒక ప్రధాన వాదనను ధృవపరుస్తున్నది. తెలంగాణా లేదా సీమాంధ్ర( ఈ పదం ఇటీవల కృత్రిమంగా సృష్టించింది) అన్న ప్రాంతాల ప్రాతిపదికన పెట్టుబడిదారులు పేదలు వుండరు. వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో వుంటారు. వ్యాపార యుద్దాలు రాజకీయ ఘర్సణలు అన్ని చోట్లా జరుగుతూనే వుంటాయి. రేవంత్‌ ఆరోపణను ఖండించేందుకు టిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న సమర్థనల్లో వుండాల్సినంత తీవ్రత లేదంటే కారణం అక్కడ ఒక టెండరు అంటూ వుండటమే. ఇందులో రెండు అంశాలేమంటే - పెట్టుబడిదారులు ఇక్కడా వున్నారని, వారికి ఇక్కడ ప్రధాన పార్టీతో సంబంధం వుందని . పైగా ఆ పార్టీ వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు పని వారే చేపట్టారని. మిగిలిన రాజకీయాలు వ్యాపారాలు ఎలా వున్నా ఈ మేరకైతే గుర్తించక తప్పదు. ప్రయోజనాలు లేని రాజకీయాలు వుండవు. వ్యత్యాసాలు లేని ప్రాంతాలూ వుండవు. గతంలో లగడపాటి తెలంగాణాలోనే దొరలు పీడకులు వున్నారని పుస్తకాలు సీడీలు పంపిస్తే నేను ఏకీభవించలేదు. ఎందుకంటే మందసా, చల్లపల్లి, మునగాల జమీందార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిన తర్వాతనే ఆ ప్రభావం నైజాం వ్యతిరేక పోరాటానికి దారి తీసింది. కాకపోతే ఇక్కడ దొరతనం వెట్టిచాకిరీ రూపంలో దారుణంగా వుండేది. కాని తరతమ తేడాలతో ఆర్తిక దోపిడీ సామాజిక పీడన అంతటా వున్నాయి. అలాగే పెట్టుబడిదారులు కూడా వున్నారు. తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం సీమాంధ్ర పెట్టుబడిదారులకే వ్యతిరేమని చెప్పడం

ప్రపంచ నియంతపట్ల ప్రమత్తతా?



గడాఫీ హత్య లేదా హతం వెనక అమెరికా పాత్ర దాచేస్తే దాగని సత్యం. ఆయన కడిగిన ముత్యం అని నేనెక్కడా చెప్పలేదు. ఆయన హయాంలో అభివృద్దిని కూడా వికీ పీడియాలో చూడొచ్చన్నాను. ఆయన ఎలాటి వాడైనా ఎక్కడో వున్న అమెరికా కూటమి జోక్యం అవసరమేమిటి? ఇలా ఇతర దేశాధినేతలను హతమార్చడం మొదలెడితే అంతమెక్కడీ దేశాల సార్వభౌమత్వాలకు రక్షణ ఎక్కడీ విమానాన్ని కూల్చివేయడం, హొటల్‌పై దాడి వంటివాటికి దేశాలనే బాంబు దాడులతో దగ్ధం చేస్తున్న అమెరికా అమానుష వ్యూహాలకూ పోలిక ఎక్కడీ గడాఫీని త్వరితంగా నిర్మూలించాలని ఒత్తిడి చేయడానికే విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ లిబియా వెళ్లిన సంగతి మీడియాలో రాలేదా? గడాఫీ తన దేశానికి నియంత అవునో కాదో గాని అమెరికా ప్రపంచానికే నియంతగా మారిన అమెరికా అంతకంటే కొన్ని రెట్లు ముప్పుగా వుందనడంలో సందేహం లేదు. సోవియట్‌ యూనియన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకుందనే పేరుతో మొదలైన అమెరికా వినాశకర వ్యూహాలు ఆఖరుకు 9/11 ఘటనలకు దారి తీసి ఆ పైన మరింత దారుణ రూపం తీసుకున్నాయి. ఇంకా దిగజారతాయి. ఈ మాటలు చెప్పకుండా దాచుకోవలసిన అవసరం ఏ మాత్రం లేదు. అవి దారుణమని అనుకోలేని వారికి ఇవే దారుణంగా కనిపిస్తే నేను చేయగలిగింది లేదు. ఇది అమెరికా పట్ల అమెరికా ప్రజల పట్ల వ్యతిరేకత కాదు. వారి అమానుష ఆధిపత్య వ్యూహాల అభిశంసన మాత్రమే.
దీనిపై నా ఎంట్రీపై చాలా వ్యాఖ్యలు చేయడమే గాక వారిలో వారు వాదించుకోవడం ఆలస్యంగా చూశాను.ఆ భాషను పద ప్రయోగాలను నేను హర్షించలేను. కనకనే మొత్తం తీసేశాను. ఇక ముందైనా వాదనలో విషయానికి విజ్ఞతకు ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తాను.

Thursday, October 20, 2011

రాష్ట్ర విభజనపై అద్వానీ వింత వాదన




బిజెపి వృద్ధ నేత అద్వానీ రథయాత్రపై గతంలోనే వ్యాఖ్యానించాను. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన పర్యటన తీరు అనుకున్న దానికన్నా విపరీతంగా నడిచింది. అంత పెద్ద నాయకుడు వచ్చినపుడు జనం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైగా బిజెపి రాష్ట్ర నేతలు శాయ శక్తులా సమీకరణ చేయడం సహజం. ఇంతకూ అవినీతికి వ్యతిరేకంగా ఆయన మొదలెట్టిన యాత్ర యెడ్డీ అరెస్టుతో ఆదిలోనే హంసపాదులా మారింది. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఆయన పార్టీ వాడైన గాలి జనార్థనరెడ్డి జైలులో వున్నాడు. ఇన్ని వున్నా అవినీతికి వ్యతిరేకంగా సూక్తులు చెప్పడం అద్వానీ వంటి గడుసు నేతకే చెల్లుతుంది.. ప్రధాని పరుగులో తాను ఆలసి పోలేదని చెప్పడానికే ఆయన రథ యాత్ర అని ప్రతివారికీ తెలుసు. అంతకంటే కూడా ఆయన తెలంగాణా విభజన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి చెప్పడంలో టిఆర్‌ఎస్‌ను కూడా మించి పోయి మాట్లాడ్డం జాతీయ నేత హౌదాకు తగినట్టు లేదు. శాసనసభ తీర్మానం లేకుండానే వచ్చే జనవరిలోనే ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులోపెట్టేయొచ్చని చెప్పడం రాజ్యాంగ విషయాలనూ తారుమారు చేసింది. 3 వ అధికరణం ప్రకారం

అమెరికా హత్యల జాబితాలో గడాఫీ



లిబియా అధినేత కల్నల్‌ గడాపీని వెంటాడి వేటాడి ఒకప్పుడు సద్దాం హుస్సేన్‌ను హతమార్చినట్టే అమెరికా అండదండలు గల వ్యతిరేక శక్తులు అంతమొందించాయి. మొత్తం అరబ్‌ ప్రపంచంలో ఆధునికత, లౌకికతత్వం నింపిన మరో పాలకుడు ఖతమై పోయాడు. మానవాభివృద్ధి సూచికల్లో లిబియా ఎంతటి ప్రగతి సాధించిందో ఇదే ఇంటర్‌ నెట్‌లోని వికీ పీడియా చూస్తే తెలుస్తుంది. కొద్ది రోజుల కిందటనే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ లిబియాలో పర్యటించి గడాఫీని హతమారిస్తే సహాయం చేస్తామని ప్రకటించి వచ్చారు. లిబియాలో వచ్చే మార్పులలో తమకూ వాటా వుండాలని అమెరికా అన్న సంగతి చాలా ఛానళ్లలో ప్రసారమైంది. గడాఫీ నియంత అని పెద్ద ప్రచారమే జరుగుతుందనడంలో సందేహం లేదు. ఆయన పాలనలో అనేక పొరబాట్టు వుండొచ్చు కూడా. కాని వాటికి శిక్షలు వేసే హక్కు అమెరికాకు ఎవరిచ్చారనేది ప్రశ్న.
1986లోనే గడాఫీ హత్యకు అమెరికా దాడులు చేసింది. ఆయన చిన్న కుమార్తె బలైంది అప్పట్లో. తర్వాత ఎన్ని హత్యా ప్రయత్నాలు

Saturday, October 15, 2011

రాజకీయ మలుపుల మధ్య రైల్‌రోకో




నెలరోజులు దాటిపోయిన సకల జనుల సమ్మె ద్వితీయ ఘట్టంలో సహజంగానే అనేక మలుపులు వస్తున్నాయి. మూడు రోజుల రైల్‌రోకో సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుని అరెస్టులు చేయడం ఇందులో ముఖ్యమైంది. గతంలోనూ ఆందోళనలు చేస్తున్నవారిని నిర్బంధించినా ఈ సారి ముందుగానే డిజిపి తీవ్ర హెచ్చరికలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. మామూలుగా ప్రజా ఉద్యమాల సందర్భంలో రైల్‌రోకోల వంటివి సంకేత ప్రాయంగా కొన్ని గంటల పాటు జరిగేవి. కాని ఈ సారి తెలంగాణా జెఎసి మూడు రోజుల పాటు రైల్‌ రోకో ప్రకటించింది. రెండు సార్లు వాయిదాల అనంతరం శనివారం నాడు అది ప్రారంభమైంది. డిజిపి దినేష్‌ రెడ్డి రైల్‌రోకోలో పాల్గొన్నవారిపై చాలా తీవ్రమైన శిక్షలకు దారి తీసే కేసులు నమోదు చేస్తామని చెప్పడం ముందే వివాద గ్రస్తమైంది. తమ అధిష్టానం నుంచి ప్రకటన తెప్పించడంలో విఫలమైన కాంగ్రెస్‌ ఎంపిలు కూడా రైల్‌రోకోలో పాల్గొంటామని ప్రకటించడం కూడా రాజకీయంగా ప్రచారం పొందింది. అయితే మిగిలిన వారితో పాటు ఎంపిలను కూడా అరెస్టులు చేసేందుకు సిద్ధమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తను గట్టిగా వుండబోతున్నాననే

రథయాత్ర రాజకీయాలు






అద్వానీ రథయాత్రపై బిజెపి వెలుపల కన్నా అంతర్గతంగానే ఎక్కువ అలజడి కనిపిస్తుంది. నరేంద్ర మోడీ నిరాహారదీక్షతో మొదలైన ఈ చర్చ ఇప్పుడు మరింత మంది నాయకులకు పాకింది. ప్రధాని పదవికి అభ్యర్థులెవరనే విషయంలో(ఇప్పుడు ఎన్నికలూ లేవు, బిజెపి విజయం సాధించిందీ లేదు) పోటా పోటీ ఒక పట్టాన ముగిసేట్టు లేదు. మోడీ అద్వానీని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు రాసినా ఆయన మోడీని మెచ్చుకున్నా ప్రధాని పదవిపై మాత్రం సూటిగా వ్యాఖ్యలు లేవు. పోటీలో లేను అని అద్వానీ అన్నట్టు చాలాసార్లు శీర్షికలు కనిపిస్తున్నా ఆయన అలా సూటిగా చెప్పింది లేదు. పార్టీ నిర్ణయిస్తుందనీ, తన కోసం చేయడం లేదని పరిపరి విధాల మాట్లాడటమే జరుగుతున్నది. ఇది ఇలా వుంటే బిజెపిలో ఇంకా రాజ్‌నాథ్‌సింగ్‌, యశ్వంత్‌ సిన్హా, మురళీ మనోహర్‌ జోషి తదితరులు చాలా మంది తామూ రేసులో వున్నామని సూచనలు వదులుతున్నారు. విలక్షణ పార్టీలో విస్తారంగానే ప్రధాన మంత్రులున్నారు. 1995లో తన మాట వినకుండా వాజ్‌పేయిని ముందుకు తెచ్చి అద్వానీ పొరబాటు చేశారన్నట్టు ఉమా భారతి మాట్లాడితే బలపర్చిన వారు మాత్రం పెద్దగా లేరట.

శంకర్‌రావు ఆరోపణలపై విచారణ వుత్తిదే!





హౌం మంత్రి సబితా ఇంద్రారెడి, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలపై
సహచర మంత్రి శంకర రావు చేసిన తీవ్రారోపణలను విచారణకు స్వీకరించవచ్చునని జస్టిస్‌ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వచ్చిన వార్తల లోతుపాతులు ఈ బ్లాగులో లోగడ చర్చించాము. అవి కేవలం సిఫార్సులు తప్ప నిర్ణయాలు కాదని, ఆ పని చేయవలసింది వేరే ధర్మాసనమని కూడా చెప్పుకున్నాము.నిజంగానే ఇప్పుడు హైకోర్టు ఉన్నాతాసననం ఆ సిఫార్సును తోసిపుచ్చడమే గాక మంత్రుల విభేదాలలో తలదూర్చవద్దని సలహా ఇచ్చింది. ఈ సందర్భంగానే వార్తా కథనాలను ఎంత మేరకు తీసుకోవచ్చనే దానిలో సింగిల్‌ జడ్జి పరిధి మించారన్న భావన కలిగించే వ్యాఖ్యలు కూడా చేసింది. ఫ్రధాన న్యాయమూర్తి కక్రూ, మరో న్యాయమూర్తి అఫ్జల్‌ పుర్కార్‌లు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత హైకోర్టు పరిస్థితి నేపథ్యంలోనూ, నరసింహారెడ్డి తీర్పుల రాజకీయ ప్రాధాన్యత నేపథ్యంలోనూ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆరోపణల నిజానిజాల కంటే చట్టబద్దమైన పద్ధతులు, కోర్టుల నిబంధనల రీత్యానే ఈ అంశం ప్రస్తావించాల్సి వచ్చింది.ఇంతకూ శంకరరావుపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా వున్నా ఆయన్ను కదిలించలేకపోవడానికి కూడా రాష్ట్ర రాజకీయాలు, అధిష్టానం అనుమతి నిరాకరణే కారణమని కూడా భావిస్తున్నారు. బహిరంగంగా సహచరులపై ఆరోపణలు చేసిన ఆయన మంత్రివర్గంలోనే కొనసాగుతుండగా ఆ ఆరోపణలకు స్పందన లేదా ఖండన లేకపోవడం ఇక్కడ విపరీతం!

Monday, October 10, 2011

నిరాధార కథనాలతో కాలక్షేపం


తెలంగాణా సమస్యపై ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనే భావన కలిగించేందుకు కేంద్ర ప్రతినిధులు, తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమం వూపును నిలబెట్టడం కోసం టిఆర్‌ఎస్‌, జెఎసి నేతలు కూడా అంతా ఆఖరిదశకు వచ్చిందనే రీతిలో మాట్లాడుతున్నారు. తాము కూడా క్రియాశీలంగా చక్రం అడ్డం వేస్తున్నట్టు కనిపించడానికి ఇతర ప్రాంతాల కాంగ్రెస్‌ తెలుగుదేశం నాయకులు కూడా హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ చూసి మీడియా కూడా వీక్షకులకు ఆకట్టుకోవడానికి ఏదో ఒక కథనం ఉదయాన్నే చలామణిలో పెడుతున్నది. ఎవరు ఎవరిని కలిసినా దానిపై అంతులేని వూహాగానాలు సాగుతున్నాయి. వీటికి కేవలం మీడియానే నిందించి లాభం లేదు. రాజకీయ అవసరాల కోసం ఆ విధమైన కథనాలను అటు పాలక వర్గీయులూ ఇటు తెలంగాణా రాజకీయ నాయకులూ కూడా అందిస్తున్నారు. ఈ కథనాల మాటున కేంద్ర నాయకులు బహిరంగంగానే మాట్లాడిన మాటలూ సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం సరిగ్గా జరగడం లేదు. ఉదాహరణకు ఈ పదిహేనురోజులలోనూ కేంద్రం నుంచి మాట్లాడిన ప్రతివారూ సమస్య త్వరితంగా తేలేది కాదని, అందరికీ ఆమోదంగా వుండాలనీ పదే పదే చెబుతున్నారు. సంప్రదింపులు కొనసాగాలని అంటున్నారు. తెలంగాణా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేట్టయితే దాన్ని సూచనగా వెల్లడించి లాభం పొందడానికి యత్నిస్తారే తప్ప ఇన్ని సన్నాయి నొక్కుల అవసరం వుండదు. దానిలో సమస్యలు వున్నాయన్న మాట నిజమే అయినా కేంద్రం ఇప్పుడే తెలుసుకున్నట్టు మాట్లాడ్డమే విచిత్రం. అలాగే సలక జనుల సమ్మె ఉధృతంగా జరుగుతున్నా దాన్ని బట్టి ప్రతిస్పందించేందుకు కేంద్రం సిద్దం కావడం లేదన్నది స్పష్టం. కనక సమ్మె సెగ తగిలినందువల్లనే కేంద్రంలో కదలిక వచ్చిందనీ చెప్పడం వాస్తవాలతో పొసగడం లేదు. సమ్మె విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం

Saturday, October 8, 2011

అనిశ్చితి యథాతథం- ఆచరణ అగమ్యం



రాష్ట్ర రాజకీయాలలో ఏదో తీవ్ర నిర్ణయం జరగబోతుందన్న వాతావరణాన్ని ఈ వారాంతంలో కేంద్రం కల్పించింది. దసరా పండుగ రోజున గవర్నర్‌కు ప్రధాని పిలుపు అందినట్టు వచ్చిన వార్తలతో మొదలైన హడావుడి రాష్ట్ర కాంగ్రెస్‌ పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ పునరుద్ఘాటన వరకూ కొనసాగింది. గతంలో చెప్పిన ప్రకారం సంప్రదింపులు జరపడం తప్ప త్వరితంగా చేస్తున్నదేమీ లేదని ఆయన తేల్చి చెప్పాక అనవసరంగా హైరాన పడిన వారికి ఆశ్యర్యమే మిగిలింది. షరా మామూలుగా ఇదంతా మీడియా హడావుడి అని చప్పరించేసి నేరం దానిపైకి నెట్టేస్తారు . రరరకాల మార్గాలలో ఏవేవో కథనాలు మీడియాకు అందించి కృత్రిమమైన వూహాగానాలకు ఆస్కారం కల్పించడం స్పందనలు గమనించిన తర్వాత కొట్టిపారేయడం కేంద్రానికి పరిపాటి అయింది. ఒక వైపున తమలో తామే

Friday, September 30, 2011

ఆజాద్‌ నివేదిక, అనంతరం..



తెలంగాణా సమస్యపై ఏదో వెంటనే జరిగిపోతుందని భావించేవారు, జరిగిపోవాలని కోరుకునే వారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌ ఇచ్చే నివేదికకు శ్రుతి మించిన ప్రాధాన్యత కల్పించారు. కాని వాస్తవం ఏమంటే దానికి ముందు తర్వాత కూడా కేంద్రం నుంచి వెలువడుతున్న సూచనల్లో కొత్తదనమేమీ లేదు.ఈ సమస్యపై వారికి అవగాహన లేదని కాదు, దాన్ని వెల్లడించాలనే ఉద్దేశమే లేదు. కెసిఆర్‌ ఏ జోస్యాలు చెప్పినా కాంగ్రెస్‌ నాయకులు మాత్రం అలాటి సాహసం చేయడం లేదు. ఎందుకంటే వారికి అంతర్గత పరిస్తితులు మరింత బాగా తెలుసు. శుక్రవారం నాడు హౌం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్టు స్పష్టమవుతుంది. కాకపోతే కాంగ్రెస్‌ ఒక అవగాహనకు రావడానికి ఆజాద్‌ అ ద్యక్షురాలికి ఇచ్చిన నివేదిక దోహదపడుతుందని మాత్రం అనుకోవాలి. ఎనిమిది మాసాల కిందట ఇచ్చిన శ్రీకృష్ణ నివేదికకే ఠికాణా లేనప్పుడు ఈ ప్రహసనంతో ఏదో ఒక వొరిగి పడుతుందని మౌలిక నిర్ణయాలు మారిపోతాయని బొత్తిగా ఆశించలేము. నిజానికి సమయం చాలా పడుతుందని ఆజాద్‌ నిన్న, చిదంబరం ఈ రోజు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకుని వ్యవహరించాల్సి వుంటుంది.

Wednesday, September 28, 2011

కొత్త జోస్యాలు- పాత భాష్యాలు



కెసిఆర్‌ ఈ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన అయిదారుగురు నాయకులలో ఒకరుగా గౌరవనీయులు. కొత్త రాష్ట్రమే సాధించి దాని వ్యవస్థాపకుడు కావాలని కోరుకునే వ్యక్తి.అయితే దురదృష్టవశాత్తూ ఆయన మాటలు చేతలు తరచూ వివాదాస్పదంగానూ నిరాధారంగానూ వుంటాయి. ఈ బ్టాగులో గత ఎంట్రీలలో చేసిన వ్యాఖ్యలు విశ్లేషణలు చదివిన వారికి ఈ సంగతి బాగా తెలుసు.తాజాగా ఇప్పుడాయన కేంద్రం రెండు మాసాలలో తెలంగాణా ఇచ్యేస్తుందని చెప్పడం ఆ కోవలో మరో ప్రహసనం. అంతటితో ఆగక కేంద్రం ఆలోచనలుగా తనకు తెలిసిన వాటిని ఆయన ఇంచుమించు ప్రతిపాదనల చర్చగా మొదలెట్టారు. కర్నూలు అనంతపురంలతో కూడిన తెలంగాణా, హైదరాబాదు ప్రతిపత్తి వంటివాటిని ఈ కోవలో వదిలారు. వీటిపై తెలంగాణా ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.తమాషా ఏమంటే గతంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల నిరాహారదీక్షా శిబిరం దగ్గర ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ఢిల్లీలో చర్చలు జరుపుతున్న వారికన్నా ముందే ఈ అంశాలు ఆయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్‌ వాదులు మాత్రం వీటిని ధృవపర్చిన దాఖలాలు లేవు. ఉద్యమాలను ఉత్సాహ పర్చడం కోసం కెసిఆర్‌ ఇలాటివి మాట్లాడుతుంటారని ఆయన సహచరులు చెప్పే వివరణ దీనికీ వర్తిస్తుందనుకోవాలి.కాకపోతే వూహాగానాలతో వుత్తుత్తి కథనాలతో ఉత్సాహపర్చినా అది నిలబడుతుందా? తర్వాత కలిగే నిరుత్సాహం మరింత తీవ్రంగా వుండదా? ఈ అంశాలను ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ క్రమంలో విశ్వసనీయత దెబ్బతినడమూ కద్దు.ఇంతా చేసి భౌగోళికంగానూ చారిత్రికంగానూ రెండు రాయలసీమ జిల్లాలను తెచ్చికలపడం కుదిరేది కాదు. అలాటి ప్రతిపాదన తీవ్రంగా వచ్చే అవకాశమూ లేదు. కనక ఇది కెసిఆర్‌ మాటల పొదిలోంచి వదిలిన మరో అస్త్రంగానే భావించాలి. ఈ మాటలకు ముందు ఆయన మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో మాట్టాడ్డం వల్ల ఇవి ఆయన భావాలకు దగ్గరగా వున్నాయని కూడా చెప్పొచ్చు.

Tuesday, September 27, 2011

లగడపాటి రాక- రాజకీయ కాక


సకల జనుల సమ్మె సగం నెల పూర్తి అవుతున్న సందర్భంలో విజయవాడ కాంగ్రెస్‌ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం పరిస్తితిని అకారణంగా వుద్రిక్త పరిచింది. ఆర్టీఏ అధికారి పినిశెట్టి శ్రీనివాస్‌పై దాడిని అందరూ ఖండించారు. అందుకు కారకుడైన వ్యక్తిని తామే అప్పగించామని కూడా జెఎసి నాయకులొకరు నాతో చెప్పారు. ఏపీ ఎన్జీవో సంఘం నాయకుడు గోపాల్‌ రెడ్డి కూడా దీనిపై ఆందోళన వెలిబుచ్చారు. అలాటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత పెరక్కుండా చూసుకోవలసింది.అయితే లగడపాటి రాజగోపాల్‌ పరామర్శ పేరిట రావడంతో పరిస్తితి రాజకీయ రంగు పులుముకోవడం సహజం. గతంలో కెసిఆర్‌ నిరాహారదీక్ష సందర్భంలోనూ ఆయన ఇలానే చేశారు.వీటివల్ల ఆయనకు రాబిన్‌ హుడ్‌ ఇమేజ్‌ వస్తుందనుకుంటారేమో గాని రాష్ట్రంలో పరిస్తితి దిగజారుతుందని గుర్తించాలి. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు (మళ్లీ కాంగ్రెస్‌ వాదులతో సహా) వెళ్లడం, పోలీసులతో ఘర్షణ, నాయకులపట్ట ప్రవర్తనపై ఆగ్రహం, హరీష్‌ రావు సొమ్మసిల్లేందుకు దారి తీసిన ఘర్షణ ఇవన్నీ గత పదిహేనురోజులలో లేని కొత్త పరిస్థితికి దారి తీశాయి.ఈ ఉద్రిక్తతలు కొనసాగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతివారిపై వుంది. ఢిల్లీలో నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమోనని ముందే ప్రభావం ప్రసరించాలన్న ఆదుర్దా అందరిలో వున్నట్టు స్పష్టమవుతుంది. అది అర్థం చేసుకోవచ్చుగాని ఆ కారణంగా అవాంఛనీయ పరిస్తితులను సృష్టించుకోవడం ఎవరికీ మంచిది కాదు.

శంకర్‌ రావుపై జడ్జి ఆదేశం ప్రభావం?



ఎప్పటికప్పుడు ఏవో విపరీత వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే మంత్రి శంకర్‌ రావు హౌం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యను సుమోటాగా తీసుకోవాలని సిబిఐ దర్యాప్తు జరిపించాలని జస్టిస్‌ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఆ ఆరోపణల లాగే ఈ ఆదేశం కూడా ఇంకా పూర్తి స్వరూపం తీసుకోవలసి వుంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజా ప్రయోజన వాజ్యం కింద దీన్ని తీసుకోవడానికి అన్ని అర్హతలు వున్నాయని న్యాయమూర్తి భావించినప్పటికీ తుది నిర్ణయం జరగాల్సింది మరోచోట. శంకరరావు వ్యాఖ్యలు మంత్రివర్గంలో అస్తవ్యస్త పరిస్థితిని ప్రతిబింబిస్తున్న మాట నిజమే గాని న్యాయమూర్తి ఆదేశాల పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే విషయం అర్థమవుతుంది.

Monday, September 26, 2011

టీ కాంగ్రెస్‌ నేతల ఆగ్రహావేశాలు


సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణా కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు సోమవారం తీవ్రస్థాయిలోనే రంగంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిపైనా నేరుగా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధిష్టానంపైన కేంద్రంపైన మాత్రం ఇంకా విశ్వాసం ప్రకటించడం గమనించదగ్గది. ప్రాంతీయ విధేయతకు పార్టీ విధేయతకూ మధ్యన వారు తమ స్థానాన్ని నిర్ణయించుకోనంత వరకూ ఈ మాటల వల్ల ప్రయోజనం వుండదు.దామోదరరెడ్డి అవసరమైతే కొత్త పార్టీ వస్తుందని అన్నప్పటికీ ఆ మాటలలో వుండాల్సిన తూకం లేదు. ఇదే సమయంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణా రాష్ట్రం రావడాన్ని ఎవరూ వ్యతిరేకించదం లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజునే ఈ మాట చెప్పడం మరో విశేషం. నిన్న మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ తమ పాత విధానాన్నే పునరుద్గాటించారు. వీటన్నిటిని బట్టి సమ్మె ఉధృతిని బట్టి ఏదో ఒక పరిష్కారం రాబోతుందని అనుకోవడానికి ఆస్కారముంది.అయితే కాంగ్రెస్‌ ధోరణి రీత్యా అలా అనుకోవడం అవాస్తవికతే అవుతుంది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ఏ సమస్యనూ వారు పరిష్కరించకుండా అట్టిపెట్టి రాజకీయం నడపడానికి అలవాటు పడిపోయారు. ఒక విధానం చెప్పి దానిపై నిలబడటం కంటే ఏమీ చెప్పకుండా అందరినీ ఆడించుకునే అవకాశవాదం

Saturday, September 24, 2011

సకల సమ్మె- సంఘాలు, సర్కార్లు, పార్టీలు


సకల జనుల సమ్మె ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నా ప్రభుత్వాలలో ప్రతిస్పందన కనిపించడం లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా ప్రతిష్టంభన కొనసాగించడం బాధ్యతా రహితం. రావణ కాష్టంలా రగులుతున్న ఈ సమస్యలో స్వీయ లాభ నష్టాల లెక్కలు తేలక కాంగ్రెస్‌ నాయకత్వం రాష్ట్రంతో, ప్రజలతో చెలగాటమాడుతున్నది. రెండు వారాలకు చేరుతున్న సకల జనుల సమ్మె ప్రభావంతో పరిస్తితులు మరింత దిగజారుతున్న స్థితి. అయినా ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, అభిషేక్‌ సింఘ్వీలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యలు స్పందనా రాహిత్యానికి అద్దం పట్టాయి. ఈ దశలో ఏ విధమైన ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకునేది లేదన్న సంకేతం పంపించడానికే కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఇలా మాట్లాడుతున్నారన్నది స్పష్టం. మరోవైపు అదే అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులూ ఆఖరుకు మంత్రులూ ఆందోళన కారులను మించి పోయి మాట్లాడుతున్నారు. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న నాయకులు ప్రత్యేక తెలంగాణా ప్రకటించేవరకూ సమ్మె ఆపేది లేదని ప్రకటిస్తున్నారు. ఈ పూర్తి విరుద్ధ వైఖరుల అనిశ్చితి ఇంకెంత కాలం సాగుతుందని అన్ని ప్రాంతాల ప్రజలూ ఆందోళనకు గురి కాక తప్పడం లేదు.అధిక ధరలు, కొత్త భారాలు, వ్యవసాయ సమస్యలు స్తంభించి పోయిన ఆర్థిక జీవితం, కొడిగట్టిన పరిపాలన, అవాంఛనీయ వాతావరణాన్ని సృష్టించాయి.

నాలుగు స్తంభాలాట
తెలంగాణా సమస్య అంటున్నప్పటికీ ఇది ఆంధ్ర ప్రదేశ్‌ మొత్తం భవిష్యత్తుతో ముడిపడిన వ్యవహారం. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరులను ఇప్పటికే తెలియజేశాయి. ప్రాంతాలను బట్టి మాట్లాడే కాంగ్రెస్‌ తెలుగు దేశం అదే వైఖరి కొనసాగిస్తున్నాయి. తెలంగాణా ప్రాంతంలోనే ప్రత్యేక రాష్ట్ర కోర్కెను వినిపిస్తూన్న కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపి, టిఆర్‌ఎస్‌లు తమ తమ వ్యూహాల సమరం సాగిస్తూనే వున్నాయి. ఇవి కొన్ని సార్లు మాటల యుద్ధాలకే పరిమితమైతే కొన్నిసార్లు ప్రత్యక్ష ఘర్షణలు దాడులుగానూ పరిణమిస్తున్నాయి. పార్టీలు మాత్రమే గాక రకరకాల జెఎసిలు కూడా ఏర్పడ్డాయి. ఇలాటి సమయంలో రాజకీయ శక్తులన్ని ఏకాభిప్రాయంతో ఏదో చెప్పేదాక పరిష్కారం ప్రసక్తి లేదని కేంద్రం చేతులు దులుపుకోవడం కుటిలత్వమే. అఖిల పక్ష సమావేశం ప్రకారం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికనిచ్చి ఎనిమిది మాసాలు గడిచిపోయినా ఏమీ తేల్చకుండా కాలం గడపడం వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే పథకం తప్ప మరేమీ కాదు. గతంలో అలాటి అనేక నిర్వాకాలకు కారణమైన కాంగ్రెస్‌ చరిత్రను ఎవరూ మర్చిపోలేదు.
ఇప్పుడు కూడా ప్రాంతాల వారిగా వీరంగం తొక్కుతున్న వారిలో కాంగ్రెస్‌ నేతలే ముందుండటం గమనించదగ్గది. తెలుగు దేశం నేతలు తర్వాతి స్తానం ఆక్రమిస్తున్నారు. ఇక బిజెపి అధికారికంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఇవన్నీ జాతీయ, రాష్ట్ర పార్టీలనుకుంటే ఒక ఉప ప్రాంతానికే పరిమితమైన టిఆర్‌ఎస్‌ కూడా వ్యూహపరమైన వైరుధ్యాలనే ప్రతిబింబిస్తున్నది. లాబీయింగు ద్వారా లక్ష్య సాధన చేస్తామన్న

Friday, September 23, 2011

కేంద్రం వైఖరిపై అడుగంటిన ఆశలు



త్వరలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం అని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రకటించారు. ఇలాటి ప్రకటనే లోగడ కెసిఆర్‌ చేసి తర్వాత సవరించుకున్న తీరు అందరికీ తెలుసు. సకల జనుల సమ్మె ఉధృతంగా జరుగుతుంది గనక కేంద్రం వైఖరి మారుతుందని కొందరు అనుకోవడం అవాస్తవికమే. ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా కేంద్రం అలసత్వాన్ని చెలగాటాన్ని అందరూ అభిశంసిస్తున్నారు. ఇది యాదృచ్చికమేమీ కాదు.ఉద్దేశ పూర్వకమే. సకల సమ్మెపై రేణుకా చౌదరి, అభిషేక్‌ సింఘ్వీ, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అందరూ ఒకే స్వరం వినిపించడం వెనక స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. గత కొద్ది మాసాలలోనూ వివిధ పార్టీల ప్రముఖులతో ఆంతరంగికంగా మాట్లాడినప్పుడు (ప్రాంతాల తేడా లేకుండా) అందరూ చెబుతున్నదేమంటే కేంద్రం ఎలాటి తీవ్ర నిర్ణయం తీసుకోబోవడం లేదు అని. అత్యంత ముఖ్యమైన నేతల మాటలు కూడా అలానే వున్నాయి.. కేంద్రం వైఖరి ఇప్పట్లో మారే సూచనలూ లేవు. మార్చుకుంటే కలిగే లాభం ఏమీ వుండదని వారు గట్టిగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రయోజనాల కోణం నుంచి తప్ప అంతకంటే విశాలంగా ఆలోచించే అవకాశం ఎలానూ వుండదు. ప్రతి వారూ ప్రతిచోటా అడిగే ప్రశ్న ఇదే గనక నాకున్న సమాచారాన్ని పంచుకుంటున్నాను

చిదంబర రహస్యాలు తేల్చాల్సిందే!



2 జి స్ప్రెక్ట్రం కుంభకోణం యుపిఎ 2 ప్రభుత్వాన్ని పట్టి కుదిపేయడం ఖాయంగా కనిపిస్తుంది. రాజాను కాపాడటానికి మొదట్లో గట్టిగా ప్రయత్నించిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తర్వాత న్యాయస్థానాల ముందు తల వంచక తప్పలేదు. ఆ తర్వాత కూడా సంకీర్ణ (అ)ధర్మం పేరిట తనను తాను సమర్థించుకోవడానికి విఫలయత్నం చేశారు. ఆ సెగ కనిమొళి, మారన్‌ తదితరులందరికీ తాకింది.అయితే ఈ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం, నాటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రను కూడా విచారించాలన్న డిమాండు వస్తూనే వుంది. దాన్ని ఎంతగా పెడచెవిని పెట్టినా ఇప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ లేఖ బయిటకు వచ్చాకనైనా స్పందించక తప్పడం లేదు. చిదంబరంపై కూలంకషమైనదర్యాప్తు జరగాలంటే ఆయన నేతృత్వంలోని సిబిఐకి స్వేచ్చ వుంటుందా? ఆ కోణం నుంచి చూస్తే ఆయన తప్పక ఇంటి దోవ పట్టాల్సి రావచ్చు. యుపిఎకు ఒక మూల స్తంభంగా వున్న చిదంబరం కూడా వేటుకు గురైతే ప్రభుత్వ పునాదులు కదలడం అనివార్యం. అసలు ప్రణబ్‌ ముఖర్జీ లేఖ బయిటకు రావ్టడం వెనక అత్యున్నత స్తాయి అంతర్గత కలహాల ప్రభావం వుందా అని కూడా ఆనుమానించక తప్పదు. మసకబారిన మన్మోహన్‌ ప్రభకు ఇదో తాజా దెబ్బ. అపర చాణక్యుడిగా వెలుగొందిన చిదంబరం ఇంతటి ఇరకాటంలో పడటం చూస్తే ఈ నాటి రాజకీయాల మేడిపండు స్వరూపం స్పష్టమవుతుంది.

Wednesday, September 21, 2011

Modification by fasting?


     Remember the word Modification ? It is back in a garb.In the aftermath of 2002 genocide it was the name given to the political strategy  of Narendra Modi. Now US appears to be hell bent on Modification. The very country which rejected a visa to him and angered  every Indian now  ready to do business with him. That is US. This certificate preceded the Fast of Modi  aimed at show casing a different face. That apart  a great myth is sought to be created around him as a icon of vibrancy and effective ruling with almost no corruption.
       Remember the feel good projection that was rejected out right after Vajpaye rule? Modi attempting the same is ridiculous and incredible. Maybe he sustained the growth of an already developed state  and controlled corruption to some extent. Business men may praise him for their own reasons but to depict him as icon of development is far from true.

           The mute point is getting acceptability to Modi. Just three  points are enough. Vajpaye as PM asked him to quit and then backtracked under pressure.  Anna Hazare drawn flack from various quarters for praising him. Finally Nitish Kumar, another CM won laurels from us himself refused to share platform with him during elections. Modi enjoys. On the occasion of the fast JD(U) is once again recorded it’s reservations on MODI. Then Advani was summoned by

Tuesday, September 20, 2011

కెసిఆర్‌ మరో దీక్ష యోచన- రాజకీయ కారణాలు


మరోసారి నిరవధిక నిరాహారదీక్ష చేయాలని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్ర శేఖర రావు ఆలోచిస్తున్నట్టు మంగళవారం ఉదయం చాలా పత్రికలు వార్తలిచ్చాయి. ఉదయం టీవీ9 న్యూన్‌వాచ్‌లో ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్‌ మాట్లాడినప్పుడు కూడా పరోక్షంగా అందుకు బలం చేకూర్చే వ్యాఖ్యలే చేశారు.మధ్యాహ్నం తర్వాతనైతే మరిన్ని ఛానళ్లు ఆ అంశం తీసుకొచ్చాయి.టీవీ5లో ఫోన్‌ ఇన్‌ ఇచ్చినప్పుడు మరో వైపు నుంచి తారక రామారావు కూడా మాట్లాడారు. ఎన్టీవీ కూడా దీనిపైనే అభిప్రాయం వివరంగా తీసుకున్నది. సాయింత్రం సాక్షికి వెళ్లినప్పుడు కెసిఆర్‌ విద్యుత్‌ ఉద్యోగుల సమావేశంలో దీనిపై చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌ చూడగలిగాను.

సకల జనుల సమ్మె సందర్భంగా విద్యార్థులపై సాగిన దాడికి దెబ్బలకు బాధ కలిగి కెసిఆర్‌ నిరాహారదీక్ష యోచన చేశారని పైన చెప్పిన నాయకులు అన్నారు.అయితే ఆయన మాటలు ప్రత్యక్షంగా విన్నప్పుడు మాత్రం

Friday, September 16, 2011

సెప్టెంబరు 17: వాస్తవాలు, వక్రీకరణలు


సెప్టెంబరు 17 పేరిట తెలంగాణా ప్రాంతంలో షరామామూలుగా ఈ ఏడాది కూడా రకరకాల రాజకీయ శక్తులు హడావుడి సాగిస్తున్నాయి. విమోచనా విద్రోహమా అని చర్చలు నడుపుతున్నాయి. పదేళ్ల కన్నా ముందు బిజెపి దీన్ని తెరమీదకు తెచ్చింది. తర్వాత టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలుగు దేశం నాయకులూ దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు దళిత బలహీన వర్గాలు వెనకబడిన తరగతుల పేరిట మరో విధమైన విశ్లేషకులూ బయిలు దేరి ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులపై దాడి ఎక్కుపెడుతున్నారు. మరికొందరు చరిత్ర కారులమంటూ యథాశక్తి గజిబిజి పెంచే పనిలో నిమగమైనారు. బిజెపికి బొరుసు లాటి మజ్లిస్‌ కూడా రంగ ప్రవేశం చేసింది. ముందొచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు అరవై ఏళ్ల కిందట ఈ తేదీకి ముందు వెనక పోరాట చరిత్ర నిర్మించిన కమ్యూనిస్టుల కన్నా , వారి నాయకత్వంలో పోరాడిన వీర తెలంగాణా యోధుల కన్నా వీరి హడావుడి ఎక్కువగా వుంది. వీటన్నిటి మధ్యనా వామపక్షాలు సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి.
మా నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి ఈసడించిన పరమ పైశాచిక పాలనకు వెట్టిచాకిరీకి దొరల చెరలకు మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం

Thursday, September 15, 2011

రెండు మాసాలా? రెండేళ్లా? రెండూ కాదా?



అధిష్టానాన్ని కలుసుకుని వచ్చిన పిసీసీ పీఠాధిపతి బాన్స్‌వాడలో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఓడిపోతామని తెలిసీ ఇలా ఆదేశించడంలో చూడగలిగితే స్పష్టమైన సంకేతాలే వున్నాయి.టిఆర్‌ఎస్‌తో ప్రస్తుతానికి రాజీ పడదలచలేదని, తమ సా ్థనాన్ని వదులుకోవాలనుకోవడం లేదని తెలుస్తూనే వుంది. పోటీ వద్దనే వారు కూడా ఓటమి భయంతో తప్ప మరే విశాల దృష్టితో కాదు. తెలుగు దేశం అసలు ఎవరూ పోటీ చేయొద్దని చెబుతుంది గాని ఆ మాట వినేవారుండరని వారికీ తెలుసు. టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో గెలిచినా రాజకీయ పరిస్తితిలో దాని వల్ల వచ్చే నాటకీయ తక్షణ పరిణామాలేమీ వుండవు కూడా.కాకపోతే రెండు మాసాల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చేస్తుందని అది ఒక పక్షానికి సంతోషంగా వుండకపోవచ్చని బోత్స అంటున్న మాటను ఎటైనా అర్థం చేసుకోవచ్చు. కాని కాంగ్రెస్‌ ఇచ్చేట్టు లేదన్న కెసిఆర్‌ మాటలు, టి కాంగ్రెస్‌ వాదుల నిర్వేదం బట్టి చూస్తే బొత్స మాటల వెనక వున్నదేమిటో చూచాయగా అర్థమవుతుంది. రెండు మాసాల వ్యవధి కోసం ఇలా అంటున్నారా లేక రెండేళ్ల తర్వాత పరిష్కరిస్తామని అప్పుడు చెబుతారా అనేది కూడా చూడాల్సిందే. గతానుభవాలను బట్టి చూసినప్పుడు ఈ మాటలపై ఏవేవో భాష్యాలు చెప్పుకుని ఆవేశాలు వివాదాలు పెంచుకోవడం అర్థరహితమని గ్రహిస్తే శ్రేయస్కరం.

వికల దృశ్యంలో సకల సమ్మె


ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్న సకల సమ్మెపై కేంద్రీకృతమై వుంది. ఈ మాటను ఇంగ్లీషులో ఏమంటారు అని ఎవరో అడిగారు.మామూలుగా జనరల్‌ స్ట్రెక్‌ అన్నప్పుడు సార్వత్రిక సమ్మె అని అనువదించడం జరుగుతుండేది. ఈ సకల జనుల సమ్మె మాటను యూనివర్సల్‌ స్ట్రైక్‌ అనొచ్చు. పేరు నిర్వచనం ఏమిటనే దానికంటే ఎంత విస్త్రతంగా వుధృతంగా జరుగుతుందనేది ముఖ్యం. ఇప్పుడున్న నేపథ్యంలో ఈ సమ్మె ఉధృతంగానే మొదలవుతుందని అందరూ అనుకున్నారు.ఎక్కడ ఏ తరగతులు ఏ మేరకు కలసి వస్తారనేది అలా వుంచితే వుద్యోగుల వరకూ పాల్గొంటారన్నదీ ముందే స్పష్టమైంది. అదే జరిగింది కూడా. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా గొంతు కలపడం దీనికి మరింత వూతమిచ్చినట్టయింది. అత్యవసర సర్వీసులను మినహాయించినా పరోక్షంగా గని కార్మికుల సమ్మె ఆ మినహాయింపును మించిపోయింది. ఏ పోరాటంలోనైనా ప్రజలపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం పడటం తప్పనిసరి గాని ఇక్కడ ప్రత్యేకంగా ప్రాంత ప్రజలకు ఎక్కువ నష్టం కదా అన్న ప్రశ్నలు వస్తుంటాయి. రాజకీయ పరిష్కారం సూచనలేమీ లేనప్పుడు ఈ పోరాటం ఎంత కాలం సాధ్యమన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమైందేమంటే తెలంగాణా సమస్య 2014 వరకూ తేలేది కాదని స్వయంగా కెసిఆర్‌ వ్యాఖ్యానించి వున్నారు. ఢిల్లీకి ప్రదక్షిణల ప్రహసనం జరుపుతున్న కాంగ్రెస్‌ నేతలు కూడా అయోమయంగానూ ఆశాభంగంతోనూ తిరిగి వస్తున్నారు. ఏదో ఒక ప్రకటన వస్తుంది అని తప్ప తమకు అనుకూలంగా వస్తుందని తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు చెప్పలేకపోతున్నారు. అన్ని పార్టీలూ వస్తేనే అఖిలపక్ష సమావేశం సాధ్యమని కేంద్ర హొంమంత్రి చెబుతుంటే తాము హాజరుకాబోమని ప్రధాన ప్రతిపక్షం ప్రకటిస్తున్నది. వీటన్నిటిలోనూ భవిష్యత్‌ పరిణామాలు దాదాపుగా అర్థమవుతూనే వున్నాయి. పైగా తెలంగాణా క్షేత్రంలోనూ టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తెలుగు దేశం, బిజెపి తమ తమ ప్రయోజనాల కోణాలను తాము అనుసరిస్తున్నాయి. అందరూ తెలంగాణా ప్రజల పేరు చెబుతున్నా జరుగుతున్నది ప్రయోజనాల పాకులాట అని జనం చూడగలుగుతున్నారు. అందువల్లనే సకల జనుల సమ్మెకు సాద్యమైనంత హేతుబద్దమైన ప్రజాస్వామికమైన పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుంటుంది. ఈ లోగా ఇరు ప్రాంతాలలోనూ ప్రధాన పార్టీల నాయకులు కవ్వింపు ధోరణులతో మాట్లాడ్డం మానుకోవాలి కూడా.ఏ ప్రాంత ప్రజల మనోభావాలు ఏమైనప్పటికీ ఈ దుర్భాషలు దూషణలు మాత్రం వారు కోరుకోవడం లేదు.1969లో తెలంగాణాలోనూ, 1972లో ఇతర చోట్ల స్వార్థపరులైన నేతల ప్రచారాలను నమ్మి సమ్మెలు చేసి కష్టనష్టాల పాలైంది ప్రధానంగా ఉద్యోగులు విద్యార్థులే. ఆ అనుభవాలను ఇప్పుడు కూడా గుర్తుంచుకున్నామనే ఉద్యోగ నాయకులు చెబుతున్నారు.కనకనే అందరూ విజ్ఞతగా వ్యవహరిస్తారని ఆశించాలి.

మోడీకి కితాబు... అద్వానీకి జవాబు!



గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమర్థతకు మారు పేరు అని అమెరికా కాంగ్రెస్‌ రిసెర్చి విభాగం పెద్ద నివేదిక నివ్వడంపై ఆయనతో సహా ఆ పార్టీ ఆనందోత్సాహాలలో మునిగిపోవడం సహజమే. ఆరేళ్ల కిందట అమెరికా ఆయనకు వీసా నిరాకరిస్తే అన్ని పార్టీలూ ఖండించాయి. తర్వాత కాలంలో ఆయన విధానాలలో గాని ఆలోచనల్లో గాని ఏ మార్పు వచ్చింది లేదు. అయినా అమెరికా ఇంతగా పొగుడుతున్నదంటే అవసరాన్ని బట్టి మార్చుకున్న వ్యూహమై వుండాలి. మోడీకి తమ ఆమోదం వుందన్న సందేశం పంపించడమే వారి ఉద్దేశం. ఇతర పార్టీల సంగతి ఎలా వున్నా మరోసారి భారత యాత్ర ప్రకటించిన మహా రథికుడు అద్వానీకే ఇది అశని పాతం. ఎందుకంటే

మసక బారిన క్యారెక్టర్‌ పాత్రలు


సినిమా అంటే హీరో హీరోయిన్లే కదా.. ఫలానా హీరో సినిమా అంటారు.. అందుకోసం ఎదురు చూస్తారు.. బాగుంటే కేరింతలు కొట్టడం,బాగాలేకుంటే చప్పుడుచేయకుండా సర్దుకోవడం ఇవన్నీ మామూలే. మొత్తం ప్రచారమంతా ఆ హీరోల చుట్టూనే! కొంతవరకు హీరోయిన్లు ఆ పైన కమెడియన్తు, కొత్తగా వచ్చిన వారైతే విలన్లు.. అంతే! అయితే ఏ చిత్రం కూడా వీళ్లతోనే పూర్తయిపోదు. వీళ్లకు తోడుగా అనేక ఇతర పాత్రలుంటాయి. అవే క్యారెక్టర్‌ పాత్రలు.
తమాషా ఏమంటే అసలు క్యారెక్టర్‌ అంటేనే పాత్ర. మరి క్యారెక్టర్‌ పాత్రలేమిటి అంటే ఇది సినిమా భాష. నాయికానాయకులు చుట్టూ తిరిగే సినిమా రంగంలో ఇతరత్రా ప్రాధాన్యత గల పాత్రలను ఆ పేరుతో పిలవడం కద్దు. మామూలు భాషలో చెప్పాలంటే తల్లులు, తండ్రులు, అన్నలు, వదినెలు, అత్తలు మామలు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, జానపదాల్లో రాజులు మంత్రులు వంటి పాత్రలు. ఇవన్నీ చెబుతుండగానే పాఠకుల కళ్లలో కొందరు మహామహులైన నటీనటులు కదలాడటం మొదలెడతారు. సందేహం లేదు-నాలుగు పదులకు అటూ ఇటుగా వున్నవారికి ఆ పై వారికి ముందుగా గుర్తుకు వచ్చే గంభీర విగ్రహుడు ఎస్వీఆర్‌. తర్వాత

కృష్ణశాస్త్రీయ గీతామృతం


తెలుగు తియ్యదనమూ, ప్రకృతి సౌందర్యమూ, ప్రేమ సౌకుమార్యమూ, మానవీయ మహత్వమూ కలబోసుకున్న మధుర భావకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావ కవితా పితామహుడుగా సుప్రసిద్ధుడైన ఆయన తెలుగు సినిమా పాటకూ గోరింట వన్నెలు అద్దారు. తర్వాతి కాలంలో మరెవరైనా సున్నితమైన పదాలతో సుకుమార గీతాలు రాసినా వాటిని వెనువెంటనే కృష్ణశాస్త్రి రచనలుగా పరిగణించేంత బలంగా చెరగని ముద్రవేశారు. మనసు లోలోతులు తాకే మధుర వీవన వంటిది ఆయన పాట. గుండెలలో గులాబీలు పూయించే సృజన శీలత ఆయన కలానిది. రాసిన పాటల సంఖ్య తక్కువే అయినా వాటి ప్రభావం ప్రాభవం అనితర సాధ్యమైనవి. మల్లీశ్వరితో బిఎన్‌రెడ్డి రంగ ప్రవేశం చేయించిన దేవులపల్లి వాణిజ్య చిత్రాలలోనూ తన బాణీ నిలబెట్టుకోవడం అసాధారణ విజయం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి చలన చిత్ర గీతాలు గతంలో మేఘమాల,గోరింట పేర్లతో సంపుటాలుగా వెలువడ్డాయి.ఇప్పుడు ఆ రెంటినీ కలిపి విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌ వారు ఒకే పుస్తకంగా తెచ్చారు. కృష్ణశాస్త్రి రచనా సర్వస్వంలో మూడవ సంపుటంగా వెలువడిన ఈ వెండితెర పాటలు రస హృదయులైన ప్రేక్షకులకు కవితాభిమానులకు గొప్ప కానుకలేనని చెప్పాలి.
సహజంగానే ఈ పుస్తకం మల్లీశ్వరి పాటలతో మొదలవుతుంది. అందులోని పదిహేను పాటలు కృష్ణశాస్త్రివే. అందులోకోతి బావకు పెళ్లంట, పరుగులు తీయాలి, పిలిచినా బిగువటరా వంటివి బాగా గుర్తున్నవే కాని అంతకంటే ప్రసిద్ధమైనవి ఇంకా చాలా వున్నాయి. పుస్తకానికి శీర్షికంగా అమరిన 'అందాల ఓ మేఘమేలా' 'ఔనా నిజమేనా' మనసున మల్లెల మాలలూగెనే వగైరాలు. బిఎన్‌ తీసిన మరో కళాఖండం ' బంగారు పాప'లో 'తళాంగు థకదిమి తోల్‌ బొమ్మ దీని తమాష చూడవె కీల్‌బొమ్మ' అన్న పాట వేదాంత ధోరణిలో సాగితే 'యౌవన మధువనిలో వన్నెల పూవుల వుయ్యాల' అనేది చక్కటి ప్రేమ గానం.'భాగ్యరేఖ'లోనూ ఆయన చాలా పాటలు రాశారు గాని అందులో

ఉద్వేగాల చెలగాటం రియాల్టీ 'షో'


ఈ రోజుల్లో ఏ రోజు ఎవరు మాట్లాడుకున్నా టీవీ ప్రసక్తి లేకుండా ముగియదు. ఒకప్పుడు సినిమాల్లో చూపించినట్టు అనేవారు ఈ రోజున ప్రతిదానికి టీవీనే ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే టీవీ జీవితాన్ని దృశ్యమానం చేసింది.
టెలివిజన్‌ కేవలం వినోద సాధనమే కాదు, సమాచార సాధనమే కాదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పార్శ్వాలన్నింటినీ ఒక్క దెబ్బలో సమన్వయ పర్చగలిగిన ఇలాంటి అపురూప సాధనం ఏదీ ఇంతకు ముందు మనుషులకు అందుబాటులో లేదు.
టీవీలో వచ్చే హింసా దృశ్యాలపైన లేదా వ్యాపార ప్రకటనలపైన తరచూ విమర్శలు వింటుంటాము. అవన్నీ నిజమే కాని అంతకంటే తీవ్రమైన ప్రభావం మన భావోద్వేగాలపై పడుతుంటుంది. అలాంటప్పుడు పది పదిహేనేళ్ల కిందటే ఈ మీడియా విస్తరించిన మన దేశం వంటి చోట్ల మరింత ఎక్కువగా ఈ ప్రభావం వుం డడం చాలా సహజం. మనకంటే దాదాపు యాభై ఏళ్ల ముందే టీవీ విప్లవం చూసిన అమెరికా వంటి దేశాల్లోనే దీని గురించి ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
టీవీ చూడాలంటే ఏకకాలంలో మన కళ్లు చెవులు కూడా పనిచేయాలి. ఏది ఎంత వరకు స్వీకరించాలి, ఏది అట్టిపెట్టుకోవాలి, ఏది తోసిపుచ్చాలి అని విశ్లేషించుకోవడానికి మెదడుకు వ్యవధి కావాలి కాని అంత వ్యవధి తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. చూసే ప్రేక్షకుల పరిపక్వతను బట్టి అది ఆధారపడి వుంటుంది. అన్ని వయస్సుల వారు కలసి చూసే పరిస్థితిలో ఇది మరింత సత్యం. సమస్య ఏమిటంటే చూసే వారిపైనే కాదు, పాల్గొనే వారిపైన కూడా టీవీ కార్యక్రమాల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. అందుకే అది అన్ని విధాల మనుషుల భావోద్వేగాలతో ముడిపడిన వేల కోట్ల రూపాయల వ్యాపారం. సామాజిక కళాత్మక కార్యక్రమంగా కనిపిస్తుంటుంది. కనుక పూర్తిగా వ్యాపారం అనడానికి కూడా వుండదు. సమాచార సంబంధమైన విధినిర్వహణగా అనిపిస్తుంటుంది. కాని.. ఆ క్రమంలో మన కష్టసుఖాలూ, బాధలూ భావనలూ, ప్రేమలు, చావులూ, హత్యలూ, భక్తి, రక్తి అన్నీ బహిరంగ విన్యాసాలుగా మారిపోతుంటాయి. ఎప్పుడైతే బహిరంగ

వైభవ విషాదం- సావిత్రి!


ఆమెను తల్చుకోగానే తెలుగు దనం తొణకిసలాడే ఒక కళాత్మక మహిళా మూర్తి మనసులో కదలాడుతుంది. అభినయం మూర్తీభవించిన విదుషీమణి సాక్షాత్కరిస్తుంది. నటీనటులు ధరించిన పాత్రలూ వారి వాస్తవ జీవితాలూ పెనవేసుకు పోవడం అరుదుగానైనా జరుగుతుంటుంది. అందులోనే అనేక వైరుధ్యాలూ వుంటాయి. అలాటి అరుదైన జీవితం సావిత్రిది! ఆమె తర్వాత ఎంత ప్రతిభా వంతులైన కథానాయికలు వచ్చినా ఒక పట్టాన ఆమెతో పోల్చలేని స్థితి కొనసాగుతూనే వుంది. వాణిశ్రీ, శారద, సుహాసిని, సౌందర్య ఇలాటి వారిని ఎంతగానో ఆరాధించేవారు కూడా. సావిత్రిలోని సంపూర్ణత్వం వుందని మాత్రం పూర్తిగా ఆమోదించలేరు. ఆమె వేసిన ముద్ర అంత ప్రగాఢమైంది.
కొంతమంది లాగా సావిత్రి బంగారు సోపానాలపై నడిచి రాలేదు. వెండి తెర ఆమెకు ఎర్రతివాచీలు పర్చి ఆహ్వానించలేదు. నటనపై ఎనలేని మక్కువతో- ఎన్ని సార్లు కాదన్నా ఎదురీద గల తెగువతో ఆమె పోరాడి నిలదొక్కుకుంది. తెరపై ఒక మూల ఒక్కసారి కనిపించే పాత్రలైనా ధరించేందుకు సిద్ధపడి తర్వాత అక్కడ ఎవరున్నా తననే చూపించకతప్పని

అమర గాయకుని అద్భుత గీతావళి


  హీరో కృష్ణకు పద్మభూషణ్‌ పురస్కారం లభించగానే ప్రతి ఛానెల్‌లో కనిపించిన దృశ్యం 'తెలుగు వీర లేవరా' అన్న పాట. తెరపై ఎందరో నాయకులు నాయికలు ప్రతినాయకులు విదూషకులు, వుండొచ్చు. తెర వెనక దర్శకులు నిర్దేశకులు సాంకేతిక నిపుణులు మరింత మంది వుండొచ్చు. వారు కలసి రూపొందించిన చిత్రాల్లో అమోఘమైన సన్నివేశాలు పోరాటాలు, నృత్యాలు, సంభాషణలు మరెన్నో వుండొచ్చు. కాని - సినిమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా గుర్తుండి పోయేవీ, నిరంతరం పెదవులపై కదలాడేవీ మాత్రం అందులోని పాటలే. తరాలు మారినా తరగని మాధుర్యం వాటిలో ఇమిడి వుండటమే ఇందుకు కారణం. సైగల్‌, మన్నాడే, మహ్మద్‌ రఫీ, కిశోర్‌ కుమార్‌, లతా మంగేష్కర్‌ వంటి వారి పాటలు అప్పటికీ ఇప్పటికీ భారతీయుల హృదయాలలో వెన్నెల పూలు పూయిస్తూనే వున్నాయి. ప్రేమ వియోగం, విషాదం, వినోదం తదితర రకరకాల సందర్భాలలో మదిలో మెదులుతూనే వున్నాయి. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ ఆ కోవలో అగ్ర గణ్యుడు అమరగాయకుడు ఘంటసాల.
ఘంటసాల పేరు తల్చుకోగానే ఆయన మధుర స్వరం నుంచి జాలు వారిన మనోహర గీతాలు మనస్సును నింపేస్తాయి. వేయికి పైబడిన పాటలు, పద్యాలలో వారి వారి అభిరుచిని బట్టి అనుభూతిని బట్టి

Tuesday, September 13, 2011

నవరసాల బాటసారి

కాస్త వంగి నడవడం..

లత, రాధా అని ప్రేమగా పిలిచినా 
అమ్మా అని బరువుగా పిలిచినా 
ఆ కాస్తలోనే విరుపూ మాటలోనూ మనిషిలోనూ
శాలువా కప్పుకుని బరువుగా నడవడం
వేలు పైకి లేపి మాట్లాడ్డం
అర్థవంతమైన ఆక్షేపణీయమైన రీతిలో బిగ్గరగా నవ్వడం
ఆడవాళ్లకన్నా నాజూగ్గా కనిపించాలని ప్రయత్నించడం
కళ్లు పైకి కిందికీ తిప్పుతూ ఎదుటి వాళ్లను శల్య పరీక్ష చేయడం
తెలుగు వారికి చిరపరిచితమైన ఈ లక్షణాలన్ని ఎవరివో మళ్లీ చెప్పాలా?

Discussion on Gali arrest - Part 4 - Tv9



Senior Journalist Telakapalli Ravi and Political leaders' discussion on Gali Janardhan Reddy arrest in mining scam and Jagan links with Gali brothers

Discussion on Gali arrest - Part 3 - Tv9



Senior Journalist Telakapalli Ravi and Political leaders' discussion on Gali Janardhan Reddy arrest in mining scam and Jagan links with Gali brothers

Discussion on Gali arrest - Part 2 - Tv9



Senior Journalist Telakapalli Ravi and Political leaders' discussion on Gali Janardhan Reddy arrest in mining scam and Jagan links with Gali brothers

Discussion on Gali arrest - Part 1 - Tv9

Tv9 - Opposition blames PM - Part 3

Tv9 - Opposition blames PM - Part 3

Tv9 - CM is fickle minded? - Part 2


Tv9 - CM is fickle minded? - Part 2




Tv9 - CM is fickle minded? - Part 1

Tv9 - CM is fickle minded? - Part 1


Monday, September 12, 2011

వూహించిన రీతిలోనే కెసిఆర్‌ వ్యాఖ్యలు


కరీం నగర్‌లో టిఆర్‌ఎస్‌ జన గర్జన సభ జయప్రదమవుతుందనడంలో ఎవరికీ  సందేహాలు లేవు. అలాగే అక్కడ కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా వూహించిన విధంగానే వున్నాయి. అయినా సకల జనుల సమ్మె, దానికి ముందు వెనక వివిధరకాల పిలుపులు ప్రజాస్వామిక పద్దతుల్లో కొనసాగాలని, ప్రాంతాల ప్రజల మధ్యఉద్రిక్తతలు పెంచబోవని ప్రతివారూ కోరుకోవాలి. ఈ సభకు ముందు రోజే మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన అసందర్భ వ్యాఖ్యలు కెసిఆర్‌ బాగా కలిసి వచ్చాయి. ఈ సభ జరుగుతున్నప్పుడే ఢిల్లీలో కావూరి సాంబశివరావు తదితరుల ఆజాద్‌ను కలుసుకుని మీడియా దగ్గర స్పందిస్తున్నారు. ఈ పరస్పర ప్రాంతీయ భాషణాలు వారి వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వున్నాయనడం నిస్సందేహం. ఎందుకంటే అంతర్గతంగా చర్చించిన అంశాలు ప్రాంతాలను బట్టి నాయకులు ప్రకటిస్తుంటే ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వ్యాఖ్యానిస్తుంటే ప్రజలు కోరుకునే ప్రశాంతత మరింత దూరమై పోతుంటుంది. గత కొన్ని వారాల విరామం తర్వాత వివాదాలు మళ్లీ రాజేయాలని వీరంతా కృత నిశ్చయంతో వున్నారు. వాటిని కెసిఆర్‌ ఇతరులు అందిపుచ్చుకోవడం ఎలాగూ

బాలయ్య ..... బావయ్య



నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలని డైలాగు చెప్పిన బాలయ్య సింహౌత్సాహంతో రామరాజ్యం కేసి ఆశగా చూస్తున్నారు. ఈ దశలో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంపై రకరకాల వూహాగానాలు సాగుతున్నాయి. జనాకర్షణ గల నటుడుగా ఆయన ప్రకటనను తెలుగుదేశం శ్రేణులు ఆహ్వానించడంలో ఆశ్చర్యం లేదు. అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించాడు. ఒకప్పుడు అనంతపురంలో ఎన్టీఆర్‌ బాలయ్య నా రాజకీయ వారసుడు అని ప్రకటిస్తే రాజకీయ ప్రకంపనాలు పుట్టాయి.అలాటిచోటనే బాలయ్య ఇప్పుడు ఈ ప్రకటన చేస్తే చంద్రబాబు ఆహ్వానించడం మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇంతకూ బాలయ్య బావయ్య బాబయ్య ఎవరైనా కుటుంబాల పరిధిలో వారే గనక

నకిలీ కంపెనీల పేర్లతో నయ వంచన

ఎమ్మార్పణం-3

ఏజంటుగా నియమించుకున్న స్టైలిష్‌ హౌమ్స్‌కు చదరపు గజం రు5000 చొప్పున 100 ప్లాట్లు అప్పగించాలని, ఏజంటు ప్రతి విల్లాపైన నాలుగు శాతం తన కమిషన్‌గా అదనంగా వసూలు చేయొచ్చని దానితో కుదర్చుకున్న ఒప్పందంలో అవకాశమిచ్చారు. వాస్తవానికి అక్కడ భూమి ధర ఇంతకంటే డజను రెట్టు ఎక్కువ వుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై వేలకు తక్కువ కాదు. అయినా మొదటి వంద ప్లాట్లు ఏజంటు ఈ రేటుకే అమ్ముకోవాలని, మిగిలినవి మార్కెట్‌ రేటు ప్రకారం విక్రయించవచ్చునని అవకాశమిచ్చారు. ఆ తర్వాత 2-5-05 న ఎమ్మార్‌ ప్రతినిధులు మరో కొత్త పేరును తెచ్చారు. అప్పటికే తాము భాగస్వామిగా చేర్చుకున్న ఎంజిఎఫ్‌ గ్రూపు అనుబంధ సంస్థ అయిన ఫ్రిడ్జి హౌల్డింగ్స్‌ లిమిటెడ్‌కు తమ 74 శాతం వాటాలో 34 శాతం ఇచ్చేందుకు అంగీకరించాలని కోరారు.ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పంపిణీ ఏర్పాట్లు మార్చనవసరం లేదని ఎపిఐఐసి అధికారులు చెప్పారు. 2005 జూన్‌ 6న ఎపిఐఐసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొదటి దశకు సంబంధించిన రాస్తూ భూమి లావాదేవీలు ఇంకా మొదలు కాకుండానే నగదు తీసుకుంటున్నట్టు తెలిసిందని, ఇది సంయుక్త వ్యవహారం గనక తమతో కలసి వ్యవహరించాలని కోరారు.అంటే అప్పటికే పరిస్థితి చేజారడం