Pages

Saturday, June 16, 2012

అవినీతికి ఆమోదమా? అధినేతలకు గుణపాఠమా?


18 ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలే వచ్చాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లేదా జగన్‌ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో విజయం సాధించారు. చాలా చోట్ల భారీ మెజారిటీలు లభించాయి. రాష్ట్ర రాజకీయ రంగంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావ ప్రక్రియ దీనితో పూర్తయినట్టే. బంగ్లాకాంగ్రెస్‌, ఉత్కళ కాంగ్రెస్‌, కేరళ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌, తమిళ మానిల కాంగ్రెస్‌ వంటి పార్టీల తరహాలో మరో ప్రాంతీయ కాంగ్రెస్‌ అవతరించి బలం ప్రదర్శించింది. సిబిఐ కేసులు, అరెస్టులు ఆరోపణల నేపథ్యం వున్నా జగన్‌ అభ్యర్థులను ఎన్నుకున్నారన్నది నిజం. అయితే ఈ విజయంతో ప్రజలు ఆయనపై ఆరోపణలన్ని తోసిపుచ్చారనీ,న్యాయం చేశారని భావిస్తే అది అనుచితమే. రాజకీయంగా ఈ సారి కాంగ్రెస్‌ స్థానంలో జగన్‌ పార్టీని ఓటర్లు స్వీకరించారు. ప్రభుత్వ నిర్వాకాలపై , రాష్ట్రంలో రాజకీయ ౖ అనిశ్చితిపై పరిపాలనా ప్రతిష్టంభనపై ప్రజల అసంతృప్తి ఆగ్రహం ఈ తీర్పులో ప్రతిబింబించాయి. వైఎస్‌ఆర్‌ పథకాల ప్రచారం సామాజిక కోణాలు కూడా ప్రధాన పాత్ర వహించాయి. కేవలం సానుభూతితోనో మహిళల కన్నీళ్ల వల్లనో గెలిచారని లేక ప్రజలు తప్పుగా తీర్పు నిచ్చారని అంటే అది పాక్షికత్వం అవుతుంది.
ప్రాథమికంగా ఇది కాంగ్రెస్‌కు తిరసృతి. రెంటిని మినహాయిస్తే తక్కిన అన్ని చోట్ల పాలకపక్షం తన స్థానాలు కోల్పోయింది. శంకరరావు, దివాకరరెడ్డి వంటి పార్టీ నాయకులు భిన్న స్వరాలు వినిపించడం మొదలెట్టారు.మంత్రి మాణిక్యవర ప్రసాద్‌ ఒక విధమైన పునర్య్యవస్థీకరణ గురించి మాట్లాడారు. కనక చాలా మార్పులు
రావచ్చు. ఈ ఓటమిని అవకాశంగా తీసుకుని కిరణ్‌ వ్యతిరేక వర్గం దుమారం లేవదీసే అవకాశాలు కూడా ఎక్కువ.
కాంగ్రెస్‌కు ఇంతగా గండి పడినా విశ్వసనీయత పొందని కారణంగానే తెలుగు దేశం ఏ మాత్రం ప్రయోజనం పొందలేకపోయింది. వారు బాగా ఆశలు పెట్టుకున్న స్తానాలలోనే బాగా దెబ్బ తిన్నారు. అహౌరాత్రాలు అవిరామంగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇవి మా స్థానాలు కావు అని చేసిన వాదన అతికేది కాదు. ఈ ఫలితాలు తెలుగు దేశంను కూడా తీవ్రమైన కుదుపులకు గురి చేస్తాయి. వారేమీ పాఠాలు నేర్చుకుంటారో చూడాలి.
సిపిఎం పోటీచేసిన చోట్ల చాలా పరిమితంగా ఓట్లు రావడం వూహించిందే. అయితే మూడు పాలక పార్టీలతో చేరకుండా స్వంతంగా నిలబడటం మాత్రం చాలా మందికి నచ్చింది.
పరకాలలో సురేఖ ఇచ్చిన పోటీ తెలంగాణా రాజకీయాలలో కొత్త పాఠం. ఇక్కడ బిజెపిపై కేంద్రీకరణ వుంచిన టిఆర్‌ఎస్‌ కూడా ఏకసూత్ర రాజకీయాలే ఎల్లకాలం చెల్లవని తెలుసుకోవలసి వచ్చింది. అలాగే తెలంగాణాపై బిజెపి ఆశలు ఆదారం లేనివని తేలిపోయింది.
ఈ ఫలితాల తర్వాత కొంతమంది అవినీతి గెలిచిందని ఆవేదనకు ఆశాభంగానికి గురి కావడం మరికొంత మంది అవినీతి సమస్యే కాదని తేల్చిపారేయడం కూడా పాక్షికంగానే వాస్తవం. పాలక కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశంకీలక సమస్యలపై అవకాశవాదానికి పాల్పడుతున్నాయన్న భావం ఓటర్లను బాగా ప్రభావితం చేసింది. ఈ రెండేళ్లలోనూ జగన్‌, తెలంగాణా అనే రెండు అంశాల చుట్టూనే రాష్ట్రంలో రాజకీయ చర్చలన్ని తిప్పారు. ఈ రెండు విషయాల్లోనూ కాంగ్రెస్‌ తెలుగుదేశం పరిపరివిధాల ప్రవర్తించాయి. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మొదట్లో సంతకాలు చేసినప్పటి నుంచి ఆయనను సిబిఐ అరెస్టు చేసిన వరకూ చూస్తే కాంగ్రెస్‌ నేతల మంత్రుల పోకడలు అనేక విధాల మారిపోయాయి. వైఎస్‌ మృతదేహం వుండగానే సంతకాల సేకరణ గురించి మాట్లాడేవారు తాము కూడా సంతకాలు చేశామన్న మాట దాటేస్తుంటారు. అధిష్టానం ఆమోదం లభిస్తుందనుకున్నప్పుడు వంధిమాగధుల్లా వ్యవహరించారు. అది జరగదని తేలాక నెమ్మదిగా స్వరం మార్చారు.జగన్‌ ఆ మార్పును ఆమోదించకుండా తనకే వారసత్వ పీఠం దక్కాలన్న తపనతో కొనసాగారు. ఇందుకు ఓదార్పును ఒక సాధనంగా ఎంచుకున్నారు. దానికి అధిష్టానం ఒప్పుకోలేదన్న పేరుతో పార్టీనుంచి బయిటను నడిచి స్వంత సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. కులం ధనం ప్రధాన పాత్ర వహించే రాజకీయ పరిస్తితుల్లో ఆయనకు అనుకూలంగానూ వ్యతిరేకంగానూ శక్తుల సమీకరణ జరిగింది. తెలుగు దేశం కూడా జగన్‌ వ్యూహాలను మొదట చూసీ చూడనట్టు ఉపేక్షించి తర్వాత దాడికి దిగింది. 2009 ఎన్నికల్లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా వుండగా తను ప్రచురించిన ఆవినీతి ఆరోపణలను ఇందుకు కేంద్ర బిందువుగా చేసుకున్నది. వైఎస్‌ ప్రత్యర్తిగా పేరొందిన.శంకరరావు వాటినే కోర్టుకు తీసుకెళ్లడం అది స్పందించి దర్యాప్తుకు ఆదేశించడంతో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. తర్వాత ఆ కేసులో తెలుగుదేశం నేతలు కూడా చేరారు.ఇందుకు ప్రతిగా జగన్‌ తల్లిగారైన విజయమ్మ చంద్రబాబుపై కేసు వేసి కొంత పురోగతి సాధించినా తర్వాత న్యాయస్తానమే పగ్గాలు వేసింది. జగన్‌,విజయ లక్ష్మి కడప ఉప ఎన్నికలలో అఖండ విజయం సాధించడం, ఆలస్యంగా తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం తెస్తే సమర్తించడం,అంతకంటే ఆలస్యంగా వారిపై అనర్హత వేటు వేయడం, ఆ స్థానాల ఉప ఎన్నికలకు కాస్త ముందుగా జగన్‌ను అరెస్టు చేయడం జరిగాయి.
అరెస్టు కావడానికి ముందు రోజు వరకూ జగన్‌ ఓదార్పు పేరుతో తిరుగుతుంటే తెలుగుదేశం నేత కూడా తన శైలిలో పర్యటనలు విమర్శలు చేస్తూనే వచ్చారు.కాగా కాంగ్రెస్‌ మాత్రం ఈ విషయంలో ఎలా స్పందించాలో తెలియక తికమకపడింది. ఈ మధ్యలో లిక్కర్‌ సిండికేట్‌ పేరిట ఎసిబి జరిపిన దాడులు ముఖ్యమంత్రి కిరణ్‌కు పిసీసీ అద్యక్షుడైన మంత్రి బొత్సకు మధ్య రాజకీయ యుద్దంలా మారాయి. దాన్ని సర్దుబాటు చేసేందుకై అధిష్టానం ఉభయులను పిలిపించి మాఫియా కేసులనే మాఫీ చేసేందుకు సిద్ధమైంది. జగన్‌ పై అవినీతి ఆరోపణలు దర్యాప్తును ఆహ్వానించేవారంతా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ ద్వంద్వనీతిని ప్రశ్నించాల్సి వచ్చింది. జగన్‌ కేసులోనూ ప్రభుత్వం తరుపున ఉత్తర్వులపై సంతకాలు చేసిన మంత్రులను బాధ్యులను చేసే విషయంలో కాంగ్రెస్‌ నాయకత్వం తటపటాయింపులకు గురైంది. ఇదే కాలంలో ప్రజలపై భారాల మోత, అస్తవ్యస్త పాలనతో అవస్తలు అన్నిటినీ మించి తెలంగాణా సమస్యపై దాగుడు మూతలు షరామామూలుగా సాగుతూ వచ్చాయి. తెలంగాణా సమస్యలో అస్పష్ట వైఖరితో పదే పదే తిరస్కరణకు గురైన తెలుగు దేశం ఇతరత్రా కూడా ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తేలేకపోయింది. ఎంతసేపూ తమ పాలన స్వర్ణయుగమని పొగుడుకోవడం, ఇతరుల అవినీతిపై , అసమర్థతపై దండకాలు చదవడం తప్ప ఆత్మ విమర్శ లవలేశం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ను తలపించే రీతిలో తెలుగుదేశం లోనూ అసమ్మతి రాగాలు, అత్యున్నత స్థాయిలో అంతర్గత కలహాలు శాసనసభ్యుల వలసలు సాగాయి. ఇలాటి పరిస్తితులలోనే జగన్‌ గట్టిగా నిలబడతాడన్న ప్రచారం వైఎస్‌ఆర్‌ పార్టీ వ్యూహాత్మకంగానూ వుధృతంగానూ సాగించింది. ఆయనపై ఆరోపణలన్ని అసత్యాలని, అరెస్టు కక్ష సాధింపేనని ఏక ధాటిగా ప్రచారం చేసింది. పాశ్చాత్య దేశాల తరహాలో వృత్తిపరమైన ప్రచార నైపుణ్యం ప్రదర్శించారు. ఇంతకాలం ఉపేక్షించి సరిగ్గా ఉప ఎన్నికల ముందు అరెస్టు చేయడంలో రాజకీయాల ప్రభావం వుందని సిబిఐ గత చరిత్రను బట్టి ఆరోపించే అవకాశం వారికి కలిగింది. దీనికి తోడు కాంగ్రెస్‌ నేతలను మంత్రులను(ఒక్కరు మినహా) సలహా దారులను అంటుకోకపోవడం సందేహాలు పెంచింది. కేంద్ర కాంగ్రెస్‌ నాయకులు కూడా మాతో వుంటే మహాయోగం పట్టేదని లేనందునే కారాగారం ప్రాప్తించిందని అనడం అసలు సంగతి బయిటపెట్టింది.ఇలాటి అనేకానేక అవకాశవాదాలు అప్రజాస్వామిక నిర్నయాలపై ఆగ్రహం ఉప ఎన్నికల తీర్పులో కనిపించింది.
ఉన్న పరిస్థితుల్లో అవకాశాన్ని అంచనాలను బట్టి ప్రజలు ఓటు వేస్తుంటారు. జగన్‌ను కాదని తక్కిన రెండు పార్టీలను ఆదరించాలని ఓటర్లకు అనిపించలేదు. ఆయనపై వారి ఆశలు భ్రమలే కావచ్చు గాని ప్రస్తుతానికి పై చేయి సాధించాయంటే అధికారంలో వున్నవారిపై అసంతృప్తి మొదటి కారణం మామూలుగానే ఒక పాలక పార్టీ మూడోసారి వరుసగా గెలవడం చాలా కష్టం.అలాటిది వరుస సంక్షోభాలతో స్తంభించిపోయిన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మూడో సారి గెలవడం పెద్ద సవాలు అని కాంగ్రెస్‌ వారే మొదటి నుంచి చెబుతున్నారు.జగన్‌ బయిటకు వెళ్లడానికి, వున్న వాళ్లు ఇప్పుడే ఇళ్లు సర్దుకోవాలని అదుర్దా పడటానికి అదే కారణం. ఇది ప్రస్తుత ఘట్టం.రేపు ఎలా వుంటుందనేది జరిగే పరిణామ క్రమంపైన నేర్చుకునే పాఠాలు చేసుకునే మార్పులపైన ఆధారపడి వుంటుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో అవినీతి భరితమైన ప్రస్తుత వ్యవస్థలో అదొక్కటే ప్రజల తీర్పును ప్రభావితం చేయకపోవచ్చు. దాంతోపాటు ఇతర అంశాల ప్రభావం కూడా వుండకపోదు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షంపై అవిశ్వాసం వల్ల ప్రజలు తమకు వేసిన ఓట్లను తమపై ఆరోపణల తిరస్కరణగా వైఎస్‌పార్టీ చిత్రించితే అది చాలా తప్పవుతుంది. న్యాయస్తానాలలో విచారణ ఎలా వుంటుంది , సిబిఐ దర్యాప్తు ఎంత వేగంగా సాగుతుందనేది ముందు ముందు చూడాల్సిన విషయం. ఆ విషయాలు ఎలా వున్నా ఇప్పటికైనా ప్రజల సమస్యల పరిష్కారం ప్రధానంగా చేసుకున్న రాజకీయ ఎజెండా ముందుకు తీసుకురావడం అవసరం. ఎవరి అవినీతి ఎంత,అందుకు ఎవరి దోహదం ఎంత అన్నది ఎలా వున్నా అన్యాయమై పోయిన ప్రజల ఆస్తులను ప్రకృతి వనరులను స్వాధీనపర్చుకుని ప్రజలకు అప్పగించవలసిందే. ప్రభుత్వం అలాటి ఆసక్తి ప్రదర్శిస్తుందో లేదో చూడాలి. అవకాశవాద పోకడలను ప్రజావ్యతిరేక చర్యలను విడనాడకపోతే ప్రభుత్వ పతనం అనివార్యమని హెచ్చరించే ప్రమాద ఘంటికలే ప్రస్తుత ఫలితాలు.

8 comments:

  1. @విజయమ్మా...షర్మిలా...జగన్ అరెస్ట్....ఇవేమీ కాదు..కేవలం పధకాలే!!ఈ వోట్ బాంక్ ను ఎప్పుడో సృష్టించాయి...హృదయ విదారకమయిన వైఎస్స్ మరణమ్ ప్రజల మనస్సులో విపరీతమైన సానుభూతిని ఏర్పరిచి... అగ్ని పర్వతం లా జనాల మనస్సులో ఎప్పటి నుండో ఉంది... అది ఇప్పుడు రూపం ధరించింది....ఒక్కసారి జనాలలోకి వెళ్ళి గమనించండి....

    తర్వాతి ఎలక్షన్లలో కూడా వీళ్ళే విజేతలు...

    ReplyDelete
  2. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి..
    గొర్రెచాటు మందకి ఈ జ్ఞానబోధ దేనికి..

    నయావంచనలో ఇదో నవశకం... అంతే

    ReplyDelete
  3. kvsv గారు చెప్పింది correct.రాజశేఖర రెడ్డి గారి మీద జనానికున్న అభిమానం జగన్ పార్టీని ఒకసారైనా గద్దె ఎక్కించకుండా పోదు.ఆ తర్వాత జగన్ ఏంచేస్తాడనే దాన్ని బట్టి ఆ పార్టీ భవిష్యత్తు నిర్ణయింప బడుతుంది.అవినీతికి ఆమోదమా? అని మీరు అడగనక్కర లేదు.జనం దృష్టిలో జగనెంత అవినీతి పరుడో కాంగ్రెసువారూ చంద్ర బాబూ అంతే అవనీతి పరులు.రాజశేఖర రెడ్డి బ్రతికున్నన్నాళ్ళూ సూట్ కేసులతో డబ్బంతా సోనియాకు తీసుకెళ్ళి ఇచ్చేవాడని గోల చేసిన బాబు గారు ఇవాళ మేడమ్ అవినీతి పరురాలని మాట్లాడరేమి?సోనియాను ఏమయినా అంటే తాను కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందనే భయమా? జగన్ అవినీతిని కోర్టులు తేల్చే అవకాశం ఉంది. మరి తప్పించుకు తిరుగుతున్న దొంగలింకెవరూ లేరా? లేరు అని చెప్పగలిగితే ఆంధ్రులమంతా అదృష్టవంతులమే. ఎందు చేతనంటే ఆ ఒక్కడూ జైల్లోనే ఉన్నాడు కదా? హాయిగా నిద్ర పోదాం. ఏ పార్టీకి ఓ టేస్తే అవినీతికి పట్టం కట్టినట్టు కాదో కూడా శలవిస్తే జనం వారికే ఓటేస్తారు. జనాన్ని గొర్రెలంటున్న మేధావులు వారిని తిట్టకోవడం కాకుండా స్పష్టమైన దారి చూపించండి.అవినీతి లేని పార్టీని చూపించి వారిని
    ఆదుకోండి.

    ReplyDelete
    Replies
    1. /రాజశేఖర రెడ్డి బ్రతికున్నన్నాళ్ళూ సూట్ కేసులతో డబ్బంతా సోనియాకు తీసుకెళ్ళి ఇచ్చేవాడని గోల చేసిన బాబు గారు ఇవాళ మేడమ్ అవినీతి పరురాలని మాట్లాడరేమి?/
      ఆహా!!
      చంద్రబాబు సోనియా గురించి మాట్లాడాలని మీరు కోరడమేమిటో! :))
      జగన్ అప్పుడు చూపిన వినయం, విధేయత ఇప్పుడు ఏదీ? దోచినంత వరకూ బాగానే వుండిందా? ముఖ్యమంత్రిని చేయనంటే సోనియమ్మ దయ్యంలా ఎందుకనిపిస్తోంది? దీనికి జవాబు చెప్పండి, తక్కిన విషయాలపై మీ అమూల్యాభిప్రాయాలు సావకాశంగా వింటాము.
      /మరి తప్పించుకు తిరుగుతున్న దొంగలింకెవరూ లేరా?/
      ఆ వున్నారు, తప్పించుకు తిరుగుతున్న ఘరాన దొంగ దొరికాడు, అందరినీ పట్టుకునే దాక వదిలి వేస్తామంటారా పోలీసు మహాశయా! మిమ్మల్ని జగన్ హోంమంత్రిని చేస్తే ఇక హాయిగా నిద్ర పోదాం.
      /జనాన్ని గొర్రెలంటున్న మేధావులు వారిని తిట్టకోవడం కాకుండా స్పష్టమైన దారి చూపించండి.అవినీతి లేని పార్టీని చూపించి వారిని
      ఆదుకోండి./
      మీరేం చూపిస్తున్నారు?! అవినీతి దారి తప్ప మరో దారే లేదంటున్నారు, అంతే కదా! ఇలాంటి వాళ్ళను పీకల దాకా పూడ్చి , ఏనుగులతో తొక్కించడం ఓ పాత సినిమాలో చూశాను. :)) ఆ ఆటవిక రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటాను.

      Delete
  4. ఇదే జనాలు ఒక నాడు తెలుగు దేశానికి వోటు వేశారు ,అప్పుడేమో మంచికి వోటు వేశారు ,వీళ్ళు చరిత్ర సృష్టించారు అని అన్నారు ,ఇవాళ తమకి వోట్లు వెయ్యక పొతే జెనాలు గొర్రెలా? ఏమిటి ఈ పక్ష పాతం?
    అసలు ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఊహించినవే. నిరంతరము ప్రజల్లో ఉంటూ ,ప్రజల సమస్యల పై పోరాడే వాళ్లకి ఎప్పుడయినా ప్రజాదరణ ఉంటుంది అని జగన్ నిరూపించాడు. ఇక బాధ అంటారా ఆ 'రెండు పత్రికలకు', కొంత మంది కుల పిచ్చి తో రగిలిపోయే వంకర గాళ్ళకి.
    మిగతా జనం అందరూ బాగానే ఉన్నారు. ప్రజా తీర్పు ని అపహాస్యం చేయకుండా ,ఆత్మా శోధన చేసుకొని ప్రజా సమస్యల మీద పని చేస్తే ఆ పార్టీలకి ,ప్రజలకి మంచిది . లేదంటే ఇటువంటి పరాభవాలు మళ్ళీ మల్లె తప్పవు. ఈ సంకర ఏడుపులు జీవితాంతం కంటిన్యూ అవుతాయి.

    ReplyDelete
  5. అవినీతి ఆరోపణలతో జైల్లో వున్న ఓ వ్యక్తికి ఓటేసిన వాళ్ళు ఒట్టి అమాయకపు గొర్రెలనుకోలేము, మూర్ఖపు గొర్రెలు, అవినీతి తాయిలాలకు అలవాటు పడిన గొర్రెలు అనుకోవచ్చు.
    రేపు చంద్రి, రామోజి, బొత్స, సబిత, మరెవరికైనా జైల్లో వుంటే వర్తిస్తుంది.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete