Pages

Saturday, December 3, 2011

అవిశ్వాస పర్వం: టీ కప్పులో తుపాన్లు




ఎట్టకేలకు శాసనసభలో తెలుగు దేశం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌ స్వీకరించి చర్చకు అనుమతించారు గనక ఇక రెండు రోజుల పాటు దృష్టి దానిపైనే కేంద్రీకృతమవుతుంది. దీన్ని బలపరుస్తామని దాదాపు ప్రతిపక్షాలన్ని ప్రకటించాయి. జగన్‌ వర్గం కూడా అదే వైఖరి తీసుకుంది. అయితే జగన్‌ వెనక ఎందరున్నారు, వున్నవారిలో ఎందరు నిలబడతారు అన్నది మాత్రం ఇంకా సందేహంగానే వుంది. ఆ విధంగా ఇది ఆయనకూ విశ్వాస పరీక్ష వంటిదే అనుకోవాలి. ఈ సమయంలో చిరంజీవి శిబిరం( లేదా శాసనసభలో సాంకేతికంగానే మిగిలి వున్న పిఆర్‌పి) అసంతృప్తి టీ కప్పులో తుపానులా ముందుకొచ్చింది. బహుశా చాలా మాసాల తర్వాత రద్దయిన పిఆర్‌పి వునికిని ప్రత్యేకంగా చూపించిన సందర్భమిది. దీన్ని అలుక ఆసంతృప్తి ఆగ్రహం ఇలా ఏ పేరుతో పిలిచినా పెద్ద తేడా లేదు. వీటన్నిటినీ కలిపినా మాజీ ప్రజారాజ్య నేతల బాధను పూర్తిగా వ్యక్తం చేయలేవు. అయితే వారికి వున్న అవకాశాలేమిటనే ప్రశ్న అంతకన్నా ముఖ్యమైంది.చిరంజీవి పార్టీని లీనం చేయడమే అనివార్య పరిస్థితుల్లో తన వెనక వున్నవారిని తనే నాయకుడుగా మిగలడానికి చేసిన పని. ఇప్పుడు జగన్‌ వెనక వున్న వారే పాలక పక్షం ఆకర్షణలో లాగేయబడుతుంటే ఉనికిని వదులుకున్న పిఆర్‌పి చేయగలిగింది స్వల్పం. కాకుంటే ఏ కారణంతో లీనమైనారో ఆ పరీక్షా సమయం వచ్చింది గనక సన్నివేశానికి తగినట్టు బెట్టు చూపించి మెగాస్టార్‌ రక్తి కట్టించారు. ఎలాగూ కాంగ్రెస్‌తో రాజీకి రాకపోతే జగన్‌ విషయంలో జరిగిందే తమ పార్టీ విషయంలోనూ జరుగుతుందని ఆయనకు బాగా తెలుసు. గులాం నబీ ఆజాద్‌ తప్ప ఇతర పార్టీల నాయకులెవరూ చిరంజీవితో మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే కారణమదే.అలాగే టిఆర్‌ఎస్‌ నేతలు గాని, కోదండరామ్‌ గాని పిలుపునిచ్చినా కాంగ్రెస్‌ సభ్యులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి ముందుకు రాలేదు. కనక అవిశ్వాసం నెగ్గే అవకాశాలు దాదాపు కనిపించడం లేదనే చెప్పాలి. కనీసం ఈ పేరుతో ప్రజా సమస్యలపైనైనా సమగ్ర చర్చ జరిగితే పదివేలు. అయితే సాధారణంగా ఇలాటి చర్చల్లో రాజకీయాలే ప్రధానమై సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రధానమై పోవడం కద్దు. ఖచ్చితమైన ముగింపు సోమవారం. అయితే ఈ తీర్మానం వీగిపోయినా అది ప్రభుత్వానికి గొప్ప సుస్థిరత తెస్తుందని అనుకోవడానికి లేదు.

No comments:

Post a Comment