Pages

Wednesday, June 22, 2011

ప్రొఫెసర్‌ జయ శంకర్‌ ...ఒక దీపస్తంభం



తాము పూర్తిగా ఏకీభవించని వారినెవరినైనా ఇతరులు గౌరవిస్తున్నారంటే అది వారి వ్యక్తిత్వానికి ప్రతీక. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ అక్షరాలా అలాటి వ్యక్తి. అరవై ఏళ్లపాటు ఒకే మాటకు బాటకు కట్టుబడి నిస్వార్థంగా నిష్కల్మషంగా నిలబడ్డారు. తెలంగాణా విముక్తికి మొదటి తరంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి వారు ప్రతీకలైతే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత కాలంలో ఆ ప్రాంత సమస్యలకు ఆయన ప్రతిధ్వని అయ్యారు. అది పదవులతో ప్రచారాలతో సంబంధం లేని భావాత్మక ప్రాతినిధ్యం. అనుకున్నది జరక్కపోయినా ఆకాంక్షకే కట్టుబడిన దృఢమైన ప్రాతినిధ్యం. విద్యా రంగంలో వున్నతమైన బాధ్యతలు నిర్వహించినా రాజకీయ నేతలకు గురుపీఠంలో భాసించినా జయ శంకర్‌ నిబద్ధంగా నిరాడంబరంగా సంచరించారు. తనకు చాలా ఇష్టమైన మాటల్లో చెప్పాలంటే చెన్నారెడ్డి నుంచి చిన్నా రెడ్డి వరకూ రకరకాలైన రాజకీయ పాత్ర ధారులు మారారు గాని తాను సూత్రధారిగానే వుండిపోయారు.వచ్చీ పోయే నౌకలకు దారి చూపిస్తూ వుండిపోయే దీపస్తంభమే
అయ్యారు.ఆయన ఆలోచనలను అన్ని వేళలా అందరూ ఒప్పుకుని వుండకపోవచ్చు గాని ఆయన అంకిత భావం, అధ్యయన శీలత, ఆచరణకు ప్రాదాన్యత నివ్వడం, ఆడంబరాలకు అట్టహాసాలకూ దూరంగా వుండటం ఇవన్నీ ఆదర్శప్రాయమైనవి.
నాయకత్వం అనేక విధాల పట్టుపడుతుంది. భూస్వామ్య సంప్రదాయాలు గల దేశాల్లో కుటుంబ వారసత్వం వొక మార్గం. పదవుల వల్ల, పై నుంచి ఆమోదం వుండటం వల్ల, ఒకానొక చారిత్రిక సన్నివేశం వల్ల మనుషులు నాయకులవువుతుంటారు. కాగా తమ నైతికతతోనూ జ్ఞాన సంపదతోనూ పట్టుదలతోనూ పోరాట పటిమతోనూ మరికొందరు నాయకత్వ పాత్ర పోషించగలుగుతారు. అధికార పూర్వకమైన నాయక స్థానాలలో మార్పులు చేర్పులుంటాయి గాని నైతిక సైద్ధాంతిక కారణాల వల్ల లభించే నాయకత్వాలు అలా కాదు. వర్తమాన తెలంగాణా రాజకీయ దృశ్యంలో జయ శంకర్‌ది అలాటి నైతిక నాయకత్వమే. అది బలం బలహీనత కూడా.బలం ఏమిటంటే ఆటు పోట్లకు అతీతంగా కొనసాగడం.బలహీనత ఏమంటే తమ భావ పరివ్యాప్తికి ఎవరిపైనైనా ఆధారపడవలసి రావడం. నాయకుడు ఎవరైనా నేను నా భావాల విస్తరణకే ఉపయోగించుకున్నానని ఆయన తరచూ చెబుతుండేవారు. అయితే ఈ ఉపయోగించుకోవడం అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. ఈ సంగతి తెలుసు కనకే వీలైనంత వరకూ ప్రత్యక్ష పదవులకు దూరంగా మసిలారు. 1969 ఉద్యమం తర్వాత చెన్నారెడ్డి తనను ఎన్నికల్లో పోటీ చేయమని పిలిస్తే నిరాకరించానని,అలా చేసి వుంటే తను కూడా ఒక మదన్‌ మోహన్‌ లాగా మిగిలిపోయేవాడినని ఆయన ఒకసారి ఈ రచయితతో మాట్లాడుతూ అన్నారు. దాదాపు గంట సేపు రాష్ట్ర రాజకీయాలకు, వ్యక్తులకు సంబంధించి వివిధాంశాలపై జరిపిన చర్చ ఆయన అవగాహన విస్త్రతికి అద్దం పట్టిందనే చెప్పాలి.అప్పటికే ఆయన జర రుజ భారాలతో కాస్త మెత్తగా వున్నారు.
1952కు ముందు తెలంగాణా ప్రతేక రాష్ట్ర వాదన వుండేది కాదని సుందరయ్య రాశారు. తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రం కోరిన వారిలో భిన్న తరహాలకు చెందిన వారున్నారు. తరాలకు చెందిన వారున్నారు. 1954లో ఫజల్‌ అలీ కమిటీ దగ్గరే ప్రత్యేకంగా వుండాలని జయశంకర్‌ మెమోరాండం ఇచ్చారంటే మొదటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు ఆయన వ్యతిరేకంగానే వున్నారనేది స్పష్టం. ఫజల్‌ అలీ సిఫార్సులపైన వాటి అమలుపైన అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఆనాడు దానికి మెమోరాండాలు ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు పలువురు తర్వాత తమ వైఖరి మార్చుకున్నారు. ఉదాహరణకు రాష్ట్ర ఏర్పాటుపై హడావుడి వద్దని అంతకన్నా ముందే దస్త్రం సమర్పించిన నీలం సంజీవరెడ్డి తర్వాత తనే మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మర్రి చెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డి వంటివారు మంత్రులయ్యారు. తమ రాజకీయ భవితవ్యాలు మారగానే ప్రత్యేక మంత్రం చేపట్టి మళ్లీ మానుకున్నారు. ఆ దశలో జయ శంకర్‌ వారికి మద్దతుగా నిలిచి తర్వాత నిరుత్సాహానికి గురైనారు. ఇక వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి హయాంలోనూ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్ర పల్లవి ఆలపించి సోనియా గాంధీకి మెమోరాండం ఇచ్చినప్పుడు వారితోనూ జయ శంకర్‌ వుండి విషయ పుష్టి కలిగించేందుకు కారకులైనారు.
అంతకు ముందు కాలంలో విభజన ఉద్యమానికి 90 ల తర్వాతకూ తేడా ఏమంటే అస్తిత్వ రాజకీయాలకు అంతర్జాతీయంగా ప్రోత్సాహం పెరగడమే. ఆ పదం వాడినా వాడక పోయినా మొదటి నుంచి ఆ తరహాకు చెందిన ఆలోచనలు కలిగిన జయ శంకర్‌ వంటి మేధావులకు ఈ వాతావరణం కూడా బాగా దోహదం చేసింది. ఈ ప్రాంతంలో వెనకబాటు గురించి, అసమానతలు లేదా తాము అనుకునే వివక్షల గురించి సమాచార తాత్విక భూమిక ఏర్పాటుచేయడం అవసరమని వారు గుర్తించారు. ప్రపంచీకరణ విధానాల ఉధృతితో పెరిగిన సమస్యలను ప్రాంతీయ కోణాన్ని మేళవించి విస్త్రతమైన అధ్యయన ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు. దీని ఫలితమేమంటే అప్పటి వరకూ పాలక వర్గ రాజకీయ వేత్తల పాచికలకే పరిమితమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒక సిద్ధాంత రూపం తీసుకున్నది. తాను సిద్ధాంత కర్తనని జయ శంకర్‌ నొప్పుకోకపోయినప్పటికీ ఈ కోణంలో ఆయన చిరకాల భావాలు అస్తిత్వ సిద్దాంతాలకు అచ్చంగా సరిపోయాయి. కె.సి.ఆర్‌ 2000 తర్వాత తెలుగు దేశం నుంచి వైదొలగాక, ప్రత్యేక రాష్ట్ర నినాదం తీసుకుని టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశాక సహజంగానే జయ శంకర్‌ దానికి భీష్మ పితామహుడుగా మారాడు. భారతంలో భీష్ముడి పాత్ర పూర్వాపరాలు సుప్రసిద్ధమైనవే.
వామపక్షాల విద్యుదుద్యమ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి 2004లో కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత వైఎస్‌ వైఖరి ఎలా మారిందీ రెండు చోట్ల రెండు రకాల ఎలా మాట్లాడిందీ ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పుడు ప్రధాన పార్టీలు సాగిస్తున్న ద్వంద్వ భాషణం అప్పుడు ఒక్క గొంతుతోనే వినిపించిన ఘనాపాటీ వైఎస్‌! అయితే ఇదంతా పాలక పక్షాలకూ ఆ నాయకులకు సర్వ సాధారణమైన విషయం. వ్యూహాత్మకత ప్రయోజనాల పరిరక్షణ పేరుతో వారు దేన్నయినా సమర్థించుకోగలరు. జయ శంకర్‌ వంటివారు అలా గాక అనుకున్నదానికే కట్టుబడి వాదనలు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఆయన కమ్యూనిస్టేతర రాజకీయవాదులతోనే సన్నిహితంగా మెలిగినట్టు కనిపిస్తుంది. ప్రాంతీయ సమస్యలనుంచి ప్రపంచ సమస్యల వరకూ అన్నిటి పట్లా దృష్టి సారించే మార్క్సిస్టు రాజకీయాలకు ఒక ఉప ప్రాంతంపై ప్రధానంగా దృష్టి నిలిపే వైఖరికి మధ్యన తేడాలుండటంలో ఆశ్చర్యం లేదు. మరోవైపున ఆయనతో మమేకమైనట్టు కనిపించే పార్టీలైనా సరే ఆయన చెప్పిన ప్రతిదీ అమలు చేశాయని గాని చేయగలవని గాని అనుకోవడం కష్టం. భావాత్మక రాజకీయాలకూ వ్యూహాత్మక రాజకీయాలకూ తేడా అక్కడే వస్తుంది. అలాటి తేడాలు ఎన్ని వున్నా ఆ రేఖలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవించడమే గొప్ప విశేషం.

ఇక జయ శంకర్‌కు నివాళి సందర్భంలో కనిపించిన కొన్ని అవాంఛనీయ ఘటనలు ఆయన అనుసరించిన ఈ ఉన్నత జీవన సంప్రదాయాలకు అనుగుణమైనవి కావని చెప్పక తప్పదు. పూర్తిగా వ్యతిరేకించేవారికి కూడా గౌరవించే అవకాశం కలిగించడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనమవుతుంది తప్ప నివాళిని నిరసనకు నిలయంగా చేయనవసరం లేదు. అనిశ్చితికి అసలైన చిరునామాగా మారిన ఈ రాష్ట్రంలో రేపు ఏ నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో, అసలు వెలువడుతుందో లేదో ఎవరికీ తెలియదు.తన రాజకీయ లాభనష్టాల లెక్క తేలేవరకూ కేంద్రం ఎలాటి ప్రకటన చేసే ప్రసక్తి వుండదు. ఇప్పుడున్న గజిబిజి అస్తవ్యస్త పరిస్తితులలో ఆ లెక్క అంత సులభంగానూ తేలదు. అందుకే అధిష్టానం దాగుడు మూతలు విరమించిన దాఖలాలు లేకపోగా సందేహాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ విధంగా ప్రాంతాలతో ప్రజలతో చెలగాటమాడుతున్న కేంద్రం వైఖరిని తెలుగు ప్రజలంతా నిరసించాల్సిన సమయమే తప్ప ఇది పరస్పరం ఉద్రేకాలు పెంచుకోవసిన పని లేదు. ప్రజలు ఎక్కడున్నా ప్రజలే. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ అనుకున్న అవగాహనకు ప్రాధాన్యత నిచ్చారే గాని అసహనానికి కాదు. అదే సంయమనం, చర్చా సంప్రదాయం కొనసాగించడం ప్రజాస్వామిక పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తుంది. ఫజల్‌ అలీ కమిటీ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకూ నడిచిన చరిత్ర అందరికీ అనేక పాఠాలు నేర్పింది. సవ్యంగా అధ్యయనం చేసేట్టయితే రేపటికి బాట చూపుతుంది. ఆ విధంగా స్వాతంత్రానంతర ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్రలో ప్రొఫెసర్‌ జయ శంకర్‌కు తనదైన స్తానం వుంటుంది. చరిత్ర నిరంతరం నిర్మించబడుతూనే వుంటుంది తప్ప ఒక స్థిరబిందువు దగ్గర ఆగిపోదు.

No comments:

Post a Comment