Pages

Saturday, May 14, 2011

బెంగాల్‌ ఫలితాలు: వికృత భాష్యాలు



అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో మధ్యంతర మార్పులకు సూచికలుగా వున్నాయి. వీటిపై విశ్లేషణలూ రకరకాలుగా వున్నాయి. అన్నిటిలోకి సహజంగానే పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వ ఘోర పరాజయంపై ఎక్కువ చర్చ కేంద్రీకృతమవుతున్నది. ఎర్ర కోటకు బీటలు, కమ్యూనిస్టుల భూస్థాపితం వంటి శీర్షికలు పత్రికల్లోనూ ఛానళ్లలోనూ ప్రత్యక్షమయ్యాయి. 34 ఏళ్ల అవిచ్చిన్న పాలన ముగిసిన ఈ సమయంలో అలాటి చిత్రణ వెలువడడంలో
ఆశ్చర్యం లేదు. మరోవైపున ఒక తరం రాజకీయ వాదుల చైతన్యంలో భాగమై పోయిన వామపక్ష ప్రభుత్వం ఓడిపోవడం పట్ల బాధా వేదనలు కూడా ఆ స్థాయిలోనే వుండటం కూడా వూహించదగిందే. ఎవరు కేరింతలు కొట్టినా ఎవరు వేదన చెందినా ఎన్నికలలో ప్రజల తీర్పు శిరోధార్యం. అంతిమం.34 ఏళ్ల తర్వాత బెంగాల్‌లో అత్యధిక ఓటర్లు రాజకీయ మార్పు కోరిన ఫలితంగానే దీన్ని చూడవలసి వుంటుంది. ఇన్నేళ్లలోనూ వరుసగా డజన్ల కొద్ది ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో విజయ పరంపరలు చేకూర్చిన ఓటర్లు ఈ దఫా ముఖ్యమంత్రితో సహా ఓడించి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌- కాంగ్రెస్‌ కూటమికి అధికారం అప్పగించడం వెనక గల కారణాలను లోతుగా పరిశీలించ వలసి వుంటుంది. పాఠాలు తీయవలసి వుంటుంది.
సిపిఎం కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు తీర్పును నమ్రతగా స్వీకరిస్తూనే సమగ్ర సమీక్షణతో ముందుకు రానున్నట్టు ప్రకటించాయి.వాస్తవానికి 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత తక్కువ ఫలితాలు సాధించిన సమయంలోనూ ఒక విమర్శనాత్మక సమీక్ష వెలువడింది. అందులో ఆశించినట్టుగా దూరమైన ప్రజలను మళ్లీ దగ్గర చేసుకోవడంలో సత్ఫలితాలు కలగనందునే ఈ సారి మరింత దారుణమైన పరాజయం సంభవించిందనేది వాస్తవం. మా మట్టి మనిష్‌ అనీ, పరివర్తన అని రకరకాల నినాదాలతో ప్రజలను ఆకట్టుకున్న మమతా బెనర్జీ అపర ప్రజాస్వామ్య పునరుద్ధారకురాలైనట్టు మీడియాలో వస్తున్న కథనాలు కూడా ఈ విజయ పరవాశ్యంలో భాగంగానే చూడాల్సి వుంటుంది. ఒంటిచేత్తో విజయం సాధించినట్టు చెప్పబడుతున్న మమతా వెనక క్లింటన్‌ నుంచి కిషన్‌ జీ వరకూ మార్క్సిస్టు వ్యతిరేకులందరూ వున్నారనే వాస్తవం కూడా కలిపి చూస్తేనే ఈ ఫలితాల పూర్ణ స్వరూపం బోధపడుతుంది. వామపక్ష సంఘటన,సిపిఎంలనుంచి కొన్ని పొరబాట్లు ఇందుకు తోడయ్యాయనేది నిజమైనప్పటికీ వాటినే భూతద్దంలో చూపించి రెండో పార్శ్యాన్ని చూడకపోతే సరైన అంచనాలకు రావడం సాద్యం కాదు.అలాగే
మమతా బెనర్జీ గురించి అమెరికా సామ్రాజ్యవాదులు చూపించిన అమితాసక్తి, ఆమె అరాచక ధోరణి నుంచి పరిణత నేతగా ఎదుగుతున్నారు గనక బలపర్చవచ్చన్న సూచనలు వికీలీక్స్‌ పత్రాలలో ప్రపంచమంతటికీ వెల్లడైనాయి. ఇప్పుడు మమతా శక్తి సామర్థ్యాలపై ప్రశంసలు గుప్పిస్తున్న ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మహాశయుడే ఆ పత్రాల ఖచ్చితత్వాన్ని తాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభలో చెప్పారు.సోవియట్‌ విచ్చిన్నం తర్వాత కూడా సోషలిస్టేతర ప్రపంచంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఏకైక కమ్యూనిస్టు పాలిత భూభాగం బెంగాల్‌ అంతర్జాతీయ జాతీయ అభివృద్ధి నిరోధకులకు ఎప్పుడూ కన్నుకుట్టుగానే వుంది.1972లో ఇందిరాగాంధీ సైన్యం సహాయంతో రిగ్గింగ్‌ చేసి 77 వరకూ భీభత్స పాలన సాగించి 1200 మంది ప్రాణాలు తీయడానికి ఇంకా అనేక అఘాయిత్యాలకు కారకులైనారు. అయినా 1977లో ఎమర్జన్సీ తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ వాతావరణం బెంగాల్‌లో జ్యోతిబాసు ప్రభుత్వ స్తాపనకు దారి తీసింది. ఆ తర్వాత కాలంలో దేశంలో 12 మంది ప్రధానులు మారారు, రాష్ట్రాల్లో లెక్కలేనన్ని మార్పులు కలిగాయి. బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం మాత్రం అప్రతిహతంగా కొనసాగిందంటే దాని ప్రజానుకూల విధానాలే ప్రధాన కారణం. భూసంస్కరణలు, కౌలుదార్లనమోదు, శ్రమజీవులకు మద్దతు, పంచాయతీల ద్వారా వికేంద్రీకరణ, ప్రజాస్వామ్య లౌకిక విలువల పరిరక్షణ, అవినీతికి తావులేని విశుద్ద పాలన ఇలా ఆ ప్రభుత్వం అనేక విశిష్టతలు మూటకట్టుకున్నందునే వరుస విజయాలతో మున్ముందుకు సాగింది.అంతర్జాతీయంగా సోషలిజానికి ఎదురు దెబ్బ తగిలాక కూడా రెండు దశాబ్దాలు కొనసాగింది. ఇప్పుడు ఓటమికి దారి తీసిన లోపాలోపాలు ఏమైనప్పటికీ ఈ విలక్షణ చరిత్రను విస్మరించడం, విషం కక్కడం ఎవరికీ తగదు.సిద్ధాంత పునాది గల కమ్యూనిస్టు ఉద్యమం ఎన్నికల ఓటములకు గాని, పాలకుల నిర్బంధాలకు గాని చెదిరిపోయేది గాదని చరిత్ర అనేక సార్లు నిరూపించిన సత్యం బెంగాల్‌లో మరో సారి రుజువు కావచ్చు.

ఈ సందర్భంగా టైమ్‌:్స ఆఫ్‌ ఇండియా ఇచ్చిన వార్తలో ఏనాడో కాలం చెల్లిన ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోయిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అయితే తమ స్వంత సిద్ధాంతాలలో కూరుకుపోయి మాఫియా సహయాంలో ఎన్నికలను తొత్తడం చేస్తూ పాలన సాగించినట్టు నిందారోపణలు చేస్తుంది. అలాగే తెలుగులో ఒక అగ్రశ్రేణి పత్రిక బెంగాల్‌ ఫలితాలను పురస్కరించుకుని ఇచ్చిన శీర్షికలు చూస్తే చాలు- ''కొరవడిన సంక్షేమం''పార్టీ పేరుతో అరాచకం' భయోత్పాతం' ఒటమికి ఎర్ర సిరాక్షరం లాల్‌గఢ్‌''పారిశ్రామిక విధానం ఒక పెద్ద గొయ్యి', ఒక చారిత్రిక పతనం' 'కమ్యూనిస్టు కోటలో దగాపడ్డ దళితులు' 'అభివృద్ధికి ఎర్ర జెండా' చెప్పాలంటే ఇంకా ఇలాటివి చాలా ఈ పత్రికలో వున్నాయి. వామపక్ష ప్రభుత్వంపై బడా పత్రికలు కార్పొరేట్‌ మీడియా వ్యవహరించిన తీరుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఫలితాల తర్వాతనే ఎక్కడో ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక శత్రు పక్షంలా ఇంత పచ్చిగా రాస్తున్నారంటే ఎన్నికల తరుణంలో బెంగాలీలో వ్యతిరేక మీడియా మరెంత దుష్ప్రచారం చేసిందో అర్తం చేసుకోవచ్చు. వేలమంది మత మారణహౌమంలో బలైన గుజరాత్‌ వీరికి అభివృద్ధి నమూనాగా కనిపించేవారికి బెంగాల్‌లో భయోత్పాతమే అగుపించడంలో ఆశ్యర్యం ఏముంటుంది? విశేషమేమంటే ఈ పత్రిక ఒకే పేజీలో సరళీకరణ పేరిట వచ్చిన మార్పులను ఆహ్వానించనందుకు ఒక వైపున, ఆ విధానాల ప్రభావం నుంచి ప్రజలను ఆదుకోలేదంటూ మరో వైపున వామపక్ష ప్రభుత్వంపై ద్వంద్వ దాడి సాగించడం విడ్డూరం! పరిశ్రమలు తరలిపోయాయంటూ అందుకు ఆ పెట్టుబడిదారులను గాక వామపక్ష పాలకులనే తప్పు పట్టిన ఈ పత్రిక సచివాలయంలో టాటాలు ప్రత్యక్షమైనారంటూ అందుకు కూడా వారిపైనే విమర్శలు గుప్పించింది.
బెంగాల్‌ పరిణామాలలో వైరుధ్యమంతా ఇక్కడే వుంది. సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాలకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించే వామపక్షాల ప్రాబల్యానికి అది పునాదిగా వుండటం ధనాఢ్యవర్గాలకు సామ్రజ్యవాదులకు మింగుడు పడటం లేదు. కేంద్రంలో ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేస్తూ 2004 నాటికి కీలక శక్తిగా ఎదిగిన వామపక్షాలు అణు ఒప్పందాన్ని ప్రతిఘటించడం అసలే నచ్చలేదు. ఆ తర్వాతనే దానిపై దాడి తీవ్రమైంది. ఈ సమయంలోనే నందిగ్రామ్‌ ఘటనలు సంభవించాయి.అక్కడ భూమి నిజంగా స్వాధీనం చేసుకోకపోగా ఆ ఆలోచన విరమించుకున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. సింగూరులో అయితే ఉత్పత్తి మొదలు పెట్టనున్న టాటాలను బయిటకు సాగనంపింది. లాల్‌గడ్‌లో ముఖ్యమంత్రి హత్యకు మందుపాతర అమర్చడంతో సమస్య మొదలైంది. ఈ పరిణామాలన్నిటిలోనూ ప్రభుత్వ తప్పిదాలు, పొరబాట్టు వున్న మేరకు సిపిఎం బహిరంగంగానే అంగీకరించింది. ఏ ప్రభుత్వమూ ఇంతవరకూ అలా చేసిన దాఖలాలు లేవు. కాని ఆ దిద్దుబాటును ఏ మాత్రం గుర్తించని కార్పొరేట్‌ మీడియా కమ్యూనిస్టులను కూలదోయడానికే కంకణం కట్టుకుని కథలూ కాకరకాయలూ ప్రచారం చేసింది.వాటిని ఎదుర్కొంటూ ప్రజలకు సకాలంలో సమాచారం అందించి నిలబెట్టుకోవడంలో వామపక్ష శక్తులు విఫలమైనాయి.దీర్ఘకాలం అధికారంలో వుండటం వల్ల కొంతమందిలో అహంభావం తదితర అవలక్షణాలు కూడా పెరిగివుండవచ్చు. కాని ఇవేవీ ఆ ప్రభుత్వం ప్రజల కోసం సాగించిన కృషిని మటుమాయం చేయలేవు.

విజయం ఎప్పుడూ అతిశయోక్తులకు ఆలవాలమే గనక మమతా బెనర్జీని ఆకాశానికెత్తడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని ఇప్పటికి పాతికేళ్లుగా ఆమె బెంగాల్‌లో ఎన్ని విన్యాసాలు చేసిందో మర్చిపోవడం పొరబాటవుతుంది. 1984లో ఇందిరా హత్యానంతర సానుభూతి పవనాలలో సోమనాథ్‌ ఛటర్జీని ఓడించిన మమతను తర్వాతే కాంగ్రెస్‌ వారే భరించలేక పోయారు. ఆమె అసహనంతో బయిటకు నడిచి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసుకున్నారు. బిజెపి కూటమిలో భాగస్వామిగా చేరి బెంగాల్‌లో అధికారం కోసం పోరాడి భంగపాటుకు గురైనారు. వామఫక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమానంలో వచ్చి ఆయుధాలు జారవిడిచిన విదేశీయుడు బ్లీచ్‌ను విడిపించడానికి ఎన్‌డిఎ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఆమె ఉపయోగించారు. ఇప్పుడు ఈ ఎన్నికల తరుణంలోనే దానికి సంబంధించిన మరో ముద్దాయి కిమ్‌ డేవీ అసలు సంగతులు వెల్లడించినా విచారణ జరగనీయకుండా అడ్డుకున్నారు. మమత నిరాడంబరత్వం గురించి ఎంత చెప్పినా ఆమె అఘాయిత్య పోకడలు, అదరగణ్నం రాజకీయాలను కప్పిపుచ్చడం సాద్యం కాదు.మావోయిస్టుల నుంచి మహాశ్వేతాదేవులు మేధా పాట్కర్‌ల వరకూ అతివాద దుస్సాహసికులూ అత్యంత అభివృద్ధి నిరోధకులు - ఏక కాలంలో ఆమెకు అండగా నిలవడం వెనక ఒకే ఒక సూత్రం మార్క్సిస్టులపై వ్యతిరేకతే. నాటి గవర్నర్‌ గోపాలకృష్న గాంధీ కూడా రాజ్యాంగ ధర్మానికి విరుద్దంగా ఇందుకు వంతపాడారు. (ఈ ఎన్నికల ఫలితాల సమయంలోనూ ఆనందం ఆపుకోలేనట్టు వ్యాసం రాశారు) అలా చేతులు కలిపే హక్కు వారికి వున్నట్టే దాని పర్యవసానాలకూ బా ధ్యత కూడా వారిపై వుంటుంది. ఈ పరిణామ క్రమాన్ని హిందూ ఇలా వర్ణించింది:'' తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలో అతి చంచలమైన మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఏర్పడే ప్రభుత్వం జ్యోతిబాసు బుద్ధదేవ్‌ భట్టాచార్జీల నాయకత్వంలోని వాటికన్నా పూర్తి భిన్నమైన గమనం కలిగివుంటుంది. పరస్పర విరుద్దమైన వర్గాల శక్తుల నుంచి మద్దతు పొందిన బెనర్జీ కొత్తదైన అదే సమయంలో చెప్పడానికి లేని మార్గాల్లో రాష్ట్రాన్ని నడిపించనున్నారు... ''

ఎన్నికల తీర్పును గౌరవిస్తూనే భవిష్యత్తు గురించి ఆలోచనా పరులైన వారు అంచనా వేస్తున్న తీరును పై సంపాదకీయ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. సిపిఎం పొలిట్‌ బ్యూరో, రాష్ట్ర కమిటీలు కూడా తీర్పును స్వీకరిస్తూనే ఈ ఫలితాలు ఎలాటి హింసకు దారి తీయరాదని స్పష్టీకరించడం సముచితంగా వుంది.ఎందుకంటే 2009 ఎన్నికల తర్వాత కాలంలో 270 మంది సిపిఎం కార్యకర్తలు అక్కడ హత్యకు గురైనారు. దురదృష్టకరమైన నందిగ్రామ్‌, లాల్‌గడ్‌ ఘటనలకంటే ఈ సంఖ్య అనేక రెట్టు అధికమైనప్పటికీ మన మీడియాకు పట్టలేదు. కాని మమతా బెనర్జీకి పరిస్థితి తీవ్రత తెలుసు గనకే శాంతిని కాపాడాలని లాంఛనంగానైనా పిలుపునిచ్చారు. అదే సమయంలో వామపక్ష ప్రభుత్వం హయాంలో బెంగాల్‌ నాశనమై పోయిందని దాన్ని పునర్నిర్మాణం చేస్తానని చేసిన ప్రకటన ఆమె ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తుంది. ఇది రెండవ స్వాతంత్ర దినమన్న వ్యాఖ్య కూడా అలాటిదే.పెట్టుబడిదారీ ప్రపంచంలోనే అత్యధిక కాలం కొనసాగిన కమ్యూనిస్టు ప్రభుత్వం కలిగివుండటం స్వాతంత్రానికి వ్యతిరేకమన్నమాట! భారత దేశంలో ఇంత కాలం పాలించిన ప్రభుత్వం మరేదీ లేదంటే అది స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి విరుద్దమైన విషయమా? ఎన్నికల అక్రమాలను పట్టుకుంటామంటూ పెద్ద ఎత్తున పరిశీలకులను పంపించి ఎన్నిసార్లు భంగపడిన ఉదాహరణలు లేవు? 2005లో సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇదే బుద్దదేవ్‌ను శక్తివంతుడైన ముఖ్యమంత్రి అని, దేశానికి దీర్ఘ కాల దార్శనికతగల వాడని ప్రశంసించింది నిజం కాదా? కనక ఒక విజయానికే మురిసిపోయి అంతకు ముందు సుదీర్ఘ కాలం విజయ పరంపరలు సాధించిన వారిని అపహాస్యం చేయడం ప్రజాస్వామ్య స్పూర్తి కాజాలదు.
ప్రతిసారీ అటూ ప్రభుత్వాలు మారే కేరళ వలె గాక ఏకధాటిగా కొనసాగిన కారణంగానే పశ్చిమ బెంగాల్‌ ఫలితంపై ఇంత సంచలనం కనిపిస్తున్నది. ఈ వ్యవస్తలో కమ్యూనిస్టులకు ప్రతి ఎన్నికా ఒక వర్గ పోరాటం వంటిదే. బెంగాల్‌లోనూ ఎప్పటికప్పుడు అనేక త్యాగాలతో ఐక్య కృషితో విజయాలను పరిరక్షించుకొంటూ వచ్చారు. ఈ సారి అలా జరగక పోయినా వామపక్షాల విధానాలు మారిపోతాయని విశిష్టత మాసిపోతుందని అనుకోవడం అవివేకం. ఈ ఫలితాల పాఠాలను అధ్యయనం చేసి మరింత గట్టిగా నిలదొక్కుకునే కృషి కొనసాగుతుంది. అతి స్వల్ప తేడాతో ఓటమి చెందినా కేరళ కూడా ఈ దశలో విశ్వాప కారిగా వుంటుంది. అచ్యుతానందన్‌ను పొగిడి బుద్దదేవ్‌ను సిపిఎంను తిట్టిపోసే కార్యక్రమం గాక ప్రత్యామ్యాయ వి ధానాలను ముందుకు తెచ్చే పోరాటం ఇంకా గటి ్టగా చేయాలన్న సృహ పెరుగుతుంది. నిరుత్సాహం కలగవచ్చుగాని నిసృహకు అవకాశముండదు. సత్యమే శివంలో కమల్‌ హాసన్‌ చెప్పినట్టు తాజ్‌ లేకపోయినా ప్రేమ వుంటుంది, సోవియట్‌ లేకపోయినా కమ్యూనిజం వుంటుంది. ప్రభుత్వం ఓడిపోయినా ప్రత్యామ్యాయ శక్తుల పోరాటం కొనసాగుతుంది.ఆ ప్రభుత్వాల విజయాలను కాపాడుకోవడానికి దాడులను నిరోధించడానికి గట్టిగా నిలబడటమూ జరుగుతుంది. ఇన్నేళ్లు ఎర్ర కోటను నిలబెట్టిన ప్రజలు ఆ విధమైన చైతన్యం ఒక్కసారిగా కోల్పోతారనుకోవడం భ్రమ.

8 comments:

  1. #మమతా వెనక క్లింటన్‌ నుంచి కిషన్‌ జీ వరకూ మార్క్సిస్టు వ్యతిరేకులందరూ వున్నారనే వాస్తవం కూడా...

    I have just three words to say, Excellent sir... WOW!

    ReplyDelete
  2. నేను టివిలో బివి రాఘవులు ప్రకటన చూసిన తరువాతే ఇది వ్రాసాను: http://telugu.stalin-mao.in/cpm-what-a-joke

    ReplyDelete
  3. Kishanjee is Maoist leader. How can he be anti-Marxist? One cannot understand Mao Zedong theory without understanding Marxism because Mao Zedong theory is also based on Marxist dialectical and historical materialism.

    ReplyDelete
  4. telugu type andubatulo lenanduku english script...
    cpm, left front chesina konni porapatlu,prajalllo konni taragatulaku dooram kavadam grinchi nenu sootigane prastavinchanu. ghora parajayam annandi nissandeham. aa prabhutwam, party poortiga prajavyatirekamane chitranato nenu eekibhavinchanu.ade nijamaite inni sarlu vijayalu kaligeve kadu. desa pradhani padavi kooda jyothibasu nu vetukkuntoo vachhedi kadu. okka vijayanike mamata mahaskti ayipote gatamlo ilativi edu sarlu(anni kalipite dajanla sarlu) sadhinchina prabhutwanni vastaviknga anchana kattodda? deentone cpm bhoostapitam ayipotundani anukovaddani pranab mukharjee ye chepparu.oka vaipe choostamnukunevaru hayiga aa pani cheyochhu.
    ninna naa vyasamlo eenadu partika seershikalu udaharinchanu. ninna, ee roju alativi marikonni dantlo wachhayi. avi choosi anndinchalanukunte nixepanga cheyochhu.enni sapanarthalu pettina anni konalanunchi cheppadalchukunnade cheptanu.tks everybody.

    ReplyDelete
  5. బెంగాల్ ఎన్నికల గురించి అబ్జేక్తివ్గా చూస్తె ప్రజలు సత్వర ఆధునికీకరణ ,సౌకర్యాలు కోరుకొంతున్నారని తెలుస్తుంది. గతంలో భూ సంస్కరణల ద్వారా గ్రామీణ వోటును కమ్యూనిస్టులు సంపాదిన్చేరు.కాని ఎల్ల కాలం ఒకే
    సూత్రం పనిచేయ్యడుకదా.కాంగ్రెస్పార్టీ దేశానికి ఎంతోసేవ చేసింది. అగ్రరాజ్యాలలో ఒకటిగా తీర్చిదిద్దింది. అయినా ప్రజలు అసంత్రిప్తి చెందినప్పుదంతా ఓడిస్తున్నారు. కమ్మ్యూనిజంప్రపంచ వ్యాప్తంగా విఫలమైంది.ప్రజలు.
    మార్పుకోరుతున్నారు.రేపు సరిగున్యంగా గాపనిచేయకపోతే మమతా ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారు.ప్రపంచమూ, మన భారత దేశమూ కూడా శీఘ్రంగా మారిపోతున్నవి.ఈ మార్పులను పార్టీలు. పరిశీలకులు. అర్థం
    చెసుకొవలసిఉన్టున్ది.అందుకు అనుగుణ్యంగా విధానాలు మార్చుకోవాలి. =రమణారావు.ముద్దు a

    ReplyDelete
  6. The battle is lost, but not the వార్...
    “Many people have voted against us. We have to correct our mistakes. We have to bring them back to our fold. We have also to regain their confidence. The people are our hope in difficult times and we should not lose faith in them” -- Jyoti Basu in a message to the public rally on 50th anniversary of Food Movement in Kolkata on August 31, 2009...

    ReplyDelete
  7. @ప్రవీణ్ శర్మ..
    నీబ్లాగులో రాసినవాటికి జవాబు ఇవ్వగలవా?

    # "పశ్చిమ బెంగాల్‌లో నందిగ్రాం, సింగూర్, లాల్‌గఢ్ ఉద్యమాలే CPM కోటలు కూల్చాయ"
    ౧. ఉద్యమాలు ఎవరు చేశారు? ఎవరు నాయకత్వం వహించారు?
    ౨. ఉద్యమాలు ఎవరికోరకు చేశారు?
    ౩. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల ఆధారంగా పాలకపక్షం అధికారం కోల్పోవడమంటే ఉద్యమం విజయం సాధించిందని మీ ఉధ్దేశమా?
    ౪. మీరూనుకుంటుంన్నట్లు, ఈ విజయమ్ ఎవరికి లాభపడింది?
    ౫. పశ్చిమ బెంగాల్ మొత్తం కాకపోయినా కనీసం ఈ మూడు ప్రాంతాలలోనైనా (నందిగ్రాం, సింగూర్, లాల్‌గఢ్) ప్రజలకు సోషలిజ సమాజం వచ్చేసిందా?

    #"పారిశ్రామీకరణ చేశామన్నారు కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూసేసి బహుళజాతి కంపెనీలని ఆహ్వానించారు."
    కమ్యూనిజం అంటేనే ఒంటికాలిపైలేసే ఈ భూర్జువామీడియాలో నేను ఎప్పుడూ వినలేదు చదవలేదు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను మూసివేసినట్లు. మీదగ్గర ఏమైనా జాబితా వుంటే యివ్వగలరు. లేకపోతే మీఊహాజనిత అభిప్రాయంగా భావించాలసిందే!

    #"నందిగ్రాం, సింగూర్‌లలో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా వారి భూములనే బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టారు."
    భూమి కోల్పోయన వారికుటుంబంలో వారికి ఒకరికి ఉద్యోగం యివ్వలనే షరతు వుందని చదివాను. మీకావిషయం తెలుసా?

    #"నయా ఉదారవాద విధానాలంటూ అర చేతిలో స్వర్గం చూపించారు"
    అరచేతిలో స్వర్గ చూపించే అవకాశమే లేదు. ఎందుకంటే, ఏ రాష్ట ప్రభుత్వమైనా భారత రాజ్యాంగం పరిధిలోనే జరగాలి. అలాంటప్పుడు భూర్జువా
    వ్యవస్థకు కొమ్ముకాస్తున్న ఈ రాజ్యాంగం మార్పు జరగకుండా అభివృధ్ది సాధించటమ్ కల్ల! ఒక రాష్టానికి ఈ రాజ్యాంగ పరిధిలో కలిపించబడిన హక్కులతో జరిగిన అభివృద్దిని హర్షించకుండా విమర్శలా?

    #"రాష్ట్రాన్ని పారిశ్రామీకరించాడంటే నమ్మడానికి చెవుల్లో పువ్వులు పెట్టుకోవాలి"
    నందిగ్రాం, సింగూర్ లలో ఆడ్డుకున్నది ఎవరు? ఒకసారి పారిశ్రామీకరిండం తప్పు అంటారు చెయ్యడానికి ప్రయత్నిస్తే శ్రామిక వర్గదోపిడీకి సహకారం అంటారు. మీవాదనలో శాశ్త్రీయత వుందా? కొద్దిపాటి నష్టంతో ఎక్కువగా లాభపడటం విచిత్రమేమీ కాదుకదా!

    #"హిట్లర్, గోబెల్స్ తరహాలో అబద్దాలు చెప్పినా బుద్ధదేవ్ గెలవలేకపోయాడు"
    తమిళనాడులో కరుణానిధి ఓడినా, బుద్ధదేవ్ ఓడినా ఒకటేనా? రాజకీయాలలో నిజాయితీకి, నిస్వార్ధ ప్రజాసేవకు మీరిచ్చే గుర్తింపు యిదేనా?

    #"బెంగాల్‌లో బుద్ధదేవ్ భటాచార్య అమలు చేసినది పెట్టుబడిదారీ విధానమే కానీ కమ్యూనిజం కాదు."
    ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో ఒక రాష్ట్రప్రభుత్వం కమ్యూనిజాన్ని అమలుచేస్తామని సిపియం చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? చదివారా?

    #"పైగా జ్యోతి బసు మనవరాలే బూర్జువా సంస్కృతైన నగ్న అందాల పోటీలలో పాల్గొన్నది"
    సిపియం రజకీయ వాదంతో "బసు మనవరాలి" వ్యక్తిగత విషయాలకు లింకు ఎలా పెట్టగలిగారు? 'ప్రమాదవనం' గ్రూపు సభ్యులతో వాధించి వాధించి వారి విష సంస్కృతి మీలోను చొరబడినట్లు వుంది. బసు మనవరాలు ఏమైన సిపియం సిధ్ధాంత కర్తా? వారసులందరూ సిపియం సభ్యులవ్వాలని నిబంధన ఏ వ్యవస్థలోనైనా విధించగలరా?

    ReplyDelete
  8. @ప్రవీణ్ శర్మ,

    ముందటి నా కామెంట్‌లో వ్రాసిన వాటికి జవాబులు చెప్పకుండానే, ఊకదంపుడు (రొటీన్), ఆధార రహిత (బేస్ లెస్) విమర్శలు కొనసాగిస్తున్నారు.

    #"దేశాన్ని సామ్రాజ్యవాదులకి తాకట్టు పెట్టడం అందుకు మార్గం కాదు."

    ఏదేశానికి ఏవిషయంలో తాకట్టు పెట్టారో చెప్పగలవా?

    ReplyDelete