Pages

Friday, October 21, 2011

పోలవరం టెండర్ల పాఠాలు



పోలవరం టెండర్లను టిఆర్‌ఎస్‌కు అనుకూలమైన, నమస్తే తెలంగాణాతో సంబంధం కలిగిన ఎస్‌డబ్ట్యు ఎమ్మార్‌ పటేల్‌ కన్సార్టియం చేజిక్కించుకున్నట్టు తెలుగు దేశం నాయకుడు రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణపై చర్చకు నన్ను ఆహ్వానించారు గాని వెళ్లడం కుదరలేదు. మరో ఛానల్‌లో వ్యాఖ్యలు మాత్రం చేశాను. ే ఈ అంశం నేను ఇంత కాలం చేస్తున్న ఒక ప్రధాన వాదనను ధృవపరుస్తున్నది. తెలంగాణా లేదా సీమాంధ్ర( ఈ పదం ఇటీవల కృత్రిమంగా సృష్టించింది) అన్న ప్రాంతాల ప్రాతిపదికన పెట్టుబడిదారులు పేదలు వుండరు. వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో వుంటారు. వ్యాపార యుద్దాలు రాజకీయ ఘర్సణలు అన్ని చోట్లా జరుగుతూనే వుంటాయి. రేవంత్‌ ఆరోపణను ఖండించేందుకు టిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న సమర్థనల్లో వుండాల్సినంత తీవ్రత లేదంటే కారణం అక్కడ ఒక టెండరు అంటూ వుండటమే. ఇందులో రెండు అంశాలేమంటే - పెట్టుబడిదారులు ఇక్కడా వున్నారని, వారికి ఇక్కడ ప్రధాన పార్టీతో సంబంధం వుందని . పైగా ఆ పార్టీ వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు పని వారే చేపట్టారని. మిగిలిన రాజకీయాలు వ్యాపారాలు ఎలా వున్నా ఈ మేరకైతే గుర్తించక తప్పదు. ప్రయోజనాలు లేని రాజకీయాలు వుండవు. వ్యత్యాసాలు లేని ప్రాంతాలూ వుండవు. గతంలో లగడపాటి తెలంగాణాలోనే దొరలు పీడకులు వున్నారని పుస్తకాలు సీడీలు పంపిస్తే నేను ఏకీభవించలేదు. ఎందుకంటే మందసా, చల్లపల్లి, మునగాల జమీందార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిన తర్వాతనే ఆ ప్రభావం నైజాం వ్యతిరేక పోరాటానికి దారి తీసింది. కాకపోతే ఇక్కడ దొరతనం వెట్టిచాకిరీ రూపంలో దారుణంగా వుండేది. కాని తరతమ తేడాలతో ఆర్తిక దోపిడీ సామాజిక పీడన అంతటా వున్నాయి. అలాగే పెట్టుబడిదారులు కూడా వున్నారు. తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం సీమాంధ్ర పెట్టుబడిదారులకే వ్యతిరేమని చెప్పడం
ఆవేశానికి పనికి వస్తుంది తప్త వాస్తవికం కాదు. ఎందుకంటే తెలంగాణా పెట్టుబడిదారులు దొరలైనా లేక రాయలసీమకు చెందిన వారైనా తేడా ఏమీ వుండదు. పెట్టుబడిదారులలో ఎవరికి ఎక్కువ లా భాలు వచ్చాయి, రాజకీయ వేత్తలలో ఎవరికి ఎక్కువ పదవులు వచ్చాయన్నది ప్రజలకు సంబంధించిన సమస్య కాదు. వారి సమస్యలు వారికి వుంటాయి.ఇప్పుడు పార్లమెంటులో లోగడ అత్యధిక సంపన్నుడు తెలంగాణా ఎంపి కాగా ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చిన జగన్‌. దీన్ని బట్టి ఆ ప్రాంతాలు సంపన్నంగా వుంటాయనలేము. అలాగే ఏ క్లాస్‌ కాంట్రాక్టర్లు అన్నిచోట్లా వున్నారు. పోలవరం వ్యవహారం దానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇతర విషయాలు భవిష్యత్తులో స్పష్టం కావాలి. అయితే సకల సమ్మె తాత్కాలిక విరమణకు ఇదే కారణమని చెప్పడంలో రాజకీయం వుండొచ్చు. ఎలాగైనా ముందో వెనకో దాన్ని విరమించడం అనివార్యమని అందరికీ తెలుసు. కనక ఈ రెంటికీ ముడి వేయనవసరం లేదు గాని టిఆర్‌ఎస్‌ గట్టిగా వ్యతిరేకించే ప్రాజెక్టు పని వారికి దగ్గరగా వుండే వారే చేపట్టడం మాత్రం గమనించక తప్పదు. అందులో తమ వారి వాటా మూడు శాతమే నని చెప్పడం కూడా సమర్థనకు పెద్ద ఉపయోగించదు.పైగా పోలవరం కదిలింది అంటూ నమస్తే తెలంగాణాలో పెద్ద శీర్షిక పెట్టడం కూడా వారి రాజకీయ విధానానికి అనుగుణంగా లేదు. రెండవ రోజున యుద్ధభేరీలు మోగించడం నష్ట నివారణ చర్యగానే కనిపిస్తుంది.ఈ ఆరోపణలు చేస్తున్న తెలుగు దేశం నేతలు కూడా టెండర్లు వేశారు గనక వారి విమర్శల్లోనూ మరో కోణం వుండే అవకాశం వుంటుంది. కనకనే ఒక ప్రాంతమంతా పెట్టుబడిదారులు మరో ప్రాంతమంతా కేవలం ప్రజలు అన్న రీతిలో మాట్లాడ్డం మానుకోవాలి. రెండు చోట్ల అన్ని వర్గాల వారు వున్నారని గుర్తించాలి. నా ఉద్దేశంలో అదే ప్రధాన పాఠం.

No comments:

Post a Comment