Pages

Monday, November 14, 2011

ఇక న్యాయస్థానాలు, దర్యాప్తుల పోరాటం?



మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవాద్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తు జరిపించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడం ఆసక్తికరమైన పరిణామం. ప్రజా జీవితంలో పారదర్శకత న్యాయస్థానాల పట్ల గౌరవం కోణాల నుంచి ఈ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సి వుంటుంది. తెలుగు దేశం నేతలు కూడా ఆహ్వానిస్తూనే సుప్రీం కోర్టుకు వెళ్లడంపైన కూడా ఆలోచనలు చేయడం సహజమే. ఇప్పటికే జగన్‌ గాలి జనార్థనరెడ్డి కేసుల దర్యాప్తుతో ఉత్కంఠ భరితంగా వున్న రాజకీయాలలో మరో దర్యాప్తు ప్రవేశించింది. గత రెండేళ్ల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలు రకరకాలైన పోరాటాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మొదట ఎన్నికల పోరాటం. వైఎస్‌ మరణానంతరం అధికార పక్ష అంతర్గత పోరాటం. తర్వాత ప్రాంతీయ పోరాటం. ఇప్పుడు న్యాయస్థానాలు దర్యాప్తుల పోరాటం మొదలైనట్టు కనిపిస్తుంది. మంత్రి శంకర రావు 2010 సెప్టెంబరులో కేసు దాఖలు చేస్తే 2011 జులై వరకూ వాదోపవాదాలకు అవకాశమిచ్చిన నేపథ్యంలో అసలు తమ వాదనలు వినకుండానే ఆదేశాలివ్వడం సహజ న్యాయానికి విరుద్ధమని తెలుగు దేశం వాదిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులు ఉన్నత న్యాయ వ్యవస్థ ఏమంటాయో
చూడాలి. అయితే ఇది వైఎస్‌ బాబుల మధ్య రాజకీయ ఘర్షణకు కొనసాగింపుగా ఇప్పుడు ఆయన వారసుల పార్టీకి తెలుగుదేశంకు మధ్య రాజకీయ యుద్దంగా కూడా దీన్ని చూడక తప్పదు.ఎందుకంటే జగన్‌పై దర్యాప్తు ఆదేశాలు వచ్చాకే విజయమ్మ ఈ కేసు వేశారు. కనక కారణాలేమి చెప్పినా ఈ విధంగా చంద్రబాబును కూడా దర్యాప్తు లోకి రప్పించగలిగారు. ఇప్పుడు దేశంలో వున్న అవినీతి వ్యతిరేక వాతావరణంలో కేంద్రంలో యుపిఎ ఆధ్వర్యంలో పనిచేసే సిబిఐ ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాల్సిన విషయమే. ఏమైనా బాబు ప్రభుత్వంపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. కాకపోతే వైఎస్‌ హయాంలో వాటిని నిర్ధారించింది లేదు. నిగ్గు తేల్చింది లేదు. మామూలు మాటల్లో చెప్పాలంటే సరళీకరణ విధానాల విత్తులు వేసింది ఆయనైతే వాటిని విస్తారంగా పండించుకున్నది వైఎస్‌ హయాంలో కావడం పెద్ద విచిత్రం. ఇద్దరినీ అంటకాగి పనులు చేయించుకున్నవారు కూడా వున్నారు.ఇలాటి విషయాలన్ని చివరకు ఎలా తేలతాయో మూడు మాసాల తర్వాత కోర్టు నిర్ధారణలలో గాని స్పష్టం కాదు. అప్పటి వరకూ తెలుగు దేశం ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రం దొరికినట్టే. కేవలం జగన్‌పైనే గాక బాబుపైన కూడా దర్యాప్తు జరుగుతున్నదని చెప్పే అవకాశం ఇప్పుడు లభించింది. అయితే దీని వల్ల ఆయనపై ఆరోపణలు మాఫీ అయిపోవని కూడా గుర్తించాలి. ఇంకో విశేషమేమంటే జగన్‌ కేసులో కీలక పాత్రధారిగా వున్న ఆడిటర్‌ విజయసాయి రెడ్డి సహాయంతో తాను అఫిడవిట్‌ తయారు చేశానని విజయమ్మ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులోని రాజకీయ కోణం చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. అయితే అది ప్రజాస్వామిక హక్కు గనక కోర్టు ఆదేశం గనక ఎవరైనా తలవంచాల్సిందే. దేశంలో ఇప్పుడున్న అవినీతి వ్యతిరేక వాతావరణంలో ఏ దర్యాప్తునైనా ప్రజలు తప్పక ఆహ్వానిస్తారు.అదెలా జరుగుతుంది ఎలా ముగుస్తుంది అనేది కోర్టు చేతుల్లో వుంటుంది.ఇప్పటికే కొట్టి వేసిన 18 కేసులను కలగలపడం తప్ప ఇందులో కొత్త దనం లేదని తెలుగుదేశం వారంటున్నారు.మరి సిబిఐ ఏం చెబుతుందో కోర్టు ఏమంటుందో చూద్దాం..

3 comments:

  1. ఏదైతే అయ్యింది కాని, CBIకి చేతినిండా పని. చంద్రబాబు జాతీయ జెండా ఎత్తిపట్టుకుని హజారేలా మార్చ్ చేసినపుడే అనుకున్నా ... కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడా అని. :) అవినీతిలో పీకలదాకా కూరుకుపోయిన YSR family, తమతోబాటు చంద్రబాబు కాళ్ళు వూబిలోకి లాగడం ఆసక్తికరమైన పరిణామం. 3ఏళ్ళలో శిక్షలు తేల్చేలా CBI& Special court సిబ్బందిని పెంచాలి. SC జోక్యం చేసుకుని నానబెడుతుందేమో. ఏదోలేండి, పత్రికలకు, ప్రజలకూ కాలక్షేపం. ఆస్థుల జప్తు లేకుండా, 3ఏళ్ళకు మించని శిక్షలవల్ల ఒరిగేదేమీ లేదు.

    ReplyDelete
  2. చంద్రబాబు గారికి ఇది ఒక మంచి అవకాశం, కాని ఇక్కడ CBI తన పని తానూ చేసుకోనేటట్లు అందరూ సహకరించాలి.

    ReplyDelete
  3. /ఇందులో కొత్త దనం లేదని తెలుగుదేశం వారంటున్నారు./

    కొత్తదనం కావాలటనా! హమ్మ్మ్... చెర్లోపల్లి జైల్లో చెంచల్‌గూడకన్నా అంతా కొత్తదనమే, చూపిస్తారులేండి. :))

    ప్రతిసారి పాతవి వదిలేసి కొత్తవి కావాలంటే ఎలా?!

    ReplyDelete