Pages

Tuesday, May 15, 2012

నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టు: విస్తరించిన పరిధి


మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా పరిచితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టు చేయడం కొత్త మలుపు. పూర్తిగా వూహించనిది కాకున్నా వేగంగా జరిగింది. గతంలో అరెస్టయిన సునీల్‌ రెడ్డి సహాయకుడు కాగా విజయసాయి రెడ్డి కుటుంబ ఆడిటర్‌గా దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వ్యక్తి. సాక్షి ఖాతాల స్తంభన కూడా నేరుగా వారి యాజమాన్యంలోకి సంస్థకు సంబంధించినవి. కాగా మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ అందుకు భిన్నంగా పెట్టుబడి పెట్టిన వ్యక్తి. ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ది పొంది లోపాయికారి అవగాహనతో జగన్‌ సంస్థల్లో 500 కోట్ల పెట్టుబడులు పెట్టారనేది ఆయనపై ఆరోపణ. ఇందుకు ప్రతిగా ప్రకాశం గుంటూరు జిల్లాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న వాన్‌పిక్‌ ప్రాజెక్టు(వాడరేపు నిజాం పట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండిస్టియల్‌ క్యారిడర్‌) కింద 15 వేల ఎకరాలు ఆయనకు కట్టబెట్టారనేది సిబిఐ ధృవీకరణ.వ్యాన్‌పిక్‌ కోసం భూముల సేకరణ ఒకటైతే ఈ ఒప్పందాన్ని మొదట అనుకున్న దానికి క్యాబినెట్‌లో చెప్పినదానికి భిన్నంగా కుదుర్చుకున్నారనేది అసలు విషయం. దీనిపై ప్రతిపక్షాలు మీడియా కథనాలు అలా వుంచి కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ 2010లోనే అంటే ఈ కేసు మొదలు కాకముందే అనేక విమర్శలు చేసింది. మొదట కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం(ఎంవోయు) కు భిన్నంగా తర్వాత రాయితీల వర్షం
కురిపించారు. ప్రభుత్వ పాత్రను కుదించి ప్రసాద్‌ కంపెనీ అయిన రాక్‌ ఇష్టానుసారం వ్యవహరించే వీలు కలిగించారు. తన వాటాలో 40 శాతం అది నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి విక్రయించింది కూడా. ఇలాటి చాలా అక్రమాలు వ్యాన్‌పిక్‌లో వున్నందునే జగన్‌ సంస్థలు నాలుగింటిలో మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ 500 కోట్లపైగా పెట్టుబడులు పెట్టడం అనుమానాస్సదమైంది. ఇంతకూ ఆయన తెలుగు దేశం హయాంలోనూ బాగానే ప్రయోజనాలు పొందారనేది ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. కాకపోతే వైఎస్‌ పాలనలో అది అనేక రెట్లు పెరిగిపోయింది. పెట్టుబడులు పెట్టి ప్రజల సంపద ప్రకృతి వనరులు వశం చేసుకోవాలనుకునేవారికి అనుకూలమైన సరళీకరణ విధానాలను, భూ కబళింపు చర్యలనూ మార్చాలన్నది ఇలాటి కేసుల్లొ కనిపించే కీలకమైన గుణపాఠం.
పెట్టుబడి పెట్టిన వారిని అరెస్టు చేశారంటూ వైఎస్‌ఆర్‌ పార్టీ విధేయులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు అర్థ రహితమైనవి. ఆమోదిత పద్ధతుల్లో వ్యాపారాలు చేసుకుంటే ఎవరూ కాదనరు. అనలేరు కూడా. అడ్డదోవలను ఆశ్రయించినప్పుడు అడ్డుకోవడమూ తప్పదు. వ్యాపారం పరిశ్రమలు అంటేనే అవినీతి అక్రమాలను సహించడం అని చెప్పే నిర్వచనం సరైంది కాదు. కనక నిమ్మగడ్డ ప్రసాద్‌తో మొదలైన ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇంతకూ ఈ నిర్ణయాలకు ఆమోదం తెలిపిన అప్పటి మంత్రులను కూడా తప్పక విచారించి పాత్రను బట్టి చర్యలు తీసుకోవాలి కూడా. జగన్‌ను రాజకీయంగా సమర్థించే వారైనా సరే ఈ దర్యాప్తులు చేయడమే కక్ష సాధింపు అన్నట్టు మాట్లాడితే అది చెల్లుబాటు కాదు.

2 comments:

  1. వాన్ పిక్ వ్యవహారం తప్పు అని భావించినపుడు ఆ ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు రద్దు చెయ్యటం లేదో? గతంలో వై.ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ప్రసాద్కు అనుకూలం అనుకుంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి లేదా ప్రభటవాం ఈ ప్రాజెక్టును ఎందుకు రద్దు చెయ్యాత్మ్ లేదు? ఇప్పటికే ప్రసాద్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకునేందుకు ప్రభుత్వాన్ని కోరారని కూడా వార్త. మరి ఇటువంటి సందర్భంలో ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగే ప్రాజెక్టును ఎందుకు రద్దు చెయ్యాలోదో కూడా మీరు వివరించింటే బాగుండేది.

    ReplyDelete
  2. idi taxana vyakhya mmatrame. meeru cheppinavi kuda tarwata rastanu.

    ReplyDelete