Pages

Tuesday, October 25, 2011

తెలుగు పీఠం వస్తున్నట్టేనా?






తెలుగు భాష ప్రాచీన హౌదా కోసం తీవ్ర పోరాటం తర్వాతనే ఆలస్యంగా కేంద్రం అందుకు అంగీకరించింది.ఆ నిధులు రాకముందే వాటి గురించి ఆలోచించే భాషా సేవకులు పలువురు రాష్ట్రంలో పోటీలు పడ్డారు. అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న తెలుగు విశ్వ విద్యాలయం ఈ బాధ్యత వహిస్తుందా లేక తెలుగు అకాడమీలోనో మరో దాంట్లోనో కలపాలా అని చర్చ మొదలైంది.ఈ లోగా కేంద్రం ఇందుకు సంబంధించి అధ్యయన పీఠాన్ని తీసుకెళ్లి మైసూరులో పెడుతున్నట్టు ప్రకటించి మరో వివాదానికి కారణమైంది.మైసూరులో భారతీయ భాషల అధ్యయన కేంద్రం వున్నమాట నిజమే గాని దాని పరిధి పద్ధతి వేరు. తెలుగును వారు సరిగ్గా పట్టించుకోరన్న విమర్శలూ వున్నాయి. అసలు తెలుగు భాష వికాసం కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాన్ని మరో రాష్ట్రంలో నెలకొల్పవలసిన అవసరమేమిటి? దీనిపై ప్రతిపక్షాలు భాషా వేత్తలు నిరసన తెల్పిన మీదట ఇప్పుడు హైదరాబాదులోనే దాన్ని నెలకొల్పాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సూచనలు వస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆ మేరకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అంతవరకూ మంచిదే. అసలు మైసూరులో నెలకొల్పాలన్నది ప్రాచీన భాషా విభాగమట. ప్రాచీన సాహిత్య విభాగం బేతవోలు రామబ్రహ్మం ఆచార్యత్వంలో హైదరాబాదు యూనివర్సిటీలో నెలకొల్పబడింది. ఇప్పుడు మైసూరు ఆలోచనే మానుకుని తరలి వస్తే మరీ మంచిది. అయితే ఈ కేంద్రం రావడం ఒకటైతే దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరొకటి. దుర్వినియోగాలు అరికట్టడం ఇంకోటి.కనక ప్రభుత్వం తెలుగు భాషాభిమానులు నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని భాషా వికాసానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశించాలి.

2 comments:

  1. ఈ పీఠాల సంగతేమో కానీ కెంద్ర ప్రభుత్వం వారికి మన తెలుగు పట్ల ఎంత గౌరవముందో భారతీయ రైల్వేని చూస్తే తెలుస్తుంది. టిక్కెట్ల మీద తెలుగు కరిగి పోయింది. మన రాష్టంలో 500 నుండి 1000 కిలోమీటర్లు ప్రయాణించే రైళ్ళ మీద అరవం, ఒరియా, మళయాళం, తదితర భాషలు కనపడుతున్నయిగానీ తెలుగు కనపడటం లేదు. సామాన్యులకు ఉపయోగ పడే ఇటువంటి వాటి మీద గట్టిగా శ్రద్ధ పెట్టి, భారతీయ రైల్వే వారి మెడలు వంచి, రైళ్ళను తెలుగీకరిస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. / ఇప్పుడు హైదరాబాదులోనే దాన్ని నెలకొల్పాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సూచనలు వస్తున్నాయి/

    పోయి పోయి హైదరాబాద్లో ఎందుకో! రాజమండ్రిలోనో నెలకొల్పాలి.

    ReplyDelete