Pages

Tuesday, August 7, 2012

ప్రాచీన కవులకు ప్రాంతీయ హద్దులెందుకు?



            కెసిఆర్‌ సాహిత్యంలో అవగాహన వుండే నాయకులు. అయితే ఆయన తన రాజకీయ వ్యూహంలో తరచూ భాషా సాహిత్యాలను తీసుకొస్తుంటారు. విమర్శ కోసం కాదు గాని వివరణ కోసం ఆదికవిపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించవలసి వస్తున్నది. నన్నయ్య ఆదికవి కాదు పాల్కురికి సోమనాథుడు ఆదికవి అని ఆయన చేసిన వ్యాఖ్య చారిత్రిక వాస్తవాలతో పొసిగేది కాదు. నన్నయ్య ఆదికవి అన్న వాదన మాలాటి వాళ్లం ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఒక్కసారిగా భారతం అంతటి మహాకావ్యం పుట్టదు. దానికి ముందే తెలుగు భాష ప్రజల నోళ్లలో నానుతూ వుంది. పల్లెపదాలు ప్రవర్థిల్లుతున్నాయి. అయితే నన్నయ్య చేసిందేమంటే సంసృత భాష సహాయంతో కన్నడాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగు భాషను తన శైలిలో సంస్కరించాడు. వైదిక సంసృతిని పరిరక్షించేందుకు రాస్తున్నట్టు కూడా చెప్పుకున్నాడు. 1022-1063 మధ్య పాలించిన రాజ రాజ నరేంద్రుడి ఆస్థానంలో వుండి ఈ పనిచేశాడు. పాల్కురికి సోమనాథుడు 13 వ శతాబ్దికి
చెందినవాడు. వీరశైవాన్ని అనుసరించినవాడు. ఆయన నన్నయ్య కన్నా తేట తెలుగు భాషలో రాసిన మాట నిజమే కాని తనది అనువాదం కాదనడానికి లేదు.అనేక మూలాల నుంచి తీసుకుని తన సృజన జోడించాడు. ఇంతకూ పాల్కురికి ప్రేరణగా నిలిచింది కన్నడ దేశంలోని బసవన్న, నేటి తూర్పుగోదావరి జిల్లా దాక్షారామంలోని మల్లికార్జున పండితారుధ్యుడనే వీరశైవుడు. జాను తెనుగును చాటిన నన్నె చోడుడు సోమనాథుడి కన్నా ముందువాడు. అయితే ఆయన కాల నిర్ణయంపై అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే పైన చెప్పినట్టు వాస్తవికంగా చూస్తే నన్నయ్య ఒక్కసారి మహాకావ్యం రాసే అవకాశం లేదు. ఆదికవి అని అదే పనిగా కీర్తించడం వల్ల తెలుగు భాష ప్రాచీన హౌదాకు చాలా అంతరాయం కలిగిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆదికవి భజనలో పరవశిస్తూ సోదికవులను మర్చిపోవడం వల్ల కలిగిన అనర్థమది! పల్లె పదాలతో వీధుల్లో సోది చెప్పే వారిది కూడా తెలుగు అని గుర్తిస్తే ఈ సమస్య వుండేది కాదు. ఆ సామాజిక కోణం నుంచి పరిశీలిస్తే అదో తీరు గాని ఈ ప్రాచీన కవులను ప్రాంతీయ కొలమానాలతో చూపించే ప్రయత్నం అనవసరమే గాక హాస్యాస్పదం కూడా. యాదగిరి నరసింహస్వామికి, మంగళగిరి నరసింహస్వామికి పోటీ పెట్టడం ఎలాటిదో ఇదీ అంతే. అసమానతలు ఆర్థిక రాజకీయ రంగాలలో వున్నట్టే సాంసృతిక రంగంలోనూ వున్నాయి, వుంటాయి కూడా.ఒకే ప్రాంతంలో కూడా హెచ్చు తగ్గులు వుండకపోవు. వాటిని ప్రజాస్వామికంగా సరిచేసుకోవాలి గాని ప్రజల మధ్య గీతలు గీయడం సాధ్యం కాదు. త్రిలింగ దేశం అన్నప్పుడు మూడు లింగాలు మూడు ప్రాంతాల్లో వున్నట్టే తెలుగు భాష కూడా అన్ని ప్రాంతాల్లోనూ పెరిగింది. కాకపోతే నిజాం నిరంకుశత్వం తెలుగు భాష వికాసానికి బాగా ఆటంకం కలిగించింది. అయినా సాహిత్య సాంసృతిక వికాసం కలిగిందంటే అది ఎందరో వైతాళికులు. పోరాటయోధుల నిర్విరామ కృషి ఫలితమే. వారికి అందరం నివాళులర్పించాలి తప్ప మన సంకుచితపు రేఖల్లో బంధించలేము.

13 comments:

  1. చక్కగా చెప్పారు. అయినా అంతకంటే ముందు చెప్పుకోదగ్గ పేరు లభించనప్పుడు లభించినవాణ్ణి ఆదికవి అనుకోవడంలో తప్పేముంది ? వాల్మీకికి ముందు సంస్కృతభాష లేదా ? కానీ ఆయన్నే ఆదికవి అంటున్నాం కదా ? ఛాసర్ కి ముందు ఇంగ్లీషు లేదా ? కానీ ఛాసర్ నే ఆంగ్ల ఆదికవి అనుకుంటున్నాం కదా ? మఱి నన్నయ్య ఒక్కణ్ణీ వెలివేయడం దేనికి ?

    ReplyDelete
  2. నిజాం నిరంకుశత్వం తెలుగు భాష వికాసానికి బాగా ఆటంకం కలిగించింది.....
    అలాగే ఆంద్ర ఆధిపత్యం యావత్ తెలంగాణా సంస్కృతికి, చరిత్రకు మరింత ఘోరంగా ఆటంకం కలిగించింది.
    కాదు కాదు నామరూపాలు లేకుండా చేసింది. అందుకే తెలంగాణా అస్తిత్వ ఉద్యమ విజ్రుంభణ.
    ఒక ప్రాంతం తన అస్తిత్వాన్ని పునర్మించుకునే సందర్భంలో ఇవన్నీ సర్వసాధారణమని మీకు తెలియంది కాదు.
    మీరు ఆ కొమ్మకు కాసిన కాయనే కదా.
    కాకపొతే చాకొలేట్ కోటింగ్ ఎక్కువ. నీతి వాక్యాలు ఎక్కువ. అంటే తేడా.

    ReplyDelete
  3. సాహిత్యం,చరిత్ర,రెండూ
    తెలియనివారికిఏంచెప్పగలం?వాల్మీకితొలిసంస్కృతకవి
    చాసర్,తొలి-ఇంగ్లీషుకవి
    అంటేఅంతకుముందు,ఆభాషల్లోమౌఖికసాహిత్యంలేదనికాదుకదా.
    అలాగేనన్నయతొలితెలుగుకవి.పాల్కురికిసోమనాథుడు
    ,తరవాతికవి.ఐనాప్రాచీనకవులు
    ,ఎక్కడి
    వాళ్ళయినాందరూమనాందరివాళ్ళే.

    ReplyDelete
  4. ప్రాచీన కవులకు పాలకవర్గ పక్షపాతం ఆపాదించడం లేదా ప్రజాకవి అని బిరుదు ఇవ్వడం లేదా? ఇదీ అలాంటిదే అనుకోని సర్దుకుపొండి.

    ReplyDelete
  5. ప్రాచీన కాలంలో తెలుగు భాష మాట్లాడ్డం తప్పితే ఇప్పుడు అనుకునే భౌగోళిక రాజకీయ విభజనలు లేవు. బొబ్బిలి యుద్ధం చూడండి.. కాకతీయ వైభవం, హంపీ వేంగీ ప్రాభవం అని పాడుతుంది.. అప్పటి కొలబద్దలు అవి. వీటిని వాటినీ ఎందుకు కలగాపులగం చేయడం? ఆదికవి స్తుతిని నేనూ మరో కోణంలో పరిశీలించలేదా?
    .............
    కొమ్మలనీ కమ్మలనీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు మీలాటి కొందరు. అవి అవాస్తవాలైనా వాటికి సంబంధించిన వివరాలు వివరణలు ఏకరువు పెట్టి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రాంతీయ వివాదాలకు అతీతంగా ప్రజా బాహుళ్యం తరపున మాట్లాడ్డం వక్ర వాదనలను వమ్ము చేయడం మాత్రమే లక్ష్యం.

    ReplyDelete
    Replies
    1. ఆర్యా, ఎవరి సిద్దాంతం బట్టి వారు గతాన్ని చూస్తారు. కాన్షీరాం గారికి మనువులో కుల దురహంకారం కనిపిస్తుంది. సాహిర్ లుధ్యాన్వీ తాజ్మహల్ చూసినప్పుడు ఆయనకు సామాన్యుడి ప్రేమను వెటకారం చేసే ఒక మహారాజు అగుపించాడు. రంగనాయకమ్మకు వాల్మీకి రామాయణం విషవృక్షంగా తోస్తుంది. వీరందరూ గడిచిన విషయాలను ఆ కాలంలో ప్రచారంలో లేని ప్రస్తుతకాల దృక్పథంతోనే చూసారు.

      Interpretations can't be tested for factitude. Is it fair that you target the interpretations of only those you disagree with?

      Delete
  6. గొట్టిముక్కల మహాశయా(ఆర్యా అన్నారు గనక) రంగనాయకమ్మ గారి బుద్దుడు చాలడు పై విమర్శలోనూ ఇదే సూత్రం చెప్పాను. నేటి ప్రమాణాలతో గతాన్ని అర్థం చేసుకోవడం వేరు. యాంత్రికంగా అన్వయించడం వేరు. కొన్ని ఏ కాలానికైనా తప్పే. ఉదాహరణకు మనువు సిద్ధాంతాలను ఆ కాలంలోనే మానవతా వాదులు సహించలేదు. వర్ణ దురహంకారం ఏ కాలంలోనూ సరైనవి కావని పాల్కురికి సోమనాథుడి వంటి వారు ఆ కాలంలోనే రాశారు. రామాయణం అర్థం చేసుకోవాలంటే ఏ కొశాంబినో రొమిలా థాపర్‌నో చదివితే తెలుస్తుంది గాని రంగనాయకమ్మ గారి విషవృక్షం చారిత్రిక అవగాహన ఇవ్వదు. ఆక్షేపణ తప్పులేదు గనకే దాన్ని కూడా ఆదరించడం. విషయాలను చరిత్ర క్రమంలోనూ పరిణామ శీలంగానూ చూడటం అవసరమన్నదే ఇక్కడ కీలకాంశం.
    please allow me to remind the great dictum facts are sacred, comment is free. so my objection is not to the differences, but to the distortions, particulerly the wanton ones.bye.

    ReplyDelete
    Replies
    1. క్షమించాలి మీరు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. పాలకురికి సోమనాథుడు తెలుగు కన్నడ సంస్కృత భాషలలో ప్రవేశం ఉన్నా కొందరు ఆయనను తెలుగు కవి గానే చూస్తారు. మరికొందరు ఆయనలో వీరశైవాన్ని చూస్తారు. ఇలా ఎవరి దృక్పథం వారిదయినప్పుడు కొందరు ఆయనకు తెలంగాణా ముద్ర వేయడం తప్పు కాదేమో?

      కెసిఆర్ వాదనకు మూడు స్తంభాలు ఉన్నాయి. 1. నన్నయ్య కావ్యం అనువాదం. 2. అందులో కూడా తెలుగు ప్రమేయం తక్కువ, సంస్కృతమే ఎక్కువ. 3. తెలుగు భాష తెలంగాణాలోనే ఉద్భవించింది (as per scholars like IM Sharma) కాబట్టి ఇక్కడే భాష పురోగమించే అవకాశాలు ఎక్కువ. వాస్తవం అయినా కాకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవి కొట్టేయడానికి వీలు లేని వాదనలని నా అభిప్రాయం. వీటిలో మూడవది కొంతమేరకు మాత్రమె ప్రాంతీయపరమయిన ఆలోచన. కెసిఆర్ తెలంగాణావాది అయినంతమాత్రాన ఆయన ప్రతీ మాట వెనక అదే కారణమని రుజువు కాదు.

      పాలకురికి బసవపురాణం అనువాదం కాదు. జనబాహుళ్యంలో (ముఖ్యంగా వీరశైవులలో) ప్రచారంలో ఉన్న బసవేస్వరుని జీవిత చరిత్రను పుస్తక రూపంలో చిత్రించే ప్రయత్నం. దీన్నే భీమకవి అనే ఆయన కన్నడ భాషలోకి అనువదించారని అంటారు.

      మీరు "ప్రాచీన కాలంలో తెలుగు భాష మాట్లాడ్డం తప్పితే ఇప్పుడు అనుకునే భౌగోళిక రాజకీయ విభజనలు లేవు" అన్నారు. ఇది అంత వాస్తవం కాదేమో అని నా అనుమానం. అప్పటికి తెలుగు కన్నడ భాషల మధ్య అప్పటికి పూర్తిగా విభజన జరగలేదు. అదేరకంగా సంస్కృతభాష ప్రభావం కూడా హెచ్చు. నన్నయ్య కన్నడ నుడికారం వాడారని ప్రచారంలో ఉండడం ఒక ఎత్తయితే, ఆదికవి పంప వేములవాడకు చెందినవారని కూడా కొందరు అంటారు. భాషల మధ్య సరిహద్దులు (లగడపాటి భాషలో గోడలు) అస్పష్టంగా ఉన్న కాలమది.

      నన్నయ్య ఒక మహాకావ్యం రాయడానికి ముందే గొప్ప సాహిత్యం ఉండే ఉండి ఉండాలనేది కేవలం ఊహాగానం మాత్రమె. ఒకవేళ నన్నయ్య కంటే ముందు తెలుగు భాష ఉన్నా, తెలుగు సాహిత్యం ఉందని మాత్రం దాఖలాలు లేవు.

      నా వ్యాఖ్యలో అభ్యంతకరమయిన అంశాలు ఉన్న పక్షంలో మీరు పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తాను.

      Delete
    2. గొట్టి ముక్కల గారూ, ఈ బ్లాగు పెట్టాక ఇంత సంయమనంతో జవాబు రాసిన విమర్శకులు లేరు. అయితే క్షమించడం అనేది చాలా పెద్ద పదం. అభిప్రాయభేదాలు కలిగి వుండే హక్కు మీకుంది. బహుశా మహాశయా అన్నందువల్ల మీరు అలా అనుకుని వుంటారు.తెలంగాణా తెలుగు విడదీయరానివి. తెలుగు భాషా సాహిత్యాలే కాదు, సామ్రాజ్యాల చరిత్రలోనూ తెలంగాణాకు గొప్ప స్థానముంది. అయితే అప్పటి హద్దులు వేరు, పేర్లు వేరు. మీరన్నట్టు తెలుగు భారతం రాసిన నన్నయ కన్నడిగుడని, కన్నడ భారతం రాసిన పంపన తెలుగు వాడని అంటుంటారు. ఖచ్చితంగా తెలియదు గాని తమిళ దురభిమానాన్ని పెంచిన ఎంజిఆర్‌ మళయాలీ అని,కరుణానిధి తెలుగు వాడని కూడా అక్కడ వారు కొందరు చెబుతారు!తెలుగు వాడైన త్యాగయ్య పాటలు కర్ణాటక సంగీతమై తమిళుల నుంచి అమితాదరణ పొందుతున్నాయి. ఇకపోతే నన్నయ్యకు ముందే మహాకావ్యం వుందని నేను రాయలేదు.అలాటిది రావడానికి భూమికగా దేశ భాషా సాహిత్యాలు వుండి వుండాలని మాత్రం తప్పక భావిస్తాను. బసవపురాణం అనువాదమని కూడా అనలేదు. మూలాలు వున్నాయన్నాను. ఇప్పటి రాజకీయావసరాలను వేల ఏళ్లకిందటి వ్యవహారాలను కలగాపులగం చేయనక్కర్లేదని మాత్రమే నా భావన. మీ క్షమాపణలు వెనక్కు తీసుకోగలరు. ఇప్పటికింతే.

      Delete
  7. మనమిప్పుడు నన్నయని ఆదికవి అంటే ఆయనకొచ్చిన లాభం ఏముంది ? అనకపోతే నష్టమేముంది ? ఆ బిరుదు కోసం ఆయన వ్రాయలేదు. వెయ్యేళ్ళనాడు ఒక బాల్యమిత్రుడు ఇంకో బాల్యమిత్రుణ్ణి మహాభారతం తెలుగులో వ్రాసిపెట్టమనీ, చదువుకుని ఆనందిస్తాననీ కోరాడు. ఆ మిత్రుడి కోరికను ఈ మిత్రుడు నెఱవేర్చాడు. అంతే ! భావితరాల సంగతి వాళ్ళు పట్టించుకోలేదు. తొట్టతొలిసారి భారీయెత్తున 4,300 తెలుగుపద్యాలు వ్రాసిన మహాకవిగానైనా మనం ఆయన్ని స్మరించుకోవచ్చు గదా ? ఒకఱు గుర్తించడం, గుర్తించకపోవడంతో సంబంధం లేకుండా ఎవఱి ప్రాధాన్యం వారికి ఎలాగూ ఉండిపోతుంది చరిత్రలో ! దాన్నెవఱూ చెఱపలేరు. మన తండ్రి మన వంశంలో మొదటివాడు కాడు. అయినా తండ్రి తండ్రే కదా ! నన్నయ్యగారయినా అంతే ! నన్నయ్య ఆదికవి కాడనే వాదం మొదటిసారి లేవనెత్తినది నియోగిబ్రాహ్మణులు. నన్నయ్య వైదికుడనే భ్రమలో వారీ వాదాన్ని లేవనెత్తారు. కానీ నన్నయకాలానికి బ్రాహ్మణకులం బ్రాహ్మణకులంగానే ఉంది. వైదీకులూ, నియోగులుగా విడిపోలేదు. ఆ తరువాత దళితులు ఈ వాదాన్ని తలకెత్తుకున్నారు. ఇప్పుడేమో తెలంగాణవాదులు. ఇలా తమ కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, శాఖని బట్టి, లేదా ఆర్థిక వర్గాన్ని బట్టి చారిత్రిక పితామహుల్ని ఒప్పుకోవడమో, తిరస్కరించడమో చేసే జాతి దేనికీ పనికిరాదు. History is a fact and it needs to be accepted without reservations.

    ReplyDelete
  8. సవాల్ రెడ్డి
    ఒక జాతి తన అస్థిత్వం వెతుక్కునే క్రమంలో, విముక్తికి పోరాటం చేసే క్రమంలో పాత భావనలను, వాటిని వ్యక్తీకరించే ప్రతీకలను తిరస్కరించడం...ధ్వంసం చేయడం సాధారణమైన అంశమేననే విషయం కమ్యూనిస్టు మేధావి అయిన తెలకపల్లి రవి గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. రష్యా విప్లవం సందర్భంగా చక్రవర్తుల ప్రతీకలన్నీ ధ్వంసం చేసినా... ఆ తర్వాత అక్కడ కమ్యూనిజం కోట కూలినప్పుడు ఎర్రజెండాల అవనతాలు.. లెనిన్ విగ్రహాల ధ్వంసాలు జరిగినా అన్నీ పాత ప్రతీకల భూస్థాపిత లక్ష్యాలతో చేసినవే... అంతే తప్ప లెనిన్ జాతకి చేసిన సేవను తక్కువ చేయడం కాదు.
    అలాగే తెలంగాణ భావనను తెలుగుజాతి భావజాలం,తెలుగు తల్లి వంటి మోహావేశ బంధనాలు ఉపయోగించి దెబ్బ కొట్టాలనుకుంటున్నప్పుడు....సోదర తత్వం పేరిట ఎక్కడలేని వావివరుసలు కల్పించినపుడు... తన అస్థిత్వం కోసం పోరాడుతున్న తెలంగాణకు ఆ భావజాలాన్ని సమూలంగా తుడిచిపెట్టాల్సిన చారిత్రక అవసరం ఉంటుంది. ఉద్యమ ప్రస్థానంలో అడ్డుపడే సంకెళ్లను బ్రద్దలుకొట్టకపోతే ముందుకు వెళ్లడం అసాధ్యం. కమ్యూనిజానికి అడ్డుపడుతుందనే కదా మతాన్ని, దేవుడిని ఆ వాదులు తిరస్కరించింది. ఏ ఉద్యమానికైనా... నాయకుడికైనా ఇది తప్పదు. బ్రిటిష్ వాడు మన దేశానికి ఎంత చేసినా దాంట్లో తప్పులు ఎత్తి చూపడం వల్లనే కదా దేశ ప్రజలందరినీ సమీకరించగలిగింది... యావత్తూ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నది.
    అరవై ఏళ్ల ఆంధ్ర పెత్తనం... పాలన పాదుకొల్పిన అనేక భావజాలాలను తిరస్కరించడం.. తెలంగాణ ప్రజలను ఆ మేరకు సన్నద్ధం చేయడం తెలంగాణ ఉద్యమ కర్తవ్యం. విమర్శలు, అవహేళనలు ఎదురైనా ఉద్యమ కారులు నాయకులు పాటిస్తున్నది... అనుసరిస్తున్నది అదే. అంతేతప్ప ప్రతి విషయానికి ప్రాంతీయ కొలమానంలోనే చూసేంత అంగుష్ట మాత్రపు సంకుచిత బుద్దులు, కుత్సిత మనస్కులు కారు తెలంగాణ ఉద్యమకారులు. నిజాంను పొగిడినా..తెలుగుతల్లిని తిట్టినా.. అన్నింటి వెనక ఉన్నవి భూత, వర్తమాన, భవిష్యత్ ఉద్యమ వ్యూహాలు...కోణాలు ఆరాటాలే! ఉపరితలంనుంచి చూసే వారికి ఇవి అర్థం కాకపోవచ్చు.
    అయినా నన్నయ్య ఆదికవిత్వం పై వివాదం... ఎదో కేసీఆరే మొదలు పెట్టలేదు...నాకు తెలిసి నేను చదివిన జ్ఞాపకాల ప్రకారం పందొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో తెలుగు పత్రికల తొలి అడుగులు పడ్డ కాలంలోనే ప్రారంభమైంది. ఇటీవల తెలుగు ప్రాచీన భాష వివాదం తలెత్తినప్పుడు ఏబికె సహా సమకాలీన తెలుగు ఉద్యమకారులంతా మూకుమ్మడిగా నన్నయ్ తొలి తెలుగు కవి కాడనీ... అంతకు మందు తెలుగు సాహిత్యం కుప్పలు తెప్పలుగా ఉందని వాదించిన వాళ్లే ... ఏబికె అయితే అధర్వణ పండితుడి ప్రస్తావనే కాదు... ఆయన రచనను చూశానని ఎవరో పాతకాలపు పత్రికా సంపాదకుడొకరు చెప్పాడని కూడా రాశారు. అనేక శాసనాల్లో తెలుగు పద్యాలను అందరూ ప్రస్తావించారు..
    గమ్మతైన విషయమేమంటే... ఆనాడు నన్నయ్య ఆదికవి కాడని అంటే ఎవరికీ అభ్యంతరాలు...ప్రాంతీయ భావనలు కనిపించలేదు... ఇవాళ కేసీఆర్ అనే సరికి మాత్రం ప్రపంచం బద్దలైనట్టు జరగకూడని అపచారమేదో జరిగిపోయినట్టు పెడబొబ్బలు పెడుతున్నారు.
    సరే... ఆదికవికి ఎవరి కొలమానాలు వారికున్నాయి. అది తెలుగైనా సంస్కృతానికి డుమువులు తగిలించినా తెలుగు సాహిత్యమే ముఖ్యం అనుకునే వాళ్లుంటారు. అలాగే సంస్కృతాన్ని రుద్దేది కాదు... ప్రజల వ్యవహారిక భాషే హాష అందులో రాసేదే సాహిత్యం అనే వాళ్లుంటారు.
    తెలంగాణ కవులు అచ్చ తెనుగునే తెలుగు సాహిత్యంగా అందులో వెలువడ్డ సాహిత్యమే సాహిత్యంగా భావిస్తున్నారు. అ భావనలోంచి వెలికి వచ్చిందే సోమనాథుని సాహిత్యం.
    స్వతంత్ర రచన.. ప్రజా సాహిత్యం... సంఘ సంస్కరణ లక్ష్యం...స్వయంగా రచయితే సంస్కర్త కావడం.. స్వతంత్ర సాహిత్య విన్యాసం... ఇవన్నీ సోమనాథుడితో ప్రారంభమయ్యాయి కాబట్టి ఆయనే ఆదికవి అనేది ఇక్కడి వాదం. దాన్నే కేసీఆర్ చెప్పారు.
    శ్రీశ్రీని మహాకవి అంటారు.. మరి ఆయనకన్నా ముందు గొప్ప కవులు లేరా? ఆయన సమకాలీనుడైన విశ్వనాథ చేయని సాహిత్య విన్యాసం ఏదైనా ఉన్నదా? చరిత్ర, నవల, పద్యం, గద్యం సహా అన్ని సాహితీ ప్రక్రియలు పూర్తి చేసిన సాహితీ సృష్ట ఆయన. అయినా శ్రీశ్రీనే మహాకవి అన్నాం. ఎందుకు? ఆయన ప్రజల కవి కాబట్టి..
    అదే తెలంగాణ కవులు అనుసరిస్తున్నారు. ప్రజలకోసం రాసింది... ప్రజలభాషలో రాసిందే సాహిత్యం... ఆ కొలమానంలో సరితూగింది సోమనాధుడు.
    నిజానికి ఈ వాదన చాలా కాలం క్రితమే తెలంగాణ రచయితలు చెబుతూ వచ్చారు. ఎడాది క్రితం అనుకుంటా... ఓ టీవీ చర్చలో మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఈ విషయం బాహాటంగానే చెప్పారు. నన్నయ్య అనువాద కవి మాత్రమేనని సోమనాధుడే అసలైన ఆదికవి అని చాలా స్పష్టంగానే చెప్పారు. అపుడెవరూ పెద్ద అభ్యంతరాలు వెలుబుచ్చినట్టు కనబడలేదు. ఎటొచ్చీ ఇవాళ కేసీఆర్ ఆ మాట చెప్పడం మాత్రం మిన్ను విరిగి మీద పడిన చందంగా కనబడుతోంది.
    ఇంతకీ ఈ అభ్యంతరాలు వాదం మీదనా? వాది మీదనా? వాది భావజాలం మీదనా?

    ReplyDelete
  9. ఒక జాతి తన అస్థిత్వం వెతుక్కునే క్రమంలో, విముక్తికి పోరాటం చేసే క్రమంలో పాత భావనలను, వాటిని వ్యక్తీకరించే ప్రతీకలను తిరస్కరించడం...ధ్వంసం చేయడం సాధారణమైన అంశమేననే విషయం కమ్యూనిస్టు మేధావి అయిన తెలకపల్లి రవి గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. రష్యా విప్లవం సందర్భంగా చక్రవర్తుల ప్రతీకలన్నీ ధ్వంసం చేసినా... ఆ తర్వాత అక్కడ కమ్యూనిజం కోట కూలినప్పుడు ఎర్రజెండాల అవనతాలు.. లెనిన్ విగ్రహాల ధ్వంసాలు జరిగినా అన్నీ పాత ప్రతీకల భూస్థాపిత లక్ష్యాలతో చేసినవే... అంతే తప్ప లెనిన్ జాతకి చేసిన సేవను తక్కువ చేయడం కాదు.
    అలాగే తెలంగాణ భావనను తెలుగుజాతి భావజాలం,తెలుగు తల్లి వంటి మోహావేశ బంధనాలు ఉపయోగించి దెబ్బ కొట్టాలనుకుంటున్నప్పుడు....సోదర తత్వం పేరిట ఎక్కడలేని వావివరుసలు కల్పించినపుడు... తన అస్థిత్వం కోసం పోరాడుతున్న తెలంగాణకు ఆ భావజాలాన్ని సమూలంగా తుడిచిపెట్టాల్సిన చారిత్రక అవసరం ఉంటుంది. ఉద్యమ ప్రస్థానంలో అడ్డుపడే సంకెళ్లను బ్రద్దలుకొట్టకపోతే ముందుకు వెళ్లడం అసాధ్యం. కమ్యూనిజానికి అడ్డుపడుతుందనే కదా మతాన్ని, దేవుడిని ఆ వాదులు తిరస్కరించింది. ఏ ఉద్యమానికైనా... నాయకుడికైనా ఇది తప్పదు. బ్రిటిష్ వాడు మన దేశానికి ఎంత చేసినా దాంట్లో తప్పులు ఎత్తి చూపడం వల్లనే కదా దేశ ప్రజలందరినీ సమీకరించగలిగింది... యావత్తూ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నది.
    అరవై ఏళ్ల ఆంధ్ర పెత్తనం... పాలన పాదుకొల్పిన అనేక భావజాలాలను తిరస్కరించడం.. తెలంగాణ ప్రజలను ఆ మేరకు సన్నద్ధం చేయడం తెలంగాణ ఉద్యమ కర్తవ్యం. విమర్శలు, అవహేళనలు ఎదురైనా ఉద్యమ కారులు నాయకులు పాటిస్తున్నది... అనుసరిస్తున్నది అదే. అంతేతప్ప ప్రతి విషయానికి ప్రాంతీయ కొలమానంలోనే చూసేంత అంగుష్ట మాత్రపు సంకుచిత బుద్దులు, కుత్సిత మనస్కులు కారు తెలంగాణ ఉద్యమకారులు. నిజాంను పొగిడినా..తెలుగుతల్లిని తిట్టినా.. అన్నింటి వెనక ఉన్నవి భూత, వర్తమాన, భవిష్యత్ ఉద్యమ వ్యూహాలు...కోణాలు ఆరాటాలే! ఉపరితలంనుంచి చూసే వారికి ఇవి అర్థం కాకపోవచ్చు.
    అయినా నన్నయ్య ఆదికవిత్వం పై వివాదం... ఎదో కేసీఆరే మొదలు పెట్టలేదు...నాకు తెలిసి నేను చదివిన జ్ఞాపకాల ప్రకారం పందొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో తెలుగు పత్రికల తొలి అడుగులు పడ్డ కాలంలోనే ప్రారంభమైంది. ఇటీవల తెలుగు ప్రాచీన భాష వివాదం తలెత్తినప్పుడు ఏబికె సహా సమకాలీన తెలుగు ఉద్యమకారులంతా మూకుమ్మడిగా నన్నయ్ తొలి తెలుగు కవి కాడనీ... అంతకు మందు తెలుగు సాహిత్యం కుప్పలు తెప్పలుగా ఉందని వాదించిన వాళ్లే ... ఏబికె అయితే అధర్వణ పండితుడి ప్రస్తావనే కాదు... ఆయన రచనను చూశానని ఎవరో పాతకాలపు పత్రికా సంపాదకుడొకరు చెప్పాడని కూడా రాశారు. అనేక శాసనాల్లో తెలుగు పద్యాలను అందరూ ప్రస్తావించారు..
    గమ్మతైన విషయమేమంటే... ఆనాడు నన్నయ్య ఆదికవి కాడని అంటే ఎవరికీ అభ్యంతరాలు...ప్రాంతీయ భావనలు కనిపించలేదు... ఇవాళ కేసీఆర్ అనే సరికి మాత్రం ప్రపంచం బద్దలైనట్టు జరగకూడని అపచారమేదో జరిగిపోయినట్టు పెడబొబ్బలు పెడుతున్నారు.
    సరే... ఆదికవికి ఎవరి కొలమానాలు వారికున్నాయి. అది తెలుగైనా సంస్కృతానికి డుమువులు తగిలించినా తెలుగు సాహిత్యమే ముఖ్యం అనుకునే వాళ్లుంటారు. అలాగే సంస్కృతాన్ని రుద్దేది కాదు... ప్రజల వ్యవహారిక భాషే హాష అందులో రాసేదే సాహిత్యం అనే వాళ్లుంటారు.
    తెలంగాణ కవులు అచ్చ తెనుగునే తెలుగు సాహిత్యంగా అందులో వెలువడ్డ సాహిత్యమే సాహిత్యంగా భావిస్తున్నారు. అ భావనలోంచి వెలికి వచ్చిందే సోమనాథుని సాహిత్యం.
    స్వతంత్ర రచన.. ప్రజా సాహిత్యం... సంఘ సంస్కరణ లక్ష్యం...స్వయంగా రచయితే సంస్కర్త కావడం.. స్వతంత్ర సాహిత్య విన్యాసం... ఇవన్నీ సోమనాథుడితో ప్రారంభమయ్యాయి కాబట్టి ఆయనే ఆదికవి అనేది ఇక్కడి వాదం. దాన్నే కేసీఆర్ చెప్పారు.
    శ్రీశ్రీని మహాకవి అంటారు.. మరి ఆయనకన్నా ముందు గొప్ప కవులు లేరా? ఆయన సమకాలీనుడైన విశ్వనాథ చేయని సాహిత్య విన్యాసం ఏదైనా ఉన్నదా? చరిత్ర, నవల, పద్యం, గద్యం సహా అన్ని సాహితీ ప్రక్రియలు పూర్తి చేసిన సాహితీ సృష్ట ఆయన. అయినా శ్రీశ్రీనే మహాకవి అన్నాం. ఎందుకు? ఆయన ప్రజల కవి కాబట్టి..
    అదే తెలంగాణ కవులు అనుసరిస్తున్నారు. ప్రజలకోసం రాసింది... ప్రజలభాషలో రాసిందే సాహిత్యం... ఆ కొలమానంలో సరితూగింది సోమనాధుడు.
    నిజానికి ఈ వాదన చాలా కాలం క్రితమే తెలంగాణ రచయితలు చెబుతూ వచ్చారు. ఎడాది క్రితం అనుకుంటా... ఓ టీవీ చర్చలో మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఈ విషయం బాహాటంగానే చెప్పారు. నన్నయ్య అనువాద కవి మాత్రమేనని సోమనాధుడే అసలైన ఆదికవి అని చాలా స్పష్టంగానే చెప్పారు. అపుడెవరూ పెద్ద అభ్యంతరాలు వెలుబుచ్చినట్టు కనబడలేదు. ఎటొచ్చీ ఇవాళ కేసీఆర్ ఆ మాట చెప్పడం మాత్రం మిన్ను విరిగి మీద పడిన చందంగా కనబడుతోంది.
    ఇంతకీ ఈ అభ్యంతరాలు వాదం మీదనా? వాది మీదనా? వాది భావజాలం మీదనా?

    ReplyDelete