Pages

Saturday, August 13, 2011

హైకోర్టు తీర్పు- వైఎస్‌ఆర్‌ పార్టీ వాదనలు

జగన్‌ ఆస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశలు ఆహ్వానించదగినవి. అయితే వీటిని స్వాగతిస్తున్నామంటూనే జగన్‌తో సహా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలలో సమర్థనే ఎక్కువగా కనిపిస్తున్నది. గజం మిథ్య పలాయనం మిథ్య అన్న చందంగా ఏమి వాదించినా ఇంత దూరం వచ్చిన సమస్య వూరికే సమిసి పోదని అందరికీ తెలుసు. న్యాయపరమైన కోణం నుంచి చూస్తే ఇదంతా హైకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నది. కోర్టు సిబిఐ సహాయం తీసుకున్నది. ఇంకా తీసుకోబోతున్నది. మొదట కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ శంకరరావు, తర్వాత తెలుగు దేశం నాయకుడు ఎర్రం నాయుడు వేసిన పిటిషన్ల ఆధారంగా విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్లు ప్రజా ప్రయోజన వాజ్యాలు గనక వాటిని విచారణకు చేపట్టవలసిన ప్రాథమిక సాక్ష్యాధారాలు వున్నాయా లేదా అన్న అంశానికి పరిమితమైనట్టు కోర్టు పేర్కొంది.ముందు ఆ విషయం తేల్చుకోవడానికి తొలి విడత విచారణ,వాదనలు, సిబిఐ నివేదికల పరిశీలన పనికివచ్చింది.వీటి ఆధారంగా కోర్టు ప్రాథమిక ఆధారాలు వున్నట్టు అభిప్రాయపడిుంది. అవినీతి నిరోధక చట్టం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, మనీ లాండరింగ్‌ చట్టం అనే మూడు విభాగాల కింద అక్రమాలను పరిశోధించాలని కోర్టు ఆదేశించింది.
న్యాయమూర్తులు తమ తీర్పులో అనేక ఆరోపణలనూ , సంస్థలనూ ఉటంకించారుే. . వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా భూముల పందేరంలోనూ, ప్రాజెక్టుల కాంట్రాక్టుల లోనూ, సెజ్‌ల కేటాయింపులోనూ అపారంగా లాభపడిన కార్పొరేట్‌ సంస్థలే ఆయన కుమారుడైన జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనే
ఆరోపణలను తీర్పులో సూటిగానే పొందుపరిచారు. ఇందులో ఏ ఏ సంస్థలనూ వ్యక్తులనూ పేర్కొన్నారనేది అటుంచితే ఆ జాబితా పెద్దదే. అదే గాక బినామి పేర్లతోనూ అనేక పెట్టుబడులు ప్రవహించాయి. పన్నుల ఎగవేతలకూ అక్రమ లావాదేవీలకు నల్లడబ్బు చలామణికి స్వర్గధామమైన మారిషస్‌లో నెలకొన్న సంస్థలు టు ఐ క్యాపిటల్‌,ప్యూర్లీ ఎమర్జింగ్‌ కంపెనీల పాత్ర కూడా వున్నందున విదేశాలలోనూ పరిశోధన చేయడానికి సిబిఐ అవసరం వుంటుందని కోర్టు అభిప్రాయపడింది. తన విచారణతో పాటు ఇప్పటికే అదాయపు పన్ను శాఖ జగన్‌ సంస్థలకు ఇచ్చిన నోటీసులను కూడా ఆధారంగా తీసుకున్నది.ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఇది బలమైన ఆధారాలతో కూడిన వ్యవహారమే తప్ప తేలికైంది కాదు. ఒకసారి సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత దర్యాప్తు పరిధి చాలా విస్త్రతంగానే వుంటుంది. దీనిపైన ఏ వ్యూహం తీసుకోవాలి, పై కోర్టులో ఎలా సవాలు చేయాలి అనేది జగన్‌ శిబిరం ఆలోచించుకోవచ్చు. అంతేగాని రాజకీయ కక్ష సాధింపు, జనాదరణ చూసి వోర్వలేమి, కాంగ్రెస్‌ తెలుగు దేశం కుట్ర వంటి మాటలకే చర్చను పరిమితం చేయడం సాధ్యమయ్యేది కాదు.సిబిఐ నిష్పాక్షితకను గురించి ప్రశ్నించినా చట్టం చట్టమే. పెట్టుబడులు రావడానికి చట్టాలను ఉటంకించే వారు ఆ చట్టాల ప్రకారమే న్యాయస్థానాలు సిబిఐ పనిచేయడాన్ని కూడా గౌరవించకతప్పదు.
ఎప్పుడైనా వ్యతిరేక కేసులు వేసే వారు వ్యతిరేకులే తప్ప అనుకూలులు కాదు.గతంలో వైఎస్‌తో సహా కాంగ్రెస్‌ నేతలు తెలుగుదేశం నాయకులపై కేసులు వేశారు. అదే ఇప్పుడు అవతలి వారు చేయడాన్ని వారు చేస్తే నేరమై పోదు. కనకనే రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు తమ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేవని కూడా కోర్టు తీర్పులో చెప్పింది. కాకపోతే అధికారంలో వున్న కాంగ్రెస్‌ జగన్‌ బయిటకు వెళ్లాకనే అది కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ఈ పని చేయడంలో రాజకీయం దాగేది కాదు. ఇదంతా కేవలం వైఎస్‌కు ఆయన కుమారుడికే సంబంధించింది అయినట్టు మిగతా వారంతా అమాయక ప్రేక్షక సమానులైనట్టు వాదించడం కూడా నిలిచేది కాదు. ఇక్కడ రాజకీయ వైపరీత్యం ఏమంటే ప్రజల ధనంతో అమలు చేసిన సంక్షేమ పథకాలు వైఎస్‌కు చెందుతాయా కాంగ్రెస్‌కు చెందుతాయా అనేది ఇరుపార్టీలు పరస్పరం వాదించుకుంటూనే వున్నాయి.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆ పథకాలు తమ స్వంతమని అంటుంటే కాంగ్రెస్‌ అవి పార్టీకి చెందుతాయని ఢంకా బజాయిస్తున్నది. ఆరోపణల విషయానికి వచ్చేసరికి అవి సమిష్టి బాధ్యత అని వైఎస్‌ కాంగ్రెస్‌ అంటుంటే మాకు సంబంధం లేదని అధికార పార్టీ నేతలు మంత్రులు అంటున్నారు. ఇదే ఈ కేసులో తిరకాసు. ఇందులో నిజానిజాలు పూర్తిగా తెలియాలంటే వైఎస్‌ కుటుంబీకులతో పాటు అప్పటి మంత్రులూ కీలకనేతల పాత్రపైనా దర్యాప్తు జరగవలసి వుంటుంది.
ఈ ఆరోపణలు కేవలం రాష్ట్రానికి లేదా జగన్‌ ఆస్తులకూ పరిమితమైనవి కావు. సరళీకరణ పేరిట సాగుతున్న విశృంఖల ప్రైవేటీకరణ విష ఫలితాలే ఇవన్నీ. ఆ మూల సూత్రాలను మార్చనంత వరకూ ఈ పోకడలూ ఆగవు. ప్రభుత్వ ఆస్తులనూ ప్రజా ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దీని పరమార్థం. ఆ పని ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిపోతుంటుంది. టు జి స్పెక్ట్రంలో రాజా,కనిమొళి వంటి వారి అరెస్టుతో మొదలు పెట్టి కర్ణాటకలో ఎడ్యూరప్పకు ఉద్వాసన వరకూ అన్నిచోట్లా అగుపించే అసహ్యదృశ్యమే ఇది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్‌ వుండగానే వచ్చిన ఆరోపణల కొనసాగింపు తప్ప ఇవి హఠాత్తుగా వచ్చినవీ కావు,కొత్తవీ కావు.కార్పోరేట్‌ సంస్థలు ప్రయోజనం పొందడం, నేరుగా పెట్టుబడులు పెట్టడం ఒకటైతే రకరకాల డొంక తిరుగుడు బినామి మార్గాల్లో ధనం ప్రవహించడం మరొకటి. తాము వ్యాపారం సమర్థంగా చేశాము గనక పెట్టుబడులు వచ్చి పడ్డాయని సమర్థించుకోవడం తప్ప ఇంకే విధమైన బలమైన వాదనా జగన్‌ వర్గీయులు ముందుకు తీసుకురాలేకపోతున్నారు. ఈ వాదనలను న్యాయస్థానం ఆమోదించి వుంటే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి వుండేది కాదు. అలాటి అతకని వాదనలు ముందుకు తేవడం ప్రచారానికి పనికి వచ్చేదే తప్ప ప్రయోజనం వుండదు. అలాగే ఏ ఇతర రాజకీయ వాణిజ్య వేత్తలపైనైనా తాము చట్టపరంగా వేయదగిన కేసులు వేయడానికి వారి పూర్తి హక్కు అవకాశం వున్నాయి. అలాగే తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అన్ని న్యాయ దొంతరలనూ రాజకీయ వ్యూహాలను కూడా వారు అనుసరించవచ్చు. కాని- ఇప్పుడున్న వాతావరణం, గతంలో చేసిన అభ్యర్థన తోసి వేత నేపథ్యంలో పై కోర్టు ఉపశమనం ఇస్తుందా అనేది అనుమానమే.
ఈ సందర్భంలోనే సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌ నిర్వహించిన సర్వే రాష్ట్రానికి సంబందించి అనేక అంచనాలు వెల్లడించింది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి దేశంలో అతి తక్కువ ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా పేర్కొంది. పరిపాలనే ప్రతిష్టంభనలో పడిపోయిన అనిశ్చిత పరిస్థితుల్లో ఇది ఆశ్యర్యమేమీ కాదు. కాగా రాష్ట్రంలో సమైక్య భావన కొంత పెరుగుతుందన్న అంచనా కూడా ఆ సర్వే ఇచ్చింది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌కూ ఇతర చోట్ల జగన్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే ప్రకటించింది. సర్వేలే సర్వ సత్యాలు కావని అనేక సార్లు రుజువైనా వాటిపట్ల వుండే అసక్తి వుండనే వుంటుంది.సూచన ప్రాయమైన ప్రాధాన్యతా వుంటుంది. అయితే ఎన్నికలు ఇంకా చాలా దూరం వున్నాయి గనక ఇది కూడా స్థిరంగా వుండకపోవచ్చు.ఏమైనా ప్రజాదరణ లేదా ఓట్ల ఆకర్షణ వంటి వాటికి చట్టబద్దమైన ఆరోపణలకూ ఏ సంబంధం లేదు. ఎడ్యూరప్ప ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కూడా ఘన విజయాలే సాధించినా ఉపయోగం ఏం కలిగింది? కనక కావలసింది పారదర్శక వైఖరి, సమగ్రమైన వాస్తవాలు తప్ప బలాబలాల జనాకర్షణల సమస్యగా దీన్ని చూడడానికి లేదు.
జగన్‌ ఆస్తులతో పాటు ఎమ్మార్‌ అక్రమాలపై కూడా దర్యాప్తుకు కోర్టు ఆదేశించిందంటే అవినీతి ఏ ఒక్క విభాగానికో వ్యక్తికో పరిమితమై లేదని స్పష్టమవుతుంది. రాజధానిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని, సామాన్య ప్రజల నుంచి నిర్బంధంగా సేకరించిన భూమిని ఒక విదేశీ కార్పొరేట్‌ సంస్థకు కట్టబెట్టి కాస్త వాటాతో సరిపెట్టుకున్న ఎపిఐఐసి దానికి కూడా ఎగనామం జరుగుతుంటే ఆనందంగా అనుమతించింది. ఎమ్మాఆర్‌ ఎంజిఎఫ్‌గా అవతారమెత్తి అప్పణంగా అనేక అనుమానాస్పద లావాదేవీలకు బినామి సంతర్పణలకు పాల్పడింది. వైఎస్‌ పేరిటనే గాక ఎపిఐఐసి చైర్మన్‌ ఆచార్య(బిపి) పేరిట కూడా నిర్మాణాలు చేసింది. ప్రజాస్వామ్యం చాటున కార్పొరేట్‌ స్వామ్యం ఎంత విచ్చలవిడిగా అమలవుతున్నది తెలియడానికి ఈ ఉదాహరణ చాలు.ఎమ్మాఆర్‌కు అనుమతి తెలుగుదేశం హయాంలో వచ్చిందంటే దాన్ని కూడా విచారించవచ్చు. అయితే అనుమతి లేకుండా మరో సంస్థను తెరమీదకు తేవడం, ఎపిఐఐసి వాటాను దారుణంగా తగ్గించేందుకు ఒప్పుకోవడం తర్వాతే జరిగింది.ఇందులో రాజకీయ నేతల పాత్ర ఎంత, కార్పొరేట్‌ కక్కుర్తి ఎంత, అధికారుల అవినీతి ఎంత అనేది దర్యాప్తులో తేలాల్సిందే. పనిలోపనిగా విలువైన విల్లాలు స్వంతం చేసుకున్న వీఐపీలు సెలబ్రటీలు కూడా ఎంతో కొంత సంజాయిషీ ఇచ్చుకోవలసే వుంటుంది.
దేవుడున్నాడనీ, న్యాయమే గెలుస్తుందని జగన్‌ వ్యాఖ్యానిస్తే అంబటి రాంబాబు వంటివారు తీవ్రస్తాయిలోనే ప్రత్యర్థులపై మీడియా సంస్థలపై ధ్వజమెత్తుతున్నారు. గతంలో దూరమైన వైఎస్‌ వివేకానందరెడ్డి తమ కుటుంబంపై ఆరోపణలను ఖండించడంలో గొంతు కలిపారు. పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటివారు నాటి ముఖ్యమంత్రికి తప్ప తమకేమి సంబంధం లేదన్న రీతిలో మాట్లాడారు. ఇవన్నీ పాక్షికమైన వ్యాఖ్యలు. న్యాయం గెలవాలనే ప్రతివారూ కోరుకుంటున్నారు. న్యాయాన్యాయాల నిర్ణయం చట్ట ప్రకారం జరగాల్సిందే గనక సిబిఐ దర్యాప్తు సమర్థంగానూ సమగ్రంగానూ జరుగుతుందని ఆశించాలి. న్యాయపరంగా తుది నిర్ణయం కోర్టులదే అయినప్పటికీ రాజకీయంగా మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో పాటు అధికార కాంగ్రెస్‌ కూడా ఈ దర్యాప్తు పర్యవసానాలకు సిద్ధం కావలసి వుంటుంది. వైఎస్‌ సహచరులుగా కుడిభుజాలుగా వున్న వారు నాటి నిర్వాకాలకు నిర్ణయాలకు బాధ్యత నుంచి తప్పించుకోలేరు కూడా. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అవినీతికి ఆస్కారం వుండరాదని గట్టిగా చెబుతున్నారు గనక సక్రమ దర్యాప్తుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, తమ (పూర్వ) ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కాకుండా ఏం కట్టుదిట్టాలు చేస్తారన్నది ప్రజలకు చెప్పాలి.

No comments:

Post a Comment