Pages

Tuesday, August 30, 2011

రోశయ్య వ్యాఖ్యలపై రభసలో రాజకీయాలు


ముఖ్యమంత్రిగా వుండగా తెలంగాణా సమస్యకు సంబంధించి జరిగిన పరిణామాలపై రోశయ్య ఆలస్యంగా కొన్ని అభిప్రాయాలు బయిటపెట్టారు. వాటిపై ఆయనే రాష్ట్ర విభజనకు అడ్డుపడ్డారన్నట్టుగా కేశవరావు వంటి నాయకులు విరుచుకుపడుతున్నారు.ఇంతకూ పెద్ద బలీయమైన నేతగా పేరు లేని రోశయ్య కాంగ్రెస్‌ అగ్రనాయకులు ఆనుమతి ఆమోదం లేకుండా స్వంతంగా ఏమీ చేయగలిగింది వుండదు.డిసెంబరు 9 రాత్రి వెలువడిన ప్రకటన గురించి తనకేమీ తెలియదని రోశయ్య అప్పట్లో ప్రకటించారు. అయితే చలో అసెంబ్లీ వల్ల పరిస్థితి అదుపు తప్పిపోయే ప్రమాదమేమీ లేదని,(అలా అయితే రాజీనామా చేస్తాననీ) శాసనసభలో విభజన తీర్మానం పెట్టి నెగ్గించలేనని తాను చెప్పి వచ్చినట్టు ఆయన ఇప్పుడు వెల్లడించారు. ఈ విషయంలో చాలా పరిణామాలే జరిగాయి. ఇప్పటికీ కేంద్రం ఏమీ నిర్ణయం ప్రకటించకుండా చెలగాటమాడుతున్నది. అన్నా హజారే,జగన్‌ కేసుల దర్యాప్తు, సోనియా అనారోగ్యం, కాంగ్రెస్‌-తెలుగు దేశం దోబూచులు వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ప్రస్తుతానికి తీవ్ర రూపం తీసుకోనప్పటికీ నివురు గప్పిన నిప్పులానే వున్నది. ఇందుకు ప్రథమ ప్రధాన కారణం కేంద్రమే తప్ప రోశయ్య కాజాలరు. ఆయన కూడా కొన్ని విన్యాసాలు చేసి వుండొచ్చు గాని కేంద్రానికి అడ్డుపడే శక్తి అవకాశం రెండూ లేవు. రోశయ్యపై ధ్వజమెత్తే కెకె,జీవన్‌రెడ్డి వంటి వారికి అధిష్టానం ముందు ఆయన ఎంత పరిమితుడో తెలియని వారు కాదు. అయినా కావాలని అవకాశం ఉపయోగించుకుని కొద్ది రోజులు వివాదం నడిపించడానికే ఈ చర్చ ఉపయోగపడుతుంది.విభజన సమస్య వీధుల్లో తేలదన్న మాట మౌలికంగా నిజం. వీధుల్లో వీరంగాలు తొక్కుతూ(అది కూడారెండు చోట్ల రెండు విధాలుగా) పార్టీల ప్రయోజనాలు కాపాడుకునే నాయకులు రాజకీయంగా నికరంగా ముందుకు వచ్చే వరకూ ఇది తేలదు. ఈ మాట కటువుగా ధ్వనిచంఇనా నిజమని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఆ మాటలు ఉపసంహరించుకున్నట్టు చెబుతున్నారు గనక అసలే వదిలేయొచ్చు. నిజంగా రోశయ్య అధిష్టానం అభీష్టానికి ఆదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించి వుంటే ఇప్పుడు ఆయనను తమిళనాడు గవర్నర్‌ పదవి వచ్చి వరించేది కాదు. రాజ్యాంగ బద్దమైన పదవి గనక రాజకీయాలు మాట్లాడేది లేదంటున్న రోశయ్యకు అభినందనలు చెప్పొచు.అయితే మాటకారిగా పేరు గాంచిన ఆయన మౌన యోగం పాటించడం కష్టమేనేమో!

No comments:

Post a Comment