Pages

Friday, March 30, 2012

తెలంగాణాపై కొత్త ప్రహసనం




తెలంగాణా సమస్యపై కాంగ్రెస్‌ తెలుగు దేశం పార్టీలు ఏక కాలంలో కొత్త ప్రహసనం ప్రారంభించాయి.ఏదో చర్చలు జరుగుతున్నట్టు చర్యలు తీసుకోనున్నట్టు విన్యాసాలు చేస్తున్నాయి. టీ కాంగ్రెస్‌ ఎ ంపిలు అటు, టిటిడిపి ఫోరం నాయకులు ఇటు తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారు.అయితే వాస్తవం ఏమంటే వీరంతా చెప్పే దాంట్లో కొత్త దనమేమీ లేదు. వుండే అవకాశమూ లేదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయొచ్చునా అని గులాం నబీ ఆజాద్‌ అడిగితే ససేమిరా వీల్లేదని తాము చెప్పడం గొప్ప విశేషమైనట్టు కాంగ్రెస్‌ ఎంపిలు చెబుతుంటే త్వరలో తేల్చాల్సిన అవసరముందని ఆజాద్‌ అంటున్నారు. మరి నిన్ననే చిదంబరం చేసిన ప్రకటన వీరికి తెలియదా? ఇదంతా దాన్ని మాఫీ చేసే ఎత్తుగడ మాత్రమే కాదా? ఇక కాంగ్రెస్‌ ఏదో చేయబోతుందన్న సెగ తగిలిన తెలుగు దేశం నేతలు తాము కూడా మళ్లీ కసరత్తు ప్రారంభించినట్టు హడావుడి చేస్తున్నారు. తెలంగాణా ప్రాంతంలో ఉప ఎన్నికల సమయంలో గాక ఇతర చోట్ల ఎన్నికలకు ముందు మౌలిక విధానాన్ని మార్చుకోవడం జరగదని స్పష్టంగా చెప్పొచ్చు. అది నష్టమని కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు దేశం నేత ఒకరన్నారు. ఇదంతా ఆ పార్టీని ఆవరించిన అయోమయానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఒక వేళ కేంద్రానికి లేఖ రాసినా చంద్రబాబు ఎప్పుడూ చెప్పే రాజకీయ భాషణం సారాంశంగా వుంటుంది తప్ప నాటకీయంగా ప్రకటించేది శూన్యం. ఎందుకంటే కాంగ్రెస్‌ విధానం చెప్పకుండా తెలుగుదేశం చెప్పదు. ఈ రెండు పార్టీల తరపున రెండు ప్రాంతాలలో రెండు గొంతులు వినిపిస్తున్నంత కాలం ఏం చెప్పినా విలువా వుండదు.

No comments:

Post a Comment