Pages

Wednesday, July 25, 2012

కాంగ్రెస్‌ కమిటీ సిఫార్సుల ఫార్సు!


వరుస ఓటముల తర్వాత కాంగ్రెస్‌ కాయకల్ప చికిత్స కోసం సూచనలకై నియమించిన కమిటీ సిఫార్సులు(సున్నితంగా చెప్పాలంటే) అవాస్తవికతకు అద్దం పడుతున్నాయి.తమ ప్రభుత్వ లోపాలు, అవకతవకలు, అవినీతి ఆరోపణలు, కేంద్రం సృష్టించిన ఎడతెగని అనిశ్చితి ఇవన్నీ సమస్యలుగా వారికి కనిపించలేదు.ఫీజులు,విద్యుత్తు;ధరలు, రైతుల సమస్యలు, శాంతి భద్రతలు, జల యజ్ఞం జాప్యాలు వగైరాలన్ని ప్రధాన కారణాలుగా అగుపించలేదు.తమ పథకాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటున్నది గనక ఇందిరమ్మ పేరో మరొకటో తగిలించి మళ్లీ ఖాతాలో వేసుకోవాలన్న తాపత్రయమే నివేదికపై ఇచ్చిన వివరణలో కనిపించింది. అంతేగాని అశేష ప్రజల ఆగ్రహానికి అసంతృప్తికి ఆవేదనకు కారణమైన విధానాలను కాస్తయినా సవరించుకోవడానికి సిద్ధం కాలేదు. ఇంకా చెప్పాలంటే ఆత్మవిమర్శకు బదులు ఆత్మస్తుతికి ప్రచార సాధనాలు సమకూర్చుకోవడమే తారకమంత్రమని భావిస్తున్నారు. అందుకోసం పత్రిక పెట్టాలని ఛానెల్‌ ప్రారంభించాలని సిఫార్సు చేశారు.ఇప్పుడు కూడా ప్రభుత్వ ధనంతో ప్రత్యక్ష ప్రసారాలు బాగానే చేయించుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో పార్టీ వారిని వెంటనే నియమించేయాలని మరో సిఫార్సు. నిజంగానే చాలా కాలంగా కమిషన్లు, కమిటీలు, చాలా వరకు ఖాళీగా అఘోరిస్తుంటే అధికార పక్షీయుల బాధకు అంతు లేదు గనక ఈ సిఫార్సు వారికి బాగా నచ్చ వచ్చు. మొత్తంపైన పార్టీకి రాజకీయంగా లబ్ది ఎలా చేకూర్చావాలనే ఆలోచన తప్ప ప్రజల పరంగా ఆ నివేదికలో ఏమీ సిఫార్సులు చేసినట్టు మీడియాతో మాట్లాడిన ధర్మాన చెప్పింది లేదు. ప్రజాగ్రహాన్ని ప్రచారంతో చల్లార్చవచ్చని వారు అనుకుంటున్నారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.

1 comment:

  1. ప్రజలెవరు మహాప్రభో, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు కనిపించే వాళ్ళంతా ఓటర్లు మాత్రమే.

    ReplyDelete