Pages

Sunday, July 29, 2012

అన్నా హజారే వ్యవహారం


సామాజిక రంగంలో వ్యక్తుల ప్రాధాన్యతలు ప్రభావాలు వారి వైఖరిలోని వాస్తవికతను బట్టి మారుతుంటాయి. అన్నా హజారే వ్యవహారం అలాగే వుంది. కొద్ది మాసాల కిందట ఆయన చిత్తరువు దేశాన్ని వూపేసింది. ప్రతిచోటా అనేక మంది ఆయనను చూసి ఉత్తేజ పడ్డారు.ప్రభుత్వం కూడా అధికారికంగా ఆయనతో సంప్రదింపులు జరిపింది. తర్వాత..? ఆయన చుట్టూ వున్న బృందంలోనే తేడాలు వచ్చాయి. రామ్‌దేవ్‌తో ఆయన జట్టు కట్టడంలోనూ అనేక విభేదాలు కనిపించాయి. ఆయన అవినీతిపై పోరాటం చేస్తూనే కార్పొరేట్‌ శక్తుల గురించి ప్రస్తావించడం లేదని, మోడీ వంటి వ్యక్తిని ప్రశంసించడం బాగా లేదని వివిధ తరగతుల నుంచి వ్యాఖ్యలు వెలువడ్డాయి. కర్ణాటకలో ఇంత బాహాటంగా సాగుతున్న అవినీతి అంతర్గత కలహాలపై ఆయన బృందం నుంచి ఎలాటి స్పందన లేదు కాని ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆయనపై ఆభియోగాల దండకం చదివిన అన్నా వైఖరిని ఆయన సత్యాగ్రహ వేదికపైనే రామ్‌ దేవ్‌ విమర్శించారు. అవినీతిపై పోరాటం సందర్భంలో వ్యక్తిగత కేంద్రీకరణ తగదన్న భావం మన్మోహన్‌ సింగ్‌పై ఆరోపణల విషయంలో లోక్‌సత్తా నేత జయ ప్రకాశ్‌ వ్యాఖ్యల్లో వ్యక్తమవుతున్నది. మొత్తంపైన అన్నా బృందం గతంలో వలె ఏకోన్ముఖ మద్దతు పొందలేకపోతున్నదంటే వారి వైఖరిలో సమగ్రత వాస్తవికత లోపించడం ప్రచార దృష్టి పెరగడం కూడా కారణాలే. అందువల్లనే ఆయన శిబిరం దగ్గర జన సందోహం కూడా తగ్గింది. అది పెద్ద సమస్య కాదని ఆయన అన్నా దానికి కారణాలు కూడా చూడాల్సిన అవసరం వుండనే వుంటుంది. అవినీతిని మిగిలిన ఆర్థిక విధానాల నుంచి విడదీసి చూడటం, అందులోనూ పాక్షికంగా వ్యవహరించడం పరిష్కారం చూపించదు.ఎన్జీవోలు మాజీ అధికారులే అవినీతి ప్రక్షాళన చేసేస్తారన్న భావన కూడా సరైంది కాదు. విశాల జన రాశుల భాగస్వామ్యంతో విధానాల ప్రాతిపదికన పోరాడితేనే అవినీతికి కళ్లెం వేయడం సాధ్యపడుతుంది.

1 comment:

  1. అయ్యా,మన ఇంట్లోనే మనో చేసేపనులకు ఎప్పుడూ 100% సహకారం ఉండదు.అలాంటిది మనలాటి 100 కోట్ల పైబడిన బేవార్స్ గాళ్ళ కోసం ఒక ముదుసలి ఎలాగోలా తపిస్తుంటే మనమూ సహకరించాలి

    ReplyDelete