Pages

Saturday, September 22, 2012

ధర్మాన చర్చలేమిటి? మంత్రుల వొత్తిళ్లేమిటి?



నైతిక కారణాల వల్ల సిబిఐ ఛార్జిషీటు దాఖలైన వెనువెంటనే రాజీనామా చేశానన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారం ఇంకా కొనసాగుతున్నతీరు నిజంగా హాస్యాస్పదం. ఆయన వుండబోనని గట్టిగా అంటే ఎవరూ కొనసాగించలేరు. తను రాజీనామా చేయడం, అది ఆమోదించకపోవడం ఇదంతా ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం జరగాలని ఆయన భావించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఆయనపై ప్రత్యేక ఆసక్తి లేకున్నా అధిష్టానం అనుమతి లేనందున ఆమోదించకుండా అనిశ్చితంగా అట్టిపెట్టారు.అసలు రాష్ట్రమే అనిశ్చితంగా వున్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు కదా... అంతవరకూ బాగానే వుంది గాని ఇప్పుడు కోర్టు సమన్లు విచారణ మొదలవుతున్న తరుణంలోనైనా నిర్ణయం ప్రకటించకపోవడం ఆయన కలసి లేఖ సమర్పించడం దానిపై పరిశీలన ఇదంతా మరీ ప్రహసనంగా మారింది. మరో మంత్రి పార్థసారథి రాజీనామాకు తిరస్కరించితే తాను సిద్ధమైనట్టు ధర్మాన చెప్పుకోవచ్చు గాని నిజానికి రెండూ ఒక్కటే. పైగా నోటీసులు అందుకున్న మంత్రి వర్యులు వాటి లోతుపాతులు తేల్చేందుకు న్యాయ విచారణ ఉత్తర్వులివ్వాలని ముఖ్యమంత్రిపై వత్తిడి తెస్తున్నారన్న కథనాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే స్వయంగా న్యాయస్థానమే పిలిస్తే వెళ్లి న్యాయం కోరే బదులు మరో విచారణ తతంగం దేనికి? ఆఖరి క్షణం వరకూ అనివార్యంగా తొలగించబడే వరకూ పదవులలో కొనసాగడానికి తప్ప! కాగా వారి విషయంలో అధికారికంగా ఏమీ అనలేని ముఖ్యమంత్రి అసహాయత కూడా దాచేస్తే దాగనిదే.

No comments:

Post a Comment