Pages

Tuesday, September 25, 2012

కేంద్రం దాటవేత- పెరుగుతున్న ఉద్రిక్తత



మంగళవారం సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణా సమస్యను చర్చించలేదని అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది ప్రకటించారు. నిన్న మరో ప్రతినిధి మనీష్‌ తివారి కూడా ఈ సమస్య ఇప్పుడే తేలేది కాదని అన్నారు. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ వాయిలార్‌ రవిని కలుసుకున్న తర్వాత ఆయన కూడా అదే రీతిలో మాట్లాడారు. కనక కేంద్రం నుంచి ఏదో కీలకమైన ప్రకటన రాబోతున్నదనే అంచనాలు నిజం కాదని అర్థమవుతున్నది. ఈ సమయంలో 30 వ తేదీ మార్చ్‌పై ఉత్కంఠ పెరుగుతున్నది. వాయిదా వేయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిర్వాహకులైన జెఎసి నేతలు, చైర్మన్‌ కోదండరాం మరింత గట్టిగా దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుతంగా చేస్తామంటూనే అనేక అస్త్రాలున్నాయని ప్రకటిస్తున్నారు. ఏ పార్టీ అయినా తమ యాత్రకు మద్దతు తెలియజేయకపోతే వూరుకోబోమని హెచ్చరికలు చేస్తున్నారు. అయితే ఢిల్లీ దృశ్యం మాత్రం కోదండరాం మాటల తీవ్రతకు తగు రీతిలో కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రదర్శకులు పోలీసులలో ఎవరు పై చేయి సాధిస్తారేది ఎలా వున్నా పరిస్తితి మాత్రం అనవసరంగా ఉద్రిక్తమవుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాలు తెలిసిపోతున్నప్పుడు ప్రజలు ప్రాంతాల మధ్య వివాదం రగిలించే ప్రకటనలు బెదిరింపులకు పాల్పడే వారి పట్ల కోదండరాం కఠినంగా వుండాలని చెప్పాల్సి వుంటుంది. తను చెబుతున్న శాంతియుత వాగ్దానాలను వమ్ము చేసే వారి వారి పట్ల ఉపేక్ష వహించడం అలాటి వ్యాఖ్యలకు ఆస్కారమివ్వడం పొరబాటు సంకేతాలు పంపిస్తుంది. నా ఉద్ధేశంలో ఏ ప్రాంత ప్రజలూ అవాంఛనీయమైన ఉద్రిక్తత కోరుకోవడం లేదు. పైగా హైదరాబాదుకు చాలా సమస్యాత్మకమైన గణేష నిమజ్జనం సందర్భం గనక ఉభయ పక్షాలూ చాలా అప్రమత్తంగా బాధ్యతగా వుండక తప్పదు.

No comments:

Post a Comment