Pages

Thursday, September 27, 2012

దామోదర రాజ నరసింహావతారం!



ఇప్పటి వరకూ తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల ప్రతినిధులుగా కాంగ్రెస్‌ తరపున చాలా మంది మా ట్లాడుతూ వచ్చారు. జానారెడ్డి నివాసంలో సమావేశమైన మంత్రులు కూడా సానుకూలస్వరం వినిపించినా సాత్వికంగానే మాట్లాడారు.అయితే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ మాత్రం వాళ్లందరిని మించిన తీవ్ర భాషణం చేశారు. తెలంగాణా నేతలు 56 ఏళ్లలో ఎనిమిదేళ్లు మాత్రమే పాలించారన్న వాస్తవాన్ని చెబుతూ ఈ కారణం చేత అన్యాయం జరిగిందనుకోవడం సహజమేనని సమర్థించారు. అయితే ఇది కేవలం పదవుల పంపకంలో మల్లగుల్లాల ఫలితమే తప్ప ప్రజలకు సంబంధించింది కాదని చెప్పాలి. తెలంగాణాకే చెందిన పి.వి.నరసింహారావు రాయలసీమలోని నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించినా రెండు ప్రాంతాలకూ వొరిగిందేమిటి? ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎంపిగా వున్నా జరిగిందేమిటి? నిజానికి లెక్క వేస్తే రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులే అత్యధిక కాలం పాలించారు. అయినా ఇప్పటికీ ఆ ప్రాంతం వెనకబడే వుంది. కనక మారాల్సింది విధానాలే గాని విగ్రహాల మార్పుతో ఒరిగేది వుండదు.అయితే సమభావన రావాలన్నప్పుడు అన్ని కోణాలు కొలబద్దలూ కూడా పరిగణనలోకి తీసుకోవలసిందే. దామోదర రాజ నరసింహ కూడా భావి ముఖ్యమంత్రుల జాబితాలో వున్నారు గనక ఆయన మాటలలో చాలా అర్థాలు కనిపిస్తాయి. మిగిలిన వాటికన్నా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించడం ప్రాదాన్యత లేకుండా పోదు. ఏమైనా అందరూ కోరుతున్నట్టుగా తగు కట్టుదిట్టాలతో అనుమతినిచ్చి ప్రశాంతంగా మార్చ్‌ముగిసిపోవడంపై దృష్టి పెడితే మంచిది. లేకపోతే ఇది కూడా అసంతృప్తికి ఆజ్యం పోసి పరిస్తితి మరింత దిగజారడానికి కారణమవొచ్చు.

No comments:

Post a Comment