Pages

Wednesday, September 28, 2011

కొత్త జోస్యాలు- పాత భాష్యాలు



కెసిఆర్‌ ఈ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన అయిదారుగురు నాయకులలో ఒకరుగా గౌరవనీయులు. కొత్త రాష్ట్రమే సాధించి దాని వ్యవస్థాపకుడు కావాలని కోరుకునే వ్యక్తి.అయితే దురదృష్టవశాత్తూ ఆయన మాటలు చేతలు తరచూ వివాదాస్పదంగానూ నిరాధారంగానూ వుంటాయి. ఈ బ్టాగులో గత ఎంట్రీలలో చేసిన వ్యాఖ్యలు విశ్లేషణలు చదివిన వారికి ఈ సంగతి బాగా తెలుసు.తాజాగా ఇప్పుడాయన కేంద్రం రెండు మాసాలలో తెలంగాణా ఇచ్యేస్తుందని చెప్పడం ఆ కోవలో మరో ప్రహసనం. అంతటితో ఆగక కేంద్రం ఆలోచనలుగా తనకు తెలిసిన వాటిని ఆయన ఇంచుమించు ప్రతిపాదనల చర్చగా మొదలెట్టారు. కర్నూలు అనంతపురంలతో కూడిన తెలంగాణా, హైదరాబాదు ప్రతిపత్తి వంటివాటిని ఈ కోవలో వదిలారు. వీటిపై తెలంగాణా ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.తమాషా ఏమంటే గతంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల నిరాహారదీక్షా శిబిరం దగ్గర ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ఢిల్లీలో చర్చలు జరుపుతున్న వారికన్నా ముందే ఈ అంశాలు ఆయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్‌ వాదులు మాత్రం వీటిని ధృవపర్చిన దాఖలాలు లేవు. ఉద్యమాలను ఉత్సాహ పర్చడం కోసం కెసిఆర్‌ ఇలాటివి మాట్లాడుతుంటారని ఆయన సహచరులు చెప్పే వివరణ దీనికీ వర్తిస్తుందనుకోవాలి.కాకపోతే వూహాగానాలతో వుత్తుత్తి కథనాలతో ఉత్సాహపర్చినా అది నిలబడుతుందా? తర్వాత కలిగే నిరుత్సాహం మరింత తీవ్రంగా వుండదా? ఈ అంశాలను ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ క్రమంలో విశ్వసనీయత దెబ్బతినడమూ కద్దు.ఇంతా చేసి భౌగోళికంగానూ చారిత్రికంగానూ రెండు రాయలసీమ జిల్లాలను తెచ్చికలపడం కుదిరేది కాదు. అలాటి ప్రతిపాదన తీవ్రంగా వచ్చే అవకాశమూ లేదు. కనక ఇది కెసిఆర్‌ మాటల పొదిలోంచి వదిలిన మరో అస్త్రంగానే భావించాలి. ఈ మాటలకు ముందు ఆయన మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో మాట్టాడ్డం వల్ల ఇవి ఆయన భావాలకు దగ్గరగా వున్నాయని కూడా చెప్పొచ్చు.

No comments:

Post a Comment