Pages

Saturday, September 15, 2012

నిరతి మజ్జనం..నిమజ్జనం!


వినాయక చవితి పండగ అనగానే విగ్రహాల తయారీపై చర్చ మొదలవుతుంది. మట్టి వినాయకుల గురించి ఎంత చెప్పినా పర్యావరణ హానికర కాలుష్యాలతో భారీ విగ్రహాలను సిద్ధం చేయడం జరుగుతూనే వుంది. సైన్సు, పర్వావరణం వంటి వాటిని పక్కన పెట్టి పురాణాల ప్రకారం చూసినా నిమజ్జనం అంటే బాగా కలిపేయడం. మజ్జిగ అన్న మాట అ విధంగా వచ్చిందే. నిరతి మజ్జనం నిమజ్జనం అంటే బాగా కలిపేయడం. మట్టితో చేసిన విగ్రహాన్ని మట్టితోనే కలిపెయ్యడం ఇందులో పరమార్థం.కాని విగ్రహాలను చేసిందీ మట్టితో కాదు, అవి కలిసేదీ నీటిలో కరిగేదీ లేదు. పెద్ద పెద్ద క్రేన్లతో వాటిని లాంఛనంగా నీళ్లలో దింపడం, కాస్సేపట్లో ఒడ్డుకు చేరడం జరుగుతుంది. ఆ విగ్రహాల్లో వాడిన ఇనుప చువ్వలను తీసుకునిపోవడానికి వీధి పిల్లలు అప్పటికే సిద్దంగా వుంటారు. మురికి మయంగా వున్న హుస్సేన్‌ సాగర్‌లో విగ్రహాలను వేయడమే ఒక విడ్డూరమైతే నిమజ్జనం కాకున్నా అక్కడే కలపాలని పట్టుపట్టడంలో ఏ విధమైన విశ్వాసాలు లేవు. నగర రాజకీయాలపై ప్రాబల్యం కోసం పాకులాట మాత్రమే వుంది. పురాణాలన్నిటిలోనూ చెరువులు బావులు తవ్వించడమే పుణ్య కార్యమని చెబుతున్నాయి తప్ప విష పూరితం చేయమని చెప్పవు. సప్త సంతానాలనే వాటిలో జలాశయాలను భాగంగా చెబుతాయి.మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు గాని , భగవద్గీతలో కృష్ణుడు గాని ఈ విషయమే చెప్పారు.వట పత్ర శాయి అని విష్ణు వును తాటాకుపై పడుకున్నట్టు చూపించడంలోనూ మూషికాన్ని వినాయక వాహనంగా చేయడంలోనూ ప్రకృతి ముద్ర ప్రస్పుటంగా వుంది. పర్వత రాజ పుత్రి పార్వతి అనడంలోనూ ప్రకృతి భావన వుంది. ఇన్ని విధాల ప్రకృతితో ముడిపడినవినాయక విగ్రహాలను ప్రకృతి సూత్రాలకు హాని కలిగించే విధంగా కాలుష్య భరితం చేయడం ఎక్కడి ధర్మంఅంటే సమాధానం వుండదు.
ఇంత పెద్ద విగ్రహాలను తయారు చేయడమే పురాణ దర్మం కాదు. ముందే చెప్పినట్టు ఒక సామాజిక నేపథ్యంలో మూల విరాట్టు ప్రతినిధులుగా వుత్సవ విగ్రహాలు తయారైనాయి.జనం మధ్యకు వచ్చే విగ్రహాలు చిన్నవిగా కదిలించడానికి వీలుగా వుండాలి. మరీ పెద్దవైతే ప్రజా భద్రతకు ప్రమాదం గనకే పల్లకీలోనో పారువేటలోనో వూరేగించేందుకు వీలైన పరిణామంలోనే చేస్తారు. అసలు ఉత్సవ విగ్రహాలుఎంత వుండాలో
కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. దేశంలో శ్రావణ బెళగొల వంటి జైన దిగంబరుల విగ్రహాలు వుండేమాట నిజమే గాని అవి కదిలేవి కావు. హుస్సేన్‌ సాగర్‌ మధ్యలో బుద్ధ విగ్రహం ఎంత పెద్దదైనా సమస్య ఏముంది? కాని గణేశ విగ్రహాలకు వచ్చే సరికి కావాలనే వాటిని పెద్దవీ చేసి లేనిపోని సమస్యలకు కారణమవుతున్నారు. వినాయక విగ్రహాల రూపకల్పనలోనూ ఈ విపరీతమే మనకు కనిపిస్తుంది. సినిమా :హీరోల తరహాలోనూ క్రికెట్‌ కప్పులు రూపంలోనే వాటిని చేస్తుంటారు. రకకరాల వేషాలు వేయిస్తుంటారు. అపరిచితుడు చిత్రం వచ్చినపుడు అలాగే జులపాలతో చేశారు. ఇదంతా ఏ శాస్త్రాల ప్రకారం జరుగుతుందో చెప్పరు.అలాగే విద్యుచ్చక్తి సాయంతో చేయినో తొండాన్నో కదిలించేలా కూడా ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని సరదాగా వున్నంత వరకూ పర్వాలేదు గాని ఎబ్బెట్టుగానూ ఇబ్బందిగానూ వుంటే ఎలా?

భైరతాబాదు నుంచి గాజువాక వరకూ

రికార్డుల జ్వరం వినాయకుడికి కూడా తాకడంతో ఎంత పెద్దగా చేయాలనేదానిపై పోటీ పెరిగింది. రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయానికి వెనకనే ఖైరతాబాదు వినాయకుడు అలా అలా పెరిగి పెరిగి ఇప్పుడు అరవై అడుగుల వరకూ చేరాడు.\. ఈ విగ్రహం చేతిలోపట్టుకునే లడ్డూ తాపేశ్వరం నుంచి \ తయారై వస్తుండట! ఖైరతాబాద్‌ రికార్డును బద్దలు కొడుతూ ఇప్పుడు విశాఖ గాజువాక వినాయకుడు వంద అడుగుల ఎత్తున తయారవుతున్నాడు.దాని చేతిలో లడ్డు కూడా తాపేశ్వరం తయారీనే. వీటని నిర్మించడం, అమర్చడం, తరలించడం ఎంత వ్యయప్రయాసలతో కూడిందో వూహించుకోవచ్చు.
\రు.
పర్యావరణ గణేశులు
ఇలాటి వాతావరణంలో పర్యావరణ పరిరక్షణ దృష్టితో ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రచారం చేస్తున్న సంస్తలున్నాయి. బంకమట్టి వినాయకులను చేసేందుకు శిక్షణ సరఫరా కూడా ఇస్తున్నారు.ఆ మట్టి కూడా అందజేస్తారు. ఈ విగ్రహాలు అయిదు రూపాయలకే వస్తాయి.  స్కూలు పిల్లలు అనేక స్వచ్చంద సంస్థలు కూడా విగ్రహాల తయారీలో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ హస్త కళల సంస్థ లేపాక్షిలోనూ ఈ విగ్రహాలు లభిస్తాయి. నిమజ్జనం కూడా అన్ని ఒకేసారి హుస్సేన్‌ సాగర్‌కు తీసుకుపోయే బదులు నగరంలో వివిధ చోట్ల వున్న చెరువులను కాల్వలను ఉపయోగించుకోవడం మంచిది. ఆ విధంగానే ఐడిఎల్‌ చెరువు దుర్గం చెరువు, హిమయత్‌ సాగర్‌ వంటి చోట్ల క్రేన్లు ఏర్పాటు చేస్తారు. విశాఖలో సముద్రం, చాలా పట్టణాల్లో నదులు వున్నాయి గనక అక్కడా నిమజ్జనం చేయొచ్చు. ఏమైనా వినాయక చవితిని తమ ప్రచారానికి ప్రాబల్యానికి పావుగా ఉపయోగించుకుేనేవారి పట్ల అప్రమత్తంగా వుండాల్సిందే. ఏ మత వేడుకలైనా శాంతి సామరస్యాలు పెంచాలి గాని ఉద్రిక్తతకు కాలుష్యానికి దారీ తీయకూడదు. విఘ్నాలను తొలిగిస్తాడని చెప్పే వినాయకుడి విగ్రహాలనే విఘ్నాలుగా మార్చకూడదు

1 comment: