Pages

Tuesday, September 13, 2011

నవరసాల బాటసారి

కాస్త వంగి నడవడం..

లత, రాధా అని ప్రేమగా పిలిచినా 
అమ్మా అని బరువుగా పిలిచినా 
ఆ కాస్తలోనే విరుపూ మాటలోనూ మనిషిలోనూ
శాలువా కప్పుకుని బరువుగా నడవడం
వేలు పైకి లేపి మాట్లాడ్డం
అర్థవంతమైన ఆక్షేపణీయమైన రీతిలో బిగ్గరగా నవ్వడం
ఆడవాళ్లకన్నా నాజూగ్గా కనిపించాలని ప్రయత్నించడం
కళ్లు పైకి కిందికీ తిప్పుతూ ఎదుటి వాళ్లను శల్య పరీక్ష చేయడం
తెలుగు వారికి చిరపరిచితమైన ఈ లక్షణాలన్ని ఎవరివో మళ్లీ చెప్పాలా?
అక్కినేని నాగేశ్వరరావుకు పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించడం తెలుగు వాళ్లు ఎవరికీ పెద్ద వార్తగా కనిపించదు. ఎందుకంటే ఆయన కొన్ని తరాలను అలరించిన ప్రజా హృదయ విజేత. తొమ్మిది పదులు చేరువవుతున్నా ఇప్పటికీ దసరా బుల్లోడుగానే జనానికి గుర్తుండి పోయారు. సాత్వికాభినయానికి సంస్కారవంతమైన పాత్రలకు నాగరిక ప్రవర్తనకు నమూనాగా నిలిచి పోయారు. అక్కినేని నాగేశ్వరరావు అనగానే భగ్న ప్రేమల దేవదాసులూ త్యాగరాజులూ ఠక్కున మదిలో మెదులుతారు గాని నిజానికి సీతారామ జననం నుంచి సీతారామయ్య గారి మనవరాలు వరకూ ఆయన పాత్రల్లో వైవిధ్యం అపారం. ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకు
ప్రాణ ప్రతిష్ట చేయడమే పరమావధి అనుకున్న ప్రామాణిక నటుడు. ప్రయోగాలకు వెనుదీయని ప్రయోక్త. అభిరుచికి పట్టం గట్టిన నిర్మాత అక్కినేని.

అక్కినేని నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన వివరాలు ఆయన స్వయంగానే చెబుతుంటారు. తరచూ ప్రస్తావించేది సినిమా నటులకు గౌరవం లేని కాలంలో తను రంగ ప్రవేశం చేశానని. తనకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారేమోనని అమ్మ భయపడ్డారని. వాస్తవానికి భారతీయ సంప్రదాయ చింతనలో నటులు కళాకారులు పంక్తి బాహ్యులు. పశ్చిమదేశాలలో ప్లేటో కూడా తన ఆదర్శరాజ్యంలో కవులు కళాకారులను బహిష్కరించాలన్నాడు. ఇలాటి నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు వంటి వారు కథానాయకులకు గౌరవ ప్రదమైన స్థానం తీసుకురావడానికి కారణభూతులైనారు. ఈ ఇద్దరిలోనూ అసలు వయసులో చిన్న సినిమా వయస్సులో పెద్ద అక్కినేని.

అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబరు 20న కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవాపురంలో వెంకటరత్నం పున్నమ్మలకు పుట్టిన తొమ్మిదో బిడ్డ. ఆఖరున ఆడపిల్ల పుట్టాలని ఆశపడిన ఆ తల్తి మగపిల్లాడు పుట్టినా నిరాశ పడకుండా అతనికే జడ వేసి పూలు పెట్టి మురిసిపోయింది. ఉత్తరోత్తరా ఈ బుడతడు మహిళా ప్రేక్షకుల అభిమాన కథానాయకుడవుతాడని ఆమె ఊహించి వుండరు. ఆడపిల్లగా అదరగొడుతున్న ఈ అబ్బాయిని చూసి తొమ్మిదో తరగతిలో హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేయించారు. అందాల రాణి అనిపించుకున్నాడు. అదే ఫక్కీలో విప్రనారాయణలో దేవదేవి, సారంగధరలో చిత్రాంగి వగైరా నాయికల వేషాలు కట్టి మెప్పించాడు. విప్రనారాయణలో దేవ దేవి పాత్ర చూసిన ప్రజాకళాకారుడు కోడూరు అచ్చయ్య, నాటక నిర్వాహకులు దుక్కిపాటి మధుసూదనరావు తమ ఆశాజ్యోతి నాటకంలో కథానాయికగా ఎన్నుకున్నారు. తర్వాతి కాలంలో దుక్కిపాటి ఆయన జీవితానికి మార్గదర్శకుడైనాడు.
బాలనటుడుగా ధర్మపత్ని(1941) ఆయన తొలి చిత్రం. అంటే ఖచ్చితంగా డెబ్బయి ఏళ్లకిందట తెరపై కాలూనారన్నమాట. ఆ చిత్రం తర్వాత ఒకటి రెండు అవకాశాలు దగ్గరకొచ్చి ఊరించి జారిపోయాయి. నలభైలలో రెండవ ప్రపంచ యుద్ధం భయ వాతావరణాన్ని సృష్టించింది. సినిమా జనం మద్రాసు నగరాన్ని వదిలివెళ్లి పోయారు. ఆ బెడద సర్దుకున్నాక అలాటి సమయంలోనే నెల్లూరీయుడైన ఘంటసాల బలరామయ్య తన ప్రతిభా సంస్థ పతాకంపై వరుసగా చిత్ర నిర్మాణం కొనసాగిస్తూ 1944లో సీతారామ జననం ద్వారా అక్కినేని నాగేశ్వరరావును కథానాయకుడిగా పరిచయం చేశారు. తెలుగు చిత్రాల మూల విరాట్టులో ఒకరైన గూడవల్లి రామబ్రహ్మం మొదట అనుకున్న రైతుబిడ్డలో వేషం ఇవ్వలేకపోయినా మయాలోకంలో హీరోగా తీసుకున్నారు. ఈ రెండు శతదినోత్సవాల తర్వాత రామబ్రహ్మం పల్నాటి యుద్దంలో బాలచంద్రుని పాత్ర కూడా పేరు తెచ్చింది. మొదట హీరోను చేసిన బలరామయ్యనే ముగ్గురు మరాఠీలు( 1946), బాలరాజు(1948) చిత్రాలతో ఆయనను తారాపథంలోకి తీసుకెళ్లారు. ఇందులో బాలరాజు రికార్డు కలెక్షన్లతో అక్కినేనిని సూపర్‌ హీరోను చేసింది. 26 కేంద్రాల్లో రజతోత్సవం, 13 చోట్ల 200 ద్విశత దినోత్సవం, 69 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకొన్నది. ఇప్పటి వరకూ ఇది తిరుగులేని రికార్డు. ఈ అఖండ విజయంతో అక్కినేని వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే కలగలేదు! ఆడపాత్రలు వేస్తూ బాలరాజుగా మారిన అక్కినేని తన గొంతు స్త్రీ కంఠానికి దగ్గరగా వుందని గుర్తించారు. ఖర్జ్‌ అనే పద్దతిలో చల్లటి కుండను కావలించుకుని గాత్ర సాధన చేసేవారట. ఆ విధంగానే చిత్రంలో రావా చెలియా కనరావా పాట పాడటం రికార్డింగు చేయడం జరిగిపోయాయి. అయితే తర్వాత ఆయనే బలరామయ్యకు చెప్పి అప్పుడప్పుడే నేపథ్యగీతాలు పాడుతున్న తన నేస్తం ఘంటసాల వెంకటేశ్వరరావుతో పాడింప చేశారు. అంతకు ముందు అవకాశాల కోసం అన్వేషిస్తూ అవస్తలు పంచుకునేవారు.

భగ్న ప్రేమికుడైన బాలరాజు...
బాలరాజుగా కనకవర్షం కురిపించిన అక్కినేని ఆ మరుసటి ఏడాది భగ్న ప్రేమికుడైన మజ్నూగా మరో విభిన్న పాత్రకు ప్రాణం పోశారు. భానుమతి రామకృష్ణ దంపతులు భరణీ పతాకంతో తీస్తున్న లైలామజ్ను(1949) చిత్రంలో ఆమె సరసన ఆయనను ఎంపిక చేయడం ఎవరూ హర్షించలేదు గాని జనం బాగా ఆదరించారు. ఈ లోగా ఎన్టీఆర్‌ కూడా మనదేశం(1947) చిత్రంతో ఎల్వీప్రసాద్‌ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఎల్వీ ప్రసాద్‌ ఈ ఇద్దరి కాంబినేషన్‌తో సంసారం(1950) తీసి విజయఢంకా మోగించారు. ఈ చిత్రంలో నాయక పాత్ర అక్కినేనిదే. ఎన్టీఆర్‌ది తప్పుచేసి పశ్చాత్తాపపడే పాత్ర.. సావిత్రి ఈ చిత్రంలో చెలికత్తె పాత్రకే పరిమితమైనా రంగ ప్రవేశం చేసింది. తెలుగులో సాంఘిక చిత్రాలకు సంసారం మొదటి సంకేతమైతే అక్కినేని ఆ మార్గంలో నిలదొక్కుకోవడానికి మొదటి అడుగు. అప్పటి వరకూ ఆయన జానపదాల్లోనే ఎక్కువగా కనిపించాడు. ఉత్తరోత్తరా ఎన్టీఆర్‌ జానపద పౌరాణికాలకు పేరు తెచ్చుకున్నారు. 1949, 50లలో అక్కినేని మరో అరడజను చిత్రాల వరకూ నటించారు. 1951లోనే అక్కినేని నిర్మాతగా ఆదినారాయణరావు అంజలీదేవీ దంపతులతో కలసి మాయలమారి చిత్రం తీశారు. వారే తీసిన పరదేశిలోనూ బరువైన పాత్ర వేశారు.
తర్వాత కొన్ని మజిలీలు వదిలేస్తే 1953 ముఖ్యమైన మలుపు. డిఎల్‌ నారాయణ వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తీసిన దేవదాసు అక్కినేనికి నటుడుగా పునర్జన్మను ప్రసాదించింది. అంతకు ముందు అన్నిభాషల్లోనూ అనేకసార్లు విఫలమైన ఆ కథను భాగస్వాములందరూ వదిలేసినా డిఎల్‌ ఎంతో సాహసంతో తీశారు. నాయికగా వుండాల్సిన జానకి తప్పుకుంటే సావిత్రితో పార్వతి వేషం కట్టించి మహత్తర విజయం సాధించారు. తెలుగు సినిమా ట్రేడ్‌ మార్కులలో అక్కినేనికి దేవదాసు పాత్రలు, నందమూరికి దేవుడి పాత్రలు అలా అమరిపోయాయి. చెప్పాలంటే ఆయన పౌరాణిక కృష్ణుడైతే ఈయన సాంఘిక కృష్ణుడు.

పౌరాణిక, చారిత్రికాల్లో కూడా.
అక్కినేని సాంఘిక చారిత్రిక జానపద పౌరాణిక చిత్రాల్లో వైవిధ్య భరితమైన పాత్రలలో మెప్పించారు. జానపదాలలో మొదటిదైన బాలరాజు తర్వాత మాయలమారి, ముగ్గురు మరాఠీలు, సువర్ణ సుందరి చెప్పుకోదగినవి.

చారిత్రిక చిత్రాలు లేదా పురాణ కథా సంబంధమైన చిత్రాలలో కూడా ఆయన సాధించిన విజయాలు విలక్షణమైనవి. మహాకవి కాళిదాసు, అమరశిల్పి జక్కన, మహాకవి క్షేత్రయ్య, భక్త జయదేవ, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాలతో ఆయన ఆ నాటి కవులూ కళా స్రష్టలను కళ్లముందు ప్రత్యక్షం చేశారు.  పౌరాణికాలకు సంబంధించి ఎన్టీఆర్‌తో పాటు భూకైలాస్‌లో నారదుడుగా, మాయాబజార్‌లో అభిమన్యుడుగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడుగా పాత్రలకు జీవం పోశారు. ఇక భక్త తుకారాం, విప్రనారాయణ, చక్రధారి వంటి చిత్రాలలో సాత్వికాభినయంతో జనాదరణ పొందారు.

రొమాంటిక్‌, ట్రాజెడీ కింగ్‌....
ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా ఆయన సాంఘిక చిత్రాలే ఆయనను చిరస్మరణీయుణ్ని చేశాయి. సంస్కారవంతమైన విద్యాధికుల పాత్రలు, భావుకత గల కళా సాహిత్యకారుల పాత్రలు, కుటుంబ సంబంధాలను హృద్యంగా ఆవిష్కరించే పాత్రలు, మంచి స్నేహితుడి పాత్రలు త్యాగాలూ వియోగాలు మేళవించిన పాత్రలు, రసికత నిండిన పాత్రలు, ఆకతాయి అల్లరి పాత్రలు, విషాద గంభీర పాత్రలు రకరకాల రూపాలలో ఆయన విజయాలు సాధించడమే గాక నిర్మాతలకు లాభాలు కూడా పండించారు. మొత్తంపైన అక్కినేని చిత్రాల విజయాల శాతం ఎక్కువగా వుంటుందని పరిశ్రమ భావన.
. మెతకదనం మూర్తీభవించిన అంతర్వర్తనుడుగా బాటసారి పాత్ర తనకెంతో ఇష్టమైనదని ఆయన తరచూ చెబుతుంటారు. అర్ధాంగిలో మానసిక పరణితి లేని దశ నుంచి భార్య సహాయంతో నిలదొక్కుకోవడం, పునర్జన్మలో మతి కోల్పోయిన కవి, పూజాఫలంలో తెలియని తనం వల్ల అపార్తానికి గురై ఆపైన ఆశాభంగంలో కూరుకుపోయిన సంగీతకారుడు, ప్రేమ నగర్‌లో పసితనపు గాయాల వల్ల తాగుబోతుగా మారిన జమీందారీ వారసుడు, రాజా రమేష్‌లో విష ప్రయోగం వల్ల ఘర్షణకు గురైన జమీందారు ఇలా మనో వేదనను ప్రతిబింబించే పాత్రలెన్నో ఆయన పండించారు.
. మంచి మనసులు, వెలుగు నీడలు, డాక్టర్‌ చక్రవర్తి, మురళీకృష్ణ, మనుషులు మమతలు, మంచి కుటుంబం వంటివి ప్రేమ త్యాగం ఇతివృత్తంతో వచ్చినవి.
మాంగల్యబలం, ఇలవేల్పు, అర్థాంగి, భార్యాభర్తలు, పెళ్లినాటి ప్రమాణాలు, బతుకు తెరువు, భార్యాబిడ్డలు, ఆలుమగలు, అండమాన్‌ అమ్మాయి, మేఘ సందేశం, మనసు మాంగల్యం వంటి చిత్రాలు దాంపత్య బంధాలపై తీసినవి.
.దొంగరాముడు, దొంగల్లో దొర, భలే రాముడు, అదృష్టవంతులు, బందిపోటు దొంగలు, జమీందారు, బుద్ధి మంతుడు, విచిత్ర బంధం, రావణుడే రాముడైతే, రాముడు కాదు కృష్ణుడు వగైరాలు పరివర్తన చెందిన నాయకుని పాత్రలు.
.శ్రీమంతుడు, రంగేళీ రాజా, రాజా రమేష్‌, ప్రేమ నగర్‌ వంటివి ఉదాత్తంగా మారిన విలాసపురుషుల కథలు.
.రోజులు మారాయి, నమ్మిన బంటు, రైతు కుటుంబం, దత్తపుత్రుడు, దసరా బుల్లోడు వంటివి పల్లెటూరి నేపథ్యం వుండేవి.
.ఇద్దరు మిత్రులు, మంచివాడు, పవిత్ర బంధం, గోవుల గోపన్న, సిపాయి చిన్నయ్య వంటివి ద్విపాత్రాభినయ చిత్రాలు.
.మూగమనసులు దానికదే ఒక విలక్షణ చిత్రం. పూర్వజన్మ వృత్తాంతం ఒక్కటి పక్కన పెడితే గోదావరి అందాల మధ్య అమ్మాయి గారి కోసం పరుగులు దీసే పడవవాడు గోపిగా అక్కినేని నటన మరపురానిది. ఆయన సావిత్రి కలసి ఆ చిత్రాన్ని కళాజగతిలో శాశ్వతం చేశారు.

ఎన్నెన్నో విశేషాలు..
.అక్కినేని జగపతి, పిఎపి, స్వంత సంస్థ అన్నపూర్ణ వంటి వాటిలోనూ, కొంత వరకూ సురేష్‌ పిక్చర్స్‌లోనూ ఎన్నో మంచి చిత్రాలలో నటించి తనకంటూ ఒక బాణీని సృష్టించుకున్నారు. అదృష్టవంతులుతో మొదలుపెట్టి దసరా బుల్లోడుతో స్టెప్స్‌కు ప్రాచుర్యం కలిగించారు. శాంతకుమారి నుంచి శ్రీదేవి వరకూ ఎన్నో తరాల నాయికల పక్కన నటించి మెప్పించారు. ఆయన 80మంది నాయికలతో నటించినట్టు లెక్క. దర్శకులలోనూ ఆదుర్తి, వి.మధుసూదనరావు, ప్రత్యగాత్మ వంటి వారితో వరుసగా మంచి చిత్రాలు అందిస్తూ వచ్చారు.

. తొలి దశలో దేవదాసుతో అక్కినేని సినీ జీవితం శిఖరాగ్రాన్ని అందుకుంటే మలి దశలో ప్రేమాభిషేకంతో వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించి ఆయనను ప్రేమమూర్తిగా గుర్తిండిపోయేలా చేసింది.

.అక్కినేని వయసు మళ్లిన తర్వాత కూడా నటుడుగా విశ్రాంతి తీసుకోలేదు. బహుదూరపు బాటసారి, సూత్రధారులు, ప్రాణదాత, కాలేజీ బుల్లోడు, పండుగ, రావుగారిల్లు వంటి చిత్రాలతో తన ముద్ర కొనసాగించారు. ఈ దశలో ఆయన వేసిన పాత్రల్లో మరో మైలు రాయి సీతారామయ్య గారి మనవరాలు.

.నటుడుగానే ఆగిపోకుండా దుక్కిపాటి మధుసూదనరావుతో కలసి భార్య పేరిట అన్నపూర్ణా ఫిలింస్‌ స్థాపించి దొంగరాముడుతో మొదలెట్టి వరుసగా అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. సామాజిక చైతన్యం ధ్యేయంగా ఆదుర్తితో చక్రవర్తి చిత్ర పతాకంపై ఆయన తీసిన సుడిగుండాలు, మరో ప్రపంచం చిత్రాలు అరవైల నాటి ప్రయోగాలు.
ఆయన చిత్రాల్లో సంగీతానికి ఎంత ప్రాధాన్యత వుంటుందంటే ఘంటసాల ఆత్రేయల మరణం తర్వాత తనలో ఒక భాగం పోయినట్టే ఆవేదన చెందారు. సావిత్రి, ఆదుర్తి లేకపోవడం కూడా శాశ్వతమైన లోటుగా చెబుతుంటారు. ఆత్రేయ మనసు పాటలకు అభినయించాలంటే అక్కినేనికే సాధ్యమనిపిస్తుంది. అలాగే ప్రౌఢ శృంగార విషాదాల అభినయంలో అక్కినేని సావిత్రి జంటకు సాటి లేదనిపిస్తుంది.

ఈ ట్రాజెడీ కింగ్‌ మిస్సమ్మలో చేసిన హాస్య విన్యాసాలు ఇప్పటికీ అలరిస్తుంటాయి. అలాగే చక్రపాణి, ప్రేమించి చూడు లాటి హాస్య చిత్రాల్లో కూడా.

క్రమ శిక్షణ, వ్యాపార దక్షత
అక్కినేని కళాకారుడే గాక వ్యాపార వేత్తగానూ దక్షత చూపించారు. మొదటి రోజుల్లోనే పరిశ్రమలు, వ్యాపారాలలో ప్రవేశించి స్థిరత్వం సంతరించుకోవలసిన అవసరాన్ని గుర్తించారు. ఇది తమకు ముందున్న చిత్తూరు నాగయ్య వంటి వారి జీవితాలను చూసి నేర్చుకున్న పాఠం అంటారు. తెలుగు చిత్రాల నిర్మాణం మద్రాసులో జరుగుతున్న రోజులలోనే ఆయన హైదరాబాదు తరలి వచ్చి ఇక్కడ నిర్మాణాన్ని ప్రోత్సహించారు. పిల్లల చదువుల కోసమే వచ్చానని చెప్పినా ఇతర పరమార్థాలు కూడా అందులో వున్నాయి. అభ్యుదయ భావాల నేపథ్యం వున్న దర్శక నిర్మాతలు ఆయనను కేంద్రంగా చేసుకుని కుటుంబ విలువలతో కూడిన చిత్రాలకు పెద్ద పీట వేసి నిర్మిస్తూ వచ్చారు. 1970లలో గుండెపోటు వచ్చినప్పటికీ ఆయన సరైన చికిత్సతో తట్టుకున్నారు. తర్వాతి కాలంలో అన్నపూర్ణ స్టూడియోను అపురూపంగా తీర్చి దిద్ది రాష్ట్రపతి ఫకృద్దీన్‌తో ప్రారంభింపచేశారు. సెక్రటరీ నిర్మాణంతో ఆ స్టూడియో మొదలైంది. అదే తర్వాత కాలంలో పరిశ్రమ తరలిరావడానికి మొదటి అంకం.

మూఢ నమ్మకాలకు మారుపేరైన చిత్ర పరిశ్రమలో అక్కినేని హేతుమానవతా వాదిగా కనిపిస్తుంటారు. దేవుడు వున్నాడో లేదో నాకు తెలియదు గాని అంటూ ఆయన ప్రసంగం ప్రారంభిస్తుంటారు.

అయిదో తరగతి చదవని అక్కినేని శ్రీలంకలో ఒక సమావేశంలో వచ్చీరాని ఆంగ్లం మాట్టాడబోయి భంగపడ్డాక విపరీతమైన వేదనకు గురై స్వయం కృషితో ఇంగ్లీషుపై పట్టుసాధించడం విశేషం. అలాగే వైద్యం అంతగా పెంపొందని ఆ రోజుల్లో మశూచికం సోకితే మచ్చలు రావడం నిర్మాతలకు నష్టదాయకమని నరక యాతన అనుభవించి మరీ వాటిని రాకుండా చేసుకున్న దృఢసంకల్పం ఆయనది. కళతో పాటు కవితాభిరుచిని కూడా నిలబెట్టుకుని కవితా సంకలనం వెలువరించిన కాళిదాసు.

అసంఖ్యాక గౌరవాలు
అక్కినేని కళాజీవితం యావత్తూ అసంఖ్యాకమైన పురస్కారాల మయం. అవార్డులు అందుకోవడంలో మీరు అతిధి కాదు, కస్టమర్‌ అయిపోతున్నారు అని కేంద్ర మంత్రి బ్రహ్మానందరెడ్డి అన్నారట. అర్దాంగి, తెనాలి రామకృష్ణ, తోడికోడళ్లు, పెళ్లినాటి ప్రమాణాలు, మాంగల్యబలం, జయభేరి, నమ్మినబంటు, మహాకవి కాళిదాసు, భార్యాభర్తలు, మూగమనసులు, అంతస్తులు, మనుషులు మమతలు, మేఘ సందేశం సూత్రధారులు చిత్రాలకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. 1964లో నంది అవార్డుల ప్రదానం ఆయన డాక్టర్‌ చక్రవర్తితోనే మొదలైంది. తర్వాత సీతారామయ్య గారి మనవరాలు, మేఘ సందేశం వరకూ ఆ పురస్కారాన్ని పదే పదే అందుకున్నారు. 1957లో నట సామ్రాట్‌ గా సన్మానం అందుకున్న తర్వాత 1968లో పద్మశ్రీ, 1977లో కళా ప్రపూర్ణ, 1988లో పద్మభూషణ్‌, 1990లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 1991లో దాదాసాహెబ్‌ ఫాల్కేతో అత్యున్నత పురస్కారం ఆయనకు లభించాయి. అయితే ఇవేవీ ఆయనకు కితాబులు కావు, ఎందుకంటే అక్కినేని జీవితం నటనకు నిర్వచనం. ప్రతిభకు నిదర్శనం. పట్టుదలకు పరిణతికి నిలువుటద్దం. అక్కినేని నాగేశ్వరరావు అందుకోని శిఖరాల్లేవు అని బాపు రమణలు కార్టూనీకరించారందుకే. ఆ మహానటుని ప్రస్థానంలో ఇవి కొండ గుర్తులు, అంతే. నిర్మాతగా వెంకట్‌, అగ్ర కథానాయకుడుగా నాగార్జునలే గాక మనవడు నాగ చైతన్య, మరో మనవడు సుమంత్‌ కూడా నట వారసులుగా వెలుగొందుతుంటే- తన నటనతో జీవితంతో ప్రేరణ పొందిన అసంఖ్యాక కళా కారులు అను నిత్యం జేజేలర్పిస్తుంటే నట సామ్రాట్‌ పరిపూర్ణ అవగాహనతో పరికిస్తుంటారు. పదిమందితో కలసి నడుస్తుంటారు. కడదాకా నటుడుగానే నిలవాలని చెబుతుంటారు. నందమూరి బాలకృష్ణతో బాపు రమణ తీస్తున్న శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా కనిపిస్తున్నారందుకే. ఆయన నిజంగా పద్మ విభూషణుడే.
...................
హలో బ్రదర్స్‌!!
తెలుగు వాళ్లకు సంబంధించినంత వరకూ ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌లు తెరకే పరిమితమైన నటులు కాదు. నిత్య జీవితంలో ఆలోచనల్లో భాగమై పోయిన మహా ప్రభావ శీలులు. వాళ్ల లాగా నడవడం, మాట్లాడ్డం మాత్రమే కాక ఆలోచించదం కూడా అలవడిందంటే చలన చిత్ర ప్రక్రియకున్న శక్తితో పాటు వారి ప్రతిభా విశేషాలు కూడా కారణం. ఈ ఇద్దరిలో ఎవరిని తలుచుకున్నా రెండవ వారు తప్పక మదిలో మెదులుతారు. అక్కినేని తల్లి గారు ఎన్టీఆర్‌ను పెద్దాడు అనేవారట. 1944లో అక్కినేని, 1947లో నందమూరి తెరంగ్రేట్రం చేసినా 1950లో సంసారంలో కలసి నటించడంతోనే వారి ప్రయాణాలు కలిసి పోయాయి. వేరే ఏ భాషలోని ఇద్దరు హీరోల కన్నా వీరే ఎక్కువ చిత్రాల్లో కలిసి నటించారట. తొలి దశలో వచ్చిన అలాటి చిత్రాలన్ని పెద్ద హిట్లే. గుండమ్మ కథ, మిస్సమ్మ, భూ కైలాస్‌, కృష్ణార్జున యుద్ధం, పల్లెటూరి పిల్ల, పరివర్తన, చరణ దాసి, తెనాలి రామకృష్ణ, భక్తరామదాసు ఒకో చిత్రానికి ఒక కథ. విగ్రహ ప్రధానమైన పాత్రలకు ఎన్టీఆర్‌ను మించిన వారు లేరని అక్కినేని ఎప్పుడూ అంటుంటారు. ఆయనతో కలసి అర్జునుడుగా నటించాక తన భార్యనే ఇక వద్దని చెప్పిందని కూడా ఒకసారి ప్రకటించారు. పురాణాలలో ఏ పాత్రనైనా ఎన్టీఆర్‌ రక్తి కట్టిస్తున్నప్పుడు తను వాటిని ధరించనవసరం లేదనిపించిందని కూడా అన్నారు. పైగా స్వతహాగా అందగాడైన ఎన్టీఆర్‌ ముందు నిలదొక్కుకోవడానికి తానెంతో పెనుగులాడవలసి వచ్చిందని ఆ పోటీ ఘర్షణ మరింత పదును తేలడానికి ఉపకరించాయని కూడా సూటిగా అంగీకరిస్తారు అక్కినేని. అయితే తను క్లాస్‌, ఆయన మాస్‌ అన్న భావన కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇద్దరి అభిమాన సంఘాల మధ్య స్పర్తలు సంఘర్షణలు ఒక దశలో పెద్ద బెడదగా మారితే వారే సర్దుబాటు చేశారు. మలి దశలో చాణక్య చంద్రగుప్తలో ఎన్టీఆర్‌ అక్కినేనిని తీసుకోవడమే గాక దర్శకత్వం చేశారు. అదే కోవలో రామకృష్ణులు, సత్యం శివం కూడా వచ్చాయి. అయితే ఇవి అంతకుముందు స్థాయిలో విజయం సాధించలేదు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ను ఢీకొనడం వల్ల ఒక దశ తర్వాత ఆయనకు పురస్కారాలు ఆగిపోయాయనే భావన బలంగా వుంది. ఎమ్జీఆర్‌కు భారత రత్న కూడా ఇచ్చిన కేంద్రం ఎన్టీఆర్‌ను పద్మశ్రీ దగ్గరే ఆపేసింది. అయితే ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం లభించి వుంటే అక్కినేని కూడా హర్షించేవారనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ పెట్టే ముందు ఆయన తనను కూడా ఆహ్వానించారని అయితే వెళ్లలేదని చెప్పే అక్కినేని, ఒక దశలో చంద్రబాబు నాయుడును బలపర్చారు. సంప్రదాయికంగా కాంగ్రెస్‌కు దగ్గరగా వున్నట్టు కనిపిస్తుంది. దానికి తగినట్టే ఇటీవలి కాలంలో నాగార్జున కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బలపర్చే ప్రకటనల్లో కనిపిస్తుంటారు. అయితే రాజకీయాలలో ప్రత్యక్ష ప్రవేశం చేయని అక్కినేని నట సామ్రాట్‌గానే ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు.

8 comments:

  1. మహా నటుడు అక్కినేని గురించి ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి.అదంతా క్రోడీకరించినట్లుగా ఈ ఒక్క వ్యాసం లో చాలా అద్భుతంగా రాసారు.పాత తరం తెలుగు సినీ కళాకారుల గురించి ఎన్ని సార్లు చదివినా కొత్తగానే వుంటుంది.ముఖ్యంగా 1970 ముందు పుట్టినవాళ్ళకి NTR,ANR,SVR,సావిత్రి,ఘంటసాలల మీద అభిమానం ఏనాటికీ పోదు.రాజకీయ వ్యాసాలు చదివి బుర్ర వేడెక్కితే, మీ సినిమా,సాహిత్య సంగతులు మనసుని ఆహ్లాదపరుస్తున్నాయి.అసలు మీ బ్లాగ్ పెద్ద encyclopedia. we are expecting articles regularly from you.

    ReplyDelete
  2. ఏ తరం లో ఐనా నైతిక విలువలు దిగజారటానికి ఆ తరం లోని సినిమా రంగానిది కొంత పాత్ర ఉంటుంది. అలానే ఈనాడు సినిమాలు ఇంతగా దిగజారాయంటే దానికి బీజాలు పాత తరాలలోని సినిమాలలో ఉంటాయి. అక్కినేని నటించిన అనేక వాస్తవ విరుధ్ధమైన పాత్రల ప్రభావం ఇప్పటి సినిమాలు చేసే నేల విడిచిన సాము పై ఉంది.ఇప్పటి సినిమాల దిగజారుడు కి మూలాలు కొంత వరకూ ప్రేమ నగర్ వంటి సినిమా ల లో ఆయన వేసిన క్లబ్ డాన్సులలో ఉన్నాయి. సుడిగుండాలు వంటి ఒకటి రెండు బాధ్యతాయుతమైన సినిమాలు తప్పితే అక్కినేని జీవితం వలన సమాజానికి పెద్ద ఎత్తులో జరిగిన మంచి ఏమైనా ఉందా? పేరు ఆయనే సంపాదించుకొన్నాడు, డబ్బు ఆయనే సంపాదించుకొన్నాడు, అప్పుడప్పుడూ కొంత కాలేజీలకు చిన్న చిన్న దాన ధర్మాలకు డబ్బు విదిల్చాడు.ప్రతి గా ఆయన పేరే పెట్టారు. ధర్మ దాత అనే పేరు వచ్చింది. తన బాగు కోసం తాను కష్టపడి పని చేశాడు. తెలుగు సమాజం నుంచీ ఇన్ని సంపాదించిన ఆయన వలన సమాజానికి పెద్ద ఎత్తున ఏమి మంచి జరిగింది?
    పేద్ద ఆస్థులు కూడబెట్టిన ఆయన కుటుంబం ఇప్పుడు తెలుగు సమాజం మీద ఒక అవాంఛనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.
    అవార్డులకి ఒక కస్టమర్ లా మారిన ఆయనకు మరిన్ని అవార్డులు ఇవ్వటం వలన తెలుగు సినీ రంగానికి ఏమి మేలు జరుగుతుంది? ఆ డబ్బులు ఏవో, ఇప్పుడిప్పుడే ఆ రంగంలోకి అడుగుబెట్టి తమ పొలమూ పుట్రా అమ్మి అవార్డు సినిమా తీసిన ఒంగోలు దర్శకుడు శ్రీనివాస రెడ్డి లాంటి వారికి ఇస్తే సినీ పరిశ్రమ కి మేలు జరుగుతుంది.
    అక్కినేని గురించిన మీ అభిమానం ఆయన నటనకు మాత్రమే పరిమితమైతే పరవాలేదు. కానీ మీరు మీ అభిమానాన్ని మిగిలిన అనేక విషయాలకి కూడా విస్తరించినట్లున్నారు. ఒక వామ పక్ష మేధావి అయిన మీ నుంచీ ఇటువంటి వ్యాసాన్ని ఆశించలేదు.

    ReplyDelete
  3. బొందలపాటి గారూ,

    మీ స్పందనకు ధన్యవాదాలు. అక్కినేని నాగేశ్వరరావుపై అభిమానాన్ని ఇతర రంగాలకు విస్తరించినట్టు మీరు దేన్నిబట్టి చెబుతున్నారో నాకు తెలియదు. నా వ్యాసంలో అలాటి భాగాలు ఉదహరిస్తే సంతోషిస్తాను. అసలు ఇతర రంగాలలో ఆయన పాత్రను ఎందుకు పట్టించుకోవాలో కూడా నాకు తెలియదు. పైగా ఈ వ్యాసంలో ఆయన గురించి తప్ప ఇతర కుటుంబ సభ్యుల జోలికి నేను పోలేదు. ఇక అవార్డుల విషయంలో తారతమ్యాలను కూడా నేను చివరలో పేర్కొన్నాను. ఇక చలన చిత్ర కళ పెట్టుబడిదారీ సమాజంలో దాని పరిమితులు వగైరాల చర్చకు ఇది సందర్భం కాదు కదా.. వామపక్ష భావాలకు వ్యతిరేకమైదనదేమీ నేను రాయలేదు. తెలుగు సమాజానికి వ్యక్తిగతంగానో కుటుంబ పరంగానో ఎవరి నుంచో ఏదో జరగాలని వొరిగిపడుతుందని నేనెప్పుడూ ఎదురు చూడనవసరం లేదు. సామాజిక చైతన్యం పెంచడమే కీలకం. అందులో కళా సాహిత్య చైతన్యాలు కూడా భాగమే. తొమ్మిది పదులు చేరుకున్న ఒక మహానటుణ్ని గురించి ఎలా చర్చించాలో అలా చర్చించాను. అది కూడా ఒక వ్యాసం పరిధిలో.

    ReplyDelete
  4. రవి గారు,
    ఇతరవిషయాలు ఇవి..."వసూళ్ళూ, విజయ ఢంకా మోగించిన కేంద్రాలూ, ఆయన నట వారసులు వెలుగొందటాలూ"

    "..అందులో కళా సాహిత్య చైతన్యాలు కూడా భాగమే"
    ఆయన సినిమాలు సమాజం లో ఎంత వరకూ చైతన్యం తీసుకొని రావటానికి ఉపయోగ పడ్డాయో చర్చించటానికి ఇది సందర్భమే కదా?
    అలానే అక్కినేని గురించిన విమర్శ ను కొంచమైనా నేను మీ వ్యాసం లో చూడలేకపోయాను. వ్యాసం లో పొగడ్తలతో పాటు ఒక మనిషి లోపాలు కూడా ప్రస్తావిస్తే సమతూకం ఉంటుంది కదా?
    మీ ఇతర వ్యాసాలలో ఉండే విశ్లేషణా సమతూకం నాకు ఈ వ్యాసం లో కనపడలేదు.. దీనికి శీర్షిక "అక్కినేని కి జేజేలు" అని పెడితే బాగుండేది.
    వ్యక్తిగతం గా ఆయన వేసిన తాగుడు పాత్రలూ , నిరాశా పూరితమైన పాత్రలూ సమాజానికి ఒక చెడు ఉదాహరణ గా మిగిలాయని నాకు అనిపిస్తుంది.

    ReplyDelete
  5. బొందలపాటివారి వ్యాఖ్యలతో చాలా వరకూ ఏకీభవిస్తాను.అగ్ర నటులని superlativesతో పొగడడమే ఇంతవరకు చాలా మందికి అలవాటు.ఐతే నేను సినిమాలని వినోదం కోసమే చూస్తాను.క్లీన్ గా వుంటే చాలును.ఆ దృష్టి తో చూస్తే అక్కినేని సినిమాలు ఎక్కువ భాగం బాగుంటాయి.1970 తర్వాత అతని నటనలో మేనరిజంస్ ఎక్కువై సహజత్వం తగ్గి కృత్రిమత్వం పెరిగింది.ప్రేమనగర్ తర్వాత ఆయన రిటైర్ అయి వుండాలిసింది.ఆయన వ్యక్తిగత ,కుటుంబ విషయాలు ఇక్కడ మనకనవసరం.

    ReplyDelete
  6. some how i am not gtg Telugu type hehre.it is just a routine article meant for sunday magazine. i may write the kind of critical item some time latter. any way i don't expect much from commercial cinema. That Nageswar rao is a legend and pioneer is a eact every one agree.so also several other luminaries. we apply appropraite parameters depending on the subject and subjects.hope to conclude.

    ReplyDelete
  7. గమనిస్తే 1974 ఘంటసాల మరణం,సావిత్రి తెర మరుగైన తర్వాత(వాణి్శ్రీ తర్వాత కూడా)అక్కినేనికి సూపర్ డూపర్ హిట్లు లేవు ఒక్క ప్రేమాభిషేకం తప్ప.ANR కి దర్శకుడు,హీరోయిను,సంగీతం,రచయిత combination కుదరాలి.తన సొంత మాస్ ఇమేజుతో NTR చిత్రాలు విజయం సాధిస్తాయి. ఏవైనా ఇద్దరూ ఇద్దరే!

    ReplyDelete
  8. @prasiddha

    Akkineni himself admitted this after the death of Atreya. After all cinema is a collective effort. one difference is that NTR succeeded in image change with Adavi Ramudu thanks to Raghavendra rao.Akkineni image was encashed in a big way by Dasari. Not only the picture you mentioned but some others as well.As Nagarjuna commented recently three pictures enacted by them together almost bombed at box office. so there are several factors.. ok.

    ReplyDelete